అక్షర
అద్వైతమూర్తి అప్పయ్య దీక్షితులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అద్వైతాచార్య అప్పయ్య దీక్షితులు
రచన: రావినూతల శ్రీరాములు
వెల: రూ.25/-లు
ప్రతులు లభించు స్థలం
సరస్వతి నిలయం 12.13.414/11
తార్నాక, సికింద్రాబాదు - 500 017
*
పేరుకు తగ్గట్టుగానే శివాంశసంభూతుడు అప్పయ్యదీక్షితులు. ఈశ్వరుడు సంకల్పించిన ఈ సృష్టిలో అప్పుడప్పుడు అధర్మం ప్రజ్వరిల్లుతుంది. ఆ అధర్మాన్ని అణచి తిరిగి ధర్మాన్ని పునఃప్రతిష్ఠించడానికి ఈశ్వరుడే తన్నుతాను సృజియించుకుంటుంటాడు. ఇది ప్రతియుగంలోను జరుగుతున్నదే.
భారతదేశంలో ఒకానొక కాలంలో శైవ వైష్ణవాల మధ్య వైరుధ్యాలు ఏర్పడ్డాయి. అల్పబుద్ధులు దీన్ని అవకాశంగా తీసుకొని ప్రజల్లో అసమానతలను సృష్టించారు. ఆ సమయంలోనే ఆదిశంకరాచార్యునిగా శివుడే భూమిపై అవతరించి అవైదికాన్ని అణచి వైదికమతాన్ని సుస్థిరం చేశాడు. అట్లాంటి నేపథ్యమున్న వారే అప్పయ్యదీక్షితులు. శివకేశవుల్లో తారతమ్యాలు లేవని భగవంతుడనేవాడు ఒక్కడే నని, ఆయన రచననే ఈ సృష్టి అంతా కనుక అల్పహేతువులతో అనర్థాలను తెచ్చుకోవద్దని చెప్పడానికే ఆయన జీవితాంతం కృషి చేశారు. సర్వం ఈశ్వరమయం అయిన సృష్టిలో దైవాంశ లేని వస్తువుఅంటూ ఏది ఉండదు అని చెప్పడానికి గాను వీరి తాతగారైన ఆచార్య దీక్షితులు ఓనాడు విజయనగర సామ్రాజ్యాధీశులైన రాయల దంపతులను చూచి ఆశువుగా ఒక కవిత చెప్పారట. ఆ కవితార్థం వరదరాజస్వామికి తన వక్షస్థలాన ఉండవలసిన లక్ష్మీదేవి తన దగ్గరే ఉంది కదా అని మరలా తన వక్షఃస్థలాన్ని తడిమి చూసుకొన్నాడట. ఇలా ఎందుకు? చేశాడంటే తనకు నమస్కరించడానికి వచ్చిన రాయలవారి దేవేరి ని చూడడం జరిగింది. అంటే రాయలవారి దేవేరి అపర లక్ష్మీదేవిగా ఉన్నదని చెప్పడానికి సాహించిన ఆచార్య దీక్షితులు శ్రీవరదరాజస్వామికే అనుమానం కలిగిందని చెప్పడంలో వివేకాన్ని చూచి రాయలవారు అప్పటి కప్పుడు ఆయనకు వక్షఃస్థలాచార్యుడు అన్న బిరుదునిచ్చి సత్కరించారట.
అటువంటి తాతగారి పెంపకంలో పెరిగిన అప్పయ్యదీక్షితులు తెలివితేటల గురించి చెప్పటం అంటే సూర్యుని ముందు దివిటి పట్టుకున్నట్లే గదా. తెలుగు భాషోన్నతికి కృషి చేసిన రాయల వారి లాగే అప్పయ్య దీక్షితులకు కూడా తెలుగుభాషఅంటే పరమాభిమానం.
అప్పయ్య దీక్షితులు అప్పటి శైవవైష్ణవ ద్వేషాలను దూరం చేయడానికి గాను సుమారు 104 గ్రంథాలను రచించారు. అప్పయ్యదీక్షితులు వేలూరి పాలకుడైన చిన్న బొమ్మరాజు ఆస్థానంలో ముప్ఫై సంవత్సరాలు ఉన్నప్పుడు ఎన్నో రచనలు చేశారు. ఒకసారి వేదాంత దేశికుల రచనయైన యాదవాభ్యుదయానికి సరళ వ్యాఖ్య రాయమని చిన తిమ్మరాజు కోరగా ఆ పనిని పూర్తిచేసి రాజుగారి దగ్గర నుండి గౌరవసన్మానాభిమానాన్ని పొందారు.
ఇలా అప్పయ్య దీక్షితులు అద్వైతాచార్యునిగా ప్రజలకు బోధ చేస్తూ అనేక గ్రంథాలను రచనచేస్తూ తనకు ఆస్థానంలో స్థానం ఇచ్చిన రాజులకు మతాచారాల్లోను, రాజ్యవ్యవహారాల్లోను తగిన సలహాలు ఇస్తుండేవారు. తాతాచార్యులవంటివారు అప్పయ్యదీక్షితులకు ఆటంకాలు కలిగించినా ‘మార్గ బంధుస్తవం’ లాంటి రచన చేసి అటు భగవంతుని ఆశీర్వాదాన్ని ఇటు ప్రజల అభిమానాన్ని ఇంకొక ప్రక్క రాజుగారి అభిమానాన్ని చూరగొన్న అప్పయ్య దీక్షితుల గురించి రావి నూతన శ్రీరాములు గారు అతి చిరుపొత్తంలో 18 శీర్షికలను పెట్టి దీక్షితుల గారి జీవితాన్నంతా చక్కగా సరళమైన భాషలో రచించారు. ఈ చిన్న పుస్తకం చదివిన వారికెవరికైనా అప్పయ్యదీక్షితుల జీవితాన్ని ఆమూలాగ్రంగా తెలుసుకోవాలన్న జిజ్ఞాసను కలిగించేలా రచన చేశారు. ఏకబిగిన చదివించే సరళసౌందర్యపదాలతో చేసిన రచన చదువరికి మంచి జ్ఞానాన్ని ఇస్తుంది.