అక్షర

తెలంగాణ కథకులకు ‘కొండ’ంత అండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోలకొండ పత్రిక కథలు-1 (కథాసంకలనం 1926-1935)
సేకరణ, కూర్పు: యామిజాల ఆనంద్ డా.వి.వి.వెంకటరమణ
వెల: రూ.190
ప్రతులకు: నవ చేతన పబ్లిషింగ్ హౌస్ గిరిప్రసాద్ భవన్, బండ్లగూడ (నాగోల్) జి.ఎస్.ఐ. పోస్టుహైదరాబాద్-68.

** *** *********

‘నియంతృత్వ నిజాం పాలన’ అంటే ఇప్పటి ప్రభుత్వమూ, బేషరతుగా దాని వత్తాసు పలికే సాహిత్య కూటములూ ఒప్పుకోవేమో గానీ, పౌర స్వేచ్ఛ లేని పాలనగా భావించిన నాటి తెలుగు ప్రజలు - తెలుగు భాష ఉద్ధరణ కోసమూ, తెలుగు వారి సర్వాంగీతాభివృద్ధి కోసమూ తపించిపోయారు. తెలంగాణలో సాహితీ సాంస్కృతిక చైతన్యాన్ని ఉద్దీపింపజేయడంలో ‘గోలకొండ పత్రిక’ పాత్ర అవిస్మరణీయమైనది. నిజాం రాష్ట్రంలో తెలుగు వారిని ఏకతాటికి తేవడానికి, తెలుగేతరుల హేళనలను ఎదుర్కొని ఆంధ్ర మహాసభల నిర్మాణం చేసేందుకు సురవరం ప్రతాపరెడ్డిగారి సంపాదత్వంలో ‘గోలకొండ పత్రిక’ పోషించిన పాత్ర కీలకమైనది.
గోలకొండ పత్రిక తొమ్మిదవ సంవత్సరాది సంచికలో ‘ఆధునిక భాష కవిత్వ తత్వము’ అనే వ్యాసంలో శ్రీ ముడుంబ వెంకట రాఘవాచార్యులు గారు ‘నిజాం రాష్ట్రంలో ఆంధ్ర కవులు పూజ్యము’ అని చేసిన వ్యాఖ్య, కురుంగంటి సీతారామాచార్యులు గారు ‘నవ్యాంధ్ర సాహిత్య వీధులు’ పేర ఆధునిక సాహిత్య చరిత్రను గ్రంథస్థం చేసినప్పుడు తెలంగాణ ప్రాంతంలో అసలు కవి పండితులే లేనట్లు తెలంగాణ సాహిత్యం పట్ల చూపిన ఉదాసీనత, నిరాదరణ సురవరం వారిని కలచివేసిన కారణంగానే ఆ విమర్శలకు సమాధానం అన్నట్లుగా 1934లోనే ‘గోలకొండ కవుల సంచిక’ను మూడు వందల యాభై నాలుగు మంది కవుల రచనలతో, జీవిత రేఖలతో వెలువరించారు. గోలకొండ పత్రిక చందాదారులకు ఒక్క రూపాయికి, ఇతరులకు రెండు రూపాయలకు ‘గోలుకొండ కవుల సంచిక’ అమ్మారు. ముద్దుకృష్ణ ‘వైతాళికులు’ సంకలనం 1935లో రాగా, అంతకు ముందే 1934లోనే తెలంగాణ అస్తిత్వ పతాకను ‘గోలుకొండ కవుల సంచిక’తో ఎగురవేసింది సురవరం ప్రతాపరెడ్డిగారే. 9.7.1934 గోలుకొండ పత్రిక సంపాదకీయంలో తాము వెలువరించిన సంచికపై వచ్చిన విమర్శలను కూడా తిప్పి కొడుతూ రాశారు. ‘మా తల్లిని మేము ప్రేమించిన నితర తల్లులను నసహ్యముతో చూచితిమని తగువు పడకూడదు’. ‘మా రాష్టమ్రుపై మా కభిమానముండిన మా కితరులపై ద్వేషమున్నదని వాదింపగూడదు’ ‘మీరు హైదరాబాదు భాషను వెక్కిరించుచున్నారు’ అంటూ ఆ సంపాదకీయంలో తెలంగాణ ప్రాంత అభిమానాన్ని నిర్ద్వంద్వంగా నిర్భయంగా ప్రత్యేక అస్తిత్వ భావనతో అభివ్యక్తీకరించారు.
గోలుకొండ పత్రిక 1926లో మే 10వ తేదీన మొదట అర్ధవార పత్రికగా బుధ, శనివారాల్లో వెలువడేది. 31.07.1933 నుండి సోమ, గురువారాల్లో వచ్చేది. 2.8.1937 నుండి జాతీయ పత్రికగా తనను తాను అభివర్ణించుకుంది. 1947లో దినపత్రికగా రూపుదాల్చింది. నిజానికి గోలకొండ పత్రిక వార్తాపత్రికే కానీ పద్యాలు, కవితలు, పుస్తక సమీక్షలు, వ్యాసాలు, కథలు ప్రచురిస్తూ గోలకొండ పత్రిక నాటి తెలంగాణ సమాజంలో అపూర్వ సాహిత్యసేవ, భాషా సేవ చేసింది. జాతీయోద్యమాలన్నింటినీ నిలువరించింది. అనేక సంఘ సంస్కరణోద్యమాలకు బాసటగా నిలిచింది. ఎందరి చేతనో కలం పట్టి రచనలు చేసేలా చేసింది. తొలి దశలో సురవరం వారే పలు కలం పేర్లతో రచనలు చేసేవారు. పత్రికలో కథలను ప్రచురణకు ఆహ్వానిస్తూ 1926 మే 26 బుధవారం సంచికలో నిజాం రాష్ట్రాంధ్ర కేంద్ర సంఘం కార్యదర్శిగా మాడపాటి హనుమంతరావుగారు ప్రకటన ఇచ్చారు. అత్యుత్తమ కథలకు అయిదు రూపాయల బహుమానం ఇస్తామంటూ ‘బహుమాన కథ’ పేర ఆ ప్రకటన వచ్చింది. నియమాలు వివరిస్తూ మొదటగా నిజాం రాష్ట్రాంధ్రులలో కథలను వ్రాయు పద్ధతిని ప్రోత్సహించుటకై ఈ బహుమానము ఏర్పరుపబడినది అని పేర్కొన్నారు. కథ యొక్క విషయము (ప్లాట్), సాంఘికము (సోషల్), అయినను, చారిత్రకము (హిస్టారికల్) అయినను ఉండవలెను. నిజాం రాష్ట్రాంధ్ర దేశమునకు సంబంధించి యుండుట శ్రేష్ఠతరము. భాష సులభముగా నుండవలెను అని ప్రకటించారు.
1933 జులై 31 బుధవారం నుండి గోలుకొండ పత్రికలో సారస్వతానుబంధము వారమునకొక మారు నాలుగు పుటలు ప్రకటించడం కూడా జరిగింది. వాటిలో చిన్న కథలను వేశారు. 1934 నుండి ‘మా చిన్న కథ’ అంటూ ఓ శీర్షికన తెలంగాణలోని నాటి కథకుల కథలను ప్రత్యేకించి వెలుగులోకి తెచ్చిన ఘనతా ‘గోలుకొండ పత్రిక’దే!
గోలకొండ పత్రికలో 1926 నుంచి 1949 వరకు చాలా కథలే వచ్చాయి. కొన్ని కథలు ‘కథాంజలి’ శీర్షికనా ప్రకటితం అయ్యాయి. పాత గోలకొండ పత్రికలన్నీ ఈ కథల సేకరణ కోసం డిజిటల్ సంచికలన్నీ ప్రెస్ అకెడమీ ఆర్కైవ్స్ వెబ్‌సైట్ నుంచి గాలించి యామిజాల ఆనంద్, డా.వి.వి.వెంకటరమణ మహోపకారం చేశారు. దాదాపు అలా సేకరించిన వంద కథల నుండి ‘గోలకొండ పత్రిక కథలు’ పేర యాభై రెండు కథలను నవచేతన పబ్లిషింగ్ హౌస్ ప్రచురించడం ఏటుకూరి ప్రసాద్ గారన్నట్లు ‘తెలంగాణ సాహిత్యం శిగలో మరో పువ్వు’.
ప్రముఖ పత్రికా రచయిత, విమర్శకులు కె.పి.అశోక్‌కుమార్ ‘పఠనాసక్తులను పెంచిన చిన్న కథలు’ అంటూ తమ ముందు మాటలో ఇందులోని కథలను విశే్లషించారు. ఈ కథల్లో ఎక్కువ శాతం హాస్య కథలు, ప్రేమ కథలు ఉన్నాయి. అధిక శాతం కథలు సాంఘికాలే! ఈ కథల్లోని భాష కొన్నింటిలో గ్రాంథికంగానూ, తతిమ్మావి పూర్తి వ్యావహారికంగానే వున్నాయి. నైజాం ప్రాంతపు కథకులే అయినా తెలుగు భాషను సంపద్వంతంగానే ప్రయుక్తం చేశారని గుర్తించాలి. ఉర్దూ పదాలు ఇక్కడి తెలుగులో ఎంత సహజంగా కలిసిపోయాయో కొన్ని కథల్లోని పాత్రల సంభాషణల్లో అందంగా ఒడిసి పట్టుకోవచ్చు. జాతీయోద్యమ స్ఫూర్తిగల ‘సుశీల’ (నెల్లుట్ల శేషగిరిరావు రచన), వెట్టిచాకిరికి బలి అయిన తల్లీకొడుకుల ‘రెండు శవాలు’ (ఉన్నవ వెంకటరామయ్య) కథ, జహంగీరు కాలంనాటి చారిత్రక నేపథ్యంతో డబ్బు మదంతో వాగ్దానాలు మరిచి వ్యవహరించిన ఫర్ఖుందా వల్ల ఛిద్రమైన హమదాబేగం కుటుంబాన్ని ఆదుకున్న నవాబు ఔదార్యం తెలిపే ‘్ఫకీరు బిడ్డ’ (్భవకవి రామమ్మూర్తి) కథ, అలాగే పాశ్చాత్య వ్యామోహాన్నీ, ఆధునికత పేరిటి అవకతవకలనూ చూపుతూ ప్రబోధాత్మకంగా ముగిసే ‘బారిష్టరు గోపాల్ కిషన్‌రావు’ కథ, ‘ప్రణయబంధము’ (శేషాద్రి రమణ కవులు రాసినది) మేనరికం కాదన్నందుకు ఆ ప్రణయ జీవులు ఆత్మహత్య చేసుకోవడం చిత్రిస్తే ఆ తరహా ప్రేమ వృత్తాంతాలతోనే ‘వన భ్రాంతి’ ‘్భగ్న హృదయుడు’ ‘నిరీక్షణము’ ‘ఆనంద బాష్పములు’ వంటి కథలున్నాయి. (కటంగూరి నరసింహారెడ్డి, సారథి కె.పి.డబ్ల్యు.డి, సురవరం ప్రతాపరెడ్డి, ని.యె.యాదగిరిరావుల రచనలు). భావకవి రామమ్మూర్తి అనేది సురవరం వారి కలం పేరనీ అలాగే ‘గిరి’ పేర నందగిరి వెంకటరావు గారు కథలు రాశారనీ పీఠికాకర్త వివరించారు.
గోలకొండ పత్రికలో వచ్చిన వివిధ రచయితల ఈ కథాసంకలనంలోని కథలన్నీ గొప్పవి కాకపోవచ్చు. వెంటాడి, వెన్నడే స్మరణీయాలు కాకపోవచ్చు. కానీ మానవ మనస్తత్వ చిత్రణలతో, ఆనాటి సాంఘిక జీవన ప్రతిబింబాలుగా, నాటి కథకుల రచనా ధోరణులను తెలియపరిచేవిగా ఉన్నాయి. అప్పట్లోనే హరిజన వివక్ష గురించిన కథ రావడం ఒక విశేషం కాగా, హాస్య, వ్యంగ్యాలకు కథలలో నాటి నుంచే మంచి ప్రాతినిధ్యం ఉందని నిరూపించేవి కొన్ని.
ఏమయినా ఈ సేకరణ - కూర్పు నేటి ఒక చారిత్రక అవసరం కూడాను. తెలంగాణ ప్రాంతం నుంచి కథలు రాసిన కథకుల కథలను ఇలా గోలకొండ పత్రిక మూలకందంగా సంకలనం చేయడం, నవచేతన వాటిని ముద్రించడం ఆహ్వానించదగిన అంశాలు. ఈ సంకలనంలో అనుబంధంగా సంగిశెట్టి శ్రీనివాస్ రాసిన ‘తెలంగాణ కొంగు బంగారం - గోలకొండ పత్రిక’ అనే పరిశోధక వ్యాసాన్ని సంతరించడం ఔచితీమంతంగా భాసిస్తోంది.
‘మన రాష్టమ్రు నుండి తెనుగు దినపత్రిక నెలకొల్పుట ఎంత పవిత్ర కార్యమో అంతే కష్ట కార్యము’ అన్న సురవరం వారు నిజంగానే చీటికిమాటికి నిజాం ప్రభుత్వాధికారుల నుంచి బెదిరింపులు తట్టుకుని పత్రికను నిర్వహించారు. నిజాం ప్రభుత్వాన్ని ఎండగడుతూ సురవరం వారు ‘పిరికిపందలు’ అనే వ్యాసం రాయగా ఉపసంపాదకుని పొరపాటు వల్ల ‘పిరికి పందులు’ అని అచ్చుతప్పుతో అచ్చయ్యిందిట!
అసలే పందులు అనే పదం ఇస్లాం మతస్తులలో నాడు కోపం తెప్పించే అంశం. దీన్ని ఆసరాగా చేసుకుని కావాలనే ఆ పదాన్ని వాడారని చెబుతూ పత్రికను మూసేస్తామని అధికారులు బెదిరించారుట. జన్నరెడ్డి ప్రతాపరెడ్డి వంటి దేశ్‌ముఖ్‌లు నిజాం అండతోనే దోపిడీలను దౌర్జన్యాలను చేస్తూంటే నిర్ద్వంద్వంగా ఖండిస్తూ దేశ్‌ముఖ్‌ల పట్ల విముఖతతో సురవరం వారు వారి దౌర్జన్యాలను సహించేవారు కాదుట. సంగిసెట్టి శ్రీనివాస్ అనుబంధ వ్యాసంలో ఇలంటి ఆసక్తిదాయక అంశాలున్నాయి.
ఇంత మంచి కథలను, విశేషాలను పొదువుకున్న ఈ కథాసంకలనం పదిలపరచుకోదగిన రికార్డు గ్రంథం. ఆనంద్, రమణ, ప్రసాద్, అశోక్, శ్రీనివాస్ అందరూ బహుదా అభినందనీయులే.

-సుధామ