ఆంధ్రప్రదేశ్‌

బెడిసికొట్టిన బాబు వ్యూహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మే 23: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అతి విశ్వాసమే ఎన్నికల్లో కొంపముంచిందనేది ఫలితాలను బట్టి తేటతెల్లమవుతోంది. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్‌రెడ్డి టార్గెట్‌గా ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారం నిర్వహించారు మినహా.. తమ ప్రభుత్వం అమలుచేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో చంద్రబాబుతో సహా పార్టీశ్రేణులు విఫలమైనందునే ప్రజల నుంచి వ్యతిరేక సంకేతాలు రావటానికి కారణాలుగా విశే్లషకులు భావిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు మహా కూటమిని వ్యతిరేకిస్తూ టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల్లో సెంటిమెంట్‌ను పండించారు. దీంతో ఆ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ తిరుగులేని మెజారిటీ సాధించింది. అదే ఫార్ములాను ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రయోగించాలని చూసిన టీడీపీ బోర్లాపడింది. ఏపీలో సెంటిమెంట్, సంక్షేమ మంత్రాలు పనిచేయలేదు. పార్టీ అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి చంద్రబాబు సొంత సర్వేలు, ఆర్టీజీఎస్ నివేదికలతో మరో విడత తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమాతో ఉన్నారు. చివరకు ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు వైసీపీదే అధికారమని తేల్లి చెప్తున్నప్పటికీ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజాస్పందన 80 శాతం ఉందని ఇందులో భాగంగా పోలైన అత్యధికశాతం ఓట్లు తమ పార్టీకే అనుకూలిస్తాయని ఆశించారు. రాష్ట్ర విభజన జరిగిన అనంతరం 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఆదరించి అధికార పగ్గాలు అప్పగించారు. గత నాలుగున్నరేళ్లుగా రాజధాని నిర్మాణం, పోలవరం, నదుల అనుసంధానంపై దృష్టి సారించారు. ఇదే క్రమంలో గతంలో 1996లో ఏర్పాటైన జన్మభూమి కమిటీలను పునరుద్ధరించారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో గ్రామాల్లో జన్మభూమి కమిటీలు పెత్తనం చెలాయించటంతో పాటు పారదర్శకంగా పనిచేయక పోవటం వల్ల సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నా లబ్ధికి నోచుకోని పేదవర్గాల్లో అసంతృప్తి మొదలైంది. సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా వైఎస్ హయాం నుంచి కొనసాగుతున్న వృద్ధాప్య, వితంతు పింఛన్లను వెయ్యి రూపాయలుచేసి ఎన్నికల తాయిలాల్లో భాగంగా దాన్ని రెట్టింపు చేశారు. నెలకు రూ 2వేలు పెన్షన్‌ను పెంచినప్పటికీ చాలా గ్రామాల్లో అర్హులకు సంక్షేమ ఫలాలు అందలేదు. ఈ విషయాన్ని ప్రభుత్వం, ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లినా ప్రయోజనం లేకపోవటంతో కిందిస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల కుటుంబాల్లో పేదలకు వివాహ నిమిత్తం ప్రకటించిన దుల్హన్, చంద్రన్న కానుకల్లో కూడా పెద్దఎత్తున అక్రమాలు జరిగినట్లు తేలినా వాటిపై విచారణ జరపకపోవటం బాధ్యులపై చర్యలు తీసుకోక పోవటం కూడా ఓ కారణంగా చెప్తున్నారు. ఫిర్యాదుల పరిష్కారానికి 1100 వేదిక పెట్టినప్పటికీ సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. ప్రభుత్వం అన్నీ ఆన్‌లైన్‌లోనే పారదర్శకంగా అమలు చేస్తోందని అధికారులు ఇచ్చిన నివేదికల ఆధారంగా తమ ప్రభుత్వానికి ఢోకాలేదని భావించారు. అయితే క్షేత్రస్థాయిలో వాటి గురించి ఆరా తీయలేదు. గడచిన మూడేళ్లుగా కేంద్రంపై పోరాటం చేసే క్రమంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, వాస్తవ పరిస్థితులు గుర్తించలేదు. అమరావతి నిర్మాణం, అంతర్జాతీయ సంస్థలతో సమావేశాలు, ఒప్పందాలు ఇవన్నీ కాగితాలకే పరిమితమయ్యాయనే విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోయారు. దీనికి తోడు పార్టీ పరంగా చాలా నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇసుక, మైనింగ్ మాఫియాలో స్వయంగా ఎమ్మెల్యేలే భాగస్వామ్యం వహించటం అడ్డువచ్చిన వనజాక్షి లాంటి అధికారులపై దాడికి దిగడంతో ఉద్యోగ వర్గాల్లో కూడా ప్రభుత్వంపై ఒకింత అసమ్మతి చెలరేగింది. గత సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో రైతుల రుణమాఫీ, కాపు రిజర్వేషన్లు ప్రధానాంశాలుగా తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసుకుంది. కాపు రిజర్వేషన్లకు సంబంధించి కమిషన్ ఏర్పాటుచేసి చివరకు కేంద్రంపై నిందలు మోపటంతో గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపును శాసించిన ఆ వర్గం ఓటర్లు జనసేన వైపు మొగ్గు చూపారు. నిత్యం అధికారులు, పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌ల ద్వారా మాత్రమే అటు పాలనా వ్యవస్థ, ఇటు పార్టీ కార్యకలాపాలను చంద్రబాబు అంచనా వేశారు. జిల్లాలు, నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితి, ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో విశ్వసనీయత కల్పించే విషయంలో ఘోర వైఫల్యం చెందారు. ఎన్డీఏతో 2014 నుంచి భాగస్వామిగా ఉంటూ నాలుగేళ్లకు తెగదెంపులు చేసుకుని ప్రధాని మోదీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఇతర పార్టీలను కూడగట్టే ప్రయత్నంలో రాష్ట్రంలో సొంతింటిని చక్కదిద్దుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇది కూడా టీడీపీకి ఓ మైనస్‌గా మారింది. రైతుల రుణమాఫీ పూర్తిస్థాయిలో నెరవేరలేదు. ఈ నెపాన్ని కూడా కేంద్రం, వైఎస్సార్ కాంగ్రెస్‌లకు ఆపాదించటంతో రైతుల్లో నమ్మకం సన్నగిల్లింది. రిమోట్ సెన్సింగ్ వ్యవస్థతో ప్రభుత్వ, పార్టీ యంత్రాంగాన్ని నడిపించటంతో ప్రజలు దూరమయ్యారు. చివరి అంకంలో డ్వాక్రా మహిళలకు పసుపు- కుంకుమ, నిరుద్యోగభృతి అమలుచేసి అదే ఓట్ల వర్షం కురిపిస్తుందని ఆశించారు. అంతేకాదు ఏపీలో తెలంగాణ తరహా సెంటిమెంట్ ఉంటుందని భావించి జగన్ తెలంగాణలో ఉన్నారని, కేసీఆర్‌తో మిలాఖత్ అయ్యారని, రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన మోదీ వీరిని ప్రోత్సహిస్తున్నారని ప్రచారం చేశారు. రాష్ట్ర విభజనలో ఏపీకి పూర్తిగా అన్యాయం చేసిన కాంగ్రెస్‌కు మద్దతివ్వటం వల్ల మనమే నష్ట పోతామని పలువురు సీనియర్ నాయకులు హెచ్చరించినా చంద్రబాబు పెడచెవిన పెట్టిందున నష్టం జరిగిందని చెప్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్న సంకేతాల గురించి ఎమ్మెల్యేలు, మంత్రులు ధైర్యంగా అధినేత ఎదుట చెప్పుకునే అవకాశం ఇవ్వలేదు. ఈ క్రమంలో అధినేత వ్యవహారశైలిని తప్పుపడుతూ కొందరు నేతలు పార్టీని వీడివెళ్లారు. అభ్యర్థుల ఎంపిక సమయంలో కూడా జిల్లాల్లో గ్రూపుల పోరు తలెత్తినా సర్వేలతో ఓ వర్గం నేతలను తప్పుపట్టటం వల్ల పార్టీలో అంతర్గత పోరు నివురుగప్పిన నిప్పులా రగులుతూ వచ్చింది. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఇదే జరిగింది. ఇక గత సార్వత్రిక ఎన్నికల్లో కీలకభూమిక వహించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు అసలు ప్రాతినిధ్యం ఇవ్వకపోగా ఆయన మద్దతుతో మేం గెలవలేదని టీడీపీ నేతలు కొట్టిపారేసిన నేపథ్యంలో జనసేన కార్యకర్తలు టీడీపీకి వ్యతిరేకంగా ఓట్లను చీల్చే విషయంలో కసిగా పనిచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కాకపోయినా ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో జనసేన ప్రభావం టీడీపీపై పడింది. అయితే దీన్ని టీడీపీ మరోరకంగా ప్రచారం చేసుకుంది. కాపుల్లో ఉన్న అసమ్మతి ఓట్లు వైసీపీకి పడకుండా చీల్చేందుకు పవన్‌కళ్యాణ్ తమకు పరోక్ష మద్దతిస్తున్నారనే ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు. తన వైఫల్యాలు తెలిసినప్పటికీ ప్రజల్లో టీడీపీకి చెరగని ఆదరణ ఉందని చంద్రబాబు చివర వరకు నమ్మారు. ఎగ్జిట్‌పోల్స్‌ను కూడా కొట్టిపారేసి సొంత సర్వేలు, ఆర్టీజీఎస్‌ను నమ్ముకుని తనకు 120 సీట్లు పైగానే వస్తాయని అతివిశ్వాసాన్ని వ్యక్తం చేశారు. పార్టీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలు, ప్రజల నాడి పసికట్టటంలో ఆయన వేగుల వ్యవస్థ సమర్ధవంతంగా పనిచేయలేదనేది స్పష్టమవుతోంది. చివరకు కేసీఆర్ మార్క్ సెంటిమెంట్‌ను కూడా పండించలేక చతికిలపడాల్సిన పరిస్థితి వల్లే టీడీపీకి ఊహించని షాక్ తగిలింది.