ఆంధ్రప్రదేశ్‌

పార్టీ పాత్ర లేకుండా చర్చలేల?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 17: రాష్ట్రంలో సెంటిమెంటుగా మారిన ప్రత్యేక హోదా- ప్యాకేజీ అంశంపై తెదేపా- కేంద్రం మధ్య ఏం జరుగుతోందో తెలియక ఏపి బిజెపి నేతలు తలలు పట్టుకుంటున్నారు. ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ వ్యవహారం అంతా కేవలం ఇద్దరు ముగ్గురు నేతల వ్యక్తిగత వ్యవహారంలా మారిందే తప్ప, దానికి సంబంధించి ఏం జరుగుతుందో ఆర్‌ఎస్‌ఎస్ నుంచి వచ్చి పార్టీ వ్యవహారాలు పర్యవేక్షించే వారికి సైతం తెలియడం లేదు.
ఓ వైపు హోదాపై పార్టీని ముద్దాయిగా నిలబెడుతూ, ఢిల్లీకి వెళ్లి మోదీని పొగుడుతున్న తెదేపా నేతల వ్యూహంతో రాష్ట్రంలో పార్టీ ఎదిగే పరిస్థితి లేకుండా పోయిందని బిజెపి నేతలు వాపోతున్నారు. ప్రత్యేక హోదాపై తమ పార్టీని దోషిగా నిలబెట్టడంలో తెదేపా విజయం సాధించిందని, ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజీపై జరుగుతున్న చర్చలను కూడా తనకు అనుకూలంగా మలచుకుంటున్నా, తామేమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామని బిజెపి సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ప్యాకేజీ మీద కేంద్రం కసరత్తు చేస్తోంది. మెరుగైన ప్యాకేజీ ఇవ్వడం ద్వారా, హోదా ప్రయోజనాలు నెరవేర్చాలని కేంద్రం యోచిస్తోంది. దాదాపు 10 రాష్ట్రాలు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో, ఏపికి హోదా ఇచ్చి పది రాష్ట్రాల్లో పార్టీని దూరం చేసుకునే పరిస్థితిలో లేమని బిజెపి తెదేపా నాయకత్వానికి స్పష్టం చేసింది. దానికి బదులు ప్యాకేజీపై మాట ఇచ్చింది.
అందులో భాగంగా అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు, తెదేపాకు చెందిన కేంద్రమంత్రి సుజనాచౌదరి గత కొద్దిరోజుల నుంచి జరుపుతున్న చర్చలు మీడియాలో ప్రముఖంగా చోటుచేసుకుంటున్నాయి. ఇది రాష్ట్ర బిజెపి నేతలకు విస్మయం కలిగిస్తోంది. ప్యాకేజీ ఇవ్వాలని నిర్ణయించినప్పుడు ఆ విషయాన్ని ముందుగా రాష్ట్ర పార్టీకి సమాచారం ఇవ్వడం, దానిపై పార్టీ పరంగా ప్రచారం చేసి ప్రజలను మానసికంగా సన్నద్ధులను చేయడం, ఆ తర్వాత దాని క్రెడిట్‌ను పార్టీ తీసుకోవడం వంటి రాజకీయ చర్యలు తీసుకోని వైనంపై రాష్ట్ర బిజెపి సీనియర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో ఒకవర్గం మీడియా.. ప్యాకేజీపై తెదేపా పోరాడుతోందని, మరో నెలలో తెదేపా కృషి వల్ల ప్యాకేజీ వచ్చే అవకాశం ఉందంటూ కథనాలు వెలువరిస్తుంటే, ఇక ఆ అంశంలో తమ పాత్ర ఏమిటో తెలియక వౌనం వహించాల్సి వస్తోందని అగ్రనేతలు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. ప్యాకేజీపై జరుగుతున్న చర్చల్లో తమ పార్టీ అధ్యక్షుడు, ఎంపి కూడా అయిన హరిబాబును ఎక్కడా భాగస్వామ్యం చేస్తున్నట్లు లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్యాకేజీపై జరుగుతున్న చర్చల్లో పార్టీ నేతలను కూడా భాగస్వామ్యం చేసినట్టయితే, ఆ క్రెడిట్ పార్టీకి దక్కుతుందని చెబుతున్నారు.
అలాకాకుండా చర్చలను కేవలం ఇద్దరు ముగ్గురికి పరిమితం చేసి, క్రెడిట్‌ను తెదేపాకు కట్టబట్టే రాజకీయం జరుగుతోందని పార్టీ అగ్రనేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్యాకేజీపై పార్టీపరంగా క్రెడిట్‌ను తీసుకునేందుకు తమ పార్టీ అగ్రనేతలకే ఇష్టం లేనట్లుందని, ప్యాకేజీ ఘనత కూడా తెదేపా ఖాతాలో కలిపేందుకే కొందరు ఉత్సాహపడుతున్నారని అగ్రనేతలు వ్యాఖ్యానిస్తున్నారు.