ఆంధ్రప్రదేశ్‌

స్మార్ట్ విలేజ్ పనులు వేగవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 22: స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డుల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని, దాతల సహకారానికి ప్రభుత్వం కూడా తనవంతు తోడ్పాటునందిస్తుందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలోని తన కార్యాలయంలో గురువారం స్మార్ట్ ఏపీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డుల్లో వౌలిక వసతులు, అభివృద్ధి పనులు వేగవంతం చేయాలన్నారు. ఇప్పటికే స్థానికులతో పాటు ఎన్‌ఆర్‌ఐ దాతలు తమ గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టారన్నారు. మరెందరో దరఖాస్తు కూడా చేసుకున్నారన్నారు. ఏదైనా అభివృద్ధి కార్యక్రమానికి దాతలు 50 శాతం నిధులు సమకూరిస్తే, ప్రభుత్వం మిగిలిన మొత్తాన్ని మ్యాచింగ్ గ్రాంట్‌గా అందజేస్తుందన్నారు. గతంలో చేపట్టిన పనులకు ఇప్పటికే ప్రభుత్వం తన వాటాను అందజేసిందన్నారు. ఏపి స్మార్ట్ ఫౌండేషన్‌కు అందజేసే నిధులకు పన్ను మినహాయింపునకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపిందన్నారు. స్మార్ట్ విలేజ్, వార్డు పనులకు రెండు మూడు రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నామన్నారు. 50 శాతంపైగా నిధులిచ్చే పనులకు దాతల పేర్లు పెట్టొచ్చునని అధికారులకు సూచించారు. పలు గ్రామాలు, వార్డుల్లో కొన్ని పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయని అధికారులు మంత్రి యనమల దృష్టికి తీసుకొచ్చారు. సగంలో నిలిచిపోయే పనులకు, కొత్తగా చేపట్టబోయే పనులకు ఆటంకంగా లేకుండా వేగవంతంగా జరిగేలా వేర్వేరుగా త్వరలో కొత్త నిబంధనలు రూపొందిస్తామన్నారు. స్థానికులు, ఎన్‌ఆర్‌ఐలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటుచేసి వౌలిక సదుపాయాల కల్పనలో వారి భాగస్వామ్యం ఉండేలా కృషిచేయాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పరిశ్రమలు తమ లాభాల్లో 2 శాతం సామాజిక బాధ్యతగా వెచ్చించాలని, ఆ నిధులను రాబట్టడానికి కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా 86 మంది ఎన్‌ఆర్‌ఐలు అందజేసిన నిధులతో చేపట్టిన 86 పనులకు సంబంధించిన వివరాలను ఎన్‌ఆర్టీ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర ప్రణాళిక సంస్థ ఉపాధ్యక్షుడు సిహెచ్ కుటుంబరావు, ఆర్థికశాఖ, వైద్య, ఆరోగ్యశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, ప్లానింగ్ డిపార్టుమెంట్ అధికారులతో పాటు ఎన్‌ఆర్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.

చిత్రం.. స్మార్ట్ విలేజ్ పనులపై సమీక్షిస్తున్న ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు