ఆంధ్రప్రదేశ్‌

ఉగాదికి డ్వాక్రా మహిళలకు రూ.2 వేలు చెల్లింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 15: వివిధ శాఖల బడ్జెట్ ప్రతిపాదనలపై రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సానుకూలంగా స్పందించారు. డ్వాక్రా మహిళలకు రెండు వేల రూపాయల చెల్లింపు, ఐటీఐ విద్యార్థులకు ఉద్యోగ భరోసా, కొత్త బస్సుల కొనుగోలు వంటి ప్రతిపాదనలకు ఆయన ఆమోదం తెలిపారు. ప్రజల సంతృప్తి స్థాయి పెంచే విధంగా సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని యనమల తెలిపారు. 2018-19 బడ్జెట్ ప్రతిపాదనలపై బీసీ, సాంఘిక, మహిళా, శిశు సంక్షేమ శాఖలతో పాటు రవాణా, ఆర్టీసీ, లేబర్ డిపార్టుమెంట్ అధికారులతో సచివాలయంలోని తన కార్యాలయంలో గురువారం సాయంత్రం సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజా సంక్షేమానికి, మహిళా, శిశు సంక్షేమానికి అధిక ప్రాధాన్యతను ప్రభుత్వం ఇస్తోందన్నారు. రాబోయే బడ్జెట్‌లో అన్న అమృతం పథకం అమలుకు నిధులు కేటాయించాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత కోరారు. హిజ్రాలకు పెన్షన్లు చెల్లించడానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించడానికి యనమల నిర్ణయించారు. ఒకే ఇంట్లో ఇద్దరు వికలాంగులకు పెన్షన్లు ఇచ్చేవిధంగా బడ్జెట్ కేటాయింపునకు నిర్ణయం తీసుకున్నారు. పసుపు, కుంకుమ కింద డ్వాక్రా మహిళలకు ఇప్పటివరకు రూ.6 వేల రూపాయలు అందజేశామని, ఉగాదికి రూ.2 వేల రూపాయలు ఇవ్వనున్నామని మంత్రి పరిటాల సునీత తెలిపారు. మిగిలిన రూ.2 వేలు రాబోయే ఆర్థిక సంవత్సరంలో చెల్లించేలా చర్యలు తీసుకుంటామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుకు మంత్రి పరిటాల సునీత తెలిపారు. వచ్చే బడ్జెట్‌లో చంద్రన్న బీమా పథకం నిధులు కేటాయించాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ కోరారు. ఇందుకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అంగీకరించారు. రాష్ట్రంలో 79 ప్రభుత్వ ఐటీఐలు ఉన్నాయని వాటిలో 29 ఐటీఐలకు సొంత భవనాలతో పాటు యంత్ర సామగ్రి సమకూర్చాలని మంత్రి పితాని కోరారు. దీనికి కూడా మంత్రి యనమల అంగీకరిస్తూ, ఐటీఐ విద్యార్థులకు ఉద్యోగ భరోసా కల్పించాలని ఆదేశించారు. మార్చి నుంచి రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు కందిపప్పు ఇవ్వనమున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. జనవరి నుంచి పంచదార అందజేస్తున్నామన్నారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతున్నా, ప్రజా సంక్షేమం దృష్టిలో పెట్టుకుని పంచదార, కందిపప్పు అందజేస్తున్నామని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. స్టేట్ ఫుడ్ కమిషన్ నిర్వహణకు అవసరమైన నిధులు కేటాయింపునకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అంగీకారం తెలిపారు. కొత్త బస్సుల కొనుగోలుకు నిధులు కేటాయించాలన్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కోరిక మేరకు మంత్రి యనమల రామకృష్ణుడు అంగీకారం తెలిపారు. ఆర్టీసీకి చెందిన ఖాళీ స్థలాలను లీజుకు ఇవ్వడం ద్వారా నష్టాలను తగ్గించుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు మంత్రి యనమల సూచించారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఆర్టీసీ స్థలాలను లీజుకు ఇచ్చామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రవాణా శాఖ నిర్దేశించిన లక్ష్యం కంటే 26 శాతానికి పైగా ఆదాయం ఆర్జించడంపై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆ శాఖాధికారులను అభినందించారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రోడ్డు సేఫ్టీ ఫండ్‌కు నిధులు కేటాయించాలని సమావేశంలో నిర్ణయించారు. రవాణా శాఖకు అవసరమైన యంత్ర సామగ్రి సమకూర్చడానికి అవసరమైన నిధులు కేటాయింపునకు యనమల అంగీకరించారు. చంద్రన్న పెళ్లి కానుక, రెండోవిడత ఆదరణ పథకం అమలు కోసం అవసరమైన నిధులు కేటాయించాలని, కాపు, బీసీ భవనాల నిర్మాణానికి అవసరమైన టెక్నికల్ విభాగం ఏర్పాటుకు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. చేనేత భవనాల నిర్మాణానికి నిధుల కేటాయింపుకు అంగీకరించారు. కాపు కార్పొరేషన్‌కు నిధుల కేటాయింపుపైనా సమావేశంలో చర్చించారు. ఎస్సీ వెల్ఫేర్‌కు కేటాయించిన నిధులను వందశాతం మేర ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా ఖర్చు చేయాలని సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. ఎస్సీలకు ఇళ్ల స్థలాల కోసం భూములు కొనుగోలుకు గతంలో కంటే అధికంగా నిధులను వచ్చే బడ్జెట్‌లో కేటాయించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు కోరగా, అందుకు ఆర్థిక మంత్రి సరేనన్నారు. మెస్ చార్జీల కోసం అవసరమైన నిధుల కేటాయింపునకు సమావేశంలో నిర్ణయించారు. హాస్టళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం చూపొద్దని, స్కాలర్‌షిప్పులు సకాలంలో అందజేయాలని యనమల ఆదేశించారు.

చిత్రం..వివిధ శాఖల బడ్జెట్ ప్రతిపాదనలను సమీక్షిస్తున్న ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు