భక్తి కథలు

సర్వం జగన్నాథం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశంలోని పూరీ, బదిరీనాథ్, ద్వారక, రామేశ్వరంలలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను చార్‌ధాంగా పిలుస్తారు. వాటికి చార్‌ధాం హోదా కల్పించిన మహానుభావుడు ఆదిశంకరాచార్యులు. వీటిలో పూరీలోని జగన్నాథస్వామి ఆలయం అనేక విశిష్టతలతో విరాజిల్లుతోంది. ఒడిశా రాష్ట్రంలోని జిల్లా కేంద్రమైన పూరీలో వెలసిన ఈ క్షేత్రాన్ని జీవితంలో ఒక్కసారయినా సందర్శిస్తే జన్మసార్థకమవుతుందని భక్తుల విశ్వాసం. ఈ ప్రఖ్యాత క్షేత్రాన్ని ‘సర్వం జగన్నాథం’ అని అభివర్ణిస్తుంటారు. చెన్నై - హౌరా మార్గంలో ఖుర్దారోడ్ అనే రైల్వే కూడలి ఉంది. అక్కడి నుంచి 44 కి.మీ. దూరంలో సాగర తీరాన పూరీ పట్టణం ఉంది. ఈ ఆలయం అత్యంత పురాతనమైంది. గతంలో పూరీని పురుషోత్తమ క్షేత్రం, శ్రీక్షేత్రం అనే పేర్లతో పిలిచేవారు. ఈ ఆలయ విమాన గోపురం 192 అడుగుల ఎత్తున ఉంటుంది. సుమారు 4 లక్షల చదరపు అడుగుల భారీ వైశాల్యం కలిగి ఉండి, చుట్టూ ఎత్తయిన ప్రాకారం కలిగి ఉంది. ఆలయ గోపురంపైగల సుదర్శన చక్రం, జండా భక్తులను ఆకర్షిస్తుంటాయి. ఎటువైపునుంచి చూసినా ఒకే విధంగా ఉంటాయి. ఆలయ గోపుంపై పక్షులు ఎగరవు. విమానాలు సరేసరీ. ప్రకృతి నియమాలకు విరుద్ధంగా బంగాళఖాతంలో ఎగిరే కెరటాలు కనుల విందు చేస్తుంటాయి. ఈ ఆలయ ప్రాంగణంలో 120 మేరకు ఆలయాలు, ఉపాలయాలున్నాయి. ప్రధానాలయంలో జగన్నాథుడు (శ్రీకృష్ణుడు), బలరాముడు, వారి సోదరి సుభద్ర దివ్య మంగళ విగ్రహాలు దర్శనమిస్తాయి.
రథయాత్ర:
ఆషాడ శుద్ధ విదియ రోజున పూరీక్షేత్రం రథయాత్ర దేశం నలుమూలల నుంచి వచ్చే లక్షలాది భక్తజన సందోహంతో ప్రతిధ్వనిస్తుంది. ప్రపంచంలో ఏ హిందూ దేవాలయంలోనైనా సరే ఊరేగింపునకు మూలవిరాట్టును కదిలించరు. అందుకు ఉత్సవ విగ్రహాలుంటాయి. ఊరేగింపునకు ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్ల జరుగుతుంది. అయితే ఈ సంప్రదాయాన్నింటికీ మినహాయింపు పూరీ జగన్నాథాలయం. ఏటా కొత్త రథాలను శోభాయాత్రకు వినియోగించడం పూరీ ప్రత్యేకత. జగన్నాథడు, బలరాముడు, వారి సోదరి సుభద్ర విగ్రహాలను ఏటా ఓసారి మందిరం నుంచి బయటకు తీసుకొనివచ్చి కొత్తరథాలపై అధిష్టింప జేస్తారు. జగన్నాథుని రథాన్ని ‘నందిఘోష’, బలరాముని రథాన్ని ‘తాళధ్వజం’, సుభద్ర రథాన్ని ‘పద్మ ద్వజం’ అని పిలుస్తారు. రథయాత్రను పూరీ సంస్థానాధీశ కుటుంబానికి చెందిన వారు ప్రారంభిస్తారు. ఆ పిమ్మట ‘‘జై జగన్నాథ్’’ అనే నినాదాలు మిన్నుముట్టగా తాళ్ళతో రథానికి కట్టి లాగుతారు. భక్తుల తొక్కిసలాటలో ఒకవేళ అనుకోని సంఘటనలు జరిగినా, రథం వెనకడుగు వేసే ప్రసక్తి ఉండదు. జగన్నాథుని ఆలయం నుంచి 2.5 కి.మీ. దూరంలో ఉండే గుండిచారాణి గుడికి చేరుకొనేసరికి పనె్నండు గంటల సమయం పడుతుంది. గుండిచా ఆలయానికి చేరిన తరువాత ఆ రాత్రి బయటే రథాలను ఉంచి మర్నాడు ఉదయం మంగళవాయిద్యాలు మార్మోగగా ఆలయంలోకి తీసుకుని వెళ్తారు. నవరాత్రులు అక్కడ ఉంచిన పిమ్మట దశమినాడు మారురథయాత్ర (తిరుగు ప్రయాణం) మొదలవుతుంది. దీని ‘‘బహుదా యాత్ర’’ అని పిలుస్తారు. ఆ పిమ్మట విగ్రహాలను మళ్లీ గర్భగుడిలోని రత్న సింహాసనంపై అధిరోహింపజేస్తారు.
ఆ విగ్రహాలు విలక్షణం: పూరీ జగన్నాథుని రూపం విలక్షణంగా కన్పిస్తుంది. విగ్రహాలు కొండ్యతో నిర్మించినవే. విగ్రహాలు పెద్దపెద్ద కళ్ళలో ఉంటాయి. కాళ్ళు, చేతులు, చెవులు, పెదవులు లేకుండా ఉంటాయి. నడుం కింది భాగం ఉండదు. అనకూడదుగాని దివ్యాంగుల తరహాలో దర్శనమిస్తారు. ఈ ఆలయానికి సంబంధించిన స్థలపురాణం ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది.
స్థలపురాణం
ఇంద్రద్యుమ్నడనే మహరాజుకు విష్ణుమూర్తి కలలో కన్పించి చాంకీ నదీ తీరానికి 3 దారువులు (పెద్ద కర్రలు) కొట్టుకువస్తాయని, వాటిని విగ్రహాలుగా రూపొందించాలని సెలివిచ్చాడు. నదీ తీరంలో లభించిన దారువులతో విగ్రహాలుగా తీర్చిదిద్దేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అయితే దేవ శిల్పి విశ్వకర్మ ఓ రోజున రాజువద్దకు వృద్ధ బ్రాహ్మణ రూపంలో వస్తాడు. తాను విగ్రహాలను రూపొందిస్తానని చెబుతాడు. అయితే ఇందుకు ఓ షరతు విధిస్తాడు. శాస్త్ర సంప్రదాయాల మేరకు ఈ దారువులను 21 రోజులు తదేక దృష్టితో పనిచేస్తేగాని విగ్రహాలు తయారుకావని, అంచేతన నిష్టకు భంగపరచకూడదని పేర్కొన్నారు. పైగా తలుపులు వేసుకొని పనిచేయాల్సి ఉంటుంది. ఇంద్రద్యుమ్నుడు అంగీకరించాడు. నీలాద్రి సమీపంలో తాను నిర్మించిన ఓ మందిరంలో ఆ వృద్ధ శిల్పికి ఆశ్రయం కల్పించాడు. అలా 17 రోజులు గడిచాయి. 18వ రోజున ఇంద్రద్యుమ్నుని కుటుంబ సభ్యులు వృద్ధ శిల్పికి అన్న, పానీయాలను అందించాలని కోరారు. వారి మాట కాదనలేక భోజన, ఫల, పానీయాలతో ఆలయానికి వెళ్ళి తలుపులు బద్దలు కొట్టించి లోపలకు వెళ్లి చూడగా శిల్పి కనబడలేదు. అంగహీనమైన, అసంపూర్ణమైన విగ్రహాలు మాత్రమే ఉన్నాయి. దాంతో వాటిని అలాగే ప్రతిష్ఠించారని స్పష్టమవుతోంది. ఇప్పటికీ జగన్నాథుడు అదే రూపంలో దర్శనమిస్తున్న సంగతి తెలిసిందే. మరో విశేషమేమిటంటే ఆషాఢం అధిక మాసంగా వచ్చిన ఏడాది పాత విగ్రహాలను తొలగించి కొత్త విగ్రహాలను రూపొందించి ప్రతిష్ఠింప జేస్తారు. దీన్ని ‘‘నవకళేబర వత్సవమని’’ పిలుస్తారు. మూడేళ్ళకొకసారి ఇలా జరుగుతుంది. ఇక ఇంద్రద్యుమ్నుని వారసుడైన యయాతికేసరి స్వామిగారికి గుడి కట్టించినట్టు తాళపత్ర గ్రంథాలవల్ల తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఈ ఆలయాన్ని క్రీ.శ. 1140 ప్రాంతంలో చాడగంగ దేవుడు, అతని కుమారుడు అనంగ మహాదేవుడు పరిపూర్థ స్థాయిలో, అద్భుత కళానైపుణ్యంతో నిర్మింపజేసారు.కాగా గుడించా మందిరం గూర్చి ఓ మాట చెప్పాలి. ఇంద్రద్యుమ్నుని భార్య గుడించా. జగన్నాథ, బలభద్ర, సుభద్రల విశ్రాంతి కోసం ప్రధానాలయానికి సమీపంలో ఓ మందిరం నిర్మించింది. అదే గుడించా మందిరం. రథయాత్రలో భాగంగా అక్కడకు తీసుకువెళ్ళే మూడు విగ్రహాలను ఈ గుడిలోని రత్నపీఠంపై కూర్చొండపెట్టి గుడించా దేవి పేరిట ఆతిథ్యమిస్తారు. ఓ విధంగా చెప్పాలంటే గుడించా మందిరం జగన్నాథుని విడిది గృహం అన్నమాట.

-వాండ్రంగి కొండలరావు, 9490528730