మెయన్ ఫీచర్

చక్రం తిప్పిన బాబు చక్రబంధంలో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకప్పుడు ఢిల్లీలో చక్రం తిప్పిన చంద్రబాబునాయుడు ఇప్పుడు చక్ర బంధంలో ఇరుక్కు పోయారు. సొంత రాష్ట్రంలో, ఢిల్లీలో, చివరకు పొరుగు రాష్ట్రం ఆయనకు అన్నీ సమస్యలుగా మారాయి. పివి నరసింహారావు తరువాత ఢిల్లీలో కీలక భూమిక పోషించిన రాజకీయ నాయకుడు చంద్రబాబు. ‘‘ఐకె గుజ్రాల్, దేవగౌడలను ప్రధానమంత్రులను చేసింది నేనే. బిఆర్ అంబేద్కర్‌కు భారత రత్న ఇప్పించింది నేనే. వాజ్‌పాయికి స్వర్ణచతుర్భుజి ఐడియా చెప్పింది నేనే,’’ అంటూ కొన్ని అతిశయోక్తులను ప్రచారం చేసుకున్నా, కేంద్రంలో రాజకీయంగా కీలక భూమిక పోషించిన విషయం మాత్రం వాస్తవం. ముఖ్యమంత్రిగా తిరుగులేని నాయకునిగా ఉంటూ ఢిల్లీలో ఫ్రంట్ కన్వీనర్‌గా కీలక భూమిక పోషించారు.
‘‘ప్రధానమంత్రి పదవి కోసం ఒక గదిలో నేను ఇంటర్వ్యూ నిర్వహిస్తుంటే ఒకరి తరువాత ఒకరు వచ్చారు, అలా గుజ్రాల్‌ను ఎంపిక చేశాను’’ అని బాబు ఒక సారి చెప్పుకున్నారు. అలాంటి చంద్రబాబు ఆంధ్ర ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తరువాత వరుసగా అన్నీ సమస్యలే. విభజనకు ముందు తెలంగాణ కోసం రాజీనామా చేసిన ఎమ్మెల్యేల వల్ల, ఆంధ్రలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరడం వల్ల తరుచుగా ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ ఉప ఎన్నికల్లో ఒక్కటంటే కనీసం ఒక్క చోట కూడా టిడిపి విజయం సాధించలేదు. డిపాజిట్లు కూడా కోల్పోయింది. విభజన తరువాత జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో టిఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే, ఆంధ్రలో బాబు అధికారంలోకి వచ్చారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్, టిడిపిల మధ్య ఓట్ల శాతం తేడా స్వల్పమే అయినా అప్పటి వరకు ఒక్క సీటు గెలవని పార్టీ ఏకంగా అధికారంలోకి రావడం విశేషం. నిజానికి రాజకీయ పక్షాల కన్నా ప్రజలే విభజనను జీర్ణం చేసుకుని తగు నిర్ణయం తీసుకున్నారు. విభజనతో షాక్‌లో ఉన్న రాష్ట్రానికి తొమ్మిదేళ్ల పాలనా అనుభవం ఉన్న చంద్రబాబే బెటర్ అని నిర్ణయించుకున్నారు. కేంద్రంలో మోదీ అధికారంలోకి రావడం ఖాయం అనే అభిప్రాయం బలంగానే వినిపించింది. ఇటు బాబు అటు మోదీ అయితే ఆంధ్ర అభివృద్ధికి తిరుగులేదు అనుకున్నారు.
విభజన జరిగిపోయిన తరువాత ఎన్నికల్లో తెలంగాణలో తెలంగాణ వాదం వినిపించింది ఎవరు అని తెలంగాణ ప్రజలు చూశారు కానీ, ఆంధ్రలో సమైక్యాంధ్ర వాదం ఎవరిది అని చూడలేదు. అలా చూసి ఉంటే అధిష్టానాన్ని ధిక్కరించి సమైక్యాంధ్ర వాదాన్ని వినిపించి ఏకంగా జై సమైక్యాంధ్ర పార్టీనే ఏర్పాటు చేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి ని ఆదరించే వారు. ఆయనకు కనీసం ఒక్క చోట కూడా డిపాజిట్ దక్కకుండా ఘోరంగా ఉండేది కాదు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌తో సహా పార్టీ ఎమ్మెల్యేలంతా విభజనకు వ్యతిరేకంగా రాజీనామా చేసినందుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపేవారు. విభజనకు మద్దతుగా రెండు సార్లు లేఖలు ఇచ్చిన బాబును గెలిపిం చే వారు కాదు. ప్రజలు సమైక్యాంధ్ర యోధు లు ఎవరు అని చూడలేదు కాబట్టే ఇవి జరగలేదు. పాలనా అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని బాబును గెలిపించారు. అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు తన పాలనానుభవంతో ఆంధ్రకు మేలు చేసే విధంగా వేగంగా నిర్ణయాలు తీసుకుని ఉండాల్సింది.
ఎంతో అనుభవజ్ఞుడైన చంద్రబాబు తప్పటడుగులు వేస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రచారంతోనే దేన్నయినా సాధించవచ్చు అనే భ్రమ నుంచి చంద్రబాబు బయటపడాలి. గతంలో మాదిరిగా మీడియా ఒకే పార్టీకి, ఒకే వర్గానికి లేదు. ఒకవైపు అన్యాయంగా విభజించి కట్టుబట్టలతో పంపించారు. రాజధాని లేదు అంటుంటారు. మరోవైపు నర్సరావుపేటను ప్రపంచంలోనే టాప్ 10 నగరాల్లో ఉండేట్టు చేస్తానంటారు. మరో నెల రోజులకే అమరావతిని ప్రపంచంలో టాప్ టెన్ నగరాల్లో ఒకటిగా నిలుపుతానని అంటారు. దేశానికి ఆర్థిక రాజధాని ముంబై నగరమే ప్రపంచంలో టాప్ 10 నగరాల జాబితాలో లేదు. ఇక నర్సరావుపేట ముంబైని దాటుకుని వెళ్లాలి. లక్ష కోట్లు అంటూ జగన్‌పై చేసిన విస్తృతమైన ప్రచారం ఎన్నికల్లో ఉపయోగపడింది, ఇప్పు డూ ఉపయోగపడుతోంది. ఇంకెంత కాలం దీనిపైనే ఆధారపడతారు? ఆంధ్ర ముఖ్యమంత్రిగా బాబు తన పనితీరుతో ప్రజలను మెప్పించాలి.
ఢిల్లీలో బిజెపి ప్రభుత్వం సొంత బలంతో అధికారంలోకి రావడమే చంద్రబాబుకు పెద్ద దెబ్బ. గతంలో బిజెపి ప్రభుత్వం బాబు మద్దతుతో కేంద్రంలో అధికారం చేపట్టింది. బలమైన మిత్రపక్షం కావడం వల్ల అప్పుడు బాబుకు ప్రాధాన్యత ఉండేది. భారీ మెజారిటీని ఊహించని మోదీ ముందు జాగ్రత్తగా టిడిపితో పొత్తు పెట్టుకున్నారు. సొంత బలంతో అధికారంలోకి వచ్చాక బాబుకు ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వడంలేదు. చక్రం తిప్పడం అటుంచి మోదీ దర్శన భాగ్యం కూడా బాబుకు అంత సులభంగా దక్కడం లేదు. మోదీకి బాబు మద్దతు ఉపసంహరించుకోవాలని జగన్ డిమాండ్. బాబు మద్దతుతో నిలబడ్డ ప్రభుత్వం అయితే మద్దతు ఉప సంహరించుకుంటారనే భయం ఉండేది. మోదీ ప్రభుత్వానికి బాబు మద్దతు ఉపసంహరించుకున్నా, కొనసాగించినా తేడా ఉండదు. మోదీ లెక్కలు వచ్చే ఎన్నికల్లో బిజెపికి తగ్గే సీట్లను భర్తీ చేసుకోవడమే. బాబు వెళ్లిపోతాడు అనుకుంటే జగన్, టిఆర్‌ఎస్‌ల మద్దతు కోసం బిజెపి ప్రయత్నించే అవకాశం ఉంది. దీని వల్ల బాబు వల్ల తగ్గే సీట్ల కన్నా ఈ రెండు పార్టీల వల్ల కలిసి వచ్చే సీట్లు రెట్టింపు ఉంటాయి. వచ్చే ఎన్నికల తరువాతైనా, ప్రస్తుతానికైనా ఒక పార్టీ కన్నా రెండు పార్టీల బలం రెట్టింపు. దీం తో బాబును ఢిల్లీలో పెద్దగా పట్టించుకోవడం లేదు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోదీని తప్పించాలని బాబు డిమాండ్ చేసినందుకే ఈ కోపం అని కొందరి విమర్శ. అత్యున్నత స్థాయిలో ఉన్న నాయకులు ఏ పార్టీ వల్ల ఎంత వరకు మేలు, ఎంత వరకు నష్టం అని లెక్కలనే ప్రధానంగా చూస్తారు. ఆ రోజు ఏమన్నాడు, ఈ రోజు ఏమన్నాడు అని లెక్కలు చూసుకునేందుకు వాళ్లేమీ స్కూల్ పిల్లలు కాదు. రాజకీయం అంటే కూడికలు, తీసివేతలు.
తుఫాన్ నష్టం కావచ్చు, రాజధాని నిర్మాణానికి నిధులు, విభజన చట్టంలోని హామీల అమలు వంటి వాటిపై కేంద్రం బాబు ఇమేజ్ పెంచే స్థాయిలో సహకరించడం లేదు. ఇక ఐదేళ్ల పాటు ఆంధ్రకు ప్రత్యేక హోదా అనేది కాలం చెల్లిన హామీ అనేది తేలిపోయింది. గత రెండేళ్ల నుంచి ప్రత్యేక హోదా అదిగో ఇదిగో అని ఇంకా నమ్మిస్తూనే ఉన్నారు. బాబు మద్దతుతో బతికి బట్టకడితే ప్రత్యేక హోదా ఇచ్చేందుకు బిజెపికి ఎలాంటి అడ్డంకులు ఉండేవి కాదు. అవసరం లేదు కాబట్టి ఇప్పుడు అన్నీ అడ్డంకులే. ఇక సొంత రాష్ట్రం విషయానికి వస్తే కులాల ఆధిపత్య పోరుసాగుతోంది. మహిళా అధికారిపై ఎమ్మెల్యే దాడి జరిపినా చర్య తీసుకోలేదనే విమర్శ ప్రభుత్వానికి మచ్చగా నిలిచింది. గోదావరి పుష్కరాలు మొదలుకొని ఎన్నో విషయాల్లో ప్రభుత్వం విమర్శల పాలైంది. ప్రత్యేక హోదా సాధించలేకపోయారని విపక్షాలు బలంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. రాజకీయాల్లో నైతిక విలువల గురిం చి, నేను నిజాయితీపరుణ్ణి, నిప్పును అంటూ తన గురించి తాను ఎక్కువగా చెప్పుకునే రాజకీయ నాయకుడు దేశం మొత్తంలో చంద్రబాబు తప్ప ఎవరూ ఉండరు. నాయకుల నిజాయితీ నచ్చితే ప్రజలు వేనోళ్లుగా పొగుడుతూ ఉండవచ్చు కానీ తనకు తానే ఇలా ఎవరూ చెప్పుకోరు. వేలికి ఉంగరం, చేతికి వాచీ కూడా లేని నాయకుణ్ణి అంటూ ఈ రెండింటిని తన నిజాయితీగా నిదర్శనంగా చూపడం నవ్వులపాలయ్యేట్టుగా ఉంది. సెల్‌ఫోన్‌లు వచ్చాక వాచీలు వాడేవారు అరుదు. గతంలో రోజుకు రెండు ఇడ్లీలు, పుల్కాలు మాత్రమే తింటాను అని తానెంత నిజాయితీ పరుడో గతంలో చెప్పుకునే వారు.
మనవడితో ఆడుకునేంత సమయం కూడా లేకుండా 18 గంటల పాటు కష్టపడుతున్నానని చెప్పుకుంటున్నారు. ముఖ్యమంత్రి మనవడితో ఆడుకుంటున్నారా? వంకాయ మసాలాతో తిన్నారా? ఎన్ని గంటలు పడుకుంటున్నారు అనేది ప్రజలకు అనవసరం. ముఖ్యమంత్రిగా అధికారం అప్పగించిన తరువాత ప్రజలకు ఏం చేశారు అనేది ముఖ్యం.
ఇక అసెంబ్లీ సమావేశాలు ఆంధ్రప్రదేశ్ పరువు తీసేట్టుగా సాగుతున్నాయి. రికార్డులోకి ఎక్కని మాటలను పక్కన పెడితే ఇక కొవ్వు ఎక్కిందా? మగతనం ఉందా? ఇవీ అసెంబ్లీలో వినిపించిన కొన్ని ‘ఆణిముత్యాలు.’ బాబుకు ఢిల్లీలో, సొంత రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉంటే పొరుగు రాష్ట్రం తెలంగాణ నుంచి కూడా ఇబ్బంది తప్పడం లేదు. పాలనకు కొత్తే అయినా మొదట్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు 1956 నిబంధన వంటి కొన్ని తప్పటడుగులు వేసినా పథకాల్లో తమకు తిరుగులేదని తెలంగాణ ప్రభుత్వం నిరూపించుకుంటోంది. మీడియాలో అనుకూల వార్తలు ఎన్ని వచ్చాయి? వ్యతిరేక వార్తలు ఎన్ని అనే లెక్కలు పాలనకు కొలమానం కాదు. ఎన్నికల ఫలితాలే కొలమానం. తెలంగాణ ఏర్పడిన తరువాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ టిఆర్‌ఎస్ ఘన విజయం సాధించింది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకం వంటివి ప్రభుత్వానికి ప్రత్యేక ఇమేజ్ తెచ్చి పెట్టాయి. బాబు హయాంలో క్లింటన్‌ను హైదరాబాద్‌కు రప్పిస్తే, ముందు మీ రాష్ట్రంలో తాగునీరు లేని గ్రామాలు చాలా ఉన్నాయి వాటికి నీటి సౌకర్యం కల్పించండి అని ఆయన హైటెక్ సిటీవద్ద జరిగిన సమావేశంలో చెప్పి వెళ్లారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీటిని అందించే పథకం పనులు వేగంగా సాగుతున్నాయి.
కళ్యాణలక్ష్మి, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకం వంటివి ఆంధ్రలో సైతం అమలు చేయనున్నట్టు ఆంధ్ర ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణలోని షీ టీమ్స్ తరహాలో ఆంధ్రలో ప్రవేశపెట్టనున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వివిధ పథకాలతో పాటు ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాల పనితీరును ప్రతి అంశానికి పోల్చు తూ ప్రజలు చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ తరువాత టిడిపి అధికారంలోకి వచ్చిన సమయాల్లో రాష్ట్రాన్ని కాంగ్రెస్ పూర్తిగా భ్రష్టుపట్టించింది ఇప్పుడు మేం ఒక్కొక్కటి దారిలో పెడుతున్నాం అని చెప్పేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. తెలంగాణలో ఏం జరుగుతుందో ఆంధ్రలో చూస్తున్నారు, ఆంధ్రలో ఏం జరుగుతుందో తెలంగాణలో చూస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో పాలనను బేరీజు వేసుకుంటున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రుల తీరును పోల్చి చర్చించుకుంటున్నారు. ఇది కూడా చంద్రబాబుకు ఇబ్బంది కలిగించే అంశమే. మొత్తం మీద ఢిల్లీ, ఆంధ్ర, తెలంగాణ బాబుకు అన్నీ చక్రబంధాలే. రెండేళ్లు గడిచాయి, ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. ఇప్పుడే ఒక అంచనాకు రావడం తొందరపాటు. మూడేళ్లలో ఎన్నో పరిణామాలు చోటు చేసుకుంటాయి. మూడేళ్ల కాలం అంటే కాపురాన్ని చక్కదిద్దుకోవడానికి ఇంకా చాలా కాలం ఉన్నట్టే.

- బుద్దా మురళి