డైలీ సీరియల్

యాజ్ఞసేని - 69

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజులెవ్వరూ ఏమీ అనలేదు. అప్పుడు కర్ణుడు కలుగజేసుకొని ‘‘ఈ ద్రౌపది దాసి. ఇంటికి నడిపించు’’ అని దుశ్శాసనునితో అనగా
ద్రౌపది సిగ్గుపడుచూ, వణికిపోతూ పాండవుల గూర్చి విలపిస్తుండగా దుశ్శాసనుడు ఆ తపస్విని సభామధ్యంలోనికి ఈడ్చాడు. ద్రౌపది నేలపై పడింది. అప్పుడు ద్రౌపది
‘‘స్వయంవర సమయంలో సమాగతమైన రాజులు రంగస్థలంలో నన్ను చూచారు. మరెక్కడా నేను ఇతరుల కంట పడలేదు. అటువంటి నేను సభలోనికి రావలసి వచ్చింది. గతంలో రాజభవనంలో నున్న నన్ను గాలి, సూర్యుడు గూడ చూడలేదు. రాజభవనంలో గాలి నన్ను తాకినా సహించలేని పాండవులు నేడు ఈ దురాత్ముడు తాకుతూ ఉంటే సహిస్తున్నారు. కురువంశానికి కోడలునై, పుత్రీ సమానంగానున్న నేను ఈ విధంగా ఈడ్చబడుతున్నాను. నేను దీనికి తగను. ఐనా కౌరవులు సహించి చూస్తున్నారు. ఇది కాలవైపరీత్యమా? స్ర్తిని, కళ్యాణినీ, పతివ్రతమైన నేను సభామధ్యంలోనికి ఈడ్చుకొని రాబడ్డాను. ఇంతకన్నా దయనీయమైంది మరేముంటుంది? ఈ రాజుల ధర్మమే మయింది. ధర్మపరాయణ అయిన స్ర్తిని పూర్వమెప్పుడూ సభలోనికి కొనివచ్చేవారు కారు. ఈ కౌరవులలో ఆ సనాతన ధర్మం నశించింది. కౌరవులారా! నేను యుధిష్ఠిరుని ధర్మపత్నిని. క్షత్రియ కాంతను. ఇప్పుడు చెప్పండి. నేను దాసినా? అదాసినా? మీరు చెప్పినట్లు చేస్తాను. ఈ బాధ భరించలేను. కురువంశస్థులార! నేను ఓడిపోయాననో, ఓడి పోలేదో రాజులందరూ ఎలా భావిస్తే అలా సమాధానం చెప్పండి. దానిననుసరించి నేను ప్రవర్తిస్తాను’’ అని విలపిస్తూ అన్నది.
అప్పుడు భీష్మ పితామహుడు సభలో దుఃఖిస్తున్న ద్రౌపదిని చూచి
‘‘అమ్మా! కళ్యాణీ! నీ ప్రశ్నకు సమాధానం ఆ యుధిష్ఠురుడే చెప్పాలి. అలాకాని నాడు ధర్మం యొక్క సూక్ష్మతత్త్వాన్ని తెలిసికొనడం ఇతరులెవ్వరికైనా అసాధ్యమే. ఈ చెడుఫలితాన్ని ఈ కురువంశ దూషకులైన కౌరవులు తప్పక అనుభవిస్తారు’’ అని అనగా ద్రౌపదిని చూచి కర్ణుడు
‘‘ద్రౌపదీ! ఐదుగురి కంటే ఒక్కడే భర్త కావడం మంచిది. జూదంలో భార్యను ఓడిపోని తగు భర్తను ఇక పొందుము’’ అని పరిహాసం చేయగా దుర్యోధనుడు ద్రౌపదిని చూస్తూ
‘‘అందమైన విశాలమైన తన ఎడమ తొడమీద కూర్చుండ రమ్మని సైగ చేశాడు’’.
ఆ సైగను దూరం నుండి చూచిన భీమసేనుడు సభాసదులు వినేటట్లు సభలో ఉగ్రుడై ‘‘రాజ్యసంపద వల్ల కలిగిన పొగరుతో అందమైన ద్రౌపదిని చూచి అరటి (బోదెల) వంటి తొడలుగల ఆమెను తన తొడపైన కూర్చుండ రమ్మని పిలిచిన ఈ దుష్ట దుర్యోధనుణ్ణి భయంకర యుద్ధరంగంలో ఎదుర్కొని అడ్డగించ సాధ్యంగాని నా చేతులు త్రిప్పే భీకరగదాదండం దెబ్బలతో ఇతని తొడలు విరుగగొట్టుతాను’’ అని భీకర శపథం చేశాడు.
***
ఉ!! ధారుణి రాజ్యసంపద మదంబున గోమలి గృష్ణజూచి రం
భోరునిజోరు దేశమున నుండగ బిల్చిన యిద్దు రాత్ము దు
ర్వార మదీయ బాహుపరివర్తిత చండగదాభిఘాత భ
గ్నోరుతరోరు జేయుదు సుయోధను నుగ్రరణాంతరంబునన్!!
(నన్నయ భారతం సభాపర్వం ద్వి, ఆశ్వా. పద్యం 249)
***
కోపావేశంతో మైమరచి ఆయుధాలుండే దిక్కు కు చూపులు ప్రసరింపజేస్తూ అన్న మొగం చూస్తున్న భీమసేనుడి భయంకరాకారం చూచి భీష్మద్రోణులు ‘‘ఇది కోపానికి సమయం కాదు’’ అని భీమసేనుణ్ణి శాంతింపజేశారు.
అప్పుడు విదురుడు కలుగజేసుకొని ‘‘్ధృతరాష్టక్రుమారులారా! తెలుసుకొనండి. భీముడి ద్వారా ఎంత భయంకరస్థితి ఏర్పడిందో. మీరు హద్దులనతిక్రమించి జూదమాడారు. స్ర్తిని సభకు తెచ్చి వివాదాన్ని సృష్టించారు. కౌరవులు పాపిష్టమైన మంత్రాంగం చేస్తున్నారని అందరికీ అర్థమైనది. ఈ శకుని మాటలను విని ధర్మానికి దూరం కావద్దు’’ అని అనగా దుర్యోధనుడు..
..........................ఇంకావుంది

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము