డైలీ సీరియల్
పంచతంత్రం--23
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బాల్రాజ్ మెల్లిగా కళ్ళుతెరిచాడు.
మొదట అతడికి తాను ఎక్కడ ఉన్నాడో అర్ధంకాలేదు. రెండు క్షణాల తర్వాత తాను హాస్పిటల్లో ఉన్నట్లు అర్ధంచేసుకున్నాడు. తల పక్కకు తిప్పి చూసిన బాల్రాజ్కు నేలమీద కూర్చుని చికెన్ తింటూ, మందుకొడుతూ, పేకాట ఆడుకుంటున్న బైరాగి, పఠాన్లు కనిపించారు.
వాళ్ళను అలాచూడగానే కోపంతో అరిచాడు బాల్రాజ్ ‘‘రేయ్!... నేను ఇక్కడ బెడ్డుమీద పడి ఉంటే.. మీరు అక్కడ ఎంజాయ్ చేస్తార్రా?’’
ఆ మాట వినగానే బైరాగి, పఠాన్లు ఠక్కున లేచి నిలబడ్డారు.
బైరాగి వినయంగా చెప్పాడు.
‘‘అన్నా! నువ్వు అలా అనాధ శవంలా పడి వుంటే చూడలేక, ఆ బాధ మర్చిపోవడానికి మందు కొడుతున్నామన్నా..’’
‘‘ఈ డాక్టర్ గాడు మనకు తెలిసినోడే అన్నా! వీడు చేసే వడ్డీ వ్యాపారంలో బాకీలు వసూలు చేసుకోవడానికి అప్పుడప్పుడు మన హెల్ప్ తీసుకుంటూ ఉంటాడు. మనకు బిల్లు ఏమీ వెయ్యలేదు. నీకు ఒక గంటలో స్పృహ వస్తుంది అన్నాడు.. వచ్చింది’’ అంటూ చెప్పాడు పఠాన్.
‘‘ఊ..! ఆ పిక్ పాకెటర్గాడు నా డబ్బులంతా దానం చేసేశాడు. వాడిని వదలకూడదు. ఆ పండిట్గాడితో టచ్లో ఉండండి..’’
‘‘అలాగే అన్నా!’’ అంటూ చెప్పాడు పఠాన్.
‘‘నేను డబ్బు పోగొట్టుకున్న విషయం అన్నకు చెప్పకండి..’’
‘ఓకె అన్నా!’’ అన్నాడు బైరాగి.
‘‘నాకు హెల్త్ బాగోలేక రిజిస్ట్రేషన్స్ చెయ్యలేకపోయాం’’ అని అన్నతో చెపుదాం’’
‘‘అలాగే అన్నా’’ అన్నాడు పఠాన్.
బాల్రాజ్ ఏదో అనబోయాడు.
అంతలో నిరంజన్ నుంచి ఫోన్ వచ్చింది. వెంటనే బైరాగి, పఠాన్లతో వచ్చి కలవని బాల్రాజ్తో చెప్పాడు నిరంజన్.
అరగంట తర్వాత బాల్రాజ్, బైరాగి, పఠాలు నిరంజన్ని కలిశారు. స్టమక్ పాడైపోయి మోషన్స్ పట్టుకోవటంతో రిజిస్ట్రేషన్స్ చేయలేకపోయినట్టు నిరంజన్తో చెప్పాడు బాల్రాజ్.
‘‘రేపైనా ఆ పని పూర్తిచెయ్యండి!’’ అంటూ కోపంగా చెప్పాడు నిరంజన్.
‘‘అలాగే అన్నా! రేపు గ్యారంటీగా ఫినిష్ చేస్తా’’ అన్నాడు బాల్రాజ్ వినయంగా.
బాల్రాజ్, పఠాన్, బైరాగిలకు నిరంజన్ పాత పెద్ద నోట్ల కరెన్సీ బండిల్స్ ఇచ్చాడు. వాటిని తీసుకుని వాళ్ళు వెళ్లబోతుండగా నిరంజన్ దగ్గరున్న సెల్ఫోన్ మోగింది.
వాళ్లను ఆగమన్నట్లు సైగ చేసి ఫోన్ రిసీవ్ చేసుకుని ‘హలో!’’ అన్నాడు నిరంజన్.
అవతల చెన్నై నుంచి వేలాయుధం లైన్లోకి వచ్చాడు.
‘‘నేను! వేలాయుధాన్ని!! డైమండ్స్ రెడీగా ఉన్నాయ్... ఎల్లుండి కలుద్దాం.. మీటింగ్ పాయింట్ ఎప్పుడో, ఎక్కడో మళ్లీ చెపుతా!’’
వేలాయుధం ఎంత ఖరీదు చేసే డైమండ్స్ పంపించబోతున్నాడో అడగాలనుకున్నాడు నిరంజన్. కానీ అంతలోనే ఫోన్ కట్ చేశాడు వేలాయుధం.
ఎదురుగా నిలబడి వున్న బాల్రాజ్, పఠాన్, బైరాగిలతో చెప్పాడు నిరంజన్.
‘‘ఎల్లుండి వేలాయుధం డైమండ్స్తో వస్తున్నాడు. ఎప్పుడో ఎక్కడ ఏ టైములో మనల్ని కలుస్తాడో ఇంకా చెప్పలేదు. మనం రెడీగా ఉందాం’’.
బాల్రాజ్, పఠాన్, బైరాగి తలలు ఊపారు.
ఒక ధాబాలో లిక్కర్ తాగుతూ మాట్లాడుకుంటున్నారు డిఎస్పి దుర్గారావ్, ఎస్ఐ మహేంద్ర.
‘‘ఇప్పటికే చాలా టైమ్ వేస్ట్ అయింది. ఆ నిరంజన్ మనుషులని ఫాలో అవటం దండగ. నిరంజన్గాడి దగ్గర చాలా డబ్బుంది. లేబర్ని బ్యాంకుల దగ్గర నిలపెట్టి వెయ్యి. రెండు వేలు చొప్పున ఎక్స్ఛేంజ్ చేసుకుంటూ కూచోడు. ఒకేసారి పెద్ద మొత్తంలో డీల్ చేస్తాడు. వాడి మెంటాలిటీ నాకు తెలుసు’’.
‘‘ఐతే ఏం చేద్దాం?’’ అంటూ అడిగాడు మహేంద్ర.
‘‘ఆ బాల్రాజ్గాడు నిరంజన్కి నమ్మిన బంటు. పఠాన్ని తేలిగ్గా లొంగదీయలేం. బైరాగి గాడిని కాంటాక్ట్ చెయ్!’’ చెప్పడం ముగించాడు దుర్గారావ్.
***
అప్పుడు సమయం ఉదయం పది గంటలు అవుతోంది.
ఆ క్రితం రోజే బాల్రాజ్ డబ్బు అంతా దేవాలయాలకు, రెడ్క్రాస్ సొసైటీకి, ప్రైమ్మినిస్టర్ నేషనల్ రిలీఫ్ ఫండ్ మొదలైన వాటికి కార్తీక్ ట్రాన్స్ఫర్ చేశాడు.
తన రూమ్లో పుస్తకాల ర్యాక్లోనుంచి ఒక చిన్న అట్టపెట్టి తీసింది గోపిక.
ఆ అట్టపెట్టెలో కొన్ని పాత కరెన్సీ నోట్లు ఉన్నాయ్. వాటిని బయటకు తీసి చూసింది. అవి అన్నీ ఒకటి, రెండు, ఐదు, పది, ఇరవై, యాభై, వంద రూపాయల నోట్లు. వాటిల్లో కొన్ని పంతొమ్మిది వందల ఎనభైలలో ప్రింట్ అయినవి ఉన్నాయి. పాత కరెన్సీ నోట్లు, స్టాంపులు మొదలైనవి సేకరించటం గోపికకు అలవాటు. గోపిక కంప్యూటర్ ఓపెన్ చేసి ఆన్లైన్లో వెతికింది. పాత వస్తువులు, పాత కరెన్సీ నోట్లు, పాత పేక ముక్కలు, పాత స్టాంపులు మొదలైనవి వేలంలో అమ్మే వెబ్సైట్స్ పరిశీలించింది.
ఒక ఆక్షన్ వెబ్ సైట్లో రిజర్వు బ్యాంకు గవర్నర్ మాంటెక్ సింగ్ అహ్లూవాలి సంతకం చేసిన ఒక రూపాయి నోటు యాభై వేల రూపాయలకు వేలానికి పెడితే, మరొక సైట్లో అదే నోటు పాతివేల కనీస ధరకు ఆక్షన్లో పెట్టారు. ఆర్.వెంకటరామన్ రిజర్వు బ్యాంకు గవర్నర్గా ఉన్నపుడు ఆయన సంతకంతో వెలువడిన ఒక రూపాయి నోటు ఎవరో లక్ష రూపాయలకు వేలంలో పెట్టారు. మరొకరు అదే నోటు పదివేలకు కనీస ధరకు వేలంలో ఉంచారు. రకరకాల వెబ్ సైట్లలో వెతికింది గోపిక. ఆ రోజు ఆన్లైన్ బిడ్స్లో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో విడుదలైన పాత రూపాయి నోటు విలువ కనీసం పదివేలు ఉంది.
గోపిక నిరాశగా నిట్టూర్చింది. ఆమె దగ్గర పంతొమ్మిది వందల ఎనభైల నాటి రూపాయి నోట్లు రెండే ఉన్నాయి.
తర్వాత ఆమె ఆ నోట్లు తిరిగి అట్టపెట్టెలో పెట్టి, ఆ అట్టపెట్ట తిరిగి పుస్తకాల ర్యాక్లో పెట్టేసింది. ఏదో ఆలోచించి పాత నోట్ల గురించి, పాత వస్తువుల గురించి నెట్లో చదివింది. పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది జనవరిలో అప్పటి ప్రైమ్ మినిస్టర్ మొరార్జీ దేశాయ్ టైంలో రద్దుచేసిన వెయ్యి, ఐదువేలు, పదివేల నోట్లకు ఇప్పుడు యాంటిక్ వేల్యూ వచ్చింది. అప్పటి పదివేల నోటు ఇపుడు ఇరవై లక్షలు పలుకుతోంది.
బ్రిటీష్ వాళ్ళు అధికారంలో ఉన్నపుడు సర్ జేమ్స్ బ్రైడ్ టైలర్ అనే భారతీయ రిజర్వు బ్యాంకుకు రెండవ గవర్నర్గా పనిచేశాడు. అప్పట్లో ఆయన సంతకంతో విడుదల అయిన వంద రూపాయల నోటు ఇపుడు మూడున్నర లక్షల నుంచి తొమ్మిది లక్షల వరకూ ధర పలుకుతోంది.
-సశేషం