డైలీ సీరియల్

యాజ్ఞసేని--129

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పుడు ద్రౌపది కలిగించుకొని ధర్మరాజుకు దండనీతి గురించి వివరిస్తుంది. ధర్మసూక్ష్మాలను దర్శించగల ద్రౌపది ధర్మరాజునుద్దేశించి ఎంతో మృదువుగా అనునయిస్తూ-
‘‘రాజా! నీ తమ్ముళ్ళు చాతక పక్షులవలె నీరసించిపోతున్నారు. ఇంకా యింకా కుమిలిపోతున్నారు. సముచితంగా సంభాషించి వారిని సంతోషపెట్టుము. పూర్వం ద్వైతవనంలో చలికి, గాలికి కృశించినపుడు నీ తమ్ముళ్ళతో ఎలా చెప్పావు?
‘‘జయకాంక్షతో మనం యుద్ధంలో దుర్యోధనుని సంహరించి, పూర్ణమైన ఈ భూమినంతటినీ పరిపాలించుదాము. రథికుల యొక్క రథాలను విరగగొట్టి, ఏనుగులను చంపుదాం. యోగ్యులకు భూరి దక్షిణలనిచ్చి ఎన్నో యజ్ఞాలను చేద్దాం. ఈ వనవాస దుఃఖం మనకు భవిష్యత్తులో సుఖాన్ని కలిగిస్తుంది’’ అని నీవు స్వయంగా అప్పుడు చెప్పి ఇప్పుడు ఎందుకు మా మనస్సులను హింసిస్తున్నావు? నిర్వీర్యుడు భూమిని పాలించలేడు. ధనం పొందలేడు. దండనీతి లేని క్షత్రియుడు రాణించలేడు. భూమిని పాలించలేడు. దండనీతి లేని రాజుయొక్క ప్రజలు సుఖపడలేరు. సర్వప్రాణులమీద మైత్రి, దానమూ, తపస్సు అనేవి బ్రాహ్మణుని ధర్మాలుగానీ రాజధర్మాలుగావు. దుష్టులను శిక్షించడం, శిష్టులను రక్షించడం, సుజనులను కాపాడడం, యుద్ధంలో వెనుదిరిగిబోకపోవడం, అనేవి రాజుకు ముఖ్యమైన ధర్మాలు. సహనము, క్రోధం, యివ్వడం, పుచ్చుకోవడం, భయం, నిర్భయం, నిగ్రహం, అనుగ్రహం- ఈ జంటలు తగు రీతిలో వుండేవాడిని ‘్ధర్మవేత్త’ అని అంటారు. పాండిత్యం చేతగానీ, యజ్ఞాలు చేసినందువలన గానీ, భిక్షాటనం చేతగానీ నీకు రాజ్యం లభించలేదు.
భీష్మద్రోణ కృపాశ్వత్థామకర్ణులతో రక్షింపబడిన గొప్పదైన సేనను నీవు సంహరించావు. రాజా! అందువలన ఈ భూమిని అనుభవింపుము. ఎన్నో జనపదాలతో నిండిన జంబూద్వీపం అంతా నీ దండంతో జయించావు. జంబూద్వీపంతో సమానమైనదీ, మరువుకు పశ్చిమంగా వున్న క్రౌంచద్వీపాన్ని, మేరువుకు తూర్పున వున్న శాకద్వీపాన్నీ, మేరువుకు ఉత్తరానవున్న భద్రాశ్వద్వీపాన్నీ నీవు దండంతోనే జయించావు. చూర్ణం చేశావు.
ద్విజులంతా నిన్ను పూజిస్తున్నారు. అయినా నీకు తృప్తిలేదు. నీ తమ్ముళ్ళంతా దేవతా సమానులు. శత్రుంజయులు. వీరిలో ప్రతి ఒక్కరూ ప్రీతితో నాకు సుఖాన్ని చేకూర్చగలవాడే. అటువంటి నర్తోములైన అయిదుగురు నా భర్తలు. ఇక వేరే చెప్పాలా.
మా అత్త కుంతీదేవి ఎన్నడూ అబద్ధమెరుగదు. సర్వజ్ఞురాలు. ఆమె నాతో ఒకసారి ‘‘పాంచాలీ! ధర్మరాజు చతురుడైన పరాక్రమంతో వేలకొద్ది రాజులను సంహరించి నిన్ను ఎంతో సుఖ పెడతాడు’’ అని అన్నది. కానీ నీ అజ్ఞానంవలన అదంతా వ్యర్థమైమాటే అనిపిస్తున్నది. మహారాజా! పెద్దన్న గొప్ప వెర్రివాడు. మిగిలిన తమ్ముళ్ళంతా వానినే అనుసరిస్తారు. నీ వెర్రితనంతో పాండవులంతా వెర్రివాళ్లయ్యారు. అంతేగాకపోతే నాస్తికులతోపాటు నిన్ను బంధించి భూమినంతటినీ పాలించి వుండేవారు.
నేను లోకంలో స్ర్తిలలో అందరికంటే అధమురాలనయ్యాను. పుత్ర సమానులచేత అవమానింపబడ్డాను. అయినా యింకా జీవించాలనుకొంటున్నాను. నీకోసం ప్రయత్నించే నీ సోదరులందరినీ కాదని నీవు భూమినంతటినీ వదలి, స్వయంగా ఆపద కొనితెచ్చుకొంటున్నావు. ఇపుడు నామాట అసత్యము కాదు. రాజులందరికీ యిష్టులై పూర్వం మాంథాత, అంబరీషుడు, భూమిమీద వెలుగొందినట్లే నీవూ వెలుగొందుచున్నావు. ప్రజలందరినీ సుఖ సంతోషాలతో వర్థిల్లజేస్తూ పర్వతాలూ, నదులూ, ద్వీపాలతో కూడిన భూదేవిని పరిపాలించుము. మనసు పాడుచేసుకోకుము. రాజోత్తమా! వివిధ యజ్ఞాలు చెయ్యి. శత్రువులను జయించుము. ధనాలు, భోగాలు, వస్త్రాలు విప్రులకు సమర్పింపుము’’ అని అన్నది.
పిమ్మట అర్జునుడు కూడా ధర్మరాజుకు రాజదండమును గురించి చెప్పగా, భీమసేనుడు యజ్ఞ యాగాదులను చేయమని అన్నగారిని ప్రోత్సహించాడు.
(58)
మహర్షి వ్యాసుడు వచ్చాడు.
ధర్మరాజును ప్రాయశ్చిత్త రూపముగా అశ్వమేథ యాగము చేయమని ప్రోత్సహించాడు. శాంతించిన ధర్మరాజు పురప్రవేశం చేశాడు.
కోపతాపాలు విడిచి బంగారు సింహాసనం మీద సంతోషంతో తూర్పుముఖంగా కూర్చున్నాడు.
బంగారు పీఠాలమీద సాత్యకి, శ్రీకృష్ణవాసుదేవుడు అభిముఖంగా కూర్చున్నారు.
ధర్మరాజును మధ్య బీబట్టుకొని భీమార్జునులిరువురూ యిరువైపులా కొంచెం యెత్తు తక్కువైన మణిపీఠాల మీద కూర్చున్నారు.
బంగారు పూలు పొదిగిన దంతపు సింహాసనం మీద నకుల సహదేవులిద్దరినీ చెరొకవైపు పెట్టుకొని కుంతీదేవి కూర్చుంది.
సుధర్ముడు (దుర్యోధనుడి పురోహితుడు), విదురుడు, ధౌమ్యుడు, ధృతరాష్ట్రుడు ప్రజ్వరిల్లే కాంతులుగల వేరువేరు ఆసనాలను అలంకరించారు.

..........................ఇంకావుంది

--త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము