సంపాదకీయం

క్రౌర్యం.. కాలుష్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణజింకల హత్య ప్రతీక మాత్రమే.. దేశమంతటా వన్యప్రాణుల హననం విచ్చలవిడిగా కొనసాగుతుండడం వాస్తవ వైపరీత్యం. విదేశాల్లో సైతం వన చర జంతు జాతులను, పక్షులను నాగరికతను అభినయిస్తున్న అనాగరికులు పొట్టనపెట్టుకుంటూ ఉండడం దశాబ్దులుగా ఆవిష్కృతవౌతున్న మానవ క్రౌర్యానికి వికృతమైన నిదర్శనం. అమెరికా, ఐరోపా ఖండాల్లోని ‘తెల్లదొరలు’, డబ్బు మదమెక్కినవారు, విడివిడిగాను గుంపులుగాను ఆఫ్రికాలోని అడవులలో వేటాడుతుండడం నిత్యకృత్యం. అటవీ జంతువులను, పక్షులను వేటాడ్డానికి వీరు వినోద యాత్రలు జరుపుతున్నారు. వేటాడ్డానికి వీలుగా కొన్ని స్థానిక ప్రభుత్వాలు అనుమతులను ఇవ్వడం పర్యావరణ హననానికై మానవులు సాగిస్తున్న బీభత్సకాండలో భాగం. ‘అనుమతి’ని అనేక ప్రభుత్వాలు నిరాకరిస్తున్నాయి. అలాంటి సందర్భాలలో ‘వన విహారం’ ‘వనభోజనం’ వంటి ముసుగుల్లో ఈ ‘తెల్ల ముష్కరులు’ ఆఫ్రికా, ఆసియా అడవుల్లోను, దక్షిణ అమెరికాలోను వన్య జంతు హత్యలను కొనసాగిస్తున్నారు. అవినీతిపరులైన ప్రభుత్వ ఉద్యోగుల అండదండలు వారికి మెండుగా ఉన్నాయి మరి. ఆఫ్రికా అడవుల్లో 2005 నాటికి దాదాపు ఐదు లక్షల ఇరవై ఆరు వేల ఏనుగులు మిగిలి ఉన్నాయి. 2015 నాటికి వీటి సంఖ్య నాలుగు లక్షల పదిహేను వేలకు పడిపోయింది. పదేళ్లలో లక్షా పదకొండు వేల ఏనుగులు నశించాయి. వీటిలో తొంబయి శాతానికి పైగా హత్యకు గురి అయ్యాయట! దంతాలు, ఇతర అవయవాల కోసం ఏనుగులు చంపడం వృత్తిగా జీవిస్తున్నవారు అంతర్జాతీయ ముఠాలుగా ఏర్పడి ఉన్నారు. ఏటా ఆఫ్రికా అడవులలో సగటున ముప్పయివేల ఏనుగులను చంపేస్తున్నట్టు 2016లో నిర్ధారణ జరిగింది. వేల టన్నుల ఏనుగుదంతాలు విదేశాలకు తరలిపోగా వందల టన్నుల దంతాలను ఆయా దేశాల ప్రభుత్వాలు స్వాధీనం చేసుకుంటున్నాయి. కెన్యాలో ఇలా పట్టుబడిన నూట ఐదు టన్నుల ఏనుగు దంతాలను ప్రభుత్వం వారు రెండేళ్ల క్రితం పదకొండు గుట్టలుగా పోసి తగులబెట్టారు. తమ దేశం నుండి దంతాలను తరలిస్తుండడంపట్ల నిరసన తెలుపడానికై కెన్యా ఇలా దంతాలను అగ్నిజ్వాలలకు ఆహుతి చేసింది. టన్ను ఏనుగు దంతాల ధర ఆరు కోట్ల రూపాయలకు పైగా ఉన్నప్పటికీ దంతాలను విక్రయించబోమని కెన్యా ప్రభుత్వం స్పష్టం చేయడం వన్య జంతు సంరక్షణ నిష్ఠకు నిదర్శనం!
ఇలా తరలిపోతున్న ఏనుగు దంతాలలో అధిక శాతం చైనాకు చేరుతున్నాయి. చైనా ‘కమ్యూనిజం’-సామ్యవాదం- కుబుసాన్ని వదలిపెట్టి ఈ శతాబ్ది ఆరంభం నాటికి ‘మార్కెట్ ఎకానమీ’- స్వేచ్ఛా విపణి- వ్యవస్థగా ఏర్పడింది. ‘కాపటలిస్ట్’- పెట్టుబడిదారీ- ఆర్థిక వ్యవస్థకు మరో పేరు ‘మార్కెట్ ఎకానమీ’! చైనాలో వ్యక్తిగత సంపద, సంపన్నుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఈ కొత్త కుబేరులు ఏనుగు దంతాలతో, ఎఱ్ఱ చందనంతో తయారైన ‘విలాస సామగ్రి’ని విరివిగా కొంటున్నారు. మన దేశంలో ప్రధానంగా తిరుమల క్షేత్ర ప్రాంగణంలోని ఎఱ్ఱచందనం వృక్షాలను దుండగులు నిరంతరం తెగ నరకుతున్నారు. ఈ చందనం కలప విదేశాలకు ప్రధానంగా చైనాకు దొంగ రవాణా అయిపోయింది. ఎఱ్ఱగంధం చెక్కలను దొంగ రవాణా చేస్తున్న అంతర్జాతీయ ముఠాలలో చైనా ముష్కరులు ఎక్కువ మంది ఉన్నారు. చైనా ప్రభుత్వం ఇలాంటి సీమాంతర అక్రమ వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తూ ఉండడం అంతర్జాతీయ రహస్యం! ఆఫ్రికాలోని టాంజానియాలో 2009- 2014 మధ్యకాలంలో- ఐదేళ్లలో-దేశంలోని ‘వన్యగజ’ సముదాయంలో సగం హత్యకు గురికావడం ప్రకంపనలను సృష్టించింది. హత్యకు గురైన ఏనుగుల దంతాలలో అధిక శాతం చైనాకు వెళ్లాయి. 2013 మార్చిలో చైనా అధ్యక్షుడు ఝీజింగ్ పింగ్ టాంజానియాకు వెళ్ళారు. తిరుగు పయనంలో ఆయన ఎక్కిన విమానంలోనే అనేక పెట్టెలలో ఏనుగు దంతాలను నింపి చైనాకు దొంగ రవాణా చేయడం దుశ్చర్యలకు పరాకాష్ఠ! ఇలా ఆఫ్రికా ఏనుగులను భోంచేస్తున్న చైనా మన దేశపు పులులను సైతం ‘్ఫలహారం’ చేస్తోంది..
చైనావారి సంప్రదాయ వైద్య ప్రక్రియలో తయారయ్యే ఔషధాలకు పులిగోళ్లు, చర్మాలు, ఎముకలు, ఏనుగు దంతాలను ‘ఘటుకాలు’- ఇన్‌గ్రీడియంట్స్-గా ఉపయోగిస్తున్నారట! మన దేశపు అడవులలోని పులులను చంపి చైనాకు ఎగుమతి చేస్తున్న ముఠాలు విరివిగా పనిచేస్తున్నాయి. చైనాలోని పులి అవయవాలను శుద్ధిచేసే కేంద్రాల -టైగర్ హార్వెస్టింగ్ సెంటర్స్-కు ‘సరఫరాలు’ మన దేశం నుండి అక్రమంగా వెడుతుండడం మన ‘శార్దూలాల’ హత్యకు ప్రధాన కారణం! ఈ విషయమై మన ప్రభుత్వం అనేకసార్లు చైనా ప్రభుత్వానికి గుర్తుచేసినప్పటికీ దొంగ రవాణాను ప్రోత్సహిండం చైనా ప్రభుత్వం మానుకున్న సమాచారం లేదు. మన దేశంలో దాదాపు ముప్పయి ఒక్క వేల ఏనుగులు, రెండువేల రెండువందల ఇరవై ఆడపులులు ఉన్నట్టు 2014లో నిర్ధారణ జరిగింది. కర్నాటకలో అతిపెద్ద సంఖ్యలో నాలుగు వందల ఆరు పులులున్నాయి. కర్నాటక, తమిళనాడు, కేరళ, గోవాలలో విస్తరించిన పడమటి కనుమల ప్రాంతంలో దేశంలోని పులులలో నలబయి ఐదు శాతం జీవిస్తున్నాయి. కానీ పడమటి కనుమలను ‘ప్రపంచ వారసత్వ’ ప్రాంగణంగా ఐక్యరాజ్యసమితి గుర్తించాక పర్యాటకుల వేషంలోని వేటగాళ్లు పులులను పొట్టనపెట్టుకుంటున్నారు. గత ఏడాది జనవరి-జూలై మధ్యకాలంలో అరవై రెండు పులులు మరణించినట్టు వెల్లడైంది. ఈ పులులలో ఎన్ని హత్యకుగురి అయ్యాయో? 2016లో వంద పులులు కనబడకుండా పోయాయి. ఈ గణాంకాలకు మించి పులులను హత్యచేసి ఉంటారన్న సందేహం అతార్కికం కాదు. పులులకే దిక్కులేదు. రాజస్థాన్‌లోని కృష్ణజింకల గోడు ఎవరికి పట్టింది? సల్మాన్‌ఖాన్ వంటి వన్యప్రాణి హంతకులు, పట్టుబడని వారు ఎందరో??
మానవ క్రౌర్యానికి ఇలా వివిధ ప్రాణులు బలైపోతుండడం ‘జాతీయ సంస్కార పరంపర’కు తీరని కళంకం! మానవుడు పెంచుతున్న కాలుష్యం వల్ల లక్షల ప్రాణులు అకాల మరణం పాలవుతుండడం మరింత ప్రమాదకరం. ఉడుతలు, పిచ్చుకలు ఊళ్లలో కనిపించడం లేదు. భాగ్యనగరం శివారులలోను, ఇతరచోట్ల చెఱువులలోని లక్షల చేపలు విగత జీవులై ఒడ్డునకు కొట్టుకొని రావడం నడుస్తున్న కథ. అటవీ విస్తీర్ణం తగ్గిపోవడంవల్ల ఏనుగులు గ్రామాలలోకి, పొలాలలోకి చొచ్చుకొని రావడం అనివార్యమైపోయింది. విద్యుత్ తీగలు, రైళ్ల ఇంజన్లు తరచూ ఏనుగులను హననం చేస్తుండడానికి అడవులు అంతరించిపోవడం కారణం. చంబల్ నదిలోని కాలుష్యం కాటుపడి ఒకే రోజున అనేక మొసళ్లు మరణించడం పదేళ్లక్రితం సంచలనం కలిగించింది. మన దేశపు తూర్పు సముద్ర తీరంలో సగటున ఏటా పనె్నండు వేల తాబేళ్లు కాలుష్యానికి, క్రౌర్యానికి బలై అకాల మరణం పాలవుతున్నాయి. వందల కొలదీ తిమింగలాల మృతదేహాలు తీరానికి కొట్టుకొని వస్తున్నాయి. మానసిక స్వచ్ఛత మానవులలో పెరగడం ఈ ప్రాకృతిక విపత్తుల నివారణకు ప్రధాన సూత్రం. జీవజాలం హితం మానవ హితం కంటె మరింత విస్తృతం. అడవి అంటే ప్రకృతి- అంటే వృక్షజాలం, జంతుజాలం కలసిన జీవ జాలం. అణువు అణువు పరస్పరం అనుసంధానం అయి ఉండడం బ్రహ్మాండం.