మెయన్ ఫీచర్

సామాన్యులకు దూరమవుతున్న బ్యాంకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చామని ఆర్‌బిఐ గవర్నర్ రఘురామ్ రాజన్ కొచ్చిలో ఫెడరల్ బ్యాంక్ కార్యక్రమంలో అన్నప్పుడు, దోశ ధర ఎందుకు తగ్గలేదని ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ప్రశ్నిస్తే, ‘ఇంకా పెనం మీదనే దోశను వేస్తే ఎలా తగ్గుతుందని’ గవర్నర్ సమాధానం. ఇదే దోశలో ఉపయోగించే ముడిపదార్ధాలైన గోధుమ, పప్పు దినుసులు నిలకడగా వుండకపోగా, రైతు చేనుగట్టు దాటగానే వినియోగదారునికి అందుబాటులో లేకుండా పోతాయి.
ఈ మధ్య స్వరాజ్ అభియాన్ అనే సంస్థ దక్షిణాన కర్నాటక నుంచి, ఉత్తరాన హర్యానా దాకా కరువుకు గురైన జిల్లాలను పరిశీలించింది. దేశంలోగల 676 జిల్లాలకుగాను 302 జిల్లాలు కరువు కోరల్లో ఇరుక్కున్నాయి. కొన్ని జిల్లాల్లో వీరు సర్వే చేశారు. 4,500 కిలోమీటర్ల మేర సాగిన ఈ అభియాన్ యాత్రలో కొత్త నగ్న సత్యాలేవీ బయటపడలేదు. గత 7 దశాబ్దాలుగా వింటున్న కథనాల్నే ఆయా ప్రాంతాల ప్రజలు వినిపించారు. ఇలాంటి వార్తలు వింటూ మొద్దుబారిన మన బుర్రలకు ఇవి స్పందించాల్సిన సమస్యలుగా కూడా తోచడం లేదు. దేశానికే వ్యవసాయ రాష్ట్రంగా, పప్పు దినుసులకు పుట్టిల్లుగా భాసిల్లిన మధ్యప్రదేశ్, బుందేల్ ఖండ్‌లోని తికంఘర్ జిల్లా మస్తాన్‌పూర్ గ్రామాన్ని ఈ బృందం సందర్శించి అడిగిన ప్రశ్నలకు, గత వర్షాకాలంలో ఒకే ఒకసారి పావు కేజీ పప్పును వుండుకొని తిన్నట్లు ఓ ఇల్లాలు చెప్పిన విషయం మన నాయకులకే కాదు, మనకేమైనా పడుతుందా? అని. గత దశాబ్ద కాలంగా పది కరువుల్ని చూసిన 10 గ్రామాల్లో చేపట్టిన సర్వేలో 60 శాతం మంది తమ పిల్లలకు పాలు ఎన్నడూ ఇవ్వలేదని, 39 శాతం అసలు పప్పుల్నే వండుకోలేదని, 40 శాతం ఉన్న పశువుల్ని అమ్ముకున్నామని, 27 శాతం నగానట్రా తాకట్టు పెట్టడం, అమ్మడం చేశామని తెలిపారు.
ఏ మీడియాలో కథనాలు రాలేదుగా అని మనం అనుకోవచ్చు. ముందు అందుబాటులో ఉన్న ఏ గ్రామాన్ని చూసినా, ఇలాంటి దీనావస్థ గల కుటుంబాలు తటస్థించడం సర్వసాధారణం. అయినా గోవధ నిషేధంపై గంటల తరబడి చర్చించే టీవీ బాబులకు, ప్రజలెందుకు ఆవుల్ని అమ్ముకోవాల్సి వస్తున్నదో పట్టింపు ఉండదని ఈ సర్వే బృందానికి నాయకత్వం వహించిన యోగీంద్ర యాదవ్ అనడం గమనించాలి.
ఇదే వ్యవస్థలో పేదల రక్తంతో తడిసిన డబ్బు, అభివృద్ధి అనే ముసుగులో బ్యాంకులు చేరడం, కోట్లాదిగా పోగుపడడం, రుణాల పేరున తిరిగి కోట్లాది రూపాయలు హంఫట్ కావడం జరుగుతున్నది. వీరంతా ఈ దేశానికి ఆర్థిక పోషకులుగా, ఆర్థికాభివృద్ధికి దోహదకారులుగా చెలామణి అవుతూనే ఉన్నారు. జీతం డబ్బునో, పోగుపడిన కష్టార్జితమో జమ చేసుకోవాలంటే ఆధార్ కావాలని, పాన్‌కార్డు కావాలని నిబంధనలను పెట్టే బ్యాంకులు, బడా బాబులకు మాత్రం పోటీపడి ఋణాలను ఇస్తున్నాయి.
మొండి ఖాతాదారుల్ని అత్యధికంగా కలిగి, నిరర్ధక ఆస్తులతో మొదటి స్థానంలో ఎస్‌బిఐ (రూ.72,791.73 కోట్లు) ఉండగా, తర్వాతి స్థానాల్లో బ్యాంక్ ఆఫ్ బరోడా (రూ.38,934 కోట్లు), బ్యాంక్ ఆఫ్ ఇండియా (రూ.36,519.14 కోట్లు), పంజాబ్ నేషనల్ బ్యాంకు (రూ.34,338.22 కోట్లు), ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంకు (రూ.22,672.40 కోట్లు) వున్నాయి. ఇలా 24 ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం నిరర్ధక ఆస్తుల విలువ ఈ ఏడాది మార్చి నాటికి రూ.4లక్షల కోట్లకు చేరవచ్చునని అంచనా. ఈ విలువ ప్రతి రూ.100 పెట్టుబడికి మొండి బకాయి భారాన్ని కలిపి రూ.150గా లెక్కిస్తే ఈ బాకీల విలువ రూ.8 లక్షల కోట్లు దాటుతుందని ఆర్‌బీఐ అంచనా. బ్యాంకుల వారీగా ఈ ఎగవేత దారుల సంఖ్య ఎస్‌బిఐకి 1,164 కాగా, వీటి విలువ రూ. 11,705 కోట్లు. ఇందులో ఒక్క కింగ్‌ఫిషర్ వాటానే రూ.1600 కోట్లు. పంజాబ్ నేషనల్ బ్యాంకు రుణ ఎగవేత దారుల సంఖ్య 900. వీరు చెల్లించాల్సిన బకాయి మొత్తం రూ.11వేల కోట్లు! ఇందులో కింగ్‌ఫిషర్ వాటా రూ.1500 కోట్లు. ఎస్‌బిహెచ్ 197 మందితో రూ. 2,088 కోట్లతో, పాటియాలా బ్యాంక్ 124 మందితో, రూ.1,324 కోట్లతో, మైసూర్ బ్యాంక్ 66మందితో రూ.974 కోట్లతో, ట్రావెన్‌కోర్ 65 మందితో రూ.839 కోట్లు, బికనీర్-జైపూర్ బ్యాంకు 43 మందితో రూ.829కోట్ల బకాయిలతో అలరారుతున్నాయి.
లిక్కర్ కింగ్‌గా వెలుగొందుతున్న విజయ మాల్యా, తన కింగ్‌ఫిషర్ విమానయాన సంస్థ పేరున వివిధ బ్యాంకులనుంచి తీసుకున్న ఎగవేసే అప్పుల జాబితా చూస్తుంటే, బ్యాంకింగ్ సేవలు ఎంత నిజాయితీగా ఉన్నదీ తెలుస్తుంది. ఎస్‌బిఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకులకు తోడుగా ఐడిబిఐ నుంచి రూ.800 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.650 కోట్లు, సెంట్రల్ బ్యాంకు నుంచి రూ.410 కోట్లు, యూకో బ్యాంకు నుంచి రూ.320 కోట్లు, కార్పొరేషన్ బ్యాంకు నుంచి రూ.310కోట్లు, మైసూర్ బ్యాంకు నుంచి రూ.150 కోట్లు, ఓవర్సీస్ బ్యాంకు నుచి రూ.140 కోట్లు, ఫెడరల్ బ్యాంకు నుంచి రూ.90 కోట్లు, పంజాబ్ సింధ్ బ్యాంకునుంచి రూ.60 కోట్లు, యాక్సిస్ బ్యాంక్ నుంచి రూ.50 కోట్లు తీసుకొని ఎగవేత దారుల్లో ప్రథమస్థానంలో ఉన్నాడు.
ఈ మధ్యన పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రకటించిన ఇష్టపూర్తి ఎగవేత దారుల్లో జ్యువెల్లరీ వ్యాపారస్తులు కూడా ఉండటం గమనార్హం. ఈ లెక్కన బ్యాంకుల దగ్గరకు ఈ బడాబాబులు పోతారా లేకా వీరి దగ్గరికే బ్యాంకులు వెళ్లుతాయా అనేది ఓ చిదంబర రహస్యమే. దీంతో గత 22వ తేదీ నాటికి రూపాయి విలువ గత 30 నెలల కనిష్ట స్థాయికి పడిపోయి రూ.68.61కి చేరుకుంది. ఈ దెబ్బతో బ్యాంకింగ్ షేర్ల విలువ 6.49 శాతం (ఎస్‌బిఐ) నుంచి 1.37 శాతం (యూనియన్ బ్యాంక్) దాకా పడిపోవడంతో మదుపరులెవరూ పెట్టుబడులు పెట్టని పరిస్థితి. ఒక్క ఎస్‌బిఐ నష్టమే 67 శాతంగా నమోదయి రూ.1,259.49 కోట్ల లాభంతో సరిపెట్టుకుంది.
ఈ బాకీలను రాబట్టడానికై ఆర్‌బీఐతో పాటు సంబంధిత బ్యాంకులు చేపడుతున్న చర్యలు కూడా ‘విల్‌ఫుల్ నెగ్లిజెన్స్’గానే ఉంటున్నాయి. సుప్రీంకోర్టు నెత్తీ నోరు కొట్టుకుంటూ మొత్తుకున్నా కదలని వ్యవస్థలివి. వీరప్ప మొయిలీ అధ్యక్షతన ఏర్పాటైన 31 మందితో కూడిన పార్లమెంటరీ స్థారుూ సంఘంలో మాజీ ప్రధానమంత్రి కూడా సభ్యుడే. ఈ బకాయిల వసూళ్లకై ఆర్‌బిఐ, బ్యాంకులు, నిరాసక్తతను కనబరుస్తున్నాయంటూ ఈ సంఘం గత బుధవారం పార్లమెంటులో తెలపడం ఈ సందర్భంగా గమనించాలి. ఈ బకాయిల్ని వసూలు చేయడానికై ఎస్‌బిఐ నేతృత్వంలో 17 బ్యాంకులు కన్సార్టియంగా ఏర్పడి పడరాని పాట్లు పడుతున్నాయి. ఆర్‌బిఐ విధించిన నిర్దేశిత గడువు వచ్చే మార్చి 31 నాటికి కనీసం రూ.3వేల కోట్లన్నా రాబట్టుకోవాలని పంజాబ్ నేషనల్ బ్యాంకు అనుకుంటున్నది. ఈ నేపథ్యంలోనే కింగ్‌ఫిషర్‌కు చెందిన ముంబయి హౌజ్‌ను మార్చి 17న వేలం వేయబోతున్నారు. లెక్కకు మించి అప్పులు తీసుకున్న ఈ సంస్థ ముంబయి ఆస్తి విలువ కేవలం రూ.150 కోట్లు మాత్రమే. ఇలా రూ.6,963 కోట్లకు పైగా వివిధ బ్యాంకులకు బురిడీ కొట్టిన విజయ్ మాల్యా ఆస్తుల్ని తెగనమ్మినా అప్పులు తీరవు. బహుశా దీన్ని దృష్టిలో ఉంచుకొని కాబోలు 2012-15 మధ్యకాలంలో బ్యాలెన్స్ షీట్ క్లియరింగ్ పద్దు కింద 24 ప్రభుత్వరంగ బ్యాంకులు రద్దు చేసిన మొండి బకాయిలు రూ.1.43 లక్షల కోట్లు (53%) మాత్రమే. దీన్ని బట్టి అప్పు దారుడికి, బ్యాంకింగ్ వ్యవస్థకు ఎలాంటి అవినాభావ సంబందం కొనసాగుతున్నదో తెలుస్తుంది. ఈ లెక్కన గత డిసెంబర్ 31 నాటికి బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.3,342 కోట్ల నష్టంతో ముందంజలో ఉంది.
ఇదే దేశంలో భూరుణం తప్ప బ్యాంకు రుణం తెలియని ప్రకృతిపై విశ్వాసంతో, హాయిగా వ్యవసాయం చేసుకునే రైతులకు రాజకీయ గ్రహణం పట్టింది. ఎన్నికల చదరంగంలో, మాయదారి ఆధునికతలో వీరంతా పావులుగా మారారు. రాజకీయ లబ్దికై అప్పుల నాటకం, రుణమాఫీల ఎపిసోడ్లు మొదలయ్యాయి. రైతులకు రుణాలనే నెపంతో బినామీ అప్పుల్ని పొందే ఓ రైతేతర వర్గం బాగా పుంజుకున్నది. ఇలా రైతుల ముసుగులో బ్యాంకుల్ని కొల్లగొట్టడం, అసలైన రైతుకు రుణం రాకపోవడం, వచ్చినా మాఫీ కాకపోవడం, ప్రతీ బ్యాంకులో కనబడుతున్నది. నిజానికి ఆర్‌బిఐ మార్గదర్శకాల ప్రకారం ఇష్టపూర్వకంగా ఎగవేసిన సంస్థలకు మరే బ్యాంకు, ఇతర ఆర్థిక సంస్థలు అప్పులివ్వకూడదు. ఒకవేళ ఎగవేత దారుడు తిరిగి రుణం చెల్లించి, ఎగవేతదారుల జాబితా నుంచి పేరు తొలగించుకున్నా, సదరు వ్యక్తికి, సంస్థకు మరో అయిదు సంవత్సరాల దాకా ఎలాంటి అప్పుల్ని ఇవ్వకూడదు. ఈ నిబంధన విజయమాల్యాకు, ఎందుకు వర్తించలేదో బహుశ ఆర్‌బిఐకి కూడా తెలియదనుకుంటా. పైగా ఈ మొండి బకాయిల్ని వసూలు చేయడానికై మరో మొండి బ్యాంకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న కొంతమంది ఆర్థిక నిపుణుల సలహాను ఆర్‌బిఐ గవర్నర్ తిరస్కరించడం గమనార్హం. మొత్తంగా జాతీరుూకరణ జరిగిన బ్యాంకుల్ని భ్రష్టు పట్టించి, దేశ ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసే ఓ అంతర్గత కుట్ర జరుగుతున్నది. ఇలా మొండి బకాయిల ముసుగులో బ్యాంకుల్ని నష్టాలకు గురిచేసి, వీటిని కూడా సాధారణ పౌరులకు దూరం చేయడం కూడా ఇందులో భాగమే.

- డా. జి.లచ్చయ్య సెల్: 9440116162