మెయన్ ఫీచర్

అంతుబట్టని పరాజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈనెల 19వ తేదీన వెలువడినప్పటినుంచి కాంగ్రెస్, వామపక్షాల స్పందనను గమనించగా తాము ఎందుకు ఓడామన్న విషమైగాని, మునుముందు ఏమి చేయాలన్న ప్రశ్నపైకాని వారికి ఏమీ అర్థమవుతున్నట్టు లేదు. ఇందులో కొత్త కూడా ఏమీ కనిపించదు. గతంలోనూ ఇదేవిధంగా ఓడారు. ఇదే పద్ధతిలో అయోమయపు స్పందనలు చేశారు. గంతలు కట్టుకొని తొట్రుపడుతూనే పోయారు. ఇపుడు మరొకసారి అవే దృశ్యాలు కనిపిస్తున్నాయి.
సమస్య గెలుపు ఓటములది కాదు. తీవ్ర పరాభవం తర్వాత తిరిగి లేచిన పార్టీలున్నాయి. చిరకాలం అజ్ఞాతంలో కొనసాగి మళ్లీ పుంజుకున్నవీ ఉన్నాయి. ఇటువంటి చరిత్రను చదువుకుంటూ కాంగ్రెస్, వామపక్షాలు ఏదో ఒకరోజు తమ పడవలు తిరిగి అలలపై తేలకపోవా అని కలలు కంటుండవచ్చు. వామపక్షాలు కాకపోయినా కాంగ్రెస్ వాదులు ఇటువంటి వాదనలు చేయడం మనచుట్టూ వినిపించిందే.’’ కాంగ్రెస్‌ను ఎవరూ ఏమీ చేయలేరు. ఫలానా అప్పుడేమైంది?’’ అని వారు ఎంతో ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతుంటారు. ఇవి పైకి చూపే విశ్వాసం, తర్కం మాత్రమేనా లేక మనసులో కూడా వారికి అటువంటి నమ్మకాలు ఉన్నాయా చెప్పలేం. కనీసం కొంతకాలం క్రితం వరకు కాంగ్రెస్ ఉత్థాన పతనాలను ఎదుర్కొన్నమాట నిజమే కూడా. కాని రాజకీయంగా వారు మరొక దశలోకి ప్రవేశించడం సమాంతరంగా సాగుతూ వచ్చింది. బలహీనతలు పునాదులలో, కూకటివేళ్లలో మొదలయ్యాయి. వారి మహావృక్షపు ఉపరితల భాగంపైకి బాగా కన్పిస్తూనే వేర్లస్థాయినుండి శిథిలం కావడం మొదలైంది. దానిప్రభావాలు ఏమిటో గ్రహించలేని కాంగ్రెస్ వాదులు, తమను ‘‘ఎవరూ ఏమీ చేయలే’’ రని అమాయకంగా మాట్లాడుతూ పోయా రు.
ఆవిధంగా కొంతకాలం గడిచేసరికి సమస్య సీరియస్‌గా మారింది. క్యాన్సర్ వ్యాధి తొలిదశ నుంచి మలిదశకు చేరింది. ఈ రోజున దేశాన్ని తేరిపార జూస్తే కర్ణాటక మినహా మరొక పెద్ద రాష్ట్రం లేదు వారికి. మరుసటి ఎన్నికల్లో అక్కడ గెలిచి తీరగలమనే నమ్మకం లేదు. ఇతరత్రా కొన్ని చిన్న రాష్ట్రాలున్నాయి. లోక్‌సభ స్థానాల సంఖ్య అరవయ్యేళ్లలో ఎన్నడూ లేనంత స్థాయికి తగ్గింది. కొంత అటుఇటుగా 45 శాతం ఉండిన ఓట్ల శాతం సుమారు పాతికకు పడిపోయింది. ఒకప్పుడు అంతటా ఏకఛత్రాధిపత్యం కాగా ఈ రోజున తమకు ఎదురులేని రాష్టమ్రంటూ ఒక్కటీ మిగలలేదు.
పైన అనుకున్నట్లు సమస్య జయాపజయాలతో కాదు. ధోరణి ఏదిశలో సాగుతున్నదనేదే ముఖ్యం. పతన దిశకు కారణం ఏమిటన్నది ప్రధానం. కాంగ్రెస్ నాయకత్వానికి అది అర్థం కావడంలేదు. అర్థం చేసుకున్న కొద్దిమంది ఏమీ చేయగల స్థితిలో లేరు. ఈ స్థితికి లోనవడం కొంతకాలం క్రితం మొదలైంది. అసలైన ప్రమాదకరపు మలుపు అది. ఈ మలుపు ఒకసారి మొదలైన తర్వాత ఇతరత్రా ఏవో కలిసివచ్చి, స్వీయ ప్రయత్నాలతో నిమిత్తం లేకుండా, అప్పుడప్పుడు అధికారానికి వస్తే రావచ్చుగాక. వరద ఏదో వచ్చి పడవపైకి తేలవచ్చుగాక. దాని అర్థం కథ కొత్తమలుపు తిరిగిందని కాదు. కాంగ్రెస్‌కే చెందిన ఒక మేధావి మరొక సందర్భం గురించి అన్నట్లు, రిగర్ మార్టిన్ మొదలు కావాలంటే మనిషి చనిపోయి తీరాలని లేదు. బతికే ఉంటాడు కొంతకాలం. కాని రిగర్ మార్టిన్ మొదలవుతుంది. బతికి ఉన్నాడంటే బతకబోతున్నాడని కాదు, మొదలైన రిగర్ మార్టిన్ వెనుదిరుగుతుందని కాదు.
ఇది గెలుపు ఓటములు అకౌంటెన్సీతో సంబంధం లేని వౌలిక మార్పు. కాంగ్రెస్ అదేస్థితిలో ఉంది. ఆ స్థితిలో వారు చేసిందేమిటి? ఈ వౌలికమైన రిగర్ మార్టిన్ అర్థంకాలేదు గనుక, తిరిగి పుంజుకోగలమని తొలి దశలో నమ్మారు. జయాపజయాలు ఒక సహజక్రమమని భావించారు. కాని భూగర్భగతమైన కూకటివేళ్లలో కుళ్లు మొదలై పెరిగిన కొద్దీ, వ్యాధి ఏమిటో తెలియని అయోమయానికి గురయ్యారు. సమస్య తెలియదు గనుక పరిష్కారాలనూ కనుగొన లేరు. సాధారణ కార్యకర్తలు, కిందిస్థాయి నాయకులు నిందించదగినవారు కాదు. కాని, కొద్దిమందిని మినహాయిస్తే పైస్థాయిలోనూ పరిస్థితి ఇదేవిధంగా ఉంటుంది. ఈ విధంగా కనిపించడం కొంతకాలం క్రితమే మొదలైంది. ఇప్పుడు అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాల దరిమిలా అదే కనిపిస్తున్నది. ఆ నాయకులు పలువిధాల ప్రకటనలు చేస్తున్నారు. సమీక్షలు, అంతర్గత శోధనలు అంటున్నారు. ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. బాధ్యత నెహ్రూ-గాంధీ కుటుంబానిది కాదా? రాహుల్ గాంధీ అధ్యక్షునిగా పూర్తి బాధ్యత స్వీకరిస్తే సమస్య పరిష్కారమవుతుందా? ప్రియాంకను ఆహ్వానించాలా లేదా? అనే చర్చలు జరుపుతున్నారు. ఇవేవీ నిజంగా గట్టెక్కించేవి కావని అర్థమవుతున్నదే. కాని అంతకుమించిన ఆలోచనలు వారికి తట్టడంలేదు.
కాంగ్రెస్‌కు ప్రజలకు సంబంధం ఎందువల్ల, ఎప్పటినుంచి తెగుతున్నదనేది అసలు సిసలైన ప్రశ్న. స్వాతంత్య్రోద్యమం, నెహ్రూ హయాం, ఇందిరాగాంధీ కాలంనుంచి మొదలైన మార్పులు, ఆర్థిక-రాజకీయ-సామాజాలు, ప్రాంతీయ శక్తులనుంచి-బడుగువర్గాలనుంచి-మైనారిటీలనుంచి తలెత్తి సాగిన ధోరణులు, ఆర్థిక సంస్కరణల మలుపు భవిష్యత్తుకు సంబంధించి ఎంతమాత్రం ఆశాభావం కనిపించని రాహుల్ గాంధీ- ఇవీ దశలు. ఈ దశలుదశలుగా క్రమంగా పార్టీ క్షీణిస్తూ వస్తున్న స్థితి. ఇవన్నీ తెలిసినవే. కాని జారుడు బండపై కాలుపెట్టి ఈ స్థితికి పడిపోయిన తర్వాత, ఇప్పుడు వెనుదిరగడం ఏవిధంగా? అది సాధ్యమా కాదా అనే ప్రశ్నలు అట్లుంచి, సమస్య ఏమిటో గుర్తించే దృష్టి అయినా వారికి కలగకపోవడం, గుర్తించగల సాహసం లేకపోవడం మొదటి సమస్య అవుతున్నది. గుర్తించినా ఆ తర్వాత అందుకు చికిత్స ఏమిటో గుర్తెరగడం, ఆ చికిత్స చేసుకోవడం మరొక సమస్య. కాని అదేమీ ఎంతమాత్రం జరగడం లేదు. మొదట చెప్పుకున్నట్లు కళ్లకు గంతలు కట్టుకొని పొంతనలేని మాటలు మాట్లాడటం మినహా తరుణోపాయపు సూచనలు అసలు రావడం లేదని కాదు. 2014 ఎన్నికల అనంతరం కొంత వ్యవధి గడిచిన వెనుక బయటి నుంచి పార్టీలోనుంచి కూడా ఎక్కువకాదుకాని కొద్ది సూచనలు వినిపించాయి. అవి పనిచేయగలవా లేదా అన్నది వేరే. కాని వాటిలో పరిశీలించదగినవి కొన్నున్నాయి. ప్రజలతో సంబంధాలు ఏ కారణాలవల్ల బలహీన పడ్డాయో ఆ విధానాలను సవరించుకోవాలన్నది అన్నింటికన్నా ముఖ్యమైంది. ఉదాహరణకు ఆర్థిక సంస్కరణలు. అవి ఒకవైపు అవసరమవుతూ ఆర్థక రంగం పుంజుకునేట్లు చేస్తూనే, విచక్షణారాహిత్యం వల్ల సామాన్యులకు హాని కలిగించాయి. అటువంటి విచక్షణా రాహిత్యాన్ని తెలిసి కూడా చూపడం ఆయా వర్గాల స్వార్థ ప్రయోజనాలకోసం వారికి ఆ ప్రయోజనాలైతే నెరవేరాయి గాని, అటువంటి హాని కారణంగా ప్రజలతో కాంగ్రెస్ సంబంధాలు బలహీనపడ్డాయి. మారిన పరిస్థితులలో ఆర్థిక సంస్కరణలను పూర్తిగా రద్దుపరచడం సాధ్యంకాని స్థితిలో, నెహ్రూ మార్గానికి తిరిగి మళ్లటమంటే నిజంగా అప్పటి దశకు వెళ్లడం కాదు. కాని దేనినైతే విచక్షణారాహిత్యమంటున్నామో దాన్ని రద్దు పరచడం అసాధ్యం కాదు. ప్రజలకోసం అయినా కాకున్నా కనీసం పార్టీ మేలుకోసమైనా ఆపని చేయవచ్చు. అదేవిధంగా, సంస్కరణలకు మానవతా ముఖమన్నది మొక్కుబడిగా, ఎత్తుగడగా చేయడం గాక తగినంత నిజాయితీ చూపేందుకు చాలా అవకాశముంది. అవకాశం ఉన్నా ఇంతకాలం చేయని దాన్ని ఇప్పుడు చేయవచ్చు. అట్లాగే ప్రజలకు ఉపయోగపడే చట్టాలు అనేకం ఉండి కూడా ఉద్దేశపూర్వకంగా, స్వార్థపరుల ప్రయోజనాలకోసం మరుగునపడుతున్నాయి.
ఇటువంటివే ఒక జాబితాగా తయారుచేయవచ్చు. ఈ తయారీ క్రమంలో, వాటి అమలు క్రమంలో కాంగ్రెస్‌లోని బలవంతులకు, ఇతర ప్రయోజనపరులకు నష్టం కలిగించేవి ఉంటాయి. అయినా పార్టీకి తిరిగి ప్రజలతో సంబంధాలు నెలకొనాలంటే అవి చేయకతప్పదు. సమస్య ఏమంటే ఇటువంటివి గమనికలోకి తీసుకొని నిర్ణయాలు చేసే నాయకత్వం కాంగ్రెస్‌కు లేకుండా పోయింది. ఇంతకాలం నాయకత్వం బలహీనపడికాలం చెల్లినదైంది. కొత్తనాయకత్వమనే పదానికి అసలు ఒక దృక్పథమంటూ లేదు. సోనియాగాంధీ క్రమంగా రంగం నుంచి ఉపసంహరించుకోవడం కనిపిస్తున్నది. రాహుల్ గాంధీ సమర్థుడని భావించేవారు ఎక్కువ లేరు. తరుణోపాయమేమిటో కన్పించదు. మొదట అనుకున్నట్టు పార్టీకి ఒక క్లూ అంటూ లేకుండా పోతున్నది అందువల్లనే. వరద ఏదో వచ్చి పడవ తేలితే తేలినట్టు తప్ప స్వయంగా ప్రణాళికలు రచించగల దశను పార్టీ గడచిపోయినట్లు స్పష్టంగా కనిపిస్తున్నది. భాజపా కాకుండా మరొక పోటీలేని రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లను మినహాయిస్తే, ఇతరత్రా అంథకార స్థితే!
వామపక్షాల పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు. వారి తీరు 2014 నుంచి అయోమయంగా మారగా, ఈ అయిదు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆస్థితి మరింత మెరుగుపడింది. వారి మాటలు, ఇంటర్వ్యూలో కనిపించేదంతా దిక్కుతోచని స్థితే. వాస్తవానికి ఇందుకు మూలాలు వారు పశ్చిమ బెంగాల్‌లో 2011లోఅధికారం కోల్పోవడానికన్నా కూడా ముందే ఉన్నాయి. బెంగాల్, కేరళ, త్రిపురలను దాటలేక స్తంభించిపోవడంలోనే అందు కు బీజాలు పడ్డాయి. బెంగాల్‌ది కృత్రిమ బలంగా మారింది. సైద్ధాంతికత, పార్టీ వ్యవస్థ, విలువలు, పరిపాలన అన్నీ దెబ్బతిని ప్రతిష్ఠంభనలు, క్షీణతలు మొదలయ్యాయి. అయినా వారు కళ్లు తెరిచి మారింది లేదు. వారికి క్లూ లభించకపోవడం 2011కు ముందునుంచే కనిపించింది. 2011 నుండి వత్తిడి పెరిగినా క్లూ దొరకలేదు. ఏమీ చేయలేదు. ఇపుడు 2016 ఎన్నికల ముందు దిక్కుతోచని స్థితిలో కాంగ్రెస్ పొత్తుతో ఆత్మరక్షణ చేసుకోచూశారు. అది సైతం పనిచేయక ఇప్పుడు అయోమయపు మాటలు ఇంకా పెరిగాయి. భవిష్యత్తు గురించి 2011-16 మధ్య మాటలైతే చెప్పారుగాని, వౌలికంగా సమస్యలేమిటో చేయవలసిందేమిటో గుర్తించలేకపోయారు, చేయలేకపోయారు. తృతీయ కూటమి ప్రయత్నాలు కాపాడలేదు. అక్కడి నాయకత్వం కూడా కాంగ్రెస్ వలెనే బలహీనంగా ఉన్నాయి. ఇరువురిలో ఎవరికీ క్లూలు దొరకడం లేదు. కాంగ్రెస్, కమ్యూనిస్టులకు ఇంతకన్నా భిన్నమైన రాజకీయ మలుపు అంటూ వస్తే దాన్ని అద్భుతమనాలి.

- టంకశాల అశోక్ (సెల్ : 9848191767)