మెయన్ ఫీచర్

కాలం మాన్పని గాయం ఇది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనదేశానికి ఆఫ్ఘానిస్తాన్‌తో ఉన్న సంబంధ బాంధవ్యాలు ‘‘కాలానికి కట్టుబడనివి’’ అని ప్రధానమంత్రి జూన్ నెల నాలుగవ తేదీన వ్యాఖ్యానించడం చరిత్రకు అనుగుణమైన అంశం. అఫ్ఘానిస్తాన్ ఒకప్పుడు భారతదేశంలో భాగమన్న వాస్తవం నరేంద్ర మోదీ వ్యాఖ్య ను విన్నవారికి స్ఫురించడం సహజం. భౌగోళికమైన అనుబంధం సాంస్కృతికమైన అనుబంధం ముడివడి ఉండడం జనసముదాయం లేదా జనసముదాయాలు ఒకే జాతిగా వికసించడానికి ప్రాతిపదిక. మనదేశానికీ అనేక ఇరుగుపొరుగు దేశాలకు మధ్య అనేక లక్షల ఏళ్లపాటు సమాన జాతీయత వికసించడం ఎవ్వరూ నిరాకరించలేని చారిత్రక వాస్తవం. ఈ జాతీయత కాలానికి కట్టుబడనిది. ఇస్లాం జిహాదీల బీభత్సకాండవల్ల ఐరోపా జాతుల దురాక్రమణ వల్ల శతాబ్దులపాటు ఈ జాతీయతా స్వభావం గాయపడింది. సాంస్కృతిక స్వభావం తరగిన చోటల్లా ఒకే భౌగోళిక స్వరూపం చెరగిపోవడం సమాన జాతీయతను భంగపరచిన విపరిణామక్రమం. ఈ విపరిణామ క్రమంలోనే ప్రాచీన కాలంలో అనేక భారతీయ రాజ్యాలుగా ఏర్పడి ఉండిన ఇప్పటి అఫ్ఘానిస్తాన్ మన దేశం నుండి భౌగోళికంగా సాంస్కృతికంగా విడిపోయింది. ఇప్పటి మనదేశం, భూటాన్, బంగ్లాదేశ్, బర్మా, సింహళము, మాలా ద్వీపాలు, పాకిస్తాన్, అప్ఘానిస్తాన్, నేపాల్, టిబెట్-ఇవన్నీ కలిపి ఒకప్పటి అఖండ భారత్...ఈ భారత ఖండ సమాన జాతీయతకు ప్రధాన లక్షణం. వైవిధ్యాలను పరిరక్షించడం, ఈ ప్రధాన జాతీయత నుండి భౌగోళికంగా మాత్రమే విడిపోయిన భారత పొరుగు దేశాలలో సాంస్కృతిక స్వభావం చెడిపోలేదు. నేపాల్ భూటాన్ బర్మా సింహళము టిబెట్ వంటి దేశాలలో వైవిధ్యపరిరక్షకమైన భారత జాతీయ స్వభావం ఇప్పటికీ సజీవంగా ఉంది. కానీ భౌగోళికంగా మాత్రమే కాక సాంస్కృతికంగా కూడ భారతీయతకు దూరమైపోయిన బంగ్లాదేశ్, మాలా ద్వీపాలు-మాల్‌దీవులు-పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్‌లలో వైవిధ్యాలను రక్షించి పోషించే సనాతన వ్యవస్థ ధ్వంసమైంది.
అనాదిగా ఈ ప్రాంతాలలో వికసించిన స్వజాతీయ మతాలను, భాషలను, భావజాలాన్ని విదేశాలనుంచి విరుచుకొని పడిన ఇస్లాం దిగమింగింది. ఇస్లాం కూడా మిగిలిన వైవిధ్యాలతోపాటు పరిఢవిల్లాలి. ఇది అవశేష భారత్‌లో నడుస్తున్న చరిత్ర. కానీ అఖండ భారత్ నుండి భౌగోళికంగా సాంస్కృతికంగా విడిపోయిన దేశాలలో ఈ చరిత్ర నడవడంలేదు. ఇస్లాం మినహా మిగిలిన వైవిధ్యాలన్నీ ధ్వంసమైపోయిన చరిత్ర మాత్రమే ఆ దేశాలలో నడిచింది, నడుస్తోంది...నరేంద్ర మోదీ అఫ్ఘానిస్తాన్‌లోని హీరట్‌లో చేసిన వ్యాఖ్యలతో కాలానికి కట్టుబడని ఈ చారిత్రక వాస్తవం ధ్వనించింది.
అనాదిగా అఖండ భారత్‌లోను, భారత వర్షంలోను ప్రభావితమైన రీతిలోనే, క్రీస్తుశకం 1947 ఆగస్టు 15 తరువాత కూడ, ఆ విశేష భారత్‌లో కూడ వైవిధ్య పరిరక్షక స్వభావం ప్రజల సమష్టి మనఃప్రవృత్తిని ప్రభావితం చేస్తోంది. అందువల్లనే మనదేశంలో సర్వమత సమభావ వ్యవస్థ కొనసాగుతోంది. సర్వభాషా సమభావ వ్యవస్థ కొనసాగుతోంది. సర్వ వైవిధ్య సమభావ వ్యవస్థ కొనసాగుతోంది. కానీ అఖండ భారత్ నుండి విడిపోయిన బంగ్లాదేశ్‌లోను, మాల్‌దీవులలోను, పాకిస్తాన్‌లోను, అఫ్ఘానిస్తాన్‌లోను, వైవిధ్య విధ్వంసక స్వభావం ప్రజల సమష్టి మనఃప్రవృత్తిని ప్రభావితం చేస్తోంది. అందువల్లనే వైవిధ్య మతాలకు చోటులేని ఏకమత రాజ్యాంగ వ్యవస్థలు ఆ దేశాలలో ఏర్పడిపోయాయి. ఈ ఏకమత వ్యవస్థలు వైవిధ్యాలను సహించని జిహాద్ శతాబ్దుల పాటు సాగించిన బీభత్సకాండ ఫలితం. అరబ్ దేశాలలోని జిహాదీలు పర్షియాను, ఆ తరువాత భారత్‌ను రక్తసిక్తం చేయడం చరిత్ర. జిహాదీల బీభత్సకాండ ఫలితంగా భారత్ నుండి విడిపోయిన తొలి ప్రాంతం నేటి అఫ్ఘానిస్తాన్. వైవిధ్యాలను సహించలేని సమష్టి మన ప్రవృత్తి కారణంగానే క్రీస్తుశకం 2001వ సంవత్సరానికి ముందు తాలిబన్లు బౌద్ధ, వైదిక, విగ్రహాలను, చిహ్నాలను విధ్వంసం చేశారు. వికృత పరిచారు. 2001లో అఫ్ఘానీ జిహాదీలు అమెరికాపై దాడి చేశారు. 2002 నుంచి అమెరికా నాయకత్వంలోని ఉత్తర అట్లాంటిక్ సైనిక కూటమి-నాటో-దళాలు అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్లను, అల్‌ఖాయిదా జిహాదీలను తుదముట్టించారు. ప్రజాస్వామ్యం ఏర్పడింది. పార్లమెంటును, అధ్యక్షుడిని ప్రజలు ఎన్నుకుంటున్నారు. ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు 2001కి పూర్వం అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్లు, అల్‌ఖాయిదా మూకలు ధ్వసం చేసిన బుద్ధ విగ్రహాలను, వేదమతాల చిహ్నాలను కాని పునరుద్ధరించలేదు..అఫ్ఘానిస్తాన్ ప్రజల సమష్టి మనఃప్రవృత్తి ఏమిటి?
తాలిబన్లు బుద్ధ విగ్రహాలను ధ్వంసం చేసినప్పుడు, అప్పటి మన ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఈ జిహాదీ ప్రవృత్తిని తీవ్రంగా అభిశంసించారు. తాలిబన్ల ప్రభుత్వం ఆ తరువాత భారత వ్యతిరేక జిహాదీలను ఉసిగొల్పింది. పాకిస్తాన్ జిహాదీలను ప్రోత్సహించింది. 1999లో జిహాదీలు మన ప్రయాణీకుల విమానాన్ని అపహరించి అఫ్ఘానిస్తాన్‌లో కాంథహార్‌లో దింపారు. ఈ కాంథహార్ ప్రాంతం ప్రాచీన గాంధార రాజ్యం. మహాభారత యుద్ధకాలం నాటి కౌరవుల తల్లి గాంధారి ఈ గాంధార రాజ్యాధినేత కుమార్తె. 2002 తరువాత తాలిబన్లు తోకముడిచారు. అప్పటినుంచి ఇప్పటివరకు ప్రభుత్వం అఫ్ఘానిస్తాన్‌కు అనేక విధాలుగా సాయపడుతోంది. రహదారులను నిర్మించింది, సైనికులకు శిక్షణ ఇచ్చింది. దాదాపు ఆరువందల కోట్ల రూపాయల ఖర్చుతో రాజధాని కాబూల్‌లో పార్లమెంటు భవనాన్ని నిర్మించి పెట్టింది. గత డిసెంబర్‌లో నరేంద్ర మోదీ కాబూల్‌కు వెళ్లి అఫ్ఘానీ ప్రజలకు ఈ భవనాన్ని లాంఛనంగా అప్పగించి వచ్చారు. ఇప్పుడు హీరట్ ప్రాంతంలో మనం నిర్మించి పెట్టిన జలాశయాన్ని కూడ నరేంద్ర మోదీ అఫ్ఘాన్ ప్రజలకు సమర్పించారు. ఈ జలాశయం ప్రారంభమైన సందర్భంగానే జూన్ 4న మోదీ ‘‘అఫ్ఘాన్‌తో మన మైత్రి కాల పరిమితులకు కట్టుబడనిది’’ అని వ్యాఖ్యానించారు. కానీ అఫ్ఘానిస్తాన్ ప్రజాస్వామ్య ప్రభుత్వం మాత్రం బుద్ధ విగ్రహాలను, వేద సంస్కృతి చిహ్నాలను పునరుద్ధరించలేదు.
వైవిధ్యాలను పరిరక్షించి పరిపోషించే ప్రవృత్తికే, వైవిధ్యాలను విధ్వంసం చేసే ఏకరూపకతను సాధించాలన్న చిత్త వృత్తికీ మధ్య జరుగుతున్న సంఘర్షణ సహస్రాబ్దుల చరిత్ర. సృష్టి వైవిధ్య భరితం. అసంఖ్యాక రూపాలు సృష్టిని సృష్టిగా ఉంచుతున్నాయి. ఈ రూపాలన్నింటినీ ధ్వంసం చేసినట్టయితే సృష్టిలేదు. ప్రకృతి లేదు. సృష్టిగతమైన ఈ వైవిధ్యాలు స్వభావ ఏకత్వాన్ని కలిగివున్నాయి. ఏకోన్ముఖ లక్ష్యం వైపు పరిక్రమిస్తున్నాయి. సృష్టిగతమైన వైవిధ్యాలు సమాజస్థితి కావడమే మానవీయ సంస్కృతి. ఈ మానవీయ సంస్కృతికి అనాదిగా మరోపేరు భారతీయత. వేద సంస్కృతి, హిందుత్వం. ఈ దేశంలో పుట్టి పెరిగి బయట సీమలకు లక్షల ఏళ్లుగా వెళ్లి స్థిరపడిన వారు క్రమంగా ఈ భారతీయతకు దూరం కావడం చరిత్ర. ఇలా దూరమయిన వారు తమది కాని తమకు నచ్చని ప్రతి వైవిధ్యాన్ని ధ్వంసం చేయడం కూడ చరిత్ర. ఒకప్పుడు అఖండ భారతంలో భాగంగా ఉండి ఇప్పుడు విడివడి భారతీయతకు దూరమైన దేశాలలోనే కాదు, ఇతర దేశాలలో సైతం అల్ప సంఖ్యాక మతాలవారిని, భాషలవారిని, విజాతీయులను హత్యలు చేస్తుండడానికి ఇదీ కారణం. ఇస్లాం మతరాజ్య కూటమికి చెందిన దేశాలలో అన్య మతస్థుల నిర్మూలనకు ఇదీ కారణం. సౌదీ అరేబియాలోను, ఇతర అరబ్ దేశాలలోను ప్రవాస భారతీయులను, భారతీయ సంతతి వారిని చిత్ర హింసలకు గురి చేస్తుండడానికి కారణం ఈ వైవిధ్య విధ్వంసక ప్రవృత్తి...ఖతార్ వంటి చిన్న దేశాలలో సైతం ప్రవాస భారతీయులను, శ్రామికులను, యజమానులు రాక్షసమైన చిత్రహింసలకు గురి చేస్తుండడం నరేంద్ర మోదీ పర్యటనకు నేపథ్యం. ఐదవ తేదీన మోదీ పర్యటించిన సందర్భంగా ఖతార్ ప్రభుత్వం జిహాదీ బీభత్సకాండకు వ్యతిరేకంగా ప్రకటన చేసింది. కానీ ఖతార్, సౌదీ అరేబియా, యెమెన్, సంయుక్త అరబ్ రాజ్యాలలోని సంపన్నులు, పాకిస్తాన్ ప్రేరిత భారత వ్యతిరేక ఉగ్రవాద ముఠాలకు దండిగా విరాళాలను ఇస్తున్నారు. మనదేశంలో పుట్టి పెరిగిన ఎమ్.ఎఫ్. హుస్సేన్ అనే బీభత్సకళాకారుడు ఆజీవనం దేశ వ్యతిరేక విషం కక్కాడు. భారతమాతను సైతం నగ్నంగా చిత్రీకరించిన ఇతగాడు చివరికి దేశం నుండి పారిపోయాడు. అతగాడికి పౌరసత్వమిచ్చిన సమ్మానించిన చరిత్ర ఖతార్ దేశ ప్రభుత్వానిది. ఎమ్‌ఎఫ్ హుస్సేన్ అలా మనదేశంలో న్యాయ విచారణ తప్పించుకున్నాడు...
ప్రపంచంలోని అన్ని దేశాలలోను ప్రజాస్వామ్య వ్యవస్థలు ఏర్పడాలన్నది అంతర్జాతీయ ఆదర్శం. ప్రపంచంలోని అన్ని దేశాలలోను సర్వమత సమభావ వ్యవస్థలు ఎందుకని ఏర్పడరాదు? జాతి వివక్ష, వర్ణ వివక్ష, పాటించిన దక్షిణాఫ్రికా వంటి దేశాలను అంతర్జాతీయ సమాజం దశాబ్దులపాటు వెలివేసింది. ఇదే పద్ధతి మత వివక్షను పాటిస్తున్న దేశాలను, ఏక మతరాజ్యాంగ వ్యవస్థలున్న దేశాలను సైతం దారికి తీసుకురావడానికి ఎందుకని కృషి జరగరాదు? ఐక్యరాజ్య సమితి ‘సర్వమత సమభావం’ పరిరక్షణ కోసం ఎందుకని నియమావళిని రూపొందించరాదు? అన్ని మతాలను సమానంగా ఆదరించే మనదేశం ఈ విషయమై ఇప్పుడైనా ఉద్యమించవచ్చు..
ఇస్లాం జిహాదీలు క్రీస్తుశకం ఏడవ శతాబ్ది చివర పారశీక దేశాన్ని పారశీక జాతిని నిర్మూలించారు. పారశీక దేశం నేటి ఇరాన్! వెంటనే జిహాదీ గాంధార వంటి భారత సీమలలోకి చొరబడినాడు. ఇప్పుడు అఫ్ఘానిస్తాన్‌గా చెలామణి అవుతున్న భారత భూభాగంలో ఆనాడు దాదాపు పదిహేను రాజ్యాలుండేవి. దాదాపు మూడు లక్షల చదరపు మైళ్ల మేర ప్రాంతం విస్తరించి ఉండేది. బౌద్ధం, వైదిక మతాలు, ఈ ప్రాంతమంతటా విలసిల్లాయి. గాంధార, రామఠ, హార, హూణ, కిరాత,శక, ఉత్తర, జ్యోతిష, కటుక, సింహపుర, అభీర, దరద, ఉరగ, ఉత్తర బాహ్లీక వంటి రాజ్యాలు, నేటి అఫ్ఘాన్ ప్రాంతంలోనివి. జిహాదీలు ఈ మొత్తం ప్రాంతాన్ని ధ్వంసం చేశారు..

- హెబ్బార్ నాగేశ్వరరావు సెల్: 9951038352