ఈ వారం స్పెషల్

మానిటరే మాస్టారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలకా బలపం, కాగితం పెన్నూ... ఇవన్నీ కూడా నిన్నటి రోజులు. కంప్యూటర్ స్క్రీన్ ఆన్ చేస్తే చాలు ప్రపంచం కళ్లముందుంటుంది. నేర్చుకునే విద్యార్థి ఆసక్తిని బట్టి బావినుంచి నీరు చేదినట్లుగా ఎలాంటి విషయాన్నైనా అలవోకగా గుప్పిట పట్టేయవచ్చు. జ్ఞానాన్ని, విజ్ఞానాన్నీ సముపార్జించుకోవచ్చు. నాటి ఏకలవ్యుడు బొమ్మనే గురువుగా చేసుకుని అర్జునుడ్ని మించిన స్థాయిలో ఆరితేరినట్లుగా నేటి చదువరులు ‘కంప్యూటర్’నే కరతలామలకం చేసుకుంటున్నారు. ఈ-లెర్నింగ్‌లో ఆరితేరిపోతున్నారు. శాస్త్ర సాంకేతిక విజ్ఞానం ఎంతగా కొత్త పుంతలు తొక్కుతోందంటే కెజి నుంచి పిజి వరకు అందరికీ ఆన్‌లైన్ లెర్నింగ్ అన్నది అనివార్యంగా మారింది. స్కూల్‌లో ఎన్ని పాఠాలు చెప్పినా కంప్యూటర్ ముందు కూర్చుంటే ఎన్నో విషయాలు తెలుస్తాయన్న జిజ్ఞాస ప్రతి ఒక్కరిలోనూ పెరిగింది. పాఠం ఏదైనా, అంశం ఏదైనా దాని లోతుల్లోకి వెళ్లాలంటే దానికి సంబంధించిన అంశాలను శోధించాల్సిందే. ప్రపంచంతో పోటీ పడాలంటే నీకు తెలిసిందే జ్ఞానం కాదు. తెలియాల్సింది అనంతంగా ఉంటుంది. ఈ అనంతమైన విజ్ఞాన భాండాగారాన్ని పిన్న దశలోనే సొంతం చేసుకునే అవకాశాన్ని నేర్చుకున్నవాడికి నేర్చుకున్నంత అన్న భావనను కలిగించే రీతిలో ఈ-లెర్నింగ్ వేళ్లూనుకుంది. నిన్న మొన్నటి వరకు స్కూల్ టీచర్ చెప్పిందే పాఠం. కాలేజీలో అధ్యాపకుడు చెప్పిందే విషయం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇటు టీచర్, అటు ప్రొఫెసర్ అవసరం లేకుండానే ప్రపంచమంతా ఆన్‌లైన్‌లో అందరి ముందుకొచ్చేసింది. తరగతి గదిలో కూర్చుని పాఠం వింటున్నారన్న అనుభూతిని కలిగించే రీతిలో ప్రత్యక్షంగానే ఆన్‌లైన్ తరగతులు అందుబాటులోకి వచ్చాయి. భిన్నరంగాల్లో నిష్ణాతులైన ప్రొఫెసర్లు ఎందరో పాఠాలు చెప్పడానికి మీ ముందుకు వస్తున్నారంటే ఇది ఎంత ప్రయత్నించినా సాధ్యం కానిదే. కేవలం ఈ-లెర్నింగ్ ద్వారానే సాధ్యమయ్యేది. మనం ఎక్కడవున్నా తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఉండాలే గాని ప్రపంచమే మన కళ్లముందు ఉంటుంది. అది తరగతి పాఠమైనా, పరిశోధనాంశమైనా, ఆసక్తిని కలిగించే మరో విషయమైన కాదేదీ ఈ-లెర్నింగ్‌కు అసాధ్యం. సందేహాలు తీరాలంటే ఓ పాఠానికి సంబంధించి సంశయాలు తొలగిపోవాలి. మన కళ్లముందు టీచర్ ఉంటే ఆయన్ని ‘డౌట్లు’ అడిగేందుకు సందేహిస్తాం. ఈ-లెర్నింగ్ ప్రక్రియలో అలాంటి డౌట్లను నిస్సంకోచంగా తీర్చుకోవచ్చు. ఆ విధంగా మన అవగాహనను పెంచుకోవచ్చు. ఎలాంటి విషయాన్నైనా క్షణాల్లో అందుబాటులోకీ తెచ్చుకోవచ్చు. దాని మూలాల్లోకి వెళ్లి ఆమూలాగ్రం శోధించవచ్చు. ఇవన్నీ కూడా గురువు లేని పాఠాలే. ఎంత నేర్చుకుంటే అంత అన్నట్లుగా ప్రతి ఒక్క విద్యార్థిలోనూ నేర్చుకోవాలన్న ఆసక్తిని పెంచే అంశాలే.
ఏ వ్యవస్థలోనైనా ప్రజలను సత్‌పౌరులుగా మార్చే బాధ్యత విద్య ద్వారానే సాధ్యమవుతుంది. అందుకే విద్య ప్రక్రియను అందరి అందుబాటులోకి తీసుకురావడం సంక్షేమ రాజ్యాల లక్ష్యంగా ఉంది. ఈ విద్య ద్వారానే చైతన్యవంతమైన సమాజాన్ని నిర్మించడం ఉపాధ్యాయుల విధి అవుతుంది. భారతీయ జాతీయ విద్యాకమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ కొఠారీ పేర్కొన్నట్టు ఒక దేశం భవిష్యత్ తరగతి గదిలోనే నిర్మితమవుతుంది. అందుకు అనుగుణంగా ఉపాధ్యాయులు తమ ప్రతిభాపాటవాలను, వృత్తినైపుణ్యాలను ఎప్పటికపుడు మెరుగుపరుచుకోవల్సి ఉంటుంది.
కాని నేడు చదువుల రూపం మారిపోయింది. గురువు కేంద్రంగా ప్రాచీన విద్యావిధానం ఉండేది. భారతీయ విద్యావిధానం ప్రకారం గురువే పరబ్రహ్మగా కొలుస్తారు. గ్రీకు విద్యావేత్త ప్లేటో, అరిస్టాటిల్ స్థాపించిన అకాడమిల్లోనూ, లైసియమ్ వంటి విద్యాకేంద్రాల్లో కూడా గురువే కేంద్రంగా విద్య కొనసాగేది. ఆ రోజుల్లో అంతర్జాతీయ ఖ్యాతి గడించి పదివేలకుపైగా విద్యార్ధులున్న నలందా విశ్వవిద్యాలయం సైతం సంఘం శరణం గచ్ఛామి అంటూ వర్ధిల్లింది. మధ్య యుగంలో అంతా పాఠ్యపుస్తక కేంద్ర విద్యా విధానం అమలులో ఉండేది. యూరప్ సమాజంలో బైబిల్, మధ్య ఆసియాలో ఖురాన్, భారతదేశంలో భగవద్గీత అధ్యయనం విద్యగా భావించారు. ఆధునిక యుగంలో మాత్రం సంపూర్ణంగా శిశు కేంద్రీకృత విద్యా విధానం అమలులోకి వచ్చింది. నాగరికత వికాసంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా చదువుల్లో కూడా అత్యాధునికత సంతరించుకుంది. ఒకపుడు దశాబ్దాల తరబడి అడవుల్లో రుషుల వద్ద చదువులు కొనసాగేవి, అవి తర్వాతి కాలంలో పాఠశాలల రూపంలోకి వచ్చాయి. విజ్ఞానవిస్తరణ కొనసాగుతున్న కొద్దీ బోధన ప్రక్రియలో నూతన మార్పులు వచ్చాయి. ప్లేటో, అరిస్టాటిల్, జాన్ డ్యూయి, జాన్ పియాజ్, వెన్‌టోస్కీ , ఆమోస్ కొమినియస్, కార్ల్ రోజర్స్, జిడ్డుకృష్ణమూర్తి ఇలాంటి అనేక మంది కృషితో విద్య విశాల త్వాన్ని సంతరించుకుంది.
ఈ నేపథ్యంలోనే అనేక బోధన నమూనాలు సంప్రదాయ పద్ధతులను చేదిస్తూ వచ్చాయి. తరగతి గది అభ్యసనం కూడా మారిపోయి, అదనంగా దూరవిద్య రూపంలోకి ఒదిగిపోయింది. ఇపుడు ఆ అవసరం కూడా లేకుండా సామాజిక మాధ్యమాల పుణ్యమా అని చిన్న సెల్‌ఫోన్‌లోకి ప్రపంచం మొత్తం వచ్చేసింది. పర్సనల్ కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూర్చుని నేర్చుకునే విద్య ఒక సెల్‌ఫోన్ జోబులో ఉంచుకుంటే మనం ఎక్కడికి వెళ్తున్నా కావల్సినంత నేర్చుకునే మొబైల్ ఎడ్యుకేషన్ క్లాస్ రూమ్ మనతోనే పయనిస్తోంది. నేర్చుకోవడమే కాదు, అవసరమైన అనుమానాలను అప్పటికపుడు నివృత్తి చేసుకోవచ్చు. ఇందుకోసం ఆన్‌లైన్‌లో ప్రపంచస్థాయి నిపుణులు ఎపుడూ అందుబాటులోనే ఉంటుంటారు. కావల్సిందల్లా ఓపిక, సహనం, ఆసక్తి, అనురక్తి వీటన్నింటికీ మించి తన భవిష్యత్‌ను సవాలుగా తీసుకున్న వారు వడివడిగా అడుగులు వేస్తున్నారు. చిన్న కుగ్రామంలో కూర్చుని ఆక్స్‌ఫర్డు డిగ్రీలు పొందవచ్చు, అంతర్జాతీయంగా మంచి గ్రేడింగ్ ఉన్న యూనివర్శిటీల సర్ట్ఫికేట్లు అక్కడికి వెళ్లకుండానే ఆన్‌లైన్‌లో నేర్చుకుని, ఆన్‌లైన్‌లోనే తన ప్రతిభా పాటవాలను ప్రదర్శించి పట్టాలను పొందవచ్చు. ఇదంతా కాలం తెచ్చిన సొబగు.
ప్రపంచం మారిపోయింది, విశ్వం ఒక చిన్న కుగ్రామం అయిపోయింది. ఈ దశలో విద్య, అభ్యసనం, విద్యాపాలన, నిర్వహణ సైతం సరికొత్త రూపాన్ని సంతరించుకుంది. విద్యార్థి తరగతి గదిలోని నల్లబల్ల-చాక్‌పీస్ స్థానంలో ఎలక్ట్రానిక్ పరికరాలను వెతుక్కుంటున్నాడు. తరగతి గదిలో పాఠ్యపుస్తకాల స్థానంలో ఇ లెర్నింగ్ మెటీరియల్ వచ్చేసింది. టీచర్‌స్థానంలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్లు, టెవిలిజన్ సెట్లు వచ్చేశాయి. టీచర్ లేకుండానే టివిని ఆన్ చేస్తే ఆన్‌లైన్‌లో పాఠాలు వచ్చేస్తున్నాయి. గతంలో పూర్తయిన పాఠాల కోసం యూ ట్యూబ్ వంటి మాద్యమాల్లోకి వెళ్తేపాత పాఠాలు తిరిగి వినే సౌకర్యం ఉంది. మరోపక్క అత్యుత్తమ బోధకులు రూపొందించిన పాఠాలను ఆన్ డిమాండ్ పద్ధతిలో ఎపుడు కావాలంటే అపుడు తరగతి గదిలో ప్రదర్శించుకునే
(మిగతా 13వ పేజీలో)
(7వ పేజీ తరువాయ)
సౌలభ్యం వచ్చేసింది. ఆయా పాఠ్యాంశాలు, పాఠ్యప్రణాళికలు, వార్షిక ప్రణాళికలు, బోర్డులు, బోధన పద్ధతులకు లోబడి పాఠ్యాంశాలను రూపొందిస్తున్నారు. దీంతో తరగతి గదిలో నేర్చుకునేందుకు ఉన్న ఆంక్షలు, పరిమితులు, సరిహద్దులను అత్యాధునిక సాంకేతిక ఉపకరణాల సహకారంతో చెరిపేస్తున్నాడు. ఎపుడు కావాలంటే అపుడు నేర్చుకునేలా కొత్త సాంకేతికత విద్యార్ధికి దోహదం చేస్తోంది.
ప్రవర్తనలో, పరిపక్వతలో, సంపూర్ణ మూర్తిమత్వాన్ని సాధించడంలో ఉపాధ్యాయుడు లేని లోటును కొత్త సాంకేతికత మైమరిపిస్తోంది. నచ్చిన సమయంలో, అనుకూలంగా కూర్చుని, నచ్చినంత నేర్చుకునే అతి గొప్ప సౌకర్యం ఇ- అభ్యసనంలో ఉంది. అంతే కాదు, నేర్చుకున్నదానిని వెనువెంటనే మూల్యాంకనం చేసుకోవచ్చు. విద్యార్ధి స్థాయి, కౌశలాలు, నేర్చుకున్న అంశాలపై అవగాహన,విశే్లషణ, పునరావలోకన సామర్ధ్యం, అభ్యసన అవరోధాలను శాస్ర్తియంగా గుర్తించి లోపాలను పసిగట్టి ఎత్తిచూపేందుకు ఆధునిక సాంకేతికత ఎంతో దోహదం చేస్తోంది.
సినిమా టిక్కెట్లు తీసుకోవాలన్నా, రైలు టిక్కెట్లు కావాలన్నా, బస్సు టిక్కెట్ల బుకింగ్ కోసమైనా అంతా ఆన్‌లైన్‌లోనే చకచక జరిగిపోతున్నాయి. రేషన్ కార్డు కోసమే కాదు ఏం కావాలన్నా నేడు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సిందే. సామాజిక మాధ్యమాలు పుణ్యమా అని ఇంటర్‌నెట్ ఆధారితంగా ఆన్‌లైన్ కార్యకలాపాలు బాగా పెరిగిపోయాయి. ప్రవేశపరీక్షలకు దరఖాస్తు చేయాలన్నా, అడ్మిషన్ తీసుకోవాలన్నా, స్కాలర్‌షిప్ పొందాలన్నా, ఉద్యోగానికి దరఖాస్తు చేయాలన్నా, ఎంపిక పరీక్ష రాయాలన్నా, ఫలితాలు చూడాలన్నా అంతా ఆన్‌లైన్ ద్వారానే జరుగుతోంది.
దేశవ్యాప్తంగా ఉన్న సాంకేతిక విద్యాకోర్సుల్లో బోధకుల కొరతను, సరికొత్త పాఠ్యాంశాల్లో తర్ఫీదు పొందిన టీచర్ల కొరతను తీరుస్తూ ఇ-లెర్నింగ్ ఆన్‌లైన్ లెర్నింగ్ విద్యార్ధులకు ఎంతో తోడ్పాటును ఇస్తోంది. నిజానికి నిత్యజీవితంలో విద్యార్ధి తన లక్ష్యాలను చేరుకునేందుకు దోహదపడేదే కరిక్యులమ్, దీనినే మనం పాఠ్యప్రణాళిక అంటున్నాం. చిన్నారులను విద్యావంతులుగా చేసే సమగ్ర ప్రయత్నంలో అతిపెద్ద అంశమే కరిక్యులమ్.
కరిక్యులమ్ అనే ఆంగ్లపదానికి మూలం కరీర్ అనే లాటిన్ పదానికి ఆధారం. కరీర్ అంటే పరుగెట్టడానికి దారి అని అర్ధం. ఆ దారి మీద పరిగెడితే లక్ష్యాన్ని చేరుకోవచ్చు. విద్యార్ధి, ఉపాధ్యాయుడు గమ్యాలను చేరుకోవడానికి ఉపయోగించే మార్గమే కరిక్యులమ్.
కరిక్యులమ్ మూడు ఆధారాలతో పుట్టింది. ఒకటి ఇంటికి బదులు పాఠశాల విద్యకు కారకత్వమైంది. ప్రస్తుత సంస్కృతి నుండి తెలియని భవిష్యత్ సంస్కృతికి మారడం, ఆధార- స్వాతంత్య్రత , వ్యక్తిత్వ స్థిరత్వాల సహజమైన షరతుల స్థావరమే కరిక్యులమ్. కరిక్యులమ్ అంటే విద్యాసంబంధమైన కార్యక్రమం. విద్యా కార్యక్రమాల్లో మూడు మూలాధారాలు ఉంటాయి. చదువుల కార్యక్రమం, కృత్యాల కార్యక్రమం, దారి చూపే కార్యక్రమాలు. విద్యార్ధి పెరుగుదలకు తగిన సూచనల రూపకల్పన నిర్మిణం. ఇది ఆశయాలను ఏర్పరచిన విలువలపైనా, విద్యా లక్ష్యాలు లేదా ఉద్ధేశ్యాలపైనా ఆధారపడి ఉంది. కరిక్యులమ్ ఆశయాల సాధనకు, లక్ష్యాల గుర్తింపునకు, ఉద్ధేశ్యాలు నెరవేర్చేందుకు సహకరిస్తుంది. వ్యక్తిగత సమస్యలను సాధించడంలో తోడ్పడుతుంది. వ్యక్తికి, విద్యాకార్యక్రమానికి ఈ కార్యక్రమం సమైక్యశక్తివంటిది. సంయుక్త స్వయం సేవలు అందిస్తుంది. తరగతి గదిలో ఈ కార్యక్రమం చేపట్టడం సప్రమాణయుతమైనది. ఎందుకంటే విద్యార్ధులెందరో వారికి ఎన్నో సమస్యలు ఉంటాయి.
ఏ రూపంలో విద్యను గరిపినా, విద్యాలక్షాలు ఒక్కటే. మనిషిని మనిషిగా ఉంచే మూల అవసరాన్ని విద్య కలగచేయాల్సి ఉంటుంది. విద్య నేర్చుకునే వాడు సభ్యునిగా ఉన్న అసలు సంఘంచే విద్యావసరాలు కల్పించబడాలి. అసలు సంఘానికి భిన్నంగా మంచి సాంఘిక క్రమం లేదా ఆదర్శసంఘం ఏర్పరచబడాలి. సంఘంలో వ్యక్తి అసలు అవసరాలు చూపబడాలి. ఆదర్శ వ్యక్తి అవసరాలకు సంబంధించి ఉండాలే కాని వ్యక్తి అవసరాలు ప్రధానం కానే కారాదు. కరిక్యులమ్, సిలబస్ - ఈ రెండూ వేరువేరని చాలామందికి తెలియదు. కరిక్యులమ్‌ను సిలబస్‌ను ఒకే గాటకి కట్టి రెండూ ఒక్కటే అనే అర్థం వచ్చేలా విద్యాసంస్థలు వ్యవహరిస్తున్నాయి.
కరిక్యులమ్ అంటే విశాల దృష్టితో విద్యాసంస్థకు సంబంధించిన అన్ని విద్యా కృత్యాలను తెలిపే భావన. రసజ్ఞానమును పెంచుతూ నైతికతపై దృష్టి పెట్టేదే కరిక్యులమ్. శారీరకాభివృద్ధికి, విద్యాయాత్రలకు, సుహృద్భావాన్ని కలిగించేది అయి ఉండాలి. సిలబస్ అనేది శీర్షికలను చూపించే పట్టిక మరీ ముఖ్యంగా చెప్పాలంటే పరీక్షల రీత్యా రూపొందించిన కార్యక్రమం. పాఠ్యప్రణాళికలో జాతీయ ఉద్ధేశ్యం, అవసరాలు, సంస్కృతి, సాంఘికమార్పు, విలువలు - విధానాలు, తాత్వికత, సామాజికత, మనస్తత్వ శాస్త్ర భూమికలు ఉండాలి.
ప్రస్తుతం బోధనకు శిక్షణ వనరులుగా భిన్నమైనవి, వక్రమైనవి వినియోగిస్తున్నారు. సాంకేతిక విపరీతకల్పన, రాత వస్తువులు అతిగా వ్యాప్తి చెందడం వల్ల పాఠ్యప్రణాళిక వినియోగ సాధనం చేత, వనరుల చేత ప్రభావితం అవుతోంది. విషయాంశాలతో పాటు వనరులు పాఠ్య ప్రణాళికలో భాగమయ్యాయి. అయితే బోధనలో వచ్చినకొత్త పద్ధతులు సరిహద్దును దాటించి సఫలతను అందిస్తున్నాయి.
అభ్యాసకుల జీవితానికి సంబంధం ఉన్న వాస్తవిక విద్యావ్యవస్థను తయారుచేయడానికి అభివృద్ధి చేయడానికి భారతదేశంలో అతిపెద్ద విప్లవం మొదలైంది. ఇందుకోసం విద్యాసాంకేతికం కీలకమైన పాత్రను పోషిస్తోంది. భారత విద్యావ్యవస్థను ఒత్తిడి చేస్తున్న కొన్ని సమస్యల పరిష్కారానికి వ్యవస్థా పద్ధతి అందుబాటులో ఉన్నా అన్ని వనరులు వినియోగం - అభ్యసనం సమస్యలకు పరిష్కారంగా ప్రధాన దారులు చూపేవిగా ఉన్నాయి. విద్యాసాంకేతికం సమర్ధవంతమైన అవిరళ ఉపయోగానికి తగిన ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రధానంగా విద్యా సూక్ష్మపద్ధతులు తగిన సాఫ్ట్‌వేర్‌ను సరికొత్త ఉపకరణాలను భారీ ఎత్తున ఉత్పత్తి చేయాల్సి ఉంది. పరిశోధన ద్వారా వాటిని నిరంతరం అభివృద్ధి చేయాలి. బోధనకు తగిన సూక్ష్మపద్ధతుల వినియోగం ఉపాధ్యాయులకు సమర్ధవంతమైన వృత్యంతర శిక్షణ అందించాల్సి ఉంది.
పరిశ్రమలు, మానవ సహాయంతో నడిచేటపుడు, బోధన ప్రక్రియ, పలక నల్లబల్ల, సుద్ద, అచ్చుపుస్తకాలపైనే ఆధారపడింది. 19వ శతాబ్దం ప్రారంభంలో పరిశ్రమల రంగంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. కానీ విద్యారంగంలో మాత్రం అలాంటి విప్లవం ఏదీ అపుడు రాలేదు. సుమారుగా గత యాభై సంవత్సరాల్లోనే కొంత మార్పు వచ్చింది. విద్యాసాంకేతికం అనే మాట తొలిసారి యుకెలో వాడారు. విద్యారంగంలో తొలి మూడు విప్లవాలు చెప్పుకోవల్సి వస్తే భాషకు లిపిని సృష్టించడం, కాగితం తయారు చేయడం, ముద్రణ ప్రక్రియలను చెప్పవచ్చు. ఎలక్ట్రానిక్ రంగంలో వచ్చిన మార్పులతో రేడియో, టివి, టేప్‌రికార్డర్, కంప్యూటర్‌లు వచ్చాయి. ఇవన్నీ నాలుగో విప్లవంగా ఎరిక్ ఎషిబీ పేర్కొన్నారు. 1960 ముందునాటికి విద్యాసాంకేతికం అనే పదం దృశ్య శ్రవణ ఉపకరణాలు తరగతి గదిలో బోధనకు బోధనా సామగ్రీతో ముడిపడి ఉండేది. వేరేమాటలో చెప్పాలంటే ప్రత్యక్ష బోధన, అభ్యసన కోసం ఉద్దేశించబడిన సామాన్యమైన దృశ్యశ్రవణ ఉపకరణాల వినియోగమే విద్యా సాంకేతిక భావం. కాని విద్యాసాంకేతికం, బోధనోపకరణాల కంటే భిన్నమైనది అది బోధనోపకరణాలను వినియోగించుకోవచ్చు. బోధన, అభ్యసనాలకు వ్యవస్థా విశే్లషణ వినియోగమే విద్యా సాంకేతికంగా చెప్పుకోవచ్చు. విద్యారంగంలో రేడియో, టివి, కంప్యూటర్, టేప్ రికార్డర్, చలనచిత్రాలు, స్లయడ్‌లు, సాఫ్ట్‌వేర్ వినియోగం, ఇవన్నీ ఐటిసి పుణ్యమే. 1973లో దేశంలో తొలి విద్యా సాంకేతిక కేంద్రం స్థాపించడంతో రూపం మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలి ఐసిటి బోధనకు వీలుకల్పిస్తూ ఇటి సెల్‌ను ప్రారంభించారు. తర్వాత దృశ్య శ్రవణ ఉపకరణాల వినియోగం ప్రారంభమైంది. తర్వాతి కాలంలో రేడియో బోధన, టివి బోధన మొదలైంది. ఈ విధంగా విద్యా వ్యాసంగానికి శాస్ర్తియ విజ్ఞానాన్ని ముఖ్యంగా మనో విజ్ఞాన వార్తా ప్రసార వ్యవస్థి విశే్లషణ సిద్ధాంతాలను అనుసంథానించడానే్న విద్యా సాంకేతికగా చెబుతున్నారు. నానో టెక్నాలజీ పుణ్యమా అని ఇది మరింత మరింత ముందడుగు వేసింది. సిమ్యులేషన్స్, ప్రయోగాలు, యానిమేషన్స్, ఇంటరాక్టివ్ టూల్స్, ఫార్మటివ్ -సమ్మెటివ్ అసెస్‌మెంట్, యాక్టివిటీ టూల్స్, జీవం ఉట్టిపడేలా 2డి, 3డి, 4డి అఫెక్ట్స్, వాయిస్ ఓవర్, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అధికస్థాయి ఇంటరాక్టివ్ వాయిస్, ఇన్నోవేటివ్ కోర్సు డిజైన్లు వంటి మార్పులు చోటు చేసుకున్నాయి. ఇన్ బిల్టు ఐఆర్ రిమోట్ ద్వారా వీటిని యాక్సిస్ అయ్యేందుకు వీలుంది. డిజిటల్ క్లాసు రూమ్ సొల్యూషన్స్, వైయుక్తిక బోధనాభ్యసన పరిష్కారాలు, తేలికగా వివిధ బోధనాంశాలను అధ్యయనం చేసేందుకు ఆటోమెటెడ్ మేనేజిమెంట్ పరిష్కారాలను ఇవి అందిస్తున్నాయి.
నేడు ప్రపంచంలో అగ్రగామి దేశాలతో భారత్ పోటీపడుతుండటంతో ఆధునిక అధ్యయన పద్ధతులు అన్నిచోట్లా అందుబాటులోకి వచ్చేశాయ. జ్ఞాన దర్శన్, స్వయం ప్రభ పేరుతో 32 టివి శాటిలైట్ ఛానల్స్‌తో పాటు చాలా యూనివర్శిటీలు సొంత ఎఫ్‌ఎం చానళ్లను కూడా నడిపిస్తున్నాయి. ఇపుడు అన్ని భాషల్లో ఇలెర్నింగ్ ఆన్‌లైన్ అభ్యసనం పెద్ద ఎత్తున జరుగుతోంది. దాదాపు అన్ని సబ్జెక్టుల్లో నిపుణులు పెద్ద ఎత్తున పుట్టుకొచ్చారు. లక్షల సంఖ్యలో ఆన్‌లైన్ ఐసిటి అభ్యసన బోధన పోర్టల్స్, ఇ లెర్నింగ్ పోర్టల్స్ ఉన్నాయి. మెడ్‌ఆర్‌సి డాట్ కామ్, ఈజీ శిక్ష డాట్ కామ్, వికాస్‌పీడియా డాట్ ఇన్, కె 12 డాట్ కామ్, ఖాన్ అకాడమి , టాటా ఇంటరేక్టివ్ సిస్టమ్స్, కోర్సు ఎరా, డబ్ల్యు3 స్కూల్స్, కోడెకాడమి, ఆస్క్ ఐఐటియన్స్, ట్యూటర్, ఓపెన్ ఏల్ కోర్సు, ఇడిఎక్స్ , అప్నాకోర్సు, ఇనె్వస్టో, విజిక్యూ, రిడైస్ ఎడ్యు, మూక్స్, టాపర్ లెర్నింగ్, మేరిట్‌నేషన్, టిసివై ఆన్‌లైన్, ఫంక్షన్ స్పేస్, ఎక్సెల్లార్స్, ఎగ్జామ్ ఐఎఫ్‌వై, రెయిన్‌మేకర్, ఎడ్యుకార్ట్, ట్యూ(2)షన్ డాట్ కామ్, స్మార్టెక్ డాట్ కామ్ వంటి పోర్టల్ కొన్ని మాత్రమే. గత పదేళ్లలో అన్ని విశ్వవిద్యాలయాలు ఐటి విభాగాలను ఏర్పాటుచేశాయి. జ్ఞాన దర్శన్. మన టివి, స్వయం ప్రభ పేరుతో 32 విద్యా విషయక చానళ్లు మొదలయ్యాయి. మొత్తంమీద దేశంలో అభ్యసన తీరుతెన్నులు మారిపోయాయి. ఎక్కడికీ వెళ్లకుండానే చదువుకున్న వారికి చదువుకున్నంత అవకాశం అందుబాటులో ఉంది.
*
సందేహాలకూ
క్షణాల్లో సమాధానం
ఆన్‌లైన్ , వర్చ్యువల్ , వెబ్ ఆధారిత అభ్యాసానికి దేశంలో వేలల్లో వెబ్‌పోర్టల్స్, మూక్స్, టివి ఇంటరాక్టివ్ చానళ్లు, ప్రత్యక్ష అభ్యాస పోర్టల్స్ ఆవిర్భవించాయి. విద్యార్ధి నేరుగా నేర్చుకోవడమేగాక, ఎప్పటికపుడు తాను ఏం నేర్చుకున్నాడో సమీక్షించుకునేందుకు, మూల్యాంకనానికి కూడా ఈ వెబ్ ఛానళ్లు అవకాశం ఇస్తున్నాయి. అంతే కాదు వివిధ ప్రశ్నలకు సమాధానం రాసిన తీరు, సమాధానం రాయలేకపోయిన తీరును అధ్యయనం చేస్తూనే విద్యార్ధి ఏయే అంశాల్లో బలహీనంగా ఉన్నాడో, ఏ కానె్సప్ట్‌లలో బలంగా ఉన్నాడో కూడా క్షణాల్లో నివేదికను ఇచ్చే వీలుకలిగింది. ఈ సమీక్షా నివేదిక ఆధారంగా తాను ఏయే కానె్సప్ట్‌పై దృష్టి పెట్టాలో, మానసిక విచలనాల విశే్లషణల ప్రాతిపదికగా మరింత ముందుకు సాగేందుకు మార్గదర్శనం చేసే ఈ వెబ్ చానళ్లు ఆధునిక పద్ధతుల్లో మూల్యాంకనానికి అతి పెద్ద ఆలంబనగా మారాయి.

- బి. వి. ప్రసాద్