ఫ్లాష్ బ్యాక్ @ 50

ఎం.ఎల్.ఏ.

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో కొల్లిపర వెంకటాద్రి, సుబ్బమ్మ దంపతులకు జనవరి 14, 1926న జన్మించారు కొల్లిపర బాలగంగాధర్ తిలక్. ప్రముఖ దర్శక, నిర్మాత యల్.వి.ప్రసాద్ వీరి మేనమామ. చిన్ననాటి నుంచి స్వాతంత్య్ర పోరాటం పట్ల, ఆసక్తిగల తిలక్ ముదిగొండ జగ్గన్నశాస్ర్తీ ప్రోత్సాహంతో ప్రజానాట్యమండలి సభ్యునిగా చేరి పలు నాటకాలు ప్రదర్శించేవారు. ఆ తరువాత, మేనమామ వద్ద బొంబాయిలో గడిపి ప్రముఖ హిందీ నటులతో పరిచయం పెంచుకున్నారు. తిరిగి మద్రాసు వచ్చాక మేనమామవద్దే దర్శకత్వ మెళుకువలు, ప్రముఖ సినీ ఎడిటర్ ఎం.వి.రాజన్‌వద్ద ఎడిటింగ్ నేర్చుకున్నారు. తొలుత ఎడిటర్‌గా, ఆదుర్తి సుబ్బారావుగారితో కలిసి ‘‘కల్పన’’ హిందీ చిత్ర అంతర్జాతీయ వెర్షన్‌ను ఎడిట్ చేశారు. ఆ తరువాత 1964లో నవయుగ వారి ‘‘జ్యోతి’ చిత్రానికి పి.శ్రీ్ధర్‌తోపాటు దర్శకునిగా పనిచేశారు. ఆ తరువాత అభ్యుదయ చిత్రాలను రూపొందించాలనే నిశ్చయంతో ‘‘అనుపమ’’ చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించారు. తొలుత సెంటిమెంటుతో కూడిన కుటుంబ చిత్రం ‘‘ముద్దుబిడ్డ’’ జగ్గయ్య, జమున కాంబినేషన్‌లో, స్వీయ దర్శకత్వంలో రూపొందించారు. ఆ తరువాత, వీరు నిర్మించిన ద్వితీయ చిత్రం, రాజకీయ సమస్యలను జాగృతం చేసిన ఎం.ఎల్.ఏ. 1957 విడుదల.
సామాజికాంశం, నవ చైతన్యం కలిగించే గూడవల్లి రామబ్రహ్మంగారి ‘‘రైతుబిడ్డ’’, కె.వి.రెడ్డి, ‘‘పెద్దమనుషులు’’ తరువాత, అభ్యుదయవాది, అభిరుచిగల నిర్మాత కె.బి.తిలక్, అధికారం, రాజకీయ పదవులలో వున్న వారిని ఆర్థిక, అంగబలం కల వ్యక్తులు ఏ విధంగా అదుపుచేస్తుంటారో (రిమోట్ కంట్రోల్) ఈనాటి వ్యవస్థలో మితిమీరిన ఈ అంశాన్ని 60 సం.ల నాడే చిత్రంగా రూపొందించటం విశేషం.
ఆనాటి రాజకీయాల్లోని ముఖ్యాంశం అయిన భూసంస్కరణలను, రాజకీయవేత్తల స్వభావాలను, ఓ చక్కని ప్రేమకథతో కలిపి చిత్రకథను ఎన్నుకున్నారు. ఈ కథను తాపీధర్మారావు, ఆరుద్ర కలిసి తయారుచేయగా, రచన ఆరుద్ర, సంగీతం- పెండ్యాల నాగేశ్వరరావు, ఎడిటింగ్, దర్శకత్వం, నిర్మాత శ్రీ కె.బి.తిలక్ నిర్వహించారు.
ఆ వూరిలో నిస్వార్థ రైతు సేవాసంఘ నాయకుడు భూషయ్య (పెరుమాళ్ళు) అతని కుమార్తె నిర్మల (సావిత్రి) సేవా సమాజంలో పనిచేస్తూ వుంటుంది. నీతి నిజాయితీల పట్ల నమ్మకంగల వ్యక్తి. ఆ వూరిలోని ప్రముఖ రాజకీయవేత్త దామోదరం (గుమ్మడి) నిజాయితీ, మంచితనంగల ప్రభుత్వ ఉద్యోగి దాసు (జగ్గయ్య) ఒకసారి దాసు, దామోదరానికి సాయంచేస్తాడు. దానికి రుజువైన ఉత్తరం దామోదరం వద్ద వుంటుంది. పాపయ్య (నాగభూషణం) ఓ జమిందారు. ఆసారి జరిగే ఎన్నికల్లో దామోదరం తనకు అనుకూలుడైన దాసును నిలబెడతాడు. భూషయ్య కూడా ఎన్నికల నుంచి, విరమించుకొని దాసుకు సపోర్ట్ చేస్తాడు. దాసు ఎన్నికల్లో విజయం సాధిస్తాడు. దాసు, నిర్మల పెళ్ళిచేసుకుంటారు. దాసు స్నేహితుడు రమేష్ (రమణమూర్తి) దాసు చెల్లెలు కమల (గిరిజ) ప్రేమించుకుంటారు. కాని దామోదరం మేనకోడలు లీల (సూర్యకళ) రమేష్‌ను ప్రేమిస్తుంది. రమేష్ లెక్క చేయడు. దాసు భూసంస్కరణల బిల్లు ను, అసెంబ్లీలో ప్రతిపాదిస్తాడు. తన ఆస్తులు కోల్పోవలసి వస్తుందని దామోదరం, దాన్ని విత్ డ్రా చేసుకోమని, లేకుంటే అతని, పాత అవినీతి తెలిపే ఉత్తరం బయటపెడతానని బెదిరిస్తాడు. దీనివల్ల దాసు వెనక్కి తగ్గుతాడు. భర్తలో నిజాయితి లేదని నిర్మల అతనికి దూరమవుతుంది. దాసుకు చిక్కులు తెచ్చే ఉత్తరాన్ని రమేష్, లీల ద్వారా తెలివిగా చిక్కించుకుని నాశనం చేస్తాడు. ఆ విషయం తెలిసికొన్న దాసు ‘లాండ్ సీలింగ్ చట్టాన్ని’ ప్రవేశపెట్టడం, ప్రజలమెప్పు పొందడం, నిర్మల, దాసులు కలుసుకోవటం, వారిరువురూ కమల, రమేష్‌ల వివాహం జరిపించటం, దామోదరం ఆటలుకట్టడంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
ఈ చిత్రంలో ‘‘నీ ఆశ అడియాస, చేజారే మణిపూస’’అని సావిత్రి, జగ్గయ్యలపై చిత్రీకరించిన విషాద గీతం(ఆరుద్ర- ఎస్.జానకి, ఘంటసాల) ద్వారా ఎస్.జానకి తెలుగు పరిశ్రమకు గాయనిగా పరిచయమయ్యారు. అంతకుముందు తమిళ చిత్రం ‘‘విధి హిన విలయత్తు’’లో ఎస్.జానకి తొలిసారిగా పాడినా, ముందుగా ఎం.ఎల్.ఏ. రిలీజ్ కావటంతో, ఆమె గాయనిగా ప్రవేశించిన తొలి చిత్రం ‘‘ఎం.ఎల్.ఏ.’’ కావటం, ఓ రికార్డు.
జగ్గయ్య, సావిత్రి తదితరులపై సేవా సదనంలో చిత్రీకరించిన గాంధీ జయంతి ఉత్సవ గీతం ‘నమో నమో బాపూ మాకు న్యాయమార్గమే చూపూ’ మరో సందేశాత్మక, చిరస్మరణీయమైన గీతంగా నిలవటం విశేషాంశం. (రచన ఆరుద్ర, గానం- పి.సుశీల, మాధవపెద్ది బృందం). 60 సం.లుగా శ్రోతలను నేటికి గాంధీ జయంతి, ఇతర జాతీయ వేడుకల్లో విన్పించటం, అలరించటం విశేషం.
హైదరాబాద్‌లో ‘మెహందీ’ ప్రాంతానికి చెందిన ‘్ఛటా ఖుర్షీద్’ ఈ చిత్రం ద్వారా చిత్రసీమలో ప్రవేశించారు. ఆమెచేత రమేష్ పుట్టినరోజు సందర్భంగా ఓ ఖవ్వాలీ నృత్యగీతం అభినయింపచేశారు. నిర్మాత తిలక్ ఆ గీతం ‘ఎందరో మహానుభావులు, వందనాలు చెయ్యాలి’ అందరికి, వంక దణ్ణాలు పెట్టాలి, కొందరికి’ (రచన-ఆరుద్ర, గానం- పి.సుశీల). గిరిజకు, నగరం చూపుతూ రమణమూర్తిలపై చిత్రీకరించిన గీతం ‘‘ఇదేనండి ఇదేనండి భాగ్యనగరం, మూడుకోట్ల ఆంధ్రులకు ముఖ్యపట్టణము, చార్మినార్, గోల్కొండ, కట్టడాలు కులీకుతుబ్‌షా, భాగమతి చిత్రాలు చూపుతూ చక్కగా సాగుతుంది. (ఘంటసాల, ఎస్.జానకి-ఆరుద్ర). సూర్యకళ, రమేష్‌ను ప్రేమించానని వెంటబడి పాడే గీతం ‘‘ఒకసారి కనె్నత్తి చూడుమది నీకోసమే అల్లాడు’(జిక్కి- ఆరుద్ర), గిరిజ, రమణమూర్తిలపై చక్కని హాస్య యుగళ గీతం ‘జామిచెట్టుమీదనున్న జాతీ రామచిలకా’’ (ఎ.ఎం.రాజా, జిక్కి-ఆరుద్ర), ఎలక్షన్స్, ఓటర్ల గురించి తమాషాగా నిజాలు తెలిపే గీతం ‘లోగుట్టు తెలుసుకో బాబాయా, ఈ పెట్టిలో ఓటేసి పోవయ్య’ నిత్యనూతనంగా, ఏ ఎన్నికలకయినా అన్వయించే గీతం. రచన- కోగంటి, గానం- ఘంటసాల, మాధవపెద్ది, పి.సుశీల బృందం. అనుపమ వారి చిత్ర గీతాలు అనుపమానమైన సంగీతానికి సాహిత్యానికి ఆటపట్టుగా నిలిచాయి. ఈ చిత్రంకూడా ఆ కోవలోనే చేరుతుంది.
ఈ చిత్రంలోని నటీనటులందరూ తమ పాత్రలకు పరిపూర్ణ న్యాయం చేశారు. ప్రజానాట్యమండలికి చెందిన కళాకారులు పెరుమాళ్ళు, రమణారెడ్డి, ఇంకొందరూ, అనుపమావారి చిత్రంలో ముఖ్య భూమికలు పోషించటం, ఓ ఆనవాయితీగా మారింది. సహాయ పాత్రల్లో రమణారెడ్డి, నాగభూషణం రక్తికట్టించగా, ప్రధాన పాత్రధారులు జగ్గయ్య, సావిత్రి, ఉదాత్తమైన, నిర్మలమైన నటనతో, గుమ్మడి మెత్తని పులివంటి విలనినీ అలవోకగా ప్రదర్శించారు. 1954లో ఆంధ్ర నాటక కళాపరిషత్ వారి ప్రదర్శనలో ఉత్తమ నటునిగా ఎంపిక కాబడిన ‘రమణమూర్తి’ని తొలిసారి రెండవ హీరోగా చిత్రసీమకు తిలక్, ఈ చిత్రం ద్వారా పరిచయం చేశారు. ఆ తరువాత, హీరోగా కారెక్టర్ ఆర్టిస్టుగా రమణమూర్తి రాణించారు. ఈ చిత్రంలో జగ్గయ్య తన ఎన్నికల గుర్తుగా ఆవూ-దూడ సింబర్ ఉపయోగించటం, ఆ తరువాత 1971లో ఇందిరా కాంగ్రెస్ తమ ఎన్నికల గుర్తుగా ఆవూ-దూడ సింబల్ ఉపయోగించటం విశేషం కాగా 1957 ‘ఎం.ఎల్.ఏ.’ చిత్రంలో ఎం.ఎల్.ఏ.గా నటించిన జగ్గయ్య 1967లో ఒంగోలు నియోజకవర్గం నుంచి ఎం.పిగా, కాంగెస్ పార్టీతో గెలవటం ఓ చిత్రం కొంగర గోపాలకృష్ణయ్య వ్రాసిన ‘లోగుట్టుతెలుసుకో’ పాటను ‘ఖమ్మం’లోని ఒక ప్రదేశంలో చిత్రీకరించారు. నేడక్కడ ఓ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించబడింది. ఈ చిత్రంలోని ఎలక్షన్ క్యాంపెయిన్ సన్నివేశాలు ఆ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో నూకల రామచంద్రారెడ్డి పోటీచేసిన మెహబూబాబాద్ నియోజకవర్గంలోని, మనె్నగూడెం గ్రామంలో చిత్రీకరించారు. ఎన్నికల ఊరేగింపు సన్నివేశాలను, జీపుయొక్క హెడ్‌లైట్స్ వెలుగులో చిత్రీకరించటం మరో విశేషం.
రష్యానుంచి వచ్చిన సాంస్కృతిక బృంద సభ్యులకు కె.బి.తిలక్ ఈ చిత్ర ప్రదర్శన ఏర్పాటుచేయటమేకాక, వారికి ఒక ప్రింటును పంపటం, వాటికి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ శ్రీశ్రీగారు వ్రాయటం, మరో ప్రింటును ‘దక్షిణ ఎమెన్’కూ పంపటం జరిగింది.
‘ఎం.ఎల్.ఏ.’ చిత్రాన్ని ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డిగారికి, ఇతర మంత్రులకు రాజధాని హైద్రాబాదులో ప్రదర్శించటం, వారిలో కాసు బ్రహ్మానందరెడ్డిగారి వంటి ప్రముఖులెందరో ఈ చిత్రాన్ని ప్రశంసించటం జరిగింది. ఎం.ఎల్.ఏ. చిత్రం ప్రేక్షకాదరణ పొందింది. ఈ చిత్రం ప్రింటు ప్రస్తుతం అలభ్యం కావటం విచారకరం.

-సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి