జనాంతికం - బుద్దా మురళి

ఇంతకీ ఆయనెవరు..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ప్రతి విజయం వెనుక...’’
‘‘ఇక చాల్లే... నాకు తెలుసు...!’’
‘‘ఏదీ చెప్పు చూద్దాం?’’
‘‘ఫేస్‌బుక్‌లో అకౌంట్ ఓపెన్ చేసిన ప్రతి బుడ్డోడూ అమ్మాయిలను ఇంప్రెస్ చేద్దామని రాసే మొదటి మాట ఇదే. ప్రతి విజయం వెనుక ఓ మహిళ ఉంటుంది అనే కదా? నువ్వు చెప్పబోయేది’’
‘‘కాదు.. నువ్వు చెప్పింది సామాన్య కుటుంబరావుల విజయం వెనుక ఉండే మహిళ గురించి.. నేను చెప్పేది అది కాదు. ప్రతి విజయం వెనుక ఆయన ఉంటారు?’’
‘‘ఎవరాయన..?’’
‘‘నీకు పేరు కావాలా? విజేతల జాబితా కావాలా?’’
‘‘నీకో విషయం తెలుసా? మాయాబజార్ కన్నా ముందు ఎన్టీఆర్ ఒక నాటకంలో కృష్ణుడిగా నటిస్తే చెప్పులు విసిరారట! కృష్ణుడంటే ఈలపాటి రఘురామయ్యను తప్ప మరొకరిని ఊహించడానికి ఇష్టపడలేదట! అలాంటి ఎన్టీఆర్‌ను మయాబజార్ తర్వాత కృష్ణుడంటే ఎన్టీఆరే అని జనం మనసులో ముద్ర వేసేసుకున్నారు. దీనికి కారణం ఎవరనుకున్నావు?’’
‘‘ఎవరు?’’
‘‘ఆయనే’’
‘‘మాయాబజార్ సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత చూసిన వారు పెదవి విరిచాక దర్శకుడు కెవిరెడ్డి తిరిగి చేర్చిన దృశ్యాలతో- ఆ కళాఖండం 60 ఏళ్లయినా అజరామరంగా నిలిచింది. కృష్ణుడిగా ప్రేక్షక జన హృదయాల్లో ఎన్టీఆర్ నిలిచిపోయారు. ఆ ఇమేజ్ తరువాత రాజకీయ పరమపద సోపానానికి సైతం ఉపయోపడంది. కొంప తీసి ఆ రోజు సలహా ఇచ్చింది నువ్వే అంటావా? ’’
‘‘నేను కాదు ఆయన..’’
‘‘ఇంతకీ ఆయనెవరండీ ?’’
‘‘ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎలా వచ్చారో తెలుసా? ’’
‘‘పార్టీ పెట్టినప్పుడు చెప్పారు కదా? సినిమా నటునిగా ఇన్ని దశాబ్దాల పాటు తనను ఆదరించిన ప్రేక్షకులకు ఏదో చేయాలని రాజకీయాల్లోకి వచ్చానని ఆయన చెప్పుకున్నారు. సరే.. ఆ తరువాత ఎన్టీఆర్‌ను దించేసిన నాదెండ్ల భాస్కరరావు మాత్రం ఎన్టీఆర్‌ను రాజకీయాల్లోకి తెచ్చింది తానే అని చెప్పుకున్నారు. ఒకటి రెండు సార్లు సినీ రచయిత త్రిపురనేని మహారథి కూడా ఎన్టీఆర్‌ను రాజకీయాల్లోకి రావాలని చెప్పింది తానేనని చెప్పుకున్నా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇంతకూ నువ్వేమంటావు? ఎన్టీఆర్‌ను రాజకీయాల్లోకి తీసుకు వచ్చింది నాదెండ్ల భాస్కరరావు. ‘ఆయన’ అంటే నాదెండ్ల అనా? నీ ఉద్దేశం..’’
‘‘కాదు... ఆయనంటే ఆయనే... నాదెండ్ల భాస్కరరావు ఎపిసోడ్‌ను హోటల్ క్యాంపులతో విజయవంతంగా ఎదుర్కోవావాలని ....’’
‘‘ ముందు ఆయనెవరో తేల్చండి. మిగిలిన సంగతులు తర్వాత. సస్పెన్స్ సినిమాలో విలన్ ఎవరో చివర్లో చెప్పడం పాత సినిమా టెక్నిక్. హీరో ఎంత శక్తిమంతుడో విలన్ కూడా అంతే.. ఇది పూరి జగన్నాథ్ మార్కు విలనిజం. అప్పటి వరకు ‘గుమ్మడి’ పెద్దమనిషిలా కనిపించి చివరలో విలన్ అంటే ఆశ్చర్యపోయే అమాయక రోజులు కావు ఇవి. క్యాబినెట్ మీటింగ్‌లే లీకవుతున్నాయి. సినిమా విడుదలకు ముందే సస్పెన్స్ లీకవుతుంది. ఈ టెక్నిక్ ఈ రోజుల్లో నడవదు. ముందు ఆయనెవరో చెప్పండి’’
‘‘ఆయన అద్వైతవాది’’
‘‘???’’
‘‘చిన్నికృష్ణుడు మన్ను తిన్నాడని చెబితే యశోద నోరు తెరవమంటే ఏమైందో తెలుసు కదా? చిన్నికృష్ణుని నోట్లో భూ గోళం అంతా టేబుల్ ఫ్యాన్‌లా తిరుగుతూ కనిపించింది కదా?’’
‘‘ఔను అయితే?’’
‘‘యశోద, చిన్నకృష్ణుడు భూమిపైనే ఉన్నారు కదా? మరి కృష్ణుని నోట్లో భూమి కనిపించింది అంటే అప్పుడు చిన్ని కృష్ణుడు ఎక్కడున్నట్టు?’’
‘‘ఔను.. ఎక్కడున్నట్టు?’’
‘‘అద్వైతం అంటే ఇదే? చిన్నికృష్ణుడు, భూమి, యశోద వేరు వేరు కాదు.. అంతా ఒకటే.. అందుకే గోకులంలో ఎవరింట్లో చూసినా చిన్ని కృష్ణుడే కనిపించేవాడు’’
‘‘ఆయన అంటావు? అద్వైతం అంటావు? విషయం చెప్పు?’’
‘‘వ్యవస్థను మార్చడం నా ఒక్కడి వల్ల కాదు అని, ఎన్టీఆర్‌ను రాజకీయాల్లోకి రమ్మని తానే చెప్పినట్లు చంద్రబాబు సెలవిచ్చినట్టు విన్నా.. అదిగో నేను చెప్పడం పూర్తి కాక ముందే ముసిముసి నవ్వులు నవ్వుతున్నావు. ఇక నేరుగా ఇదే విషయం చెబితే నీ రియాక్షన్ ఎలా ఉండేదో తెలుసు’’
‘‘నువ్వు చెప్పింది నమ్మాలంటావు?’’
‘‘శ్రీకృష్ణ పరమాత్ముడు తలుచుకుంటే మహాభారత యుద్ధం నివారించే వాడు కాదా? ఆయన తలుచుకుంటే కంటిచూపుతో కౌరవ సైన్యాన్ని మట్టి కరిపించే వాడు కాదా? కానీ అలా చేయలేదు. అర్జునుడితో యుద్ధం చేయించి, యుద్ధంలో కీర్తి అర్జునుడికి దక్కేట్టు చేశాడు. ఎందుకంటావు? వ్యవస్థలను గాడిలో పెట్టాలంటే అన్నీ తాను చేయడం కాదు.. చేయించాలి. ఆయన కూడా అంతే తానే పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చి వ్యవస్థలను మార్చడం సాధ్యం కాక కాదు. శ్రీకృష్ణుడికి అర్జునుడిలా తనకూ ఓ ఎన్టీఆర్ అవసరం అని రాజకీయాల్లోకి రమ్మన్నారు.. అంతేకానీ తన శక్తి సరిపోక కాదు.’’
‘‘మరి అంత కీలక సమయంలో ఆయన ఎన్టీఆర్ వైపు ఉండక, కాంగ్రెస్ వైపు ఉన్నారేం?’’
‘‘మహాభారతంలో మహా పరాక్రమ వంతుడు, ధర్మం తెలిసిన వాడు భీష్ముడు. ఆయనకు యుద్ధ ఫలితం ఏమిటో తెలియదా? ఇచ్చిన మాటకు కట్టుబడి కౌరవుల వైపు ఉన్నాడు? అలానే ‘ఆయన’ కూడా ఎన్టీఆర్‌ను రాజకీయాల్లోకి ఆహ్వానించి, పార్టీ పెట్టించి, తాను చేరకుండా కాంగ్రెస్‌లో ఉండడం విలువలతో కూడిన రాజకీయాలుగా చూడాలి.’’
‘‘అంటే.. కౌరవులను సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్న శకుని చివరి వరకు కౌరవులతోనే ఉన్నట్టు’’
‘‘మహాభారతంతో వచ్చిన చిక్కే ఇది.. ప్రతి సందర్భానికి, కావలసిన విధంగా అక్కడి నుంచి ఉదాహరణలు తీసుకోవచ్చు. పెద్దలు ఏం చేసినా ధర్మ సంస్థాపనార్థం అని గుర్తించుకో.. అది చాలు. నువ్వు, నేను వేరు కాదు.. కుర్చీలో నువ్వు కూర్చుంటే ఏంటి? నేను కూర్చుంటే ఏంటి? అనే అద్వైత భావంతో కుర్చీలో ఉన్న వారిని కిందికి దించి, తాను కూర్చున్నాడు.. అంతే తప్ప.. పదవీ కాంక్షతో కాదు’’
‘‘ఈ రోజు చాలా సంతోషంగా కనిపిస్తున్నావేంటి? ’’
‘‘వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పుట్టిన పార్టీకి మూడవ తరం వారసుడు మంత్రి కాబోతున్నాడు. లోకకల్యాణానికి ఇంకేం కావాలి?
నాలుగవ తరం వారసుడి పట్ట్భాషేకం కూడా కనులారా తిలకిస్తా.. ఈ జన్మకు ఇది చాలు’’
‘‘ఇంతకూ ఆయనెవరు? ’’
‘‘లోకకల్యాణం కోసం.. లోకాన్ని పుట్టించిన మహనీయుడు’’
*

- బుద్దా మురళి