జనాంతికం - బుద్దా మురళి

అశ్లీలాన్ని అడ్డుకోవడం ఎవడి తరం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ముందు దిగ్భ్రాంతి చెందాను, తర్వాత నిర్ఘాంత పోయాను’’
‘‘ఎందుకు? తెలంగాణ నుంచి బియ్యం అంధ్రకు ఎగుమతి అవుతున్నాయనా? ఈ సీజన్‌లో తెలంగాణలో 60 లక్షల టన్నులు, ఆంధ్రలో 39 లక్షల టన్నుల వరి ధాన్యం పండిందనే వార్త చదివి నిర్ఘాంత పోయావా?’’
‘‘అది కామన్.. పంటపొలాలు ప్రపంచ స్థాయి రాజధానిగా మారుతున్నప్పుడు- పంట విస్తీర్ణం తగ్గడం సహజం. హైదరాబాద్‌లో హైటెక్ సిటీ, అపార్ట్‌మెంట్స్ ఉన్న ప్రాంతాల్లో ఒకప్పుడు వ్యవసాయం సాగేది. ఇక్కడా అంతే ’’
‘‘కృష్ణారావును బ్రాహ్మణ పరిషత్ పదవి నుంచి తొలగించినందుకే కదా? నిజంగా అన్యాయం కదూ?’’
‘‘ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేలు తనను విమర్శిస్తేనే ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి జైలులో వేసేయిస్తున్న బాబు. ఫేస్‌బుక్‌లో వ్యంగ్యోక్తులు విసిరిన వారిని సెంట్రల్ జైలులో చుక్కలు చూపించిన వారు, తమకు వ్యతిరేకంగా ఉన్న పోస్టులను ‘షేర్’ చేస్తే పదవి నుంచి ఊడబెరకక పోతే ఆ పోస్టులకు లైక్ చేస్తారని అనుకున్నావా? ’’
‘‘ ఆ... తెలిసింది లే.. ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన రామ్‌నాథ్ కోవింద్‌ను రాష్టప్రతి అభ్యర్థిగా ఎంపిక చేసినందుకే కదా? రెండు సీట్ల నుంచి రథయాత్రతో బిజెపిని అధికారంలోకి తీసుకు వచ్చిన అద్వానీని ప్రధానిగా చూద్దామనుకుంటే 2004లో ముందస్తు ఎన్నికలు, ‘ఇండియా షైనింగ్’ అంటూ బాబుగారు తానూ మునిగి బిజెపిని ముంచేశారు. రాష్టప్రతి పదవి ఖా యం అనుకుంటే ఇలా కావడం దిగ్భ్రాంతికరమే ? ’’
‘‘ఇంట్లోంచి రోడ్డు మీదకు వెళ్లేప్పుడే పిల్లలకు సవాలక్ష జాగ్రత్తలు చెబుతాం. సైకిల్, బైక్, కారు సీట్లో కూర్చుంటేనే అన్ని జాగ్రత్తలైతే, దేశాన్ని నడిపే వాళ్లు కుర్చీలో ఇంకెంత జాగ్రత్తగా కూర్చోవాలి? ఎంత జాగ్రత్తగా అధికార చక్రం తిప్పాలి? రాబోయే ప్రమాదాలను కూడా ముందే పసిగట్టి నిర్ణయాలు తీసుకోవాలి. అద్వానీ కలలు కన్న కుర్చీలో మోదీ కూర్చున్నారు. రాష్టప్రతి పదవిలో కూర్చోబెడితే ఎప్పుడే ఇబ్బంది కలిగిస్తారో? వచ్చే ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ రాకపోతే ఏం చేస్తారో? ఇన్ని సందేహాలు తొలుస్తుంటే అద్వానీకి రాష్టప్రతి అభ్యర్థిగా ప్రకటిస్తారని ఎలా ఊహించావు?’’
‘‘అధికార పక్షం ఆర్‌ఎస్‌ఎస్ వాదిని రాష్టప్రతి అభ్యర్థిగా ప్రకటించినందుకా? విపక్షాలు సైతం దళిత కులానికి చెందిన మీరాకుమార్‌ను రంగంలో నిలిపినందుకా? ఆ దిగ్భ్రాంతి ? ’’
‘‘బిజెపి అధికారంలో ఉన్నప్పుడు ఆర్‌ఎస్‌ఎస్ కాకపోతే కాంగ్రెస్ వాది రాష్టప్రతి అవుతారా? కమ్యూనిస్టులు అవుతారా? సోనియానో, ఏచూరినో చెప్పిన వాళ్లు అవుతారనుకున్నావా? విపక్షాల నుంచి పోటీ ఊహించిందే కదా? చక్రం తిప్పిన బాబుకే చెప్పలేదు.. మోదీ ఇక వీళ్లకు చెబుతారా?’’
‘‘ నా చెవుల వరకూ వచ్చిందో విషయం.. నాకో మేధావి మిత్రుడున్నాడు అతను చెబితే నమ్మలేదు. ఇది నీ వద్దకూ వచ్చిందా? బహుశా నీ ఆశ్చర్యానికి కచ్చితంగా అదే కారణం అయి ఉంటుంది? ’’
‘‘???’’
‘‘నాతోనే చెప్పించాలని.. కెసిఆర్ పెద్ద కుట్రకు తెర లేపారట! కోటి ఎకరాలకు సాగునీరు ఇవ్వడం. లక్షలాది గొర్రెలు, కోట్లాది చేప పిల్లలు ఉచితంగా ఇవ్వడం ద్వారా గ్రామాల్లోని ప్రజలు కుల వృత్తుల్లో అక్కడే ఉండి తనకు ఎప్పటికీ పోటీకి రాకూడదని కుట్ర పన్నుతున్నారట! కరవు విలయ తాండవం చేస్తే ప్రజల్లో అసహనం పెరిగిపోయి తిరుగుబాటు చేస్తారనే కోటి ఎకరాలకు సాగునీరు పథకాన్ని ప్లాన్ చేశారట! ’’
‘‘అధికారంలో ఉన్న వాళ్లు సాధ్యమైనంత కాలం తామే అధికారంలో ఉండాలని కోరుకుంటారు. కాంగ్రెస్‌లోని మేధావులను మినహాయిస్తే మన ప్రత్యర్థులను ఎలా అధికారంలోకి తేవాలి? అని ఆలోచించే వారు ఎవరూ ఉండరు. కేంద్రంలో మోదీ, తెలంగాణలో కెసిఆర్, ఆంధ్రలో బాబు తమ పదవులు నిలుపుకోవడానికి సర్వశక్తులూ ఒడ్డుతారు. మళ్లీ అధికారంలోకి రావడానికి ఎవరికి చాతనైన పనులు వాళ్లు చేస్తారు. దీనిలో నిర్ఘాంత పోవడానికేముంది’’
‘‘అబ్బా.. ఇక నా వల్ల కాదు.. సస్పెన్స్ భరించలేను.. చైనా మన మీద దాడి చేస్తుందనే సమాచారం ఏమైనా ఉందా? తాలిబాన్లు ప్రపంచాన్ని నాశనం చేయనున్నారా? వాడెవడో కోరియావాడు మనమీదెమన్నా గురిపెట్టాడా? చెప్పు ప్లీజ్ ... చెప్పు’’
‘‘ఇవన్నీ పెద్దగా పట్టించుకోవలసినవి కాదు. నీకు కాబట్టి చెబుతున్నా లోకులకు చెప్పినా అర్థం కాదు. బూతు లేనిదే భవిష్యత్తు లేదని తేల్చి చెప్పిన జబ్బర్‌దస్త్, పటాస్ ప్రోగ్రామ్‌లను నిలిపివేస్తున్నారు అనే వార్త వినగానే ఒక్కసారిగా గుండె ఆగినట్టు అయింది... నిర్ఘాంత పోయాను. సినిమాల్లో హీరోకో హీరోయిన్‌కో కష్టం వస్తే సముద్రంలో పైకి వచ్చిన అలలు అలానే నిలిచిపోతాయి చూడు.. అచ్చం అలానే మెదడు మొద్దుబారి శూన్యం ఆవరించింది. ఉన్నావా? అసలున్నావా? ఉంటే కళ్లు మూసుకున్నావా? అని అక్కినేనిలా దేవున్ని నిలదీయాలనుకున్నాను’’
‘‘???’’
‘‘పెద్ద మనుషులుగా బయటకు మనం ఎన్ని నీతులైనా చెప్ప వచ్చు కానీ ఆ ప్రొగ్రామ్స్‌లోని బూతు మన జీవితానికి నూతనోత్తేజాన్ని ఇస్తోంది. నిషేధిత వెబ్‌సైట్స్ చూస్తే లేని పోని సమస్య. పెద్ద మనుషులు రూపొందించి పెద్దమనుషుల చానల్స్‌లో పెద్ద మనుషుల్లా ప్రసారం చేస్తే మనలాంటి పెద్ద మనుషులు ఇంట్లో కూర్చోని నిర్భయంగా చూడవచ్చు. ఏ జన్మలోనో మనం చేసుకున్న పుణ్యం వల్ల ఇలాంటి ప్రసారాల కాలంలో బతికున్నాం. ఈ అదృష్టం నుంచి మనల్ని దూరం చేసే కుట్ర జరుగుతోందని తెలిసి మనసు కకావికలం అయింది. మనమేమన్నా జిఎస్‌టి వద్దన్నామా? తిరుపతిలో గుండు కొట్టించుకున్నా పన్ను కట్టమంటే కట్టమన్నామా? మా సంతోషాల మీద ఎందుకీ కుట్ర..? దేవుడున్నాడు.. వాళ్ల కుట్రలను భగ్నం చేశాడు. సర్వే జన సుఖినోభవంతు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యోదయాన్ని ఆపలేరు. కేసులు అడ్డుపెట్టి బూతును అడ్డుకోలేరు. అవసరం అయితే రాజ్యాంగాన్ని సవరించైనా భవిష్యత్తు తరాల కోసం బూతును కొనసాగించాలి. బూతే భవిష్యత్తు’’
‘కవి చౌడప్ప సిగ్గుపడేలా కల్తీ లేని స్వచ్ఛ బూతు భవిష్యత్తు తరాలకు ఏ ఆటంకం లేకుండా ఇలానే అందించాలని కోరుకుందాం.’
*

-బుద్దా మురళి