ఖమ్మం

టీఆర్‌ఎస్ అభివృద్ధే అందలమెక్కిస్తుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, నవంబర్ 16: నాలుగున్నరేళ్ళలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధే తిరిగి గెలిపిస్తుందని అపద్ధర్మ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఖమ్మం టీఆర్‌ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఖమ్మంలో శుక్రవారం జరిగిన ఖమ్మం నియోజకవర్గ స్థాయి సమావేశంలో వారు మాట్లాడుతూ గతంలో తామంతా వివిధ పార్టీల్లో పనిచేసిన వారమేనని, ప్రజల పట్ల కేసిఆర్‌కు ఉన్న నిబద్ధతను చూసి వారి సమస్యలను పరిష్కరిస్తాడనే ధీమాతోనే టీఆర్‌ఎస్‌లోకి వచ్చామన్నారు. తామనుకున్న లక్ష్యం నెరవేరిందని, ప్రజలు కూడా టీఆర్‌ఎస్ పాలన పట్ల సంతృప్తిగా ఉన్నారని, త్వరలో జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా అన్ని స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కొంతమంది తమపై చేస్తున్న ఆరోపణలకు ప్రజలే గుణపాఠం చెబుతారని వెల్లడించారు. 19న నామినేషన్ల పర్వం పూర్తయిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ ఉంటుందన్నారు. సభ ద్వారానే తాము గెలుస్తున్నామనే సంకేతాలను ప్రత్యర్థులకు పంపిస్తామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశంలో అనేక ప్రాంతాలకు ఆదర్శంగా నిలిచాయన్నారు. ప్రజలు కూడా తమకు వచ్చిన సంక్షేమ ఫలాలు, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా సంతృప్తిగా ఉన్నారన్నారు. తాము గత 70రోజులుగా చేస్తున్న ప్రచారంలో ప్రజల నుంచి వస్తున్న స్పందన అనూహ్యంగా తమను మరింత ఉత్తేజపర్చిందన్నారు. ముఖ్యమంత్రి సభకు నగరంలోని ప్రతి డివిజన్ నుంచి ఓటర్లను తరలించే బాధ్యత కార్పొరేటర్లు తీసుకోవాలన్నారు. ఇప్పటికే రఘునాధపాలెం మండలంతో పాటు పాలేరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు స్వచ్ఛందంగా సభకు వచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారని, సభ సమయం, ప్రాంగణం వివరాలను వారికి తెలియజేయాల్సిన బాధ్యత నాయకులదేనన్నారు. ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలను పట్టించుకోవాల్సిన పని లేదని, కూటమి అభ్యర్థిగా ఖమ్మంలో దిగిన నాయకుడు గతంలో ఏం చేశారో అందరికి తెలుసని, ప్రపంచ బ్యాంకు బ్లాక్‌లిస్టులో పెట్టిన కంపెనీ ఆయనదేనని, హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లలో ఆయనపై ఎన్ని కేసులు ఉన్నాయో అందరికి తెలుసని వ్యాఖ్యానించారు. నామినేషన్ల తరువాత ఏర్పాటు చేసే అఫిడవిట్ల ద్వారా ప్రజలకు కూడా ఈ విషయాలన్ని తెలుస్తాయన్నారు. తద్వారా ప్రజలే ఆయనకు గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. భారీగా హాజరైన జన సందోహాన్ని ఉద్దేశించి టిఆర్‌ఎస్ గెలుపు ఇక్కడే కనబడుతుందని వ్యాఖ్యానించడం విశేషం. ఈ సమావేశంలో పార్టీ నాయకులు ఆర్‌జెసి కృష్ణ, కమర్తపు మురళీ, కర్ణాటి కృష్ణ, ఖమర్, పాపాలాల్, మురళీ తదితరులు పాల్గొన్నారు.
కూటమిలో లుకలుకలు?
* చీలిపోతున్న భాగస్వామ్య పార్టీలు
* టిక్కెట్ దక్కిన నేతల్లో అయోమయం
* రెండుచోట్ల పోటీకి సీపీఐ సై
భద్రాచలం టౌన్, నవంబర్ 16: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మహాకూటమి లుకలుకలు పొడచూపిన ట్టు తెలుస్తోంది. కూటమిలోని పార్టీ పెద్దలు ఐక్యతా రాగం పలుకుతుంటే, జిల్లాలోని పలు ప్రాంతాల్లో నేతలు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. సీట్ల సర్దుబాటులో అన్యాయం జరిగిందని ఒకరంటే, వారికి సహకరించేది లేదని మరికొందరు తెగేసి చెబుతున్నారు. దీంతో కూటమిలోని పార్టీలన్నీ చీలిపోయే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర స్థాయిలో ఏర్పడిన పొత్తులు నియోజకవర్గ స్థాయిలో ఇబ్బందులు కలిగిస్తుండగా ఆయా పార్టీల మధ్య పరస్పర సహకారం ఎలా ఉంటుందోనన్న ఆందోళన మొదలైంది. కాంగ్రెస్, తెదేపా, సీపీఐ, తెలంగాణ జన సమితి కలిసి మహా కూటమిగా ఏర్పడ్డాయి. పొత్తుల్లో భాగంగా కొంత ఆలస్యంగా జిల్లాలోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు కూటమి అభ్యర్థులను ఖరారు చేశారు. మహాకూటమి అభ్యర్థిగా కొత్తగూడెంకు కాంగ్రెస్ నుంచి వనమా వెంకటేశ్వరరావు, భద్రాచలంనకు కాంగ్రెస్ నుంచి పొడెం వీరయ్య, పినపాక నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రేగా కాంతారావు పేర్లను ప్రకటించారు. తెదేపా అశ్వారావుపేట టిక్కెట్‌ను తమ పార్టీ అభ్యర్థికి కేటాయించింది. ఇల్లందు స్థానంపై సందిగ్ధత నెలకొంది. ఇదిలా ఉంటే పొత్తుల్లో భాగంగా ఆయా నియోజకవర్గాల సీట్ల కేటాయింపులపై మహా కూటమి పార్టీల్లో విభేదాలు మొదలయ్యాయి. తొలి నుంచి కొత్తగూడెం టిక్కెట్‌ను సీపీఐ ఆశిస్తుండగా అనూహ్య పరిణామాల మధ్య అక్కడ కాంగ్రెస్ నుంచి వనమాను బరిలో దించారు. దీంతో సీపీఐ నుంచి మాటల దాడి మొదలైంది. ఇక్కడ సీపీఐ రేసులో ఉన్న కూనంనేని మహా కూటమి అభ్యర్థి వనమాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పొత్తుల వల్ల సీపీఐ తీవ్రంగా నష్టపోయిందని ఆయన విమర్శించారు. ఇదిలా ఉంటే ఇక్కడ కాంగ్రెస్ నుంచే టిక్కెట్ ఆశించి భంగపడ్డ ఎడవల్లి కృష్ణ కూడా ఆగ్రహం చెంది కాంగ్రెస్‌ను వీడి బీఎల్‌ఎఫ్‌లో చేరారు. ఈ పరిణామాలన్నీ చకచకా జరగ్గా కొత్తగూడెంలో కూటమి పార్టీలన్నీ ఒక్కతాటిపై నడిచే అవకాశాలు లేవని స్పష్టమవుతోంది. కొత్తగూడెం టిక్కెట్ సీపీఐకి దక్కకపోవడంతో పినపాక నియోజకవర్గంపై కూడా ఆ ప్రభావం పడింది. పినపాక టిక్కెట్‌లో కూటమిలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి రేగా కాంతారావుకు కేటాయించారు. ఆయన నామినేషన్‌కు సీపీఐ దూరంగా ఉంది. ఇదంతా కొత్తగూడెం టిక్కెట్ కేటాయించకపోవడం వల్లనే అని తెలుస్తోంది. ఎందుకంటే పినపాకలో నిన్నటి వరకు కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారంలో సీపీఐ పాలుపంచుకొంది. కాంగ్రెస్‌కే సీటు వస్తుందని తెలిసిన పినపాక సీపీఐ నేతలు రేగాను బలపరుస్తూ వచ్చారు. కానీ కొత్తగూడెం విషయంలో తమ పార్టీకి జరిగిన అన్యాయం, ఆ పార్టీ నేతల నుంచి వచ్చిన ఆదేశాలతోనే సీపీఐ కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్‌కు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక భద్రాచలం నియోజకవర్గంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. తొలి నుంచి ఇక్కడ మహా కూటమిలోని ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌కు పోటీ లేదు. కానీ స్థానికుడికే టిక్కెట్ ఇవ్వాలని భాగస్వామ్య పార్టీలు నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలో స్థానికేతరుడైన ములుగు ప్రాంతానికి చెందిన పొడెం వీరయ్యకు కాంగ్రెస్ టిక్కెట్ ఇవ్వడంతో సొంత పార్టీ నుంచే కాక సీపీఐ నుంచి కూడా కాంగ్రెస్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. అవసరమైతే భద్రాచలం నుంచి పోటీ చేస్తామని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి సాబీర్‌పాషా ప్రకటించారంటే కూటమిలో రచ్చ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు రంగంలో ఉండగా కూటమిలోని భాగస్వామ్య పార్టీల నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ అశ్వారావుపేట నియోజకవర్గంలో మాత్రం తెదేపా అభ్యర్థిపై అలకబూనింది. కాంగ్రెస్‌కు టిక్కెట్ వస్తుందని ఆశించిన నేతలు తెదేపాకు టిక్కెట్ రావడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో ఆయా పార్టీల మధ్య పొత్తులపై అవగాహన కుదిరినా నియోజకవర్గ స్థాయిలో విభేదాలు భగ్గుమంటున్నాయి. భద్రాచలం టిక్కెట్ దక్కించుకున్న వీరయ్య సైతం తొలుత అధిష్టానంపై గుర్రుగా ఉన్నా తప్పనిసరి పరిస్థితుల్లో భద్రాచలం రావాల్సి వస్తోంది. ఇక్కడ స్థానిక అభ్యర్థులకే విజయావకాశాలు ఉంటాయని గత ఎన్నికల్లో సైతం రుజువైంది. గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్న చోట కాంగ్రెస్ ఏరి కోరి ములుగు ప్రాంతం నుంచి అభ్యర్థిని పంపడం సొంత పార్టీల్లోని నేతలకే మింగుడు పడటం లేదు. ఇప్పటికే సీపీఐ తన అభ్యర్థిని ప్రకటించి నామినేషన్ వేయించేందుకు సిద్ధంగా ఉంది. మిగిలిన తెలుగుదేశం పార్టీ సహకారం ఎంతమేరకు ఉంటుందో అప్పుడే చెప్పలేని పరిస్థితి. ఇప్పటికే నాలుగు నియోజకవర్గాల్లో కూటమి పార్టీల అభ్యర్థులు ఖరారు కాగా క్షేత్ర స్థాయిలో ఆయా పార్టీల్లోని నాయకుల మధ్య స్నేహభావం పెరగకపోవడం, అసంతృప్తిజ్వాలలు ఎగిసి పడుతుండటంతో పోటీలో ఉన్న అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.