కృష్ణ

అమరావతికి మరో అరుదైన గౌరవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం దక్కింది. బ్రిటీష్ ప్రభుత్వ ఇంటర్నేషనల్ ట్రేడ్ విభాగం నిర్వహించే ప్రదర్శనలో అమరావతి విశిష్టత, సంస్కృతి , సాంప్రదాయాలు, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం మేళవింపుల గురించి వివరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆహ్వానించింది. ఈ నెల 20 నుంచి 22 వరకు 3 రోజులపాటు లండన్‌లో జరిగే సదస్సులో ఇంటర్నేషనల్ ట్రేడ్ వాటర్ టెక్నాలజీపై ప్రదర్శన ఉంటుందని, దీనికి హాజరు కావాలంటూ బ్రిటీష్ ప్రభుత్వం ప్రత్యేకంగా పంపిన ఆహ్వానంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. వాస్తవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రదర్శనలో పాల్గొని రాజధాని నగరం, అమరావతి నిర్మాణం, భవిష్యత్ ప్రణాళిక, పెట్టుబడులు, అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థల ఏర్పాటు, ఉపాధి కల్పన, ప్రజా సదుపాయాలు, వౌలిక వసతుల కల్పన తదితర అంశాల గురించి వివరించాల్సి ఉంది. కానీ దైనందిన కార్యక్రమాల్లో తీరిక లేకుండా ఉన్నందున చంద్రబాబు నాయుడు తన తరఫున మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణతో కూడిన అత్యున్నత బృందాన్ని ఈ ప్రదర్శనకు పంపుతున్నారు. ఈ బృందంలో సిఆర్‌డిఎ కమిషనర్ చెరుకూరి శ్రీధర్, తదితర అధికారులు ఉంటారు. రాజధాని నగరం అమరావతి నిర్మాణ సంకల్పం, భూసమీకరణ, భవిష్యత్తరాలకు ఉపయోగపడేలా వౌలిక సదుపాయాల కల్పన, అంతర్జాతీయ స్థాయి విద్య, వైజ్ఞానిక, వైద్య సంస్థలు, ఉపాధి అవకాశాలు, పర్యాటక రంగం వంటి అంశాలను గురించి మంత్రి నారాయణ ఈ వేదిక ద్వారా ప్రపంచానికి వివరించనున్నారు. ఈ సందర్భంగా సిఆర్‌డిఎ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టెలికాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలు చేసినట్లు ఇంధన, వౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, సిఆర్‌డిఎ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి నారాయణ, సిఎంఓ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, సిఎంఓ ముఖ్య కార్యదర్శి జి.సాయి ప్రసాద్, ఇంధన, వౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, సిఆర్‌డిఎ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, సిఆర్‌డిఎ కమిషనర్ చెరుకూరి శ్రీధర్, ఎడిసి ఛైర్‌పర్సన్ లక్ష్మీపార్థసారథి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ వేదిక ద్వారా నగర నిర్మాణం కోసం ప్రభుత్వ ధనం ఒక్క రూపాయి తీసుకోకుండా 33,000 ఎకరాలను భూసమీకరణ విధానంలో ఇవ్వడం ద్వారా రైతులు చేసిన త్యాగాన్ని విశ్వానికి వివరించాలని మంత్రి నారాయణ బృందానికి చంద్రబాబు సూచించారు. అమరావతి నగర నిర్మాణంలో స్వల్ప, దీర్ఘకాల ప్రణాళికను ఎలా రూపొందించామో వివరించాలని సూచించారు. వచ్చే దశాబ్ద కాలంలో 3 నుంచి 5.5 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయో స్పష్టం చేయాలన్నారు. దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులోనే అమరావతి నిర్మాణం గురించి ప్రపంచానికి అవగతమయ్యిందని సిఎం చంద్రబాబు చెప్పారు. ప్రపంచ స్థాయి పారిశ్రామిక వేత్తలకు అమరావతిలో పెట్టుబడులు పెట్టడంపై ఆసక్తి పెరుగుతోందని ముఖ్యమంత్రి చెప్పారు. దావోస్ పర్యటనలోనే విలువైన పెట్టుబడి అవగాహన ఒప్పందాలను చేసుకోవడాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. రాజధాని నగర నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులపై ఆదాయ పన్ను భారం పడకుండా ‘క్యాపిటల్ గెయిన్స్’ మినహాయింపులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం ద్వారా వారికి కలిగిన లబ్ధి గురించి వివరించాలని మంత్రి నారాయణ బృందానికి చంద్రబాబు సూచించారు. అమరావతి నగరాన్ని అత్యున్నత ప్రణాళికతో పరిపాలన, క్రీడా, మీడియా, జస్టిస్, విజ్ఞాన, ఎలక్రానిక్, ఆర్థిక, పర్యాటక నగరాలుగా అభివృద్ధి చేస్తున్నామని ప్రపంచానికి చెప్పాలని సిఎం చంద్రబాబు వివరించారు. అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు రావాలని ఇప్పటికే జపాన్, సింగపూర్, చైనా, ఫ్రాన్స్ వంటి దేశాలను ఆహ్వానించిన విషయాన్ని వివరించాలని అన్నారు. గత నెల 27-28 తదీల్లో విశాఖలో నిర్వహించిన పారిశ్రామిక భాగస్వామ్య సదస్సులో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు దేశ, విదేశీ సంస్థలు ముందుకు రావడం... రూ.10.54 లక్షల కోట్లను పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం వంటి అంశాలను ఈ వేదికపై ప్రస్తావించాలన్నారు. అమరావతి నగరాన్ని భూ ప్రణాళిక, నిధులు, వౌలిక సదుపాయాల కల్పన, ఆర్థిక, సామాజిక అభివృద్ధి వంటి అంశాలతో మిళితం చేసి.. అభివృద్ధి చేయనున్నామని ఈ సందర్భంగా అజయ్ జైన్ వివరించారు. ఈ సందర్భంగా రంగాల వారీగా ఉద్యోగ కల్పన అంచనాలను గురించి సిఆర్‌డిఎ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ వివరించారు.