మెయన్ ఫీచర్

పిల్లి మెడలో గంట కట్టేదెవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దవాళ్లు చిన్నపిల్లల చేష్టలు చేస్తే ఎలా ఉంటుంది? ఏపి-తెలంగాణ ప్రభుత్వాల గొడవల్లా ఉంటుంది! హైకోర్టు విభజనపై తెలుగు రాష్ట్రాల మధ్య జరుగుతున్న తగాదాల్లో ఇంతకూ తప్పెవరిది? పరిష్కారకర్త ఎవరన్నది బ్రహ్మపదార్ధం మాదిరిగా తయారయింది. అం దరూ తమ తప్పు లేదంటే తమ తప్పు లేదని అడ్డంగా వాదించేవారే. ఇద్దరినీ కూర్చోబెట్టి సమస్య పరిష్కరించాల్సిన గవర్నర్ గుళ్లు, గోపురాలు, విందుల్లో బిజీగా ఉన్నారు. బిల్లు సమయంలో కాంగ్రెస్‌తో కలసి వి‘్భజన’ చేసిన బిజెపి ఇప్పుడు తంపులు పెట్టి తమాషా చూస్తున్నట్లుంది.
బాబుగారేమో ఇది సుప్రీంకోర్టు తేల్చాల్సిన వ్యవహారమంటారు. తెరాస నేతలేమో బాబు అడ్డుకుంటున్నారన్న సన్నాయినొక్కులు. రాష్ట్రం విడిపోయినా న్యాయమూర్తుల ద్వారా తెలంగాణపై పెత్తనం చేయాలని బాబు చూస్తున్నారని తెరాస గళధారుల మండిపాటు. జంతర్‌మంతర్‌లో కేసీఆర్ ధర్నా చేస్తారన్న హెచ్చరిక. బిజెపి, కాంగ్రెస్ నేతలేమో బాబు-కేసీఆర్ కూర్చుని పరిష్కరించుకోవాలంటున్నారు. కేంద్రన్యాయశాఖమంత్రి సదానందగౌడ ఇది తమ పరిథిలోకి రాదని, ఇద్దరు చంద్రులూ పరిష్కరించుకోవాలని, ఏపి సర్కారు తేల్చాలని బంతిని తెలుగు రాష్ట్రాలవైపు నెట్టేశారు. బాబుగారే మాట్లాడాలన్నారు. మరి పిల్లి మెడలో గంటకట్టేదెవరు?
హైకోర్టు విభజన వ్యవహారం చినికి చినికి గాలివాన అవుతోంది. కృష్ణా జలాల పంచాయితీ ముగిసిందనుకుంటే, కొత్తగా హైకోర్టు విభజన గొడవ తెరపైకి రావడం తెలుగు ప్రజలను కలత పరిచేదే. విభజన జరిగిన తర్వాత కూడా మా మానాన మమ్మల్ని పరిపాలించుకోకుండా న్యా యాధికారులు, న్యాయమూర్తులకు ఏపి ఆప్షన్లు ఇవ్వడమేమిటన్నది అసలు పంచాయితీ. దీనికి బాబుదే బాధ్యత అని తెరాస, కేసీఆర్ ఇంకా సెంటిమెంట్‌తో బతుకుతున్నారని తెదేపా పరస్పర ఆరోపణలు గుప్పించుకోవడం చూసిన వారికి రోత.
రాష్ట్రం విడిపోయి రెండేళ్లయినా, కమల్‌నాధన్ కమిటీ ఇంకా తన పని ముగించకుండా పదవీకాలం పొడిగింపు కోసం నత్తలూ ఈర్ష్యపడేలా పనిచేస్తోంది. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన ఈ యుగంలో కూడా విభజన వ్యవహారానికి ఏండ్లూ, పూండ్లూ పట్టడం సిగ్గుచేటు మాత్రమే కాదు, ఇది అనవసర వివాదాలకు కారణమవుతోంది కూడా! చిన్న పల్లెల్లోనే గ్రామ పెద్ద ఎలాంటి తగాదానయినా ఒకరోజులో తేల్చేస్తారు. కానీ, అధికారులు, నౌకర్లు, చాకర్లు, విమానాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఆస్తులు, ఉద్యోగుల పంపిణీ ఇంకా తెలుగు టివి సీరియల్ జీడిపాకంలా సాగదీయడం కేంద్రానికే చెల్లింది.
అర్ధరాత్రి తలుపులు మూసి మరీ విభజన చట్టానికి జైకొట్టిన చిన్నమ్మ సుష్మాజీ, మీకు అన్యాయం జరగనివ్వమని చెప్పిన జైట్లీ ఇప్పుడు ఎక్కడున్నారు? విభజన వ్యవహారాన్ని త్వరగా తెమల్చాలని ఎందుకు ఆదేశించడం లేదు? అసాధ్యమనుకున్న విభజనను సుసాధ్యం చేసిన వారికి తగాదాలకు తెరదించాల్సిన నైతిక బాధ్యత లేదా? ప్రభుత్వాలు, రాజకీయ పార్టీల కుటిలత్వానికి ఎలాంటి సంబంధం లేని ప్రజలు మధ్యలో ఎందుకు ఇబ్బందులు పడాలి?
బీఎస్‌ఎన్‌ఎల్‌ను రెండు సర్కిళ్లుగా విభజించిన నేపథ్యంలో, తెలంగాణ ఉద్యోగులకు ఏపికి ఆప్షన్లు ఇస్తే సహించేదిలేదని, కావాలంటే తాము అండమాన్‌లో అయినా పనిచేస్తాముగానీ, ఆం ధ్రాలో పనిచేయమని హెచ్చరించే పరిస్థితికి కారణం కచ్చితంగా కేంద్రప్రభుత్వ నత్తనడక విధానమే! సహజంగా కేంద్రప్రభుత్వ ఉద్యోగులు దేశంలో ఎక్కడయినా పనిచేయాల్సిందే. ఉద్యోగంలో చేరేముందు ఆ మేరకు వారు దస్కతు కూడా చేస్తారు. మరి తాము ఫలానా చోట మాత్రమే పనిచేస్తామంటే ఎలా కుదురుతుంది. సైనికులు, బ్యాంకు ఉద్యోగులు, రైల్వే, విమాన, నౌకాదళంలో పనిచేసే ఉద్యోగులు కూడా టెలి కాం ఉద్యోగుల మాదిరిగా, తాము తమ రాష్ట్రంలోనే పనిచేస్తామంటే వ్యవస్థ నడుస్తుందా?
ఇక మళ్లీ హైకోర్టు విభజన వివాదానికి వస్తే, సమస్యను పరిష్కరించాల్సిన కేంద్రమంత్రి సదానందగౌడ మీ చావు మీరు చావండని చేతులెత్తేయడం బాధ్యతారాహిత్యం. పైగా ఈ వ్యవహారంలో ఆయన బాబును వ్యూహాత్మకంగా ఇరికించారు. ఇది చంద్రబాబు తేల్చాల్సిన పనే తప్ప, మాకేమీ సంబంధం లేదని తేల్చారు. పనిలోపనిగా ఇద్దరు చంద్రులూ కలసి కూర్చుని తేల్చుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు.
బాబు మాత్రం ఇది కేంద్రం పరిష్కరించే పని కాదని, సుప్రీంకోర్టు తేల్చాలన్న కొత్త లాపాయింటు తీశారు. తర్వాత మళ్లీ ఆయనే కేంద్రమే చొరవ తీసుకోవాలన్నారు. తాజాగా బాబు చెప్పినట్లు హైకోర్టు నిర్మాణం భవిష్యత్తు తరాలకు చిరకాలం గుర్తుండిపోయేలా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఆలస్యమవుతుందని తేల్చేశారు. ఈ లెక్కన హైకోర్టు విభజన వ్యవహారం చూస్తుంటే, మరికొనే్నళ్లు పట్టినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
ఇక్కడ విషయమేమిటంటే రోగమేమిటో తెలుసు. మందులూ తెలుసు. కానీ వైద్యుడే దొరకడం లేదు. ఈ వ్యవహారంలో కేజ్రీవాల్ మాదిరిగా కేసీఆర్ ఢిల్లీలో ధర్నా చేస్తారనడం కీలక వార్త. కేంద్రంతో కేసీఆర్ వ్యక్తిగతంగా సన్నిహితంగానే ఉంటున్నారు. ఎక్కడా ఘర్షణ వైఖరి అవలంబించడం లేదు. పక్కనే ఉన్న మహారాష్టల్రో బిజెపి సర్కారు ఉన్నప్పటికీ సాగునీటి ఒప్పందాల పనులు చక్కబెట్టుకుంటున్నారు. రాష్ట్రానికి వచ్చి పోయే కేంద్రమంత్రులంతా కేసీఆర్‌ను పొగడకుండా వెళ్లడం లేదు. తెలంగాణ ప్రభుత్వ పథకాలను పొగడని మంత్రి లేరు. ప్రధాని కూడా అందుకు మినహాయింపు కాదు. కేంద్ర ప్రతినిధి గవర్నరుతో అత్యంత సన్నిహితంగా ఉంటున్నారు. ఇక్కడ కొందరు బిజెపి ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్‌ను సందర్భం వచ్చినప్పుడల్లా ఆకాశానికెత్తుతున్నారు. మూడు రాష్ట్రాల గవర్నర్లకు ఆయన ఒకరకంగా ముద్దుల ముఖ్యమంత్రి. ఉభయ రాష్ట్రాల గవర్నరు నరసింహన్, మహారాష్ట్ర గవర్నరు విద్యాసాగర్జీకి ఆయన ఇష్టుడే. మరి మళ్లీ ఢిల్లీలో కేంద్రంపై ధర్నా దండయాత్ర ఎందుకన్నది చిదంబర రహస్యమే.
ఏదైనా ఒకటి మాత్రం నిజం. పెంచిన 1527 కోట్ల విద్యుత్ చార్జీలు, 286 కోట్ల ఆర్టీసీ బస్సు చార్జీల నిరసనలు, హైకోర్టు ఉద్యమ హోరులో గాలిలో కలిసేలా చేయడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. విపక్షాలు కూడా కేసీఆర్ వ్యూహానికి చిక్కి, చార్జీల ఉద్యమం చేయకుండానే శల్యమలయ్యాయి. కాంగ్రెస్, తెదేపా వంటి బలహీనమైన ప్రతిపక్షాలుంటే ఏ ముఖ్యమంత్రికయినా సౌకర్యమే కదా?
ఏపిలో సెంటి‘మంట’
ఇక ఏపిలో బాబు సర్కారు జనం వ్యతిరేకతను కొనితెచ్చుకునే పనిలో ఉన్నట్లుంది. కృష్ణా పుష్కరాల కోసం బెజవాడలో దాదాపు 45 గుళ్లను పెకలించి వేసి, హిందువుల్లో వ్యతిరేకత మూటకట్టుకున్నారు. గోదావరి పుష్కరాల్లో కూడా 108 నాగప్రతిమలు, రెండు శివలింగాలను తొలగించారు. పుష్కరాలంటేనే విశ్వాసం. ఆ విశ్వాసాన్ని తమ భుజాల మీద తుపాకి పెట్టి కొడుతుంటే, హిందుత్వానికి పేటెంట్ పెద్దమ్మ బిజెపి అధికారమత్తులో సుఖనిద్ర పోవడం చూచువారలకు చూడముచ్చట. హైందవాన్ని దివ్యంగా వెలిగించి, దేశాన్ని ఉద్ధరిస్తుందని మురిసి ముక్కలయి, బిజెపిని నెత్తికెక్కించుకున్న కమలదళం నుంచి వీరత్వం ఆశించడం తప్పేనేమో?! క్రైస్తవం దివ్యంగా వెలిగిన గత పదేళ్లు, లౌకికవాదంతో హిందుత్వాన్ని అనాధను చేసిన కాంగ్రెస్ దశాబ్దాల కాలంలో కూడా చేయని సాహసాన్ని, బిజెపి అపూర్వ సహోదర భాగస్వామి తెదేపా చేసింది. అదే ఆశ్చర్యం! అయితే, గుళ్ల తొలగింపుపై వస్తున్న విమర్శలకు జంకిన బాబు, తాజాగా గుళ్ల విషయంలో మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని హితవు పలికారు. అడుసుతొక్కనేల? కాలు కడగనేల?!
జగన్‌పై అత్యుత్సాహం
ఎవరి కళ్ల నుంచి వారు చూస్తే దాని అనుభూతి వేరు. కానీ అరువు కళ్లతో చూస్తేనే ఇబ్బంది. నవ్యాంధ్రలో మీడియా ఉత్సాహం ఇలాగే ఉంది. జగన్‌బాబుకు చెందిన 749 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్‌మెంట్ చేసింది. సరే. జగన్‌కు జైలు, సీబీఐ కేసులు, అటాచ్‌మెంట్లు కొత్తేమీ కాదు. దానివల్ల ఆయన నిర్వహిస్తున్న కంపెనీలేమీ ఆగిపోవు. కానీ ఒక వర్గం మీడియా రెండురోజుల పాటు చేసిన హడావిడి, వండి వార్చిన ఇనె్వస్టిగేషన్ కథనాలు చూసి, కొత్త నిజాలను తెలుసుకున్నామన్న భావన కంటే, పాత చింతకాయ పచ్చడిని కొత్తగా కూడా చేయవచ్చన్న జ్ఞానోదయమయితే కలిగింది. ఏపిలో లోకకల్యాణం కోసం అక్షరయుద్ధం చేస్తున్న ఈ మీడియా పరిశోధన మెచ్చదగ్గదే. మరి అదే పనితనం అమరావతి భూము లు, సదావర్తి సత్రం భూముల అమ్మకాలు, స్విస్‌చాలెంజ్ విధానంలో భవన నిర్మాణాలు, భూముల అప్పగింతపై వస్తున్న ఆరోపణలపైనా శ్రద్ధ చూపిస్తే, లోక కల్యాణ ప్రయత్నానికి పరిపూర్ణత్వం వస్తుంది కదా?!

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 9705311144