మెయన్ ఫీచర్

ఆన్‌లైన్ బెదిరింపులకు ‘పాత్రికేయం’ విలవిల!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పత్రికా స్వాతంత్య్రానికి ముప్పు అనూహ్య మార్గాల నుండి ఏర్పడుతోంది. సాంకేతికత ఉపయోగం మానవ జీవనానికి ఎంత సౌలభ్యం కలిగిస్తున్నదో మరింతగా ప్రమాదాలకూ కారణ మవు తోంది. తాజాగా ఆన్‌లైన్‌లో పత్రికా స్వాతంత్య్రానికి ముప్పు ఏర్పడుతున్నట్లు ‘సరిహద్దులు లేని రిపోర్టర్లు’ (రిపోర్టర్స్ విత్ అవుట్ బోర్డర్స్) సంస్థ తన నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పద్ధతిలో జర్నలిస్టులు సామూహికంగా బెదిరింపులకు గురవుతున్నారని తెలి పింది. ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ దాడులకు- పాల్పడుతున్నవారు ద్వేషం విరజిమ్మే వ్యక్తులు, వ్యక్తుల సముదాయం కావచ్చని, వారు- తెర వెనుక ఉన్న నిరంకుశ వ్యవస్థలు రూపొందించిన ‘ఆన్‌లైన్ కిరాయి సైనికుల’ని వ్యాఖ్యానించింది. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులు వౌనంగా ఉండేలా తరచూ దారుణమైన అసంబద్ధమైన పద్ధతులకు ఆ కిరాయ సైనికులు పాల్పడుతున్నారు.
కొంత కాలంగా ఇలా దాడులకు పాల్పడుతున్న వారి గురించిన సమాచారాన్ని సేకరిస్తూ, విశే్లషణ జరిపిన తర్వాత ఇప్పుడది ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తూ, పత్రికా స్వాతంత్య్రానికి తీవ్రమైన ముప్పుగా పరిణమిస్తున్నదని నిర్ధారణకు వచ్చినట్టు రిపోర్టర్స్ విత్ అవుట్ బోర్డర్స్ సంస్థ సెక్రటరీ జనరల్ క్రిస్టోఫే దెలియర్ తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో దేశాల మధ్యనే సమాచార యుద్ధం జరగడం లేదని తాము గ్రహించామని, వాస్తవాలను నిజాయతీగా ప్రకటిస్తున్న జర్నలిస్టులను అణచివేయడానికి ఇటువంటి దుష్ట సైనికులను నియ మిస్తున్నారని, నిజమైన యుద్ధ్భూములలో పాల్పడే దుష్ట పన్నాగాలను వీరు జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన వ్యాఖ్యా నించారు. జర్నలిస్ట్‌లకు వ్యతిరేకంగా ఆన్‌లైన్‌లో కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్న వారికి, ప్రభుత్వాలకు మధ్య గల సంబంధాన్ని నేరుగా నిరూపించడం కష్టం కావచ్చు. నిరంకుశ లేదా అణచివేత పాలకుల కార్యకలాపాలపై ఒక వంక కన్ను వేసి ఉంచుతూ, 32 దేశాలలో ఆన్‌లైన్‌లో జర్నలిస్‌లను వేధిస్తున్న సంఘటనలను రిపోర్టర్స్ విత్ అవుట్ బోర్డర్స్ సంస్థ పరిశోధించింది. వీటిల్లో చైనా, భారత్, టర్కీ, వియత్నాం, ఇరాన్, అల్జీరియా వంటి దేశాలు ఉన్నాయి. వీరు మూడు విధాలుగా తమ కార్యకలాపాలు సాగిస్తున్నారు. సోషల్ నెట్ వర్క్ లలో తప్పుడు వార్తలను, ప్రభుత్వ అనుకూల సమాచారాన్ని నింపుతూ తప్పుడు సమాచారాన్ని చేరవేస్తున్నారు. సోషల్ నెట్‌వర్క్‌లలో అనుకూల సమాచారం నింపేవారిని కిరాయికి ఉపయోగించుకొంటున్నారు. నిబద్ధతతో పనిచేసే జర్నలిస్ట్‌లను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకొని అవమానాలకు గురిచేయడం, బెదిరించడం, దుర్భష లాడటం చేస్తున్నారు.
మెక్సికో వంటి ప్రజాస్వామ్య దేశాలతో పాటు, పత్రికా స్వాతంత్య్రంలో ప్రపంచంలోనే అగ్రభాగంలో ఉన్న స్వీడన్, ఫిన్లాండ్ వంటి దేశాలలోనూ కొందరు వ్యక్తుల బృందాలు లేదా రాజకీయ బృందాలు ఆన్ లైన్ లో వేధింపులకు దూకుడుగా పూనుకొంటున్నాయి. ఇటువంటి వేధింపుల పర్యవసానాలు చాలా నాటకీయంగా ఉంటు న్నాయి. చాలామంది జర్నలిస్టులు ఆన్ లైన్ వేధింపులకు తట్టుకోలేక తమ కథనాలను తామే సెన్సార్ చేసు కొంటున్నామని ఈ సంస్థకు తెలిపారు. ఆన్ లైన్ వేధింపులకు అత్యధికంగా గురవుతున్నది మహిళా జర్నలిస్టులు కావడం గమనార్హం. మూడింట రెండు వంతుల మంది మహిళా జర్నలిస్టులు ఇటువంటి వే ధింపులకు లోనవుతున్నారు. 25 శాతం కేసులలో వేధిం పులు ఆన్‌లైన్‌లోనే జరు గుతున్నాయి. పరిశోధనాత్మక కథనాలను ప్రచురించే వారిని జిహాదీలుగా, తీవ్రవాదుల మద్దతుదారులుగా, ఐసిస్ బానిసలుగా ముద్రవేస్తున్నారు. మహిళా జర్నలిస్ట్‌ల ఫోటోలు తీసుకొని, నగ్నంగా ఉన్న ఫొటోలతో జతచేసి అసభ్యకరంగా పోస్టింగ్‌లు చేస్తున్నారు.
ఎక్కువగా మాట్లాడే మహిళలపై అత్యాచారం చేయ వలసిందే అంటూ ఒక మహిళా జర్నలిస్ట్‌ను ఆన్‌లైన్‌లో హెచ్చరించారు. ఈ వేధింపులు మగవారిపైనా కన్నా మహిళలపై దారుణంగా ఉంటాయి. వారిపై వేశ్య, తిరుగుబోతు, మానభంగం చేయాలి వంటి పదజాలాన్ని ఉదారంగా వాడుతున్నారు. లైంగికంగా వేధిస్తూ, వారి వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా చేస్తుంటారు. బీబీసీ న్యూస్‌లో పొలిటికల్ ఎడిటర్‌గా నియమితులైన మొదటి మహిళ లారా కుయెన్స్బర్‌కు సెప్టెంబర్, 2017లో ఒక బాడీ గార్డ్‌ను నియమించారు. ఎందుకంటే ఆమె ఘర్షణలు జరుగుతున్న ప్రదేశాలకు వెళలుతున్నదని కాదు. మే, 2016లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సమయం నుండి ఆమె పక్షపాతంతో వార్తలు పంపుతున్నట్లు లేబర్ పార్టీ వారు ఆరోపిస్తూ వస్తున్నారు. ఆమెను ఆ బాధ్యతల నుండి తొలగించాలని అంటూ ఒక పిటిషన్ కూడా తయారు చేశారు. దానిపై 35 వేల మంది సంతకాలు చేశారు. దీనికి తోడుగా ఆన్ లైన్ లో ఆమెపై అసంభ్యకరంగా బెదిరింపులు, విమర్శలు చేయడం సాగించారు.
ఏప్రిల్, 2017లో ఐరోపా మండలి 47 దేశాలలో జర్నలిస్ట్‌లపై జరుగుతున్న వేధింపుల గురించి జరిపిన సర్వే లో 40 శాతం మంది తాము ఏదో ఒక రకమైన వేధింపులకు గురవుతున్నట్లు చెప్పారు. ఈ వేధింపులతో 53 శాతం ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయి. ఇటువంటి వేధింపులు తమ వ్యక్తిగత జీవనంపై ప్రభావం చూపుతున్నట్లు వారు తెలిపారు. కేవలం యుద్ధ వాతావరణం, ఘర్షణలు నెలకొన్న దేశాలు, ప్రాంతాలలోనే కాకుండా పరిస్థితులు ప్రశాంతంగా ఉన్న మెక్సికో వంటి దేశాలలో ఇటువంటి వేధింపులు సర్వసాధారణమై పోయాయి. ఈ మధ్య మెక్సికో లో జరిగిన అధ్యక్ష ఎన్నికలతో పాటు పలు ఎన్నికలలో ఏ విధంగా నకిలీ అకౌంట్లను ఆన్‌లైన్‌లో సృష్టించి ఎన్నికల ప్రచారాన్ని ప్రభావితం చేస్తున్నారో అంటూ పరిశోధన వ్యాసాలు ప్రచురించిన మెక్సికో జర్నలిస్టు అల్బెర్టో ఎస్కార్సియా కూడా వేధింపులకు గురయ్యారు.
ఫిలిపైన్స్‌లో మరియా రెస్సాను ఆన్ లైన్ లో కిరాయి సైనికులు ఆమెను రేప్ చేస్తామని, చంపివేస్తామని అంటూ దాడులకు పాల్పడగా, ఆమె సంపాదకత్వం వహిస్తున్న వెబ్‌సైట్‌ను కోర్టులకు ఈడ్చి వేధించారు. 2016లో రోడ్రిగో డ్యూటీర్ట్ దేశాధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుండి ఆ దేశంలో ప్రభుత్వ కార్యకలాపాలపై విమర్శనాత్మక కథనాలు ప్రచురిస్తున్న జర్నలిస్ట్‌లు తరచూ దాడులకు గుర వుతున్నారు. ఫ్రాన్స్‌లో రేడియో రిపోర్టర్ నదియా డామ్‌ను ఆన్ లైన్ లో బెదిరించినందుకు ఇద్దరు వ్యక్తులకు ఆరు నెలల జైలు శిక్ష, 2,000 యూరోల జరిమానా విధించారు. విచారణ తర్వాత ఆమెను బెదిరించిన మరో వ్యక్తికి కూడా ఆరు నెలల శిక్ష విధించారు. దేవూమి వంటి కంపెనీలు నకిలీ సోషల్ మీడియా అకౌంట్లను అమ్ముతూ ఆన్ లైన్ బెదిరింపులు జరగడానికి కారణమవుతున్నాయి. ఎటు వంటి ఖర్చు లేకుండా జర్నలిస్ట్ లను వేధించడానికి దోహదపడుతున్నాయ. నిరంకుశ పాలకులను లక్ష్యంగా కథనాలు వ్రాసే పరిశోధనాత్మక జర్నలిస్ట్ సాధారణంగా ఎక్కువగా ఇటువంటి దాడులకు గురవుతున్నారు. ఈ మధ్య పనామా పేపర్లు వెల్లడైనప్పుడు ఏప్రిల్, 2016లో ఎకడోరియా అధ్యక్షుడు రఫెల్ కొరెయానం తనకు సన్నిహితులైన వారిపై ఆరోపణలు రావడానికి కారణమని ఈ పరిశోధనలో పాల్గొన్న తమ దేశానికి చెందిన ఐదుగురు జర్నలిస్ట్‌లను పేరుపెట్టి దూషించారు.
పాకిస్తాన్ లో 68 శాతం మంది జర్నలిస్ట్‌లు ఆన్‌లైన్‌లో వేధింపులకు గురవుతున్నారు. తన సోదరిని రేప్ చేస్తామని కొందరు ఆన్‌లైన్ లో బెదిరించడంతో తన వార్తా కథనాలను తానే ఎడిట్ చేసుకొంటున్నానని, దూకుడుగా కథనాలు రాయడం మానివేసానని అల్జీరియా జర్నలిస్ట్ ఒకరు చెప్పారు. ఫ్రాన్స్‌లో జిహాదీ బృందాలపై కథనాలు రాస్తున్న డేవిడ్ థామస్ బెదిరింపులను తట్టుకోలేక గత సంవత్సరం అమెరికాకు పారిపోయారు. ఐరోపా మండలి ఏప్రిల్, 2017లో జరిపిన అధ్యయనం ప్రకారం ఆన్ లైన్ వేధింపులకు గురైన తర్వాత 31 శాతం మంది జర్నలిస్టులు తమ కథనాలలోని తీవ్రతను తగ్గించుకొంటూ ఉండగా,15 శాతం మంది ఆగ్రహం కలిగించే కథనాలను రాయడమే మానివేశారు. 57 శాతం మంది అయితే బెదిరింపులపై ఫిర్యాదు చేయడం లేదు. అవినీతికి వ్యతిరేకంగా కథనాలు ప్రచురించడంలో పేరొందిన అజర్బేజాన్ పరిశోధక జర్నలిస్టు ఖదీజా ఇస్మాయిల్‌ను వేధించిన విధానం మరింత దారుణంగా ఉంది. ఆమె ఇంట్లో రహస్య కెమెరాలను అమర్చి, ఆమె వ్యక్తిగత జీవితంపై వీడియోలను తీసి, వార్తలను ఆపక పోతే వాటిని బహిర్గతం చేస్తామని బ్లాక్ మెయిల్ చేశారు. అయినా ఆమె భయపడక పోవడంతో వాటిని ఆన్ లైన్ లో ఉంచారు. పైగా, డిసెంబర్, 2014లో కల్పిత ఆరోపణలతో ఆమెను అరెస్ట్ చేసి ఏడున్నరేళ్ళ జైలు శిక్ష విధించారు. అంతర్జాతీయంగా ఆమెకు మద్దతుగా వత్తిడి రావడంతో ఆమెను మే, 2016లో విడుదల చేసినా ఆమెపై నిఘా ఉంచారు. దేశం వదిలి వెళ్లరాదని ఆంక్షలు విధించారు.
నేరుగా కాకపోయినా ఏదో ఒకవిధంగా వేధింపులకు గురవుతున్న ఇతర జర్నలిస్ట్‌లను చూసిన పలువురు జర్నలిస్టులు తమకు తామే జాగ్రత్త పడుతున్నారు. సున్నితమైన అంశాలపై కథనాలు రాయడానికి వెను కాడుతున్నారు. అమెరికాలో ఆన్‌లైన్ వేధింపులకు గురైన జర్నలిస్ట్ మిచెల్లీ ఫెర్రిర్ వేధింపులకు వ్యతిరేకంగా పోరాడటం కోసం ట్రోల్ బస్టర్స్ అనే ఒక వేదికను ఏర్పా టు చేసింది. ఇందులో సభ్యులు ఆన్ లైన్ వేధింపులకు గురైన వారికి బాసటగా నిలిచి, దాడులకు పాల్పడిన వారిని ఖండిస్తూ ప్రచారం చేస్తున్నారు. సోషల్ నెట్‌వర్క్‌లను అనుసంధానం చేసుకొని తమపై దాడులు జరుగుతున్నా జర్నలిస్టులు వాటికి దూరంగా ఉండలేక పోతున్నారు. తమ విధి నిర్వహణలో అవి ప్రధానంగా మారడమే కారణం. ఫ్రాన్స్‌లో జరిపిన ఒక అధ్యయనంలో 94 శాతం మంది జర్నలిస్టులు పేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ నెట్‌వర్క్ వేదికలను ఉపయోగించు కొంటున్నట్లు తెలిసింది. 77 శాతం మంది తమ కథనాలను పోస్ట్ చేయడం కోసం, వాటిని వ్యాప్తి చేయడం కోసం ఉప యోగించుకొంటూ ఉంటే, 73 శాతం మంది ఇతరులు పోస్ట్ చేస్తున్న కథనాలు చూసేందుకు, పాఠకులు, శ్రోతలతో సంబంధం ఏర్పరచుకోవడం కోసం 70 శాతం మంది ఉపయోగించు కొంటున్నారు.
ఆన్‌లైన్ వనరులు పాత్రికేయ వృత్తిలో కీలకం కావడంతో వేధింపుల నుండి వారికి రక్షణ కల్పించడం కోసం 25 సూత్రాలను రిపోర్టర్స్ విత్ అవుట్ బోర్డర్స్ సంస్థ సూచించింది. జర్నలిస్‌లు డిజిటల్ భద్రత పట్ల జాగురకతతో వ్యవహరించాలని పేర్కొన్నది. ఆన్ లైన్ వేధింపుల నుండి రక్షణ కల్పించే చట్టబద్ధ రక్షణలను బలోపేతం చేయాలని, అటువంటి ఫిర్యాదులపై సత్వరం స్పందించాలని, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ప్రభుత్వాలను కోరింది. ఆన్ లైన్ వేదికలు కూడా పారదర్శకంగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. వారి నిబంధనలు జర్నలిస్ట్‌లను వౌనంగా ఉండేటట్లు చేయడానికి దారితీయరాదని హెచ్చరించింది. మీడియా అధిపతులు కూడా ఆన్ లైన్ వేధింపులకు తగు ప్రాధాన్యత ఇచ్చి, జర్నలిస్ట్‌లకు రక్షణ కల్పించేందుకు ముందుండాలని ఆ సంస్థ కోరింది.

--చలసాని నరేంద్ర