మెయన్ ఫీచర్

రాఫెల్ ఒప్పందంపై రాహుల్‌కేమి తెలుసు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశ రక్షణ విషయాలపైనా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అదేపనిగా రచ్చ చేస్తున్నారు. బోఫోర్స్ కుంభకోణంలో కాంగ్రెస్‌పై మచ్చపడిన విషయం గతం. ఆ స్మృతులు కాంగ్రెస్‌ను నేటికీ వెంటాడుతున్నాయి. దేశ సరిహద్దుల్లో ఎండనక, వాననక, కుటుంబాలకు దూరంగా కాపలాకాస్తున్న జవాన్లకు అందించే శతఘు్నల కొనుగోలులోను కుంభకోణం చేసిన కృతఘు్నలు కాంగ్రెస్ నేతలు. ఫ్రాన్స్‌తో జరిగిన రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం సాంకేతిక అంశాలతో కూడుకున్న అంశం. ‘ద సాల్ట్’ పేరుగల ఫ్రెంచి విమాన నిర్మాణ తయారీ సంస్థ నుంచి 36 యుద్ధ విమానాలను కొంటున్నట్లు మూడేళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేశారు.
రష్యా, అమెరికా, యూరపులను కాదని ఈ ఒప్పందం ఫ్రాన్స్‌తో ఖరారుచేశారు. భారత్ ఇది 2012లోనే నిర్ణయమైంది. భారత రక్షణ రంగాన్ని బలోపేతం చేసేందుకు తీసుకున్న చర్య ఇది. ఈ విమానాలు రెండు ఇంజన్లు కలిగి వుంటాయి. 126 విమానాలను కొనుగోలు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని యూపీఏ ప్రభుత్వం వాయిదా వేస్తూ వచ్చింది. ఇవి చాలా ధర కల్గినవి. దశాబ్ద కాలం యూపీఏ ప్రభుత్వం చర్చలు జరిపింది. కాని ‘పాలసీ పెరాలసిస్’ వల్ల అమలు చేయలేక పోయింది. యూపీఏ-2 హయాంలో అనేక అవినీతి కుంభకోణాలు కూడా వెలుగుచూశాయి. కనుక ఇది సాధ్యం కాలేదు. కాని భారత వైమానిక దళాన్ని బలోపేతం చేసేందుకు మోదీ అధికారంలోకి రాగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. జనవరి, 2016లో ఒప్పందం ఖరారైంది. ఒప్పందం ప్రకారం యుద్ధ విమానాల తయారీ సంస్థలు సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత రక్షణ పరిశోధనా సంస్థ- డిఆర్‌డివోతో పంచుకుంటాయి. ఈ ఒప్పందం కుదరగానే కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ చెబుతున్న ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రాజెక్టు పెద్ద విఫల ప్రయోగం అని విమర్శించింది. కాని మోదీ ప్రభుత్వం ‘మేక్ ఇన్ ఇండియా’కు కొత్త భాష్యం యిచ్చింది. ఇతరుల సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం సొంతం చేసుకోవడం కూడా ఇందులో భాగం. ఈ ట్విన్ ఇంజన్ విమానం బహుళ ప్రయోజనాలు కలది. పదేళ్ళ క్రితం ధరలకు కొంత ద్రవ్యోల్బణం, డాలరు విలువ అన్నీ తోడవుతాయి. అయినప్పటికీ మోదీ ప్రభుత్వం చేసుకున్న వొప్పందంలో, యుపిఎ కంటె ఎన్‌డిఎ హయాంలో ధరలు తక్కువగానే వున్నాయి. ఈ ఒప్పందంలో అనేక విషయాలకు సంబంధించిన కొనుగోలు వివరాలు చూస్తే ఒప్పందం చౌకగానే జరిగిందని అర్థం అవుతుంది. కాని యితర సాంకేతికాంశాలు, రక్షణ రహస్యాలు పైగా ఇరుదేశాల మధ్య జరిగిన రక్షణ వొప్పందం తాలూకు విశ్వసనీయత లెక్కలోకి తీసుకోకుండా కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ ఈ ఒప్పందంపై నానాయాగీ చేస్తున్నారు. కొనుగోలు చేయనున్న 36 విమానాలకు సంబంధించి 15 శాతం అడ్వాన్సు చెల్లించారు.
భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఒప్పందం ధరల వివరాల పట్టిక
------------------------------------------------------------
కొనుగోలు వివరం యుపిఎ ఎన్‌డిఎ చౌక
------------------------------------------------------------
ఒక జెట్‌కు
(అధిక ధరలతో) 1705 కోట్లు 1646 కోట్లు 59 కోట్లు
ఒక జెట్‌కు
(అధిక ధర కాకుండా) 1627 కోట్లు 1372 కోట్లు 255 కోట్లు
మొత్తం ధర 1,72,185 కోట్లు 59,262కోట్లు 1,12,923 కోట్లు
సరాసరి ధర ఒక జెట్‌కు 911 కోట్లు 688 కోట్లు 223 కోట్లు
మొత్తం ధర (ఒప్పందం) 1,10,772 కోట్లు 24,785 కోట్లు 85,987 కోట్లు
ఆయుధాలు, సామగ్రికి 15,823కోట్లు 8955 కోట్లు 6863 కోట్లు
నిర్దిష్ఠ అధిక ధర 9855 కోట్లు 9855 కోట్లు -
శిక్షణ, సాంకేతిక
సహాయం కోసం 14027 కోట్లు 5897 కోట్లు 8130 కోట్లు
వౌలిక సదుపాయాలు 7,884 కోట్లు ఖర్చులేదు -
------------------------------------------------------------
మొత్తం ధర రూ. 58 వేల కోట్లలో 30 శాతాన్ని భారత సైనిక వైమానిక పరిశోధనా రంగంలో పెట్టుబడి పెడుతుంది. 20 శాతం రాఫెల్ విడిభాగాల తయారీలో కూడా పెట్టుబడి పెడ్తుంది. ఈమేరకు అదనపు వొప్పందం కూడా కుదిరింది. ఫ్రాన్సులోని ద సాల్ట్ సంస్థ అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్‌ను భాగస్వామిగా చేసుకోవడం పట్ల కూడా కాంగ్రెస్ రాద్ధాంతం చేస్తోంది. నిజానికి రిలయన్స్ డిఫెన్స్ అనుబంధ సంస్థ రిలయన్స్ ఏరో స్పేస్, ద సాల్ట్ ఏవియేషన్‌తో కలిసి ద సాల్ట్ రిలయన్స్ ఏరోస్పేస్‌గా జాయింట్ వెంచర్‌గా ఏర్పడ్డాయి. ఇది రెండు ప్రైవేటు సంస్థల మధ్య జరిగిన వొప్పందం. ఇందులో కేంద్ర ప్రభుత్వ ప్రమేయం ఏమీ లేదు. రిలయన్స్ అధినేత అంబానీ ఇది వరకే రాహుల్‌కు ఈ విషయమై హెచ్చరిక జారీచేశారు. తాజాగా ఆయనపై రూ. 5,000 కోట్ల మేరకు పరువునష్టం దావావేశారు. రాహుల్‌కు చెందిన నేషనల్ హెరాల్డ్ పత్రిక ఈ విషయమై అనేక అవాస్తవాలు ప్రచురించింది.
రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ ఇరు దేశాల మధ్య ఏర్పడిన ఒప్పందాలను భద్రతా కారణాల దృష్ట్యా బయటపెట్టలేమని చెప్పారు. సరిగ్గా ఇదే మాట నాడు ప్రభుత్వంలో ఉండగా మన్మోహన్ సింగ్, ఆంటోనీలు చెప్పారు. జెట్ విమానాలతోపాటు వచ్చే ఆయుధాల వివరాలను కూడా భద్రతా కారణాల దృష్ట్యా వివరించలేమని ప్రస్తుత ఎన్‌డిఎ ప్రభుత్వం అంటోంది.
నిజానికి భారత్ రక్షణావసరాలపై చాలా విశే్లషణ జరిగింది. ఇది యుపిఎ హయాంలోనే జరిగింది. 10 ఏళ్ళపాటు ధరలపై యుపిఎ చర్చలు జరిపింది. పాకిస్తాన్‌ను, చైనాను ఒకేసారి ఎదుర్కొనే సామర్థ్యం వాయుసేనకిచ్చేందుకు మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పైగా మోదీ ప్రభుత్వం అనేక సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకుంది. ఇందులో అణుశక్తిని మాధ్యమంగా చేసుకొని యుద్ధం చేసే వెసులుబాటు కూడా వుంది. యుపిఎ ప్రభుత్వ హయాంలో జరిగిన చర్చల్లో సామాన్య యుద్ధవిమానం కొనుగోలు మాత్రమే ప్రధానాంశమైంది. 2001లో కార్గిల్ యుద్ధం తరువాతనే రుూ తరహా విమానాల విషయమై చర్చ జరిగింది. 2003లో నిర్ణయం రికార్డు చేయబడింది. 2004 నుంచి 2014 వరకు యుపిఎ తాత్సారం చేసింది. కాలంతోబాటు ధర పెరుగుతుంది. ద్రవ్యోల్బణం, విదేశీ మారకం వంటివి కూడా యిందుకు దోహదపడతాయి. ధరలు పెరగడం వల్లనే కొనాలనుకున్న ఎయిర్ క్రాఫ్ట్‌లను 36కు కుదించింది ఎన్‌డిఎ ప్రభుత్వం. కొన్ని సాంకేతికాంశాలను కూడా జతచేసి ఎయిర్‌క్రాఫ్ట్‌ల నిర్మాణం జరగాలని నిర్ణయించారు. ధర ఎంత పెరిగినా యుపిఎ ప్రభుత్వ పాలనలో- 2007లో జరిగిన ధర నిర్ణయం కంటే తక్కువగానే యిపుడు సరఫరా చేసే ఎయిర్‌క్రాఫ్ట్‌ల ధర వుండాలని భారత్, ఫ్రాన్స్ ప్రభుత్వ నేతలు భావించారు. ఈ లెక్కన ప్రస్తుతం ఎన్‌డిఎ కొనాలనుకుంటున్న రాఫెల్ విమానాలు 9 శాతం తక్కువ ధరకే సరఫరా అవుతాయని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరోపించినట్లు యిందులో కుంభకోణం ఆనవాళ్ళు మచ్చుకైనా కానరావు. బోఫోర్సు కుంభకోణంలో ఖత్రోచి లాంటి వ్యక్తులు బయటపడ్డారు. వాళ్ళ బ్యాంకు ఖాతాల్లోకి చేరిన మొత్తాలు తెలిసొచ్చాయి. కాని యిపుడు అలాంటి విషయాలేమైనా వున్నాయా? 2007 వొప్పందంలో హెచ్‌ఎఎల్ ప్రస్తావన వుంది. కాని హెచ్‌ఎఎల్‌కు ఆ సామర్థ్యం ఆ సమయంలో లేని కారణంగానే ఆ వొప్పందాన్ని ఫ్రాన్సు రద్దు చేసుకుంది. ప్రస్తుతం హెచ్‌ఎఎల్ కూడా తేజాస్ విమానాలు తయారు చేస్తున్నది.
హెచ్‌ఎఎల్‌కు ఇపుడు పూర్తిస్థాయిలో వ్యాపారం వుంది. ఈ వొప్పందం తాలూకు ధరల నిర్ణయంలో ప్రైస్ నెగోషియేషన్ కమిటీ, కాంట్రాక్టు నెగోషియేషన్ కమిటీ 14 నెలలపాటు వాటి పని అవి చేస్తాయి. ఇవి లేకుండా ఏ ప్రభుత్వమూ పనిచేయదు. ఇవన్నీ జరిగాయి. దీని తరువాత భద్రతపై క్యాబినెట్ కమిటీకి ధరల సిఫారసు వెళ్ళి ఆమోదం జరిగింది. ఇవేవీ లేవని రాహుల్ బుకాయించడం కేవలం ఎన్‌డిఎపై బురదజల్లే ప్రయత్నమే. పైగా ఈ వొప్పందంలో సీక్రెసీ (రహస్యం) క్లాజు లేదని నాటి రక్షణమంత్రి ఆంటోనీ చెప్పగలరా? రాహుల్ ఈ తరహా ఒప్పందం 2008లో జరిగిందని తెలియకపోవడం శోచనీయం. ఫ్రెంచి ఎంబసీ ఈ తరహా క్లాజు వుందని స్పష్టం చేసింది. ఇది రాహుల్‌కి తెలియదు. ఈమధ్య లండన్, జర్మనీల పర్యటనల్లో మోదీ ప్రభుత్వం డోక్లామ్ సమస్యను సరిగా చక్కబెట్టలేదని రాహుల్ ఆరోపణ చేశారు. ‘మీరు ప్రధాని స్థానంలో వుంటే ఏం చేస్తారని అడిగితే, డోక్లాం గురించి నాకు వివరాలు తెలియవని ఆయన అన్నారు. ఏమీ తెలియకుండానే, తెలుసుకోకుండానే ఎన్‌డిఎ ప్రభుత్వాన్ని ఆయన విమర్శిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా అపరిపక్వత ప్రదర్శిస్తున్నారు, అభాసుపాలవుతున్నారు. రక్షణ బలగాలలో ఆత్మస్థైర్యం నింపే రాఫెల్ ఒప్పందాన్ని ఆయన నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. అబద్ధాన్ని పదిసార్లు చెబితే అది నిజమవుతుందని భ్రమపడ్తున్నారు. కాంగ్రెస్ పార్టీ, రాహుల్‌కు ఈ దూకుడు ఆత్మహత్యా సదృశం కాకమానదు.

-తాడేపల్లి హనుమత్ ప్రసాద్ 96761 90888