మెయిన్ ఫీచర్

కృషితో నాస్తి దుర్భిక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ కార్యం సిద్ధించాలన్నా, నెరవేరాలన్నా‘సాధన’ అవసరమంటారు. ఏ కళలో రాణించాలన్నా సాధన అవసరం. సంగీతం, నాట్యంలో రాణించాలంటే సాధనతో ముడిపడి వుంటుంది.
కళలే కాకుండా జ్ఞానానికి, భగవంతునిమీద భక్తి అన్నిటికీ సాధన అవసరం. సాధనతోనే ప్రతిదీ సాధ్యం. భగవంతుని సాన్నిధ్యానికి దగ్గరవడానికి, జ్ఞానానికి నవవిధభక్తులు సాధనాలు సోపానాలైతే ఆ సోపానాలు ఎక్కడానికి సాధనే కావాలి.
కలిప్రభావము కారణంగా ఈ కలియుగంలో సాధనకు కుదురు ఉండదు. మనిషిగా అన్నిటిలోనూ సందేహమే. గురువుమీద, సదాచారాలమీద, సంప్రదాయాలమీద అన్నిటిలోనూ సందేహమే. అన్నిటిమీదా, అందరిమీదా అనుమానం కల మనిషికి సాధన సాధ్యపడటం కష్టమంటారు.
సాధనకు మరోపేరు కృషి అంటారు. కృషితో నాస్తి దుర్భిక్షం అని అంటారు. ‘సాధనమున పనులు సమకూరు ధరలోన’ అని కూడా అన్నారు. పెద్దలను, అర్హులైన జ్ఞానవంతులను, గురువులను, మాతాపితరులను గౌరవించడం నుండి సాధన మొదలుపెట్టాలి. వారి శుభాశీస్సులు సాధనకు తోడవుతాయి.
ధ్యానం ద్వారా జ్ఞానం లభిస్తుందంటారు. ధ్యానానికి సాధన కావాలి. భగవంతునిపై ధ్యానానికి సద్గురువు ద్వారా భగవంతుని స్మరణం, మననంతో సాధన ప్రారంభించాలంటారు.
పూర్వం ముచికుందుడు అనే ఋషి బదరికాశ్రమం వెళ్లి ధ్యానం చేసుకోవాలనుకున్నారు. నర నారాయణులు ధ్యానం చేసుకున్న భవ్యమైన తపోథామం బదరికాశ్రమము. హిమాలయాల్లో బదరీ ఆశ్రమముంది. భక్తులు తీర్థయాత్రలు చేసే కేదార్‌నాధ్, బదరీనాధ్ హిమాలయాల్లో వున్నాయి. ఆ బదరీనాధే ధ్యానానికి చెప్పబడే బదరీకాశ్రమము. బదరి పేరు విన్నా తలచుకున్నా జ్ఞానమే. అంత పవిత్రమైనది, విశిష్టమైనది. అందరికీ బదరీ వెళ్లడం వీలుకాకపోవచ్చు. ఎక్కడైనా బదరిని తలచుకుంటే చాలు అన్నారు.
సాధనకు మనసు ప్రధానం. మనసును అదుపులో ఉంచుకోగలగడం ముందుగా ప్రయత్నం చేయాలి. ఎల్లప్పుడూ మనసు అనవసర విషయాలవైపు పరుగులు పెడుతుంది. ఎక్కువగా గతాన్ని తలపోయడం భవిష్యత్‌కై ఊహలు చేస్తూంటుంది.
మనసును చంచలం చేసేది కామ క్రోధాలలో మనసును ప్రతీక్షణం, అది వెళ్ళే వైపునుండి మరలుతూ తన త్రోవకు తెస్తూ ఉండాలి. ఏ విషయానికి ఆశపడకుండడం, దేనితోను సరిపోలిక చేయకుండా ఉండడం, జరిగిపోయిన వాటిని పదే పదే స్మరించకుండా ఉండడం- ఈ మూడు ముఖ్య విషయాలపై గట్టిగా దృష్టి పెట్టినట్లయితే మనసు పరుగులను, ఊహాగానాలను చాలావరకు ఆపడం సాధ్యమవుతుంది.
ధ్యానానికి మనసును సమాయత్తం చేయడమే సాధనకు వీలు అవుతుంది. ధ్యానంతో భగవంతుని వైపు ప్రయాణ సాధనకు మార్గం సుగమం. ఆంజనేయుడు తన గురువుగా సూర్యుణ్ణి అడగ్గా, తను చిన్నవాడు, కుదురు తక్కువ, చిలిపితనం ఎక్కువ అని సూర్యదేవుడు వీలుకాదని చెప్పాడు. సూర్యుడు రోజూ సప్తాశ్వరథంలో అతిశీఘ్రంగా ప్రయాణం చేయాలి. ఒకచోట ఉండి చెప్ప వీలుకాదని కూడా చెప్పాడు. అపుడు హనుమ తాను సూర్యదేవుడితో సమానంగా ప్రయాణిస్తూ విద్య నేర్చుకుంటానని సవినయంగా కోరడం, దానికి సూర్యదేవుడు అంగీకరించడం, ఆ విధంగా హనుమ అష్టసిద్ధులను పొందడం జరిగిందంటారు. హనుమ కారణజన్ములు, రుద్రాంశులు, దేవతలందరిచే వరాలు పొందినవాడై రామకార్యమై సంసిద్ధత తన కృషి, పట్టుదల, సాధనతో పొందగలిగారు. అందరికీ పూజనీయులైనారు.
అందుకే మనిషి ఏ లక్ష్యం లేకుండా ఏదోలే బ్రతికేస్తూన్నామన్నట్లు కాకుండా జన్మ మరణం మధ్య మానవ జీవితం కేవలం భగవంతునిపై నిష్కళ, నిష్కపట, ఏ ఆశ, కోరికలు లేనిదైన దైవభక్తి కలిగి ఉండటమే జీవిత లక్ష్యం. పరమార్థం కావాలి. దానికై నిరంతర సాధన అవసరం.

-శ్రీమతి గంటి కృష్ణకుమారి