మెయన్ ఫీచర్

సమాజం ‘పరువు’ పోతోంది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ జిల్లాలో జరిగిన తాజా పరువు హత్య సంఘటన యావత్ సమాజాన్ని ఒక్క కుదుపు కుదిపింది. గర్భవతి అయిన మహిళ కళ్లెదుటే భర్తను దారుణంగా నరికి చంపడం భీతావహ పరిస్థితిని సృష్టించింది. పరువు హత్యలు భారతీయ సమాజానికి మాత్రమే పరిమితం కాలేదు. ప్రపంచం అంతటా ఉన్నాయి. ప్రతి సమాజంలోనూ ఐశ్వర్యవంతుడు తన కుమార్తెను పేదవాడితో పెళ్లి చేసేందుకు నిరాకరిస్తాడు. దీంతో ఘర్షణ మొదలై హత్యలకు దారితీస్తుంది. కులం ప్రాతిపదికన పరువు హత్యలు భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో ఇప్పటికీ జరుగుతున్నాయి. పరువు హత్యలకు హేతువు కులాల మధ్య అంతరాలే. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య మరోసారి మన సమాజంలో ఉన్న కుల దురహంకారాన్ని బహిర్గతం చేసింది.
మన దేశంలో ఉత్తరాది రాష్ట్రాల్లో పరువు హత్యలు ఎక్కువ. హర్యానా, ఉత్తరప్రదేశ్, బిహార్, పంజాబ్ రాష్ట్రాల్లో ఎక్కడో ఒక చోట పరువు హత్యలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. అక్కడ గ్రామపెద్దలు ‘ఖాప్ పంచాయితీల’ను పెట్టి ప్రేమికులను దండిస్తుంటారు. సుప్రీం కోర్టు కూడా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని ఖాప్ పంచాయితీలపై కొరడా ఝుళిపించాలని చాలా సార్లు ఆదేశాలు జారీ చేసింది. పార్లమెంటులో ఇటీవల వెల్లడించిన వివరాల ప్రకారం 2014 నుంచి 2016 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా దాదాపు 288 పరువు హత్యలు జరిగాయి. పరువు హత్యలు లెక్కలేనన్ని జరుగుతున్నా, వీటిలో కొన్నింటిని సాధారణ హత్యల జాబితాలోకి చేర్చుతుంటారు.
మిర్యాలగూడలో పరువు హత్యను విశే్లషిస్తే ఈ కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలోకి వెళ్లింది. ఈ కేసులో పోలీసులు చురుగ్గా దర్యాప్తుచేసి నిందితులను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపారు. ఇక కాలక్రమంలో పోలీసులు అభియోగపత్రాన్ని దాఖలు చేయడం, కోర్టు విచారణ ఇవన్నీ మామూలే. నిందితులను పోలీసులు వీలైనంత త్వరగా అరెస్టు చేయడాన్ని నిజంగా అభినందించాలి. సమాజంలో కీర్తిప్రతిష్టలు దండిగా ఉన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ముడిపడి ఉన్న కేసు కావడం, హైదరాబాద్‌కు సమీపంలో మిర్యాలగూడ ఉండడం, టీవీ చానళ్లు కూడా ఈ కేసు వివరాలను బాగా ఫోకస్ చేశాయి. దురదృష్టవశాత్తు పిన్నవయసులోనే భర్తను కోల్పోయిన అమృతవర్షిణి అనేక సంచలనమైన విషయాలను నిర్భయంగా వెల్లడిస్తుండడంతో ప్రసార మాధ్యమాలు పోటీ పడి వార్తాకథనాలను అందించాయి. ‘జీవితం తెలివైన వాడికి ఒక కల, తెలివితక్కువ వాడికి ఒక ఆట, ధనవంతుడికి కామెడీ, పేదవాడికి ఒక విషాదం ’- అన్న మాటలు ఈ ఘటనకు అతికినట్లు సరిపోతాయి. ఈ ఘటనలో యువకుడైన ప్రణయ్ ప్రాణాలు కోల్పోవడం మిర్యాలగూడలో విషాదాన్ని నింపింది.
గుజరాత్ మాజీ మంత్రి హరేణ్ పాండే హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొని పదేళ్ల పాటు జైల్లో ఉండి వచ్చిన ఇద్దరు వ్యక్తులు ప్రణయ్‌ను అంతమొందించడంలో కీలకపాత్ర వహించారు. వీరికి బిహార్‌కు చెందిన మరో నేరగాడు తోడయ్యాడని పోలీసులు పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించి, 15 ఏళ్లపాటు అందరి నోళ్లలో నానిన హరేణ్ పాండే హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న వారు ఈ కేసులో ఉండడంతో మిర్యాలగూడ పరువు హత్య ఘటన సంచలనం సృష్టించింది. మీడియాతో పాటు రాజకీయ నేతలు కూడా పెద్ద ఎత్తున అమృత చికిత్స పొందుతున్న ఆసుపత్రికి క్యూ కట్టారు. ఆ యువతి వయస్సు 18 సంవత్సరాలు. ఇంకా బోలెడు భవిష్యత్తు ఉంది. పెద్ద చదువులు పూర్తి చేసి, ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు అవకాశం ఆమెకు ఉంది. సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం, డాక్టర్ రాజారామ్ మోహన్ రాయ్, ఈశ్వర దత్త విద్యాసాగర్, బాబా సాహెబ్ అంబేద్కర్ లాంటి మహనీయులు స్ర్తి విద్యకు, మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రబోధించారు. కానీ, అమృతను పరామర్శించిన ఒక రాజకీయ నాయకుడు చేసిన డిమాండ్ గురించి వింటే ఎవరికైనా మతిపోతుంది. ఆ రాజకీయ నాయకుడు మంచి మనస్సుతో ఆ డిమాండ్ చేసి ఉండవచ్చు. అమృతను ఏకగ్రీవంగా ఎన్నుకుని అసెంబ్లీకి పంపాలని, ఈ దిశగా రాజకీయ పార్టీలు కలిసి రావాలని ఆయన కోరాడు. ఎమ్మెల్యే కావాలంటే 25 ఏళ్ల కనీస వయసు ఉండాలి. ఆ విషయం వామపక్ష ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్న నేతలకు తెలియదా? అభం శుభం తెలియని వయసులో- కులపరమైన వ్యత్యాసాలకు, అహంకారానికి బలై భర్తను పొగొట్టుకుని పుట్టెడు దుఃఖంతో ఉన్న అమృతకు మన రాజకీయ వ్యవస్ధ ఇచ్చే సలహా ఇదేనా?.
కాగా, మిర్యాలగూడ పరువు హత్య ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటన గురించి మాట్లాడేందుకు సాదాసీదా జనం ఎలాంటి ఆసక్తి కనపరచలేదు. ఏం మాట్లాడితే ఏమవుతుందో, మళ్లీ ఈ తరహా ఘటనలు మన ఇళ్లలో చోటు చేసుకుంటాయన్న ఆందోళన అందుకు కారణం కావచ్చు. మధ్యతరగతి, ఉన్నత మధ్య తరగతి వర్గాల్లో కూడా ఈ ఘటనకు సంబంధించి పరిణామాలను తెలుసుకునేందుకు ఆసక్తికనపరిచారే కాని, చర్చించేందుకు ముందుకు రాలేదు. ఇందులో హత్యకు గురైన యువకుడు దళితుడు కావడం, పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్న అమృత అగ్రకులానికి చెందిన అమ్మాయి కావడం, ఈ కేసులో సూత్రధారి కోట్లకు పడగలెత్తిన ఆసామి కావడం వల్ల మిగతా సమస్యల మాదిరిగా చొరవగా చర్చించేందుకు ప్రజలు ఆసక్తి కనపరచలేదు. మనకు మనం నిర్మించుకున్న మానసిక పరమైన అడ్డుగోడల కారణంగా- నిర్మొహమాటంగా చర్చించేందుకు మధ్యతరగతి ప్రజలు వెనకాడారు. ఏ తండ్రినైతే ఎదిరించి ధైర్యంగా దళిత యువకుడిని పెళ్లిని చేసుకున్న అమృతలో మాత్రం అమాయకత్వం కనపడుతోంది. తండ్రిని శిక్షించాలని కోరుకుంటూనే, తండ్రి తన పేరుతో ఏర్పాటు చేసిన అమృత జీనియస్ పాఠశాలను ప్రణయ్ ఆశ్రమంగా, స్కూలుగా మారుస్తానని ఆమె పేర్కొన్నారు. ఇది మంచి ఆలోచనే. కాని తండ్రి ఆకాంక్షలకు విరుద్ధంగా నిర్ణయం తీసుకున్న ఆమె- కుటుంబ ఆస్తులపై నైతికంగా హక్కును వదులుకోవాల్సి ఉంటుంది. ఆస్తులన్నీ తన స్వార్జితమైతే తప్పనిసరిగా ఆమె తండ్రి తనకు ఇష్టమైన వారికి వీలునామా రాసే హక్కుంటుంది. భర్త మరణంతో విషాదంలో మునిగిన ఆమె కాలక్రమంలో అనేక విషయాలు నేర్చుకుని పరిణతితో వ్యవహరించవచ్చు. ఈ కేసులో మీడియా ఇకనైనా సొంత విచారణకు ఫుల్‌స్టాప్ పెట్టాలి. అమృతకు విశ్రాంతినివ్వాలి. నిందితుల సంగతిని చూసుకునేందుకు పోలీస్ వ్యవస్థ, కోర్టులు ఉండనే ఉన్నాయి.
పరువు హత్యల నిరోధానికి ప్రత్యేక చట్టాలు అంటూ లేవు. ఇదొక సామాజిక జాఢ్యం. దీనికి సంబంధించి పబ్లిక్‌గా మాట్లాడేందుకు రాజకీయ నేతలు, ఉద్యమకారులు, ప్రజా హక్కుల సంఘాల నేతలు ఇష్టపడరు. వీటితో ఓటు బ్యాంకు రాజకీయాలు ముడిపడి ఉంటాయి. పాఠశాలలకు, కాలేజీలకు వెళ్లే బాలికలు కచ్చితంగా ఫలానాడ్రస్సు వేసుకోవాలని, మొబైల్ ఫోన్లను వినియోగించరాదనే ఆంక్షలను కొన్ని చోట్ల సంబంధిత కుల, మత సంఘాల పెద్దలు విధిస్తుండడాన్ని చూస్తున్నాం. 2006లో ఒక పరువు హత్య కేసు ఘటనలో సుప్రీం కోర్టు తీర్పు ఇస్తూ- ‘ఈ తరహా హత్యల నిరోధానికి కఠిన చట్టాలు అవసరం ’ అని పార్లమెంటుకు గుర్తు చేసింది. ప్రజలకు చట్టానికి లోబడి తమకు ఇష్టమైనట్లుగా నడుచుకునే హక్కుంది. తన జీవిత భాగస్వామిని ఎన్నుకునే స్వేచ్ఛ వ్యక్తిగతమైంది. ప్రణయ్, అమృత కేసుకు వచ్చినంత ప్రాధాన్యత చాలా కేసులకు రాదు. మారుమూల ప్రాంతాల్లో ఈ తరహా ఘటనలు చాలా జరుగుతుంటాయి. కుటుంబ పెద్దలు తమ పెళ్లికి నిరాకరించారని ప్రేమికులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. ఒక్కోసారి తమ కుమార్తె లేదా కుమారుడు తలవంపులు తెచ్చారని కుటుంబంలో పెద్దలు ఆత్మహత్యలు చేసుకుంటారు.
సాంకేతికత నానాటికీ విస్తరిస్తున్నా, ఇప్పటికీ సామాజిక రుగ్మతల విష వలయంలో మనం చిక్కుకుని ఉన్నాం. వాస్తవంగా చెప్పాలంటే గత 30 ఏళ్లతో పోల్చితే కుల వ్యవస్థ బలంగా వేళ్లూనుకుంటోంది. ఈ వ్యవస్థ ఏమీ బలహీనపడలేదు. మనకు పాఠశాల, జూనియర్ కాలేజీ వ్యవస్థ నుంచి కౌమారంలో ఉన్న బాలబాలికలకు కౌనె్సలింగ్ ఇచ్చే వ్యవస్థలు లేవు. పెళ్లి వయసు రాకుండానే యువతీ యువకులు ప్రేమ పేరుతో దగ్గర కావడం సమంజసమా? అలాగే ఒక యువకుడు బాగా చదివి స్వయంకృషితో ఉద్యోగం సాధించలేకపోయినా- కుటుంబాన్ని పోషించే ఆర్థిక స్థోమత లేకపోయినా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకదు. ఈ విషయాలను ఎవరికివారు ఆలోచించి, తమ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సిందే. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వాలు పెద్ద ఎత్తున నిధులు ఖర్చుపెట్టి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయి. కాని సామాజిక రుగ్మతలను పారద్రోలేందుకు, మూఢనమ్మకాల భయాన్ని పొగొట్టేందుకు, సమాజంలో అందరూ ఒకటే అనే భావలను పెంపొందించేందుకు సరైన కౌనె్సలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. యువతీ యువకులు చదువుకునే వయస్సులో పెద్దలను ఎదిరించి వివాహం చేసుకోవడం, ఆర్థిక సమస్యలతో విడిపోవడం లేదా సమాజం వారిని దగ్గరికి తీసుకోకపోవడం తదితర కారణాల వల్ల నిండు ప్రాణాలను బలితీసుకుంటున్నారు. మహాత్మా గాంధీ, బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లు- ‘చదవడం, పోరాడడం’ లాంటి ఉదాత్త లక్ష్యాల సాధన దిశగా యువతను మళ్లించే వ్యవస్థను మనమే రూపొందించుకోవాలి.

-కె.విజయ శైలేంద్ర 98499 98097