మెయిన్ ఫీచర్

సిరులిచ్చే శ్రీమహాలక్ష్మి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఈశానాం జగతోస్య వేంకట పతేర్విష్ణోః పరాం ప్రేయసేం
తద్వక్షస్థల నిత్యవాసి రసికాం తక్షాంతి సంవర్థనీం
పద్మాలంకృత పాణిపల్లవ యుగాం పద్మాసన స్థాం శ్రీయం
వాత్సల్యాది గుణోజ్జ్వలాం భగవతీం వందే జగన్మాతరమ్’’
-శ్రీవేంకటేశ ప్రపత్తిః
‘శ్రీ’ అంటే పంచేంద్రియాలు. భగవంతుని క్షేత్ర దర్శన సంపద కళ్ళు. వినే సంపద- చెవులు. భగవదర్పిత సుగంధం ఆఘ్రాణించే సంపద- నాసిక. భగవంతుని గుణములను గానం చేసే సంపద- నోరు. భగవత్ మహిమను లీలలను, ఆయన కరుణా కటాక్షములను నిరంతరం చింతించే సంపద మనస్సు. ఈ అయిదు సంపదలు, మానవ దేహంలో, శిరస్సులో కేంద్రీకృతమై ఉన్నాయి. అదే మూల పదార్థం. అక్కడే వున్న సహస్రార చక్రంలో కుండలినీయోగ శక్తి ప్రస్ఫుటవౌతుంది. సహస్రారాంతర్గత చంద్రమండలంలో కుండలిని ప్రవేశించగానే అమృతధారలు వర్షిస్తాయి. ఇదే జీవబ్రహ్మైక్యస్థితి. ఆ స్థితిని ప్రసాదించే శ్రీ శక్తి- శ్రీమహాలక్ష్మి.
‘వ’కారం జ్ఞానశక్తి వాచకం, ‘ఇ’కారం ఇచ్ఛాశక్తి వాచకం, ‘కట’ అంటే కురిపించేది అని అర్థం. కనుక పంచేంద్రియాలతో శ్రీమంతమైన శ్రీగిరి శిఖర నివాసియై, సాత్వికేంద్రియాలన్నీ లక్ష్మీ సంపదకు రమణుడై జ్ఞాన ఇచ్ఛాశక్తులను నిండుగా ప్రవహింపజేసి, నిద్రాణమైన శక్తిని ప్రకటింపజేసి, ఉద్ధరించి, భక్తుల పాపములను పోగొట్టి, యిష్టార్థాలను ప్రసాదించువానిగా, ఈశుడైన వేంకటేశుని, శక్తివంతునిగా చేసింది శ్రీ మహాలక్ష్మి.
కనుకనే ‘‘సమస్త లోకములకు తల్లివైన ఓ లక్ష్మీదేవీ, శ్రీ విష్ణుమూర్తి అయిన శ్రీవేంకటాచలపతికి ప్రియమైన దానవై, అతని విశాల వక్షస్థలమున వసించి, విహరిస్తూ అతనికి సహనశక్తిని పెంపొందించే జగన్మాతా, మహాలక్ష్మీ నీకు నమస్కరించుచున్నామని’’, శ్రీ వేంకటేశ ప్రపత్తిలో, శ్రీలక్ష్మీదేవిని ప్రస్తావించి, శ్రీవేంకటేశ్వర సుప్రభాత సేవలో ప్రార్థించారు. ఇది ప్రతిరోజు పవిత్ర పుణ్యక్షేత్రమయిన కలియుగ వైకుంఠం- తిరుమలలో శ్రీ వేంకటేశ్వర సుప్రభాత సేవలో శ్రీ లక్ష్మీ అమ్మవారి పరంగా చేసే ప్రార్థన. అంతేకాదు, శ్రీ వేంకటేశ్వర స్వామిని ‘బాల’ శక్తిగా (బాలాజీ) భావించి దేశీ శరన్నవరాత్రుత్సవములలో, బాలశక్తికి బ్రహ్మోత్సవములు జరుపుటలో గల సామరస్యం విశదమవుతుంది.
ఈ విశ్వమంతా విష్ణుమయం. విశే్వశ్వరి - శ్రీమహాలక్ష్మి. విశ్వానికి విష్ణువుకు భేదం లేదు. అలాగే శ్రీ మహావిష్ణువుకి, శ్రీ మహాలక్ష్మికి తేడా లేదు. శ్రీ మహాలక్ష్మి- భోగరూంలో భవానిగా, రణరంగంలో దుర్గగా రౌద్రంలో మహాకాళిగా పుంభావ రూపంలో విష్ణువుగా భాసిల్లుతుంది.
మంచి పనులకు, మంచి ఆలోచనలకు- మహాలక్ష్మి కటాక్షం ఎప్పుడూ ఉంటుంది. శ్రీమహాలక్ష్మి సర్వదా చిరునవ్వు చిందించే ప్రసన్నవదన. పంచమి నాటి చంద్రకళలో మహాలక్ష్మీ వైభవం కనపడుతుంది. శ్రీపంచమి ఒక పర్వదినం. ఐదు సంఖ్య జీవితంలో ప్రాముఖ్యత వహిస్తుంది. అందుకే జగన్మాతను పంచహారతులతో అర్చిస్తారు. ఐదు సంఖ్యకు అధిపతి బుధుడు. బుధుడు విష్ణుపాదోద్భవుడు. విజ్ఞాన కారకుడు- బుధుడు. వ్యాపార వాణిజ్య కారకుడు కూడా. అందుకే బుధ అనుగ్రహం ఉన్నవారు ఉన్నత వ్యాపారం చేస్తారు. శ్రీ మహాలక్ష్మి కటాక్షం పొందుతారు.
‘‘కరాగ్రే వర్తతే లక్ష్మీః, కరమధ్యే సరస్వతి, కరమూలేతు శర్వాణీ, ప్రభాతే కరదర్శనం..’’ మన చేతి వేళ్ళు ఐదు. ఈ అయిదు వేళ్ళలో పంచబ్రహ్మలు, పంచభూతములు, పంచతన్మాత్రలు పంచేంద్రియములు ప్రతినిహితమై ఉంటాయని చెప్తారు. అరచేతిలో సరస్వతి, వేళ్లలో మహాలక్ష్మి ముంజేతిలో పార్వతిని వసిస్తారని, కనుక ఉదయానే్న నిద్ర లేవగానే చేతులు చూసుకుని, జగన్మాతను తలచుకని, రెండు చేతులూ కలిపి నమస్కారం చేస్తే ఆ రోజంతా శుభంగా జరుగుతుందని, త్రిమాతలే తమని ప్రభాత సమయంలో కొలిచిన బిడ్డలకు రక్షణ ఇస్తారని పెద్దలు చెప్తారు.
భక్తులకు సర్వదా కరుణా కటాక్షములను ప్రసాదించే కరుణామయి శ్రీ మహాలక్ష్మి. శరత్కాల పండు వెనె్నలలాంటిది శ్రీ మహాలక్ష్మి సాన్నిధ్యం. ఎందుకంటే చంద్రుడు లక్ష్మీదేవి-ఇద్దరూ క్షీర సాగర మథన సమయంలో ఆవిర్భవించినవారే. మంచి పనులకు, మంచి ఆలోచనలకు మహాలక్ష్మి కటాక్షం ఎప్పుడూ ఉంటుంది.
మహాలక్ష్మీదేవి ప్రేమ స్వరూపిణి, చిత్కళ. మనస్సే ఆ తల్లి వాక్కు. జగన్మాత చిదానందమే, ఆమె భక్తులకు ప్రేమామృతంగా భాసిల్లుతుంది. లక్ష్మీదేవి చంద్ర సహోదరి. లోకాల్ని ప్రేమ స్వరూపంతో పాలించే జగన్మాత శ్రీ మహాలక్ష్మి. లక్ష్మీదేవి కరుణా కటాక్షంతో అదృష్టం అర్ణవంలా పొంగిపొర్లుతుంది. సారహీనమైన ప్రపంచాన్ని అర్థవంతం చేసి, అర్థాన్ని ధర్మంతో అనుసంధానం చేస్తే, మోక్షాన్ని ప్రసాదించే ముక్తిప్రదాయిని, మోక్షలక్ష్మి- శ్రీ మహాలక్ష్మి. చంద్ర సహోదరి కనుక, తనను భక్తిశ్రద్ధలతో కొలిచేవారికి మానసిక ప్రశాంతతను ప్రసాదిస్తుంది. అందుకే చంద్ర మహర్దశ జరుగుతున్నపుడు, జాతకంలో చంద్రుడు సరియైన స్థానంలో లేనప్పుడు, లక్ష్మీ అష్టోత్తరంతో కుంకుమపూజ చేసి, ఆ కుంకుమను నుదుట పెట్టుకోమంటారు.
సూర్య తేజముగల, లక్ష్మీదేవి తప్ఫఃలంగా, పుష్పించకుండానే ఫలించే మారేడు వృక్షం పుట్టింది. అంతరింద్రియ బాహ్యేంద్రియములను దారిద్య్రాన్ని నశింపజేసే బిల్వ వృక్ష ఫలములు శ్రీదేవి అనుగ్రహము. మారేడు దళములు లక్ష్మీ స్వరూపం.
‘‘్ధనమగ్నిర్థనం వాయుః ధనం సూర్యోధనం వసుః ధనమింద్రో బృహస్పతి ర్వారుణం ధనమశ్నుతే’’ అన్నది శ్రీసూక్తం. అగ్ని వాయువు, సూర్యుడు, వసువు, ఇంద్రుడు, బృహస్పతి, వరుణుడు అను ఏడుగురు ‘్ధన’ శబ్దముచే చెప్పబడ్డారు. ధన శబ్దానికి అధిపతి, శ్రీ మహాలక్ష్మి. లౌకికమైన ధనముతోపాటు, అగ్ని మొదలగు వారి తేజోరూపమున ధనాన్ని కూడా ప్రసాదించే శక్తి- శ్రీ మహాలక్ష్మి. ‘‘ఆయుర్దా అగ్నే, అగ్నిర్మే వాచిశ్రీతః అనే వేద వాక్యమువలన, అగ్ని ఆయుర్దాన్ని, ఐశ్వర్యమును బలమును చేకూర్చేవాడు. జఠరాగ్నిని ప్రేరేపించి జీర్ణక్రియను సరిగా ఉంచి ఆరోగ్యాన్నిచ్చేవాడు, వాక్కును చేకూర్చేవాడు ‘వాయుర్మేప్రాణౌశ్రీతః’ వాయువు ప్రాణశక్తిని ప్రసాదిస్తాడు. ‘సూర్యోమే చక్షుషి శ్రీతః’ సూర్యుడు దర్శనశక్తిని, హృదయ శక్తిని ప్రసాదిస్తాడు. ‘‘వసువు శారీరక తేజస్సును యిస్తాడు’’. ఇంద్రోమే బలే శ్రీతః- ఇంద్రుడు బలాన్నిస్తాడు; బుద్ధికి అధిపతి బృహస్పతి. కనుక బుద్ధిబలముతో జ్ఞాన సంపదను అనుగ్రహించేవాడు బృహస్పతి. వరుణుడు- జలాధిపతి, శతృసంహారకుడు. కనుక వరుణునిచే జలశక్తి, శతృసంహారక శక్తి లభిస్తాయి. ఈ అగ్ని, వాయు, సూర్య, వసువు, బృహస్పతి, వరుణులందరూ- ఆ శ్రీ మహాలక్ష్మి అంశ. కనుక శ్రీమహాలక్ష్మి కటాక్షసిద్ధితో ఇవన్నీ లభిస్తాయి. ఆ దేవతల అనుగ్రహాన్ని పొందినవాడే అసలైన ధనవంతుడు, మహాలక్ష్మీ కటాక్షసిద్ధుడు.
‘పకృతి’ అన్నమాటను పదిహేను తత్త్వములుగల శ్రీమాతగా భావించి ఆధ్యాత్మిక సాధనలో శ్రీమాతను ఉపాసించి, ‘‘వేదాంత పంచదశి’ అనే గ్రంథాన్ని మనకందించిన శ్రీవిద్యోపాసనాసిద్ధుడు శ్రీ విద్యారణ్యస్వామి. విజయనగర సామ్రాజ్య స్థాపకుడై, ప్రజలు కాలవశాత్తు మిక్కిలి దారిద్య్రాన్ని అనుభవించటాన్ని చూసి, జాలి చెంది, లక్ష్మీదేవిని ప్రార్థించి ఉపాసన చేశాడు. తల్లి కటాక్షంతో సువర్ణ వృష్టి కురిసింది. ఇది శ్రీ లక్ష్మీ కటాక్ష సిద్ధిని స్వార్థరహితంగా, ప్రజోపయోగమునకు ఉపకరించిన సద్గురువులు శ్రీ విద్యారణ్యస్వామి. ఇది చరిత్ర చెపుతున్న లక్ష్మీ కటాక్షసిద్ధి.
మహాలక్ష్మీదేవిని ‘కనకధారాస్తవంతో’ స్తుతించి, పుణ్య....... దారిద్య్ర బాధను నివారించారు, జగద్గురు ఆదిశంకరాచార్యులు.
సూర్యచంద్రాగ్ని సమాన ప్రకాశ తేజోరాశి- శ్రీమహాలక్ష్మి. మనలో వుండే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములనే శతృవులను అణచి, భక్తులకు సద్బుద్ధినిచ్చి, పుత్ర పౌత్రాభివృద్ధిని ధనాన్ని పశుసంపదను అనుగ్రహించి దీర్ఘాయుష్మంతులుగా చేసే కరుణామయి శ్రీ మహాలక్ష్మి.
‘లక్షయతీతి లక్ష్మీః’ అని లక్ష్మీ శబ్దానికి వుత్పత్యర్థం. లక్షింపజేసేదేదో అది లక్ష్మి. జగజ్జనని లక్ష్మీదేవి ఎంత దారి చూపేదైనా ఆ మూల తత్త్వాన్ని అందుకొందామనే దీక్ష మనకి ఉండాలి. ఐహికమైన కోరికలు ఉంటే అవి సత్సంకల్పాలయితే, నిస్వార్థంగా ఉండి, నలుగురికి ఉపకరించేవైతే తల్లి ఆశీస్సులుంటాయి. ముముక్షువులై సేవిస్తే మోక్షలక్ష్మి. అందుకే సిద్ధి లక్ష్మి నుండి మోక్ష లక్ష్మివరకూ తల్లి అనుగ్రహమే.
‘‘సిద్ధ లక్ష్మీర్మోక్ష లక్ష్మీర్జయలక్ష్మీ స్సరస్వతీ, శ్రీలక్ష్మీ ద్వారలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదాః’’- తలచినంత మాత్రాన కోరికలను సిద్ధింపజేసే సిద్ధలక్ష్మిగాను, ముక్తిని అనుగ్రహించే మోక్షలక్ష్మిగాను, విజయాన్ని సిద్ధింపజేసే జయలక్ష్మిగాను, పద్మకాసారంలో ఉద్భవించి సంపదలిచ్చే శ్రీదేవిగాను, వరాలు ప్రసాదించే వరలక్ష్మిగాను విరాజిల్లుతున్న ఓ మహాలక్ష్మీ నీవు సర్వవేళలా నాయందు ప్రసన్న చిత్తముతో ఉందువు గాక అని జగన్మాతను ప్రార్థించటం జరిగింది శ్రీసూక్తంలో.
‘‘చంద్రాం హిరణ్మరుూం...’’ చంద్రుడిలా స్వచ్ఛమైనది, సౌమ్యమయినది, ఎటువంటి నామరూప వాసనామాలిన్యము లేనిది ఆ తల్లి. ఆ జగన్మాతను నా మనసులో ప్రవేశపెట్టి మహాలక్ష్మీదేవిని ఉపాసించేటట్లు చేయమని ప్రార్థిస్తున్నాం మనం, ఎవరిని? అగ్నిదేవుణ్ణి.
‘‘అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోదినీమ్
శ్రీయం దేవీ ముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతామ్’’- శ్రీసూక్తం.
గుఱ్ఱాలు ముందుంటే రథాలు మధ్యలో ఏనుగులు ఘీంకారం చేస్తూ వాటి వెనకాల నడుస్తుంటాయి. ‘ఇంద్రియాణి హయానాహుః’ అన్నది కఠోపనిషత్- ఇంద్రియాలే అశ్వాలు. ‘ఆశుగచ్ఛతీతి అశ్వః’ అతి వేగంగా పరుగెత్తేదేదో అది అశ్వం. అవి ఇంద్రియాలే. గుఱ్ఱాలీడ్చుకుపోతుంటే, ఇది కదిలిపోతుంది. రథమంటే మన శరీరం. ‘శరీరం రథమేవతు’. ఇంద్రియాలనే గుఱ్ఱాలీడ్చుకుపోతుంటే, ఇది కదిలిపోతుంది. అందుకే వాటి వెనకాలే మధ్యలో ఉంటుంది శరీరం.
‘హస్తినాద ప్రబోధినీం’- శరీరంకన్నా వెనకాల ఉన్నది- హస్తి అనగా ఏనుగు- మన అహంకారం. శరీరాన్ని మమకారంతో చూస్తోంది. దానికంటె ముందున్న ఇంద్రియాలనే అశ్వాలు దాన్ని రుూడ్చుకుపోయి విషయానుభవమిస్తున్నాయి, జీవుడికి. ఇది జీవుడికి వున్న సంసార బంధం. అహంకారమనే ఏనుగు ఆక్రందన చేస్తుంటే దాన్ని ప్రజ్వలింపజేస్తుంది మాయాశక్తి. అదే ‘హరిణి’. మనలను సంసారాభిముఖంగా హరిస్తుంది. అలా కాకుండా సాయుజ్యం వైపు తీసుకెళ్లాలి. దీనికి ‘శ్రీ’ కావాలి. ఆ శ్రీదేవినే ‘పహ్వయే’ మనలోకి ఆవాహనం చేసుకోవాలి. శరీరమనే రథ మధ్యస్థగు లక్ష్మియే చైతన్య లక్ష్మి. చెవులు మూసుకొంటే వినపడు నాదమే హస్తినాదం- అదే వేణునాదం-వీణానాదం- వేదనాదం- శంఖధ్వని. ఆ నాదం చేత నిరంతరం బోధింపబడుతున్న చైతన్య లక్ష్మిని ఆరాధిస్తే పరమాత్మను చేరుకునే సన్నిధి చూపిస్తుంది.
ఈ ఆరాధనతో మానవుడు ఇంద్రియాలను, తను చెప్పినట్లు నడుచుకొనేటట్లు చేసికొని, మనస్సును అదుపులో ఉంచుకొని, తన శరీర రూప రథాన్ని భగవంతుని వైపు త్రిప్పుకొని, సన్మార్గం వైపు మరలి పవిత్రులు అవ్వాలని హితవు చెపుతోంది శ్రీ మహాలక్ష్మి.
‘‘కమలజ కన్నతల్లి, కాముని గన్నతల్లి అమరుల గన్నతల్లి ఆదిమ లక్ష్మి విమలవు నీ పతికి విన్నపము సేసి మమ్ము నెమకి యేలితి దయ నీకే తగునమ్మా’’ అన్నాడు అన్నమయ్య; ‘‘మా జానకి చెట్ట బట్టగా మహారాజువైతివి’’ అని, ‘మా’ అంటే లక్ష్మీస్వరూపురాలైన జానకి అన్న భావాన్ని తెలియజేశాడు శ్రీ త్యాగరాజస్వామి. ‘‘మహాలక్ష్మి కరుణారస లహరి, ....... మాధవ మనోహరి మహావిష్ణు వక్షఃస్థలవాసిని, మహాదేవ గురు గుహ విశ్వాసిని, మహాపాప ప్రశమని, మనోన్మణి, మారజనని, మంగళప్రదాయిని- సదా నమస్తే మహాలక్ష్మీ అని కీర్తించాడు ముత్తుస్వామి దీక్షితులు, ముదావహంతో.
అర్థాన్ని ధర్మవర్తనతో పొంది, మరల అర్థాన్ని అర్థవంతంగా చేయటానికి ధర్మంతో కలిపి, లోక కల్యాణార్థం, ధర్మకార్యాచరణ చేసి, జీవితాన్ని సార్థకం చేసికోవాలని చెప్తోంది- శ్రీ మహాలక్ష్మి పూజ.
*

చిత్రం..నేడు శ్రీ మహాలక్ష్మి అలంకారం

-పసుమర్తి కామేశ్వర శర్మ 94407 37464