మెయిన్ ఫీచర్

జయజయహే మహిషాసుర మర్దిని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వాన్ని బ్రహ్మశక్తితో సృష్టిస్తుంది, జగన్మాత. సృష్టించిన ప్రపంచాన్ని విష్ణుశక్తితో రక్షిస్తుంది. ‘రుద్ర’ శక్తితో సకల చరాచర సృష్టిని సంహరిస్తుంది. ఒకప్పుడు సంహరించేందుకు బదులుగా, తన ఐశ్వర్య శక్తితో సృష్టిని తనలో లీనం చేసికొంటుంది. ఇదే- తిరోధానం. ఇది సంహారం కాదు, ఉపసంహారం. మరొకప్పుడు సదాశివ రూపంలో ప్రాణికోణినంతటిని అనుగ్రహిస్తుంది. ఈ విధంగా సృష్టి, స్థితి, లయ, ఉపసంహారం, అనుగ్రహం- జగన్మాత చేసే పంచమహత్కార్యాలు. దీనినే పంచబ్రహ్మలు సాధించే పంచకృత్యాలంటారు.

ఎవరికి ఏది ఇవ్వాలో అది వారి తత్త్వాన్ని అనుసరించి అందిస్తుంది. ముందుకా తల్లి తత్త్వాన్ని అర్థం చేసికొంటే, ఆ ‘తత్త్వాసనిని’ సమీపానికి చేరుకోగలుగుతాం. చివరకు ఆ తత్త్వ వెలుగును పొంది ‘సోహం’ భావంతో ‘తత్త్వమసి’ అయి వెలుగు శక్తిలో లీనమవుతారు భక్తులు. ఈ తత్త్వానే్న శ్రీదేవీ శరన్నవరాత్రి మహోత్సవములలో, తొమ్మిదవ రోజున పూజించే మహర్నవమి దేవత ‘మహిషాసుర మర్దిని’ వివరిస్తుంది.
కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు- ఆరు అరిషడ్వర్గములు- మన శరీరంలో ఉంటూ మన పతనానికి దారితీస్తాయి. వాటిని అదుపులో ఉంచుకొంటే నరోత్తముడు లేకపోతే పశువుకంటె హీనమైవాడు. కనుక ఇంద్రియాల్ని అదుపులో ఉంచుకొని, మనస్సును స్వాధీనంలో ఉంచుకోవటానికి ప్రయత్నిస్తూ, ధర్మవర్తనతో ఆనందాన్ని పొందాలి. అంతేకాని విశృంఖలంగా కామదాహాన్ని తీర్చుకోవటానికి ప్రయత్నిస్తే పతనమవుతాడు, అల్పాయుష్కుడవుతాడు. అధర్మాన్ని చూస్తూ ఊరుకోదు మహిషాసుర మర్దినీ మాత. ఇవన్నీ మనకు ‘సృష్టికర్త్రీ బ్రహ్మరూపా గోప్త్రీ గోవింద రూపిణీ, సంహారిణీ రుద్ర రూపా తీరోదానకరీశ్వరీ, సదాశివానుగ్రహదా పంచకృత్య పరాయణా’ అన్న లలితా రహస్య నామాలను తరచి దర్శిస్తే గోచరమవుతాయి.
‘‘అయిగిరి నందిని నందితమేదిని విశ్వ వినోదిని నందినుతే
జయ జయహే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే’’-
మానవులమైన మనమంతా మర్త్యులం. అనగా జన్మ మృత్యు జరావ్యాధులతో నిత్యమూ సతమతమవుతున్నాం. వీటి బారినుండి తప్పించుకొని బయటపడాలంటే, దేవతామూర్తులను ఆరాధించాలి. ఎందుకని? ఎందుకంటె వారికి ఆ బాధలు లేవు కాబట్టి. దేవీ దేవతలను ఆరాధిస్తే వారిలోని దివ్య గుణాలు, ధర్మమార్గం మనలో చోటుచేసుకుంటాయి. అందుకే పండగలూ పబ్బాలూ ఏర్పడ్డాయి. ఉత్సాహంతో జరుపుకుంటాం. పండుగ రోజుల్లో బంధు మిత్రులు కలుసుకొని ఆనందంగా గడిపినా, ఆంతర్యాన్ని తెలుసుకోవటం ముఖ్యం. అందులోనే విశేషముంది.
మనం శ్రీదేవీ శరన్నవరాత్రి మహోత్సవ పండగల్ని జరుపుకుంటున్నాం. ఈ రోజు మహర్నవమి, అనగా తొమ్మిదో రోజు. శరత్తంటే శరదృతువనే గాక, సంవత్సరమని కూడా అర్థం ఉంది. ‘జీవేమ శరదశ్శతమ్’ అన్నారు గదా. వివాహ సమయంలో మంగళసూత్రాన్ని కడుతూ చదివే మంత్రంలోను యిదే అర్థం. సంవత్సరం వసంత ఋతువుతో మొదలవుతుందని అనుకుంటాం, పండుగ చేసికుంటాం, పూర్వం శరదృతువులో సంవత్సరం మొదలుపెట్టేవారట. ఇవి రెండూ మనకి అనారోగ్యాన్ని యిచ్చే ఋతువులు. అనారోగ్యాన్ని పోగొట్టుకోవాలంటే, నిశ్చల మనస్సు పొందాలంటే ఆయా దేవతలను సేవించాలని దేవీ భాగవతం చెప్తోంది.
శరదృతువులో వచ్చే అనారోగ్యాన్ని పోగొట్టుకుని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందటానికి, నవరాత్రి ఉత్సవములు జరుపుకొంటున్నారు. ఈ రోజు మహర్నవమి. జగన్మాత మహిషాసురుణ్ణి సంహరించినరోజు.
‘మహిషాసుర దోర్వీర్యనిగ్రహాయైనమః’ అని, ‘తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా’ లిలతా నామములలోను, కపర్దినీ కలామాలా కామధుక్కామ రూపిణీ’ అని, జయ జయహే మహిషాసురమర్దిని శైలసుతే’ అని స్తుతింపబడే మాత- ‘మహిషాసుర మర్దిని’.
మహిషాసురుడు అనగా, వక్రబుద్ధి, క్రూరబుద్ధి కలవాడు అని అర్థమవుతుంది. అటువంటి దుష్టబుద్ధి కలవారి అజ్ఞానమును మర్దించి మహిష బుద్ధిని నశింపజేసి, జ్ఞానమును వివేకమును కలిగించు జ్ఞానదేవత, వేదమాత- మహిషాసురమర్దిని.
‘‘మహీం, మహం వాసీదన్తీతి మహిషాః అసురాః రాక్షసాః తాన్ మర్దయతీతి మహిషాసురమర్దినీ’’ భూమినీ ప్రజలను హింసించేవారు, లోకకంటకులైన రాక్షసులు. దుర్మార్గతతో భూదేవికి కూడా భారమైనవాళ్ళు రాక్షసులు. అటువంటి దుష్టశక్తులను మట్టుపెట్టు మహాశక్తి గనుకనే, జగన్మాతను ‘మహిషాసురమర్దిని’ అన్నారు.
కపర్దమనగా భాస్కర రాయ భాష్యము యిలా వివరించింది. ‘కం’ అనగా జలము, బ్రహ్మ, సుఖము అను అర్థాలున్నాయి. వానితో పూర్తిగా నిండియున్నది కపర్దము. అట్టి రమణీయమైన కపర్దమును ధరించిన జగదంబ, రమ్యకపర్దినీ అని స్తుతింపబడుతోంది. కపర్దమనగా జటాజూటము, వేద మంత్ర సమూహము. వైదిక జటలను అనగా ఘన, జట వేద మంత్రములు, మరొకర్థం. జడలను ధరించిన శివుడు కపర్ది. పార్వతి కపర్దినీ. ఇదీ రమ్యకపర్దినీ అంటే అర్థం.
పూర్వం ‘దనువు’ అనే రాక్షస రాజుకి- రంభుడు, కరంభుడు అనే యిద్దరు పుత్రులున్నారు. ఆ రాక్షస సోదరులిద్దరూ సంతానం కోసం తపస్సు చేశారు. కరంభుడు పంచనదమందున్న సరస్సులో దిగి, కంఠంలోతు నీళ్ళలో తపస్సు ప్రారంభించాడు. ఇంద్రుడు మకర రూపంలో వచ్చి కరంభుణ్ణి సంహరించాడు. ఇది న్యాయమా అని మనకు అనిపిస్తుంది. అది న్యాయమే. కరంభుడి సంకల్పం అమరుడై, దేవ ఋషి మానవులందరినీ హింసపెట్టటానికి తపస్సు ప్రారంభించాడు. మంచి సంకల్పంతో నలుగురికీ ఉపకరించే పని చేయడానికి కాదు. అటువంటివారి సంకల్పం నెరవేరితే అల్లకల్లోమవుతుంది. కనుక ఇంద్రుడు మకర రూపంలో సంహరించాడు. ఎదురుగా చెట్టుపైనుండి తపస్సు చేస్తున్న ‘రంభుడు’ ఇది సోదరుడు లేకుండా ఇంటికి వెళ్ళటానికి మనస్సు రాక బాధపడుతూ ఆత్మహత్య చేసికోవడానికి ఉద్యుక్తుడయ్యాడు. అగ్నిదేవుడు ప్రత్యక్షమయి ఆత్మహత్య మహాపాపమని హితబోధ చేసి, రంభుడు చేసిన తపస్సుకు సంతసించి కామరూపాన్ని ధరించేవాడు, ముల్లోకాలను జయించేవాడు అయిన పుత్రుణ్ణి పొందుతావని అనుగ్రహించాడు.

వరాన్ని పొంది, ఉత్సాహంతో వెడుతున్న రంభుడికి, యక్షుల సంరక్షణలోనున్న ఒక మహిషము కనపడింది. తదేకంగా దాన్ని చూచి, దానితో క్రీడించాలనే పశు రాక్షస నికృష్ట కోరిక కలిగింది. కామం ఎంత హేమయమైనదోగదా. దాని ఫలితంగా తాను మహిష రూపాన్ని దాల్చాడు. మహిష గర్భం దాల్చింది. రంభుడు మహిషాన్ని తీసికొని పాతాళలోకానికి వెడుతుండగా, వేరొక మహిషము సహజ సిద్ధముగానున్న పశుతత్త్వంతో, గర్భందాల్చిన మహిషాన్ని సంగమించటానికి వచ్చింది. రంభుడు అడ్డుకున్నాడు. మహిషములోని తీవ్ర కామము- క్రోధాన్ని ప్రేరేపించటంతో, తన వాడి కొమ్ములతో రంభుణ్ణి సంహరించింది.
రంభుని వలన గర్భం దాల్చిన మహిషి పాతాళమునుండి బయల్పడి యక్షులున్నచోటికి రాగా, యక్షుల బాణములతో మహిషాన్ని చంపి, రంభుని శరీరాన్ని, మహిష శరీరాన్ని దహనం చేశారు. ఆ మంటలయందు మరణిస్తున్న మహిషికి ఇద్దరు పుత్రులు కలిగారు. వారే మహిషాసురుడు, రక్తబీజుడు. కాలక్రమమున, బ్రహ్మచేత వరాన్ని పొంది, సాటిలేని మేటి పరాక్రమంతో, ముల్లోకాలను గడగడలాడిస్తూ ప్రజా పీడనంగా రాజ్యమేలుతున్నాడు మహిషాసురుడు. పురుషుల చేతిలో కాక స్ర్తిమూర్తి చేతన మహిషాసురుడు సంహరింపబడతాడని తెలిసికొని, దేవతలందరూ, ఆర్తితో శ్రీ భువనేశ్వరీ మాతను ప్రార్థించారు. తమ కష్టాలను జగన్మాతకు విన్నవించారు. త్రికాలాత్మకం త్రిగుణాత్మకం అయి, తేజ స్వరూపిణిగా, మహిషుని మంత్రులు సైన్యాధిపతులు అయిన తామ్రుడు, బిడాలుడు, ధూమ్రాక్షుడు, చక్షుడు, అసిలోముడు మున్నగువారినందరినీ సంహరించింది.
‘‘సురవర వర్షిణి దుర్థర ధర్షిణి, దుర్ముఖమర్షిణి హర్షరతే, దనుజ నిరోషిణి, దుర్మత శోషిణి, దుఃఖ నివారిణి, కిల్బిష మోషిణి మోహరతే జయ జయహే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే’’ అని దేవతలందరూ సోత్రం చేస్తుండగా, సింహవాహనమై, మహోగ్రరూపంతో ‘కాళీ’ శక్తిగా రక్తబీజుణ్ణి మహిషాసురుణ్ణి సంహరించింది జగన్మాత. మహిషాసుర మర్దిని సార్థక నామధేయురాలై, విజయవాడ ఇంద్రకీలాద్రిపై స్వయంభువుగా వెలసి, కనకదుర్గా నామంతో, భక్తకోటి అభీష్టాలను నెరవేరుస్తూ వెలుగొందుతున్నది.
మహిషాసుర మర్దిని వాహనం- సింహము. శతృవులను సంహరించేది సింహము. శౌర్య ధైర్య సాహసములకు చిహ్నం- సింహం. జగన్మాతకు వాహనమై మంత్రమయమై శతృ సంహారాత్మకమై ప్రవర్తించునది సింహం. ‘మృగాణాంచ మృగేం ద్రోహం’ అన్నారు శ్రీకృష్ణపరమాత్మ, భగవద్గీతలో. సంసార ఘోరారణ్యంలో చిక్కుకున్న భక్తుల్ని కాపాడటానికి, మద మాత్సర్యాది మత్త్భాల్ని అణచే శక్తికి ప్రతీకయే జగన్మాత వాహనమైన సింహం.
శక్తితత్త్వానికి పూర్ణముగా అభివ్యక్తమయినది- కాళీమూర్తి- కాళీమాత- కాల తత్త్వానికి సూచితం. మానవుని జ్ఞాన విజ్ఞాన ప్రణాళిక అంతా కాల విశేషము ద్వారా నిర్మితమయి, కాళీదేవియందే అనగా ‘కాల’ శక్తిలోనే లయమవుతుంది. రూపం అరూపంలో లీనమయితే, అది ‘నీలం’. రూపరహితమైన ఆకాశం- నీలం. ధర్మ స్వరూపుడైన శ్రీరామచంద్రుడు- నీలమేఘశ్యాముడు. దుష్టశిక్షణ శిష్టరక్షణమునకు అవతరించిన యోగీశ్వరేశ్వరుడు శ్రీకృష్ణుడు- నీలవర్ణం. కాళీమాత నీలవర్ణం.
సృష్టికి పూర్వం అంతా జలమయం, అంధకారమయం. ఈ మహాంధకారమే కాళీదేవి యదార్థరూపం. నీలవర్ణం- జగత్తుకు ఆదిరూపం. సృష్టికి పూర్వం ఉన్నది పరాశక్తియే, కాళీదేవియే అని చెప్తుంది కాళీపురాణం. నీల వర్ణాంతర్గత మహాసౌందర్యమే - మహాకాళి.
‘‘కాలానికి రాణి, సద్గుణ శీల, కీరవాణి త్రిలోకజనని దేవి’’ అన్న లయబ్రహ్మ శ్యామశాస్ర్తీ కీర్తన, ‘‘మహిషాసుర మర్దినీం నమామి మహనీయ కపర్దినీం, మహిష మస్తక నటన భేద వినోదినీం, మోదినీం మాలినీం, ప్రణత జన సౌభాగ్య జననీం’’ అన్న నారాయణి రాగకీర్తన, మహిషాసురమర్దిని మాంపాహి, మధ్య దేశ వాసిని అన్న ముత్తుస్వామి దీక్షితుల వారి గౌళరాగ కీర్తనలు, తొమ్మిదవ రోజు పూజకు స్ఫూర్తినిస్తాయి. ప్రాప్తించిన ‘శక్తి’ సంపదను లోకకల్యాణార్థం వినియోగించి ధర్మరీతితో, జీవనం చేయాలని, మహిషాసుర మర్దినీ పూజ హెచ్చరిస్తోంది.

--పసుమర్తి కామేశ్వరశర్మ 94407 37464