మెయన్ ఫీచర్

ఇపుడు దేశానికి ఏమైంది...?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంట్లో వేగంగా నఢుచుకుంటూ పరుగెత్తుతున్న కొడుక్కి అడ్డుగా ఉన్న బకెట్ తగిలింది. అక్కడే ఉన్న తండ్రి ‘కళ్లు కన్పించడం లేదా! చూసుకొని వెళ్లక్కర్లేదా?’ అని కొడుకుపై అరిచాడు. ఓ వారానికి అదే తండ్రి నడుచుకుంటూ వెళ్తుంటే అదే బకెట్ కాలికి తగిలింది. వెంటనే అక్కడున్న కొడుకును ‘ఎవడ్రా! ఇక్కడ బకెట్ పెట్టింది?’ అని తిట్టాడట. ఈ తండ్రి స్వభావం ఇపుడు చంద్రబాబులో కన్పిస్తుంది. తాను చేసిందే గొప్ప విషయం. తనకు శత్రువులైతే లోకానికి శత్రువులు కావాలి. తనకు మిత్రులు అయితే అందరికీ మిత్రులు కావాలి- ఇదీ ఆయన సిద్ధాంతం.
ఎన్టీఆర్ ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి టి.అంజయ్యను రాజీవ్‌గాంధీ అవమానిస్తే, నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి సాక్షాత్తూ ఎన్టీఆర్‌నే అవమానించినందుకు తెలుగుదేశం పుట్టిందని అంటారు. నిజానికి తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం ఓ సంచలనం. అది బాబు చేతికొచ్చాక కమ్యూనిస్టు పార్టీ-2గా మారిపోయింది. భారతదేశంలో ఎప్పుడూ కమ్యూనిస్టులు ‘గద్దె దించడం’ ఓ పనిగా పెట్టుకొంటారు. ఒకప్పుడు కాంగ్రెస్‌ను గద్దెదించేందుకు నడుంకట్టారు. ఇపుడు నరేంద్ర మోదీ గద్దెనెక్కిన మరుసటి రోజు నుండి ఎలా సీటు ఖాళీచేయించాలని ఆలోచిస్తున్నారు. అయితే కమ్యూనిస్టు పార్టీలకు ‘గద్దెదింపడం’ ఓ సిద్ధాంతం. వాళ్లు అధికారంలో లేని ప్రతీచోట ప్రభుత్వాలను, సమాజాన్ని అస్థిరపరచడం, దుష్ప్రచారం చేయడం ఓ ప్రోగ్రాంగా కొనసాగిస్తారు. అయితే చాలాసార్లు ఈ డెబ్భై ఏళ్లలో ఎన్నోసార్లు తప్పులు చేయడం వాటిని గురించి తర్వాత పునరాలోచన చేసి లెంపలేసుకోవడం వాళ్లకు పరిపాటి. వాటిని ‘చారిత్రక తప్పిదాల లిస్ట్’లో చేర్చేస్తారు.
ఇటీవల చంద్రబాబు కూడా ఆ కోవలోనే నడుస్తారు. తాను తెలుగుదేశం పార్టీ బాధ్యతలు చేపట్టినప్పటినుండి ఎవరో ఒకరితో పొత్తులేకుండా అధికారంలోకి వచ్చిన పాపాన పోలేదు. ఓసారి కమ్యూనిస్టులతో మరోసారి బీజేపీతో, ఆఖరుకు టీఆర్‌ఎస్‌తో కూడా పొత్తు పెట్టుకొన్నారు. ఇపుడు కాంగ్రెస్‌తో కూడా పొత్తుపెట్టుకున్నారు. ఇక వైయస్‌ఆర్ సీపీతో కూడా పొత్తుపెట్టుకుంటే సంపూర్ణం అవుతుంది. భవిష్యత్తులో ఏపీలో భాజపా బలపడ్డాక అదికూడా జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇటీవల రాత్రికిరాత్రి పార్టీలు మారిన ఎమ్మెల్యేలను ప్రజలు అంగీకరిస్తున్నారు. గెలిపిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ఒక దుష్పరిణామం!? అలాగే పార్టీలు రాత్రికిరాత్రి కూటమి మార్పులు చేస్తున్నా ప్రజలు అంగీకరిస్తారు. అదేం పెద్ద విషయం కాదు. శాశ్వత రాజకీయ శత్రువులు గానీ, శాశ్వత రాజకీయ మిత్రులు గాని ఉండరని ఎవడో ఈ దేశంలో ఓ దిక్కుమాలిన సిద్ధాంతం కనుక్కున్నాడు. అదే ఈ ‘వంగుడు-దూకుడు’ ఆటకు మూలం.
ఈ రాత్రికి రాత్రి జంప్ జిలానీలకు ‘ప్రజాస్వామ్య పరిరక్షణ, మతతత్వంపై యుద్ధం, దేశాన్ని రక్షించడం’ అనే నినాదాలు కలసివస్తాయి. సరిగ్గా చంద్రబాబు గతంలో కమ్యూనిస్టులు వాడిన నినాదాలే ఎత్తుకొని నలభై ఏళ్ల ఇండస్ట్రీ అహంభావం ప్రక్కనబెట్టి రాహుల్‌తో చేతులు కలిపాడు. దానికి తెలుగు బాకాలు దేశాన్ని ఏకంచేసే ‘‘అపర బిస్మార్క్’’ బయల్దేరాడని వాయించడం మొదలుపెట్టాయి. చంద్రబాబు ఇటీవల రెండుసార్లు ఢిల్లీవెళ్లి కలసి 15 పార్టీలని చెప్పుకొంటున్న ‘మోదీ వ్యతిరేక గుంపు’ క్రొత్తగా ఈయన సృష్టించిందేంకాదు. వాళ్లంతా గత 18 ఏళ్లనుండి మోదీ వ్యతిరేక జపం చేస్తున్నవారే. బాబుగారు కలిసిన ఈ పార్టీల నేతలు ఎప్పటినుండో మోదీని వ్యతిరేకిస్తూ మోదీని గుజరాత్‌నుండి వెళ్లిపోవాలని గట్టిగా అరిచి గీపెట్టినవారే. వాళ్లకోరిక మేరకు మోదీ గుజరాత్ వదలి ఢిల్లీకి వచ్చాడు. ఇపుడు క్రొత్తగా ఈ కూటమిలో చేరింది చంద్రబాబు మాత్రమే. పోనీ మోదీ ప్రక్కనున్న వాళ్లను ఎవరినీ బాబు తన వెంట తీసుకెళ్లలేదు. దానికే దేశం బ్రద్దలైపోయినట్లు తెలుగుమీడియా ప్రచారం చేసినా నేషనల్ ఛానళ్లు ఒక్కటి కూడా దీన్ని పట్టించుకోలేదు. విచిత్రం ఏమిటంటే ఇటీవల కొన్నాళ్లవరకు కేసీఆర్ అహంభావం, మోనర్కిజంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు బాగా ప్రచారంచేసి, విస్తృతంగా ప్రచారం చేసారు. ఒక రకంగా అది కేసీఆర్‌కు ఇబ్బందికరంగా మారింది. కానీ చంద్రబాబు కాంగ్రెస్‌తో కలవడంవల్ల మళ్లీ కేసీఆర్‌కు కాంగ్రెస్‌ను ఆత్మరక్షణలో పడేసేందుకు గొప్ప ఆయుధం దొరికింది. చంద్రబాబుతో పొత్తు తెలంగాణ కాంగ్రెస్‌కూ లాభం లేదు. ఆంధ్రా కాంగ్రెస్‌కు లాభం లేదు. ఈ పొత్తును ఆంధ్రాలో వట్టి వసంతకుమార్, సి.రామచంద్రయ్య లాంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులు వ్యతిరేకించి రాజీనామాచేసారు. కానీ తెలంగాణ కాంగ్రెస్ వౌనంగా ఉండిపోయింది. నిజానికి ఇక్కడున్న ఐదు ఆరు సీట్లలో అదీ ముఖ్యంగా ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి లాంటి కొందరి నియోజకవర్గాల్లో మాత్రమే తెలుగుదేశం ఉనికి ఉంది. నాయకులు సరిగ్గా లేనిచోట క్యాడర్ ఎప్పుడో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల్లోకి వెళ్లిపోయింది. ఇపుడు చంద్రబాబుతో కలవడంవల్ల కాంగ్రెస్‌కు నష్టం మొదలయ్యింది. ఇన్నాళ్లు కాంగ్రెస్‌ను ఎలా ఎదుర్కోవాలని చూస్తున్న కేసీఆర్‌కు చంద్రబాబు రూపంలో ఓ మంచి అస్త్రం దొరికింది. ఈ వారంలో టీఆర్‌ఎస్ ప్రచారమంతా దానిపైనే జరిగింది.
తాను కాంగ్రెస్‌తో కలవడానికి బాబు ‘‘విశాల దేశ ప్రయోజనాలు, ప్రజాస్వామ్య పరిరక్షణే కారణం’అంటున్నాడు. అసలు ఇపుడు దేశానికి ఏమైంది. వంశ పాలనతో నరేంద్ర మోదీ దేశాన్ని ఏమైనా కుటుంబపరం చేసాడా? వ్యవస్థలన్నీ నాశనం అయ్యాయి అంటూ సిబిఐలోని అంతఃకలహాలు ఉదాహరణగా చూపిస్తున్నారు. ఒక వ్యవస్థలో జరిగే చిన్నచిన్న సంఘటనలకు ప్రధాని బాధ్యత వహిస్తాడా? అలాగే మొన్న శ్రీకాకుళంలో జరిగిన మావోయిస్టు దాడికి చంద్రబాబు బాధ్యత వహిస్తాడా? 20కి పైగా వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలను, నాయకులను అక్రమంగా పార్టీలో కలుపుకొని పాలించే చంద్రబాబు రాజ్యాంగ పరిరక్షకుడా? దేశానికి ఏదో జరిగిందని 2014కి ముందు ఇలాగే ప్రచారం చేసి మోదీ వేవ్‌ను ఉపయోగించుకొని సీఎం పదవిలో కూర్చొన్నాడు. బీజేపీ యేతర రాష్ట్రాలైన ఒరిస్సా, తమిళనాడు, కర్ణాటక ఆఖరుకు కమ్యూనిస్టులు పాలించే కేరళ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయని ఆరోపణలు చంద్రబాబు చేస్తూ దేశాన్ని రక్షిస్తానని చెప్పడం హాస్యాస్పదం. ఎవరినీ వ్యక్తిగత స్వార్థప్రయోజనాలకు రాజకీయ రంగులు మార్చి విలువలకు తిలోదకాలిస్తే ఇపుడు దేశంలో కమ్యూనిస్టులకు పట్టిన గతే బాబుకు పడుతుంది.

-శ్రీ కౌస్త్భుభా bhaskarayogi.p@gmail.com