మెయన్ ఫీచర్

అందరికీ అందుబాటులో వైద్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశంలోలా కాకుండా సింగపూర్‌లో అమల్లో ఉన్న ఆరోగ్య వైద్య విధానం కింద, ఆ దేశంలోని ప్రతి వ్యక్తికీ, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ, ఆసుపత్రి వైద్యం, దీర్ఘకాలిక ఆరోగ్య పరిరక్షణ, తదితర సంబంధిత కార్యక్రమాలు ఒక క్రమ పద్ధతి ప్రకారం చేపట్టి అమలు చేస్తారు. ప్రభుత్వ - ప్రైవేట్ రంగంలో అనేక ఔట్ పేషంట్ - ఇన్ పేషంట్ క్లినిక్‌లు, పాలీ క్లినిక్‌లు, ఆసుపత్రులు, సింగపూర్‌లోని పౌరులకు - విదేశీయులకు వారి - వారి అవసరాలకు అనుగుణంగా, నాణ్యమైన వైద్య సౌకర్యం కలిగిస్తాయి. సింపూర్‌లో నూటికి ఎనభై శాతం మేర ప్రాథమిక వైద్య సౌకర్యం సుమారు 2000 వరకూ వున్న ప్రైవేట్ ఆసుపత్రులలో లభ్యమవుతుంది. ప్రభుత్వ పరమైన పాలీ క్లినిక్‌లు కేవలం 18 మాత్రమే. భారతదేశంలో ప్రైవేట్ రంగంలో ఎక్కువగా స్పెషాలిటీస్ -సూపర్ స్పెషాలిటీస్ సౌకర్యం మాత్రమే ఉంటుంది. ప్రాథమిక వైద్య సౌకర్యం దాదాపు లేనట్లే. సింగపూర్ ప్రభుత్వ ఆసుపత్రులలో 80 శాతం స్పెషాలిటీస్-సూపర్ స్పెషాలిటీస్ సౌక ర్యం దొరుకుతుంది. ఆసుపత్రి పడకల సంఖ్య- సుమారు 80శాతంకు పైగా, కూడా ప్రభుత్వ రంగంలోనే అధికం. ప్రైవేట్ ఆసుపత్రులలో కేవలం 20 శాతం మాత్రమే! డాక్టర్ల సంఖ్య కూడా అంతే. ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేసేవారి సంఖ్య 80 శాతం కాగా, ప్రైవేట్ రంగంలో 20 శాతం మంది మాత్రమే వున్నారు.
భారతదేశంలోని పలు రాష్ట్రాలలో మరో పెద్ద సమస్య, అందునా ముఖ్యంగా మధ్య తరగతి ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్య అందుబాటులో లేని రోగ నిర్ధారణ పరీక్షల చార్జీలు, ఈ పరీక్షలన్నీ ప్రైవేట్ రంగంలోనే లభిస్తాయి. కొన్ని పరీక్షలకయ్యే ఖర్చు మరీ ఎక్కువ. ఉదాహరణకు ‘పెట్’ స్కాన్ అనే రోగ నిర్ధారణ టెస్ట్‌కు రూ.20,000కు పైగా అవుతుంది. అలానే ఎంఆర్‌ఐ పరీక్షకు రూ.10,000 అవుతుంది. ఇలాంటివన్నీ ప్రభుత్వమే సరసమైన ధరలకు చేసేలా చర్యలు చేపట్టాలి. ఈ నేపథ్యంలో, సింగపూర్ వైద్య - ఆరోగ్య వ్యవస్థ నుంచి కొన్ని విషయాలు తెలుసుకుని అమలు చేస్తే మంచిదేమో.
1965లో సింగపూర్‌కు స్వాతంత్య్రం లభించిన కొద్ది రోజుల్లోనే, అప్పటికే దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న అంటువ్యాధులను ముందస్తుగానే అరికట్టే ప్రక్రియ ఆరంభమైంది. పెద్ద ఎత్తు న ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. దరిమిలా, భవిష్యత్‌లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్త పడేందుకు 1983లో జాతీయ ఆరోగ్య విధానాన్ని రూపొందించింది. రాబోయే 20 సంవత్సరాలలో చేపట్టి అమలుపర్చాల్సిన ఆరోగ్య రంగంలో వౌలిక సదుపాయాల కల్పన గురించి ఒక నిర్దుష్ట కా ర్యక్రమాన్ని రూపొందించింది. ఏటేటా ఆ కార్యక్రమాన్ని సమీక్షించి తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతోంది.
సింగపూర్ ఆరోగ్య వైద్య విధానంలో అత్యంత కీలకమైన ‘‘మెడి సేవ్’’ - వైద్య పొదుపు పథకానికి నాంది పలికింది. సింగపూర్‌లో మూడు విభాగాల ఆరోగ్య వైద్య నియంత్రణ వ్యవస్థలున్నాయి. మొదటిది ఆరోగ్య మంత్రిత్వ శాఖ, రెండోది కేంద్రీయ భవిష్యత్ నిధి, మూడోది సింగపూర్ మానిటరీ అథారిటీ. ఆరోగ్య సంరక్షణ సేవల పూర్తి పర్యవేక్షణ బాధ్యత మంత్రిత్వ శాఖదే. పొదుపు పథకాన్ని అమలుపర్చాల్సిన బాధ్యత భవిష్యత్ నిధిది. సింగపూర్ పౌరులందరూ - శాశ్వత నివాసీయులందరూ, వర్తమానంలోను, భవిష్యత్‌లో పదవీ విరమణ చేసిన తరువాత ముసలితనంలోను, తమ పోషణ బాధ్యత - ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాలలో, తామే విజయవంతంగా తమపై వేసుకునే విధంగా భవిష్యత్ నిధి చర్యలు తీసుకుంటుంది. బీమా రంగానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలను క్రమబద్దీకరించి, బీమాదారులెలాంటి ఇబ్బందులకు గురి కాకుండా- వారి ప్రయోజనాలను కాపాడే బాధ్యతను, సింగపూర్ కేంద్రీయ బ్యాంక్ లాగా, మానిటరీ అథారిటీ వ్యవహరిస్తుంది. ఈ మూడు వ్యవస్థలు పరస్పరం సహకరించుకుం టాయ.
సింగపూర్ మొత్తంలో, పదమూడు ప్రైవేటు ఆసుపత్రులు, పది ప్రభుత్వ ఆసుపత్రులు, అనేక స్పెషలిస్ట్ క్లినిక్‌లు వున్నాయి. ఒక్కో చోట ఒక్కో రకమైన చార్జీలు అమల్లో ఉన్నాయి. రోగులు తమకిష్టమైన సౌకర్యాన్ని ఎంచుకోవచ్చు. ఎప్పుడంటే అప్పుడు, తాను వెళ్లదల్చుకున్న ప్రభుత్వ - లేదా - ప్రైవేట్ ఆసుపత్రికి కాని, పాలీ క్లినిక్‌కు కాని వెళ్లవచ్చు. ఎమర్జెన్సీ సేవలైతే 24 గంటలు అందుబాటులో వుం టాయి. ప్రభుత్వ - ప్రైవేట్ ఆసుపత్రులన్నీ కూడా అధునాతన వైద్య సదుపాయాలను కలిగి వుంటాయి. అక్కడా - ఇక్కడా కూడా అత్యున్నత వైద్య ప్రమాణాలను పాటిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం, ఎప్పుడో, 2000 సంవత్సరం నాటికే సింగపూర్ ఆరవ ర్యాంకు సంపాదించింది. శిశు మరణాల విషయంలో అత్యంత తక్కువ శాతం సింగపూర్‌లోనే, ప్రసూతి మరణాలు దాదాపు లేనట్టే.
ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణా విధానంలో మూడు రకాలున్నాయి. మొదటిది ‘‘మెడిఫండ్’’. దీని ద్వారా, తమంతట తాము ఎలాంటి పద్ధతిలోను వైద్య ఖర్చులు భరించలేని వారికి ఆరోగ్య సంరక్షణ ప్రభుత్వమే కలిగిస్తుంది. ఇదొక రకమైన శాశ్వత నిధి. రెండోదైన ‘‘మెడిసేవ్’’ ద్వారా, దాదాపు 85 శాతం మంది జనాభాకు ప్రయోజనం చేకూరుతుంది. ఇదొక రకమైన నిర్బంధ పొదుపు విధానం. మూడోదైన ‘‘మెడిషీల్డ్’’ కింద ప్రభుత్వమే ఒకరకమైన ఆరో గ్య బీమా పథకం అమలు పరుస్తుంది. నిర్బంధ పొదుపు ద్వారా, సబ్సిడీ విధానం ద్వారా, ధరలు అదుపు చేయడం ద్వారా, మెడిషీల్డ్ అమలు సులభతరమవుతుంది. అన్నింటిలోకి ప్రధానమైంది ‘‘మెడిసేవ్’’. ఇది మరొక రకమైన జాతీ య ఆరోగ్య బీమా ప్రణాళిక. మెడిసేవ్ పథకాన్ని ఏప్రిల్ 1984లో, జాతీయ వైద్య పొదుపు గణాంక పద్ధతిన ప్రవేశపెట్టింది ప్రభుత్వం. తక్షణం ఆసుపత్రిలో చేరడానికి, ఔట్ పేషెంట్ విభాగంలో చికిత్స పొందడానికి, డే సర్జరీకి ఈ పొదుపు ఖాతాను ఉపయోగించవచ్చు. ప్రతి ఉద్యోగి తమ ఆదాయంలో, వారి - వారి వయసుకు అనుగుణంగా, 6.5 - 9.0% మేరకు, తమ వ్యక్తిగత మెడిసేవ్ అకౌంట్‌లో జమ చేస్తారు. అలా పొదుపు చేసిన డబ్బు నుంచి, వైద్య - ఆరోగ్య బిల్లులు చెల్లించవచ్చు. సింగపూర్‌లో నిరుద్యోగం కేవలం రెండు శాతం లోపే. అంటే, దాదాపు అందరికీ పొదుపు చేసే వీలుంటుంది. ఒక కుటుంబంలో ఒకరికంటే ఎక్కువమంది పొదుపు ఖాతాదారులైతే, వారందరిదీ పూల్ చేసి కుటుంబ అవసరాలకు వాడుకోవచ్చు.
సింగపూర్ జాతీయ ఆరోగ్య ప్రణాళిక ప్రాథమిక సూత్రం ప్రకారం, ‘‘ఉచితం’’ అనే ప్రసక్తే లేదు. ఏదీ-ఎవరికీ ఉచితం కానే కాదు. అలాగే, ఎవరికీ-ఎట్టి పరిస్థితుల్లోను, ఆరోగ్య, వైద్య సేవలను నిరాకరించే ప్రసక్తే లేదు. పేషెంటు దగ్గర ఫీజు మొత్తాన్ని, మందులతో సహా, డిశ్చార్జ్ చేసేంతవరకు వసూలు చేయరు. వాళ్లు బిల్లు చెల్లించినా, చెల్లించ లేకపోయినా డిశ్చార్జ్ నిలుపుదల చేయరు. ఫీజు చెల్లించకుండా వెళ్లిన వారి విషయంలో, అది రాబట్టుకొనేందుకు వేరే యంత్రాంగం తరువాత కృషి చేస్తుంది కాని కట్టేంతవరకు డిశ్చార్జ్ చేయమని అనరు. ఫీజు కట్టకుండా వెళ్లిపోయే వారు ఒక శాతం లోపే. వైద్య ఖర్చులు వారి - వారి స్థాయి సబ్సిడీని పట్టి వున్నప్పటికీ, ‘‘ఔట్ - ఆఫ్ - పాకెట్’’ వ్య యం మాత్రం స్థాయిని బట్టి మారుతుంటుంది. ఎక్కువ స్థాయి సబ్సిడీ లభించే వారికి ‘‘ఔట్ - ఆఫ్ - పాకెట్’’ ఖర్చులు కూడా ఎక్కువగానే వుంటాయి. తక్కువ వారికి అంతగా వుండవు. మొత్తం మీద వారికీ - వీరికీ చివరకు పడేది దాదాపు ఒకే రకం భారం. క్రమేపీ పెరుగుతున్న ప్రైవేట్ రంగం వైద్య సేవలను ఎక్కువగా, ప్రైవేట్‌గా బీమా చేయించుకున్న వారు, విదేశీయులు, ఖర్చు భరించగల శక్తి వున్న వారు, ‘‘ఔట్ - ఆఫ్ - పాకెట్’’ ఖర్చుకు భయపడని వారు, ఉపయోగించుకుంటున్నారు. ఎంతగా ప్రైవేటు రంగం విస్తరిస్తున్నప్పటికీ, ఇప్పటికీ, 70-80 శాతం మంది సింగపూర్ దేశీయులు ప్రభుత్వ పరంగానే వైద్య సేవలను పొందుతున్నారు.
సింగపూర్ జనరల్ ఆసుపత్రి- ఎస్.జి.హెచ్., ఆ దేశం మొత్తంలో, అతి పెద్ద - పురాతనమైన ఆసుపత్రి. దాని పునాదులు 1821లో వేశారు. ‘‘సింగ్ హెల్త్’’ అనే పేరుతో, ఆ గొడుగు కింద, ప్రభుత్వ రంగంలోని అనేక స్పెషలిస్టు ఆసుపత్రులు నడుస్తున్నాయి.ఎస్.జి.హెచ్‌లో సుమారు 600 మందికి పైగా వైద్యులు, 29 క్లినికల్ స్పెషాలిటీల్లో పని చేస్తున్నారు. ప్రతి పేషెంటుకు వ్యక్తిగతంగా వారి - వారి వైద్య అవసరాలకు అనుగుణంగా, నిబద్ధతతో పనిచేస్తారీ డాక్టర్లు. ఎమర్జెన్సీ కేసుల విషయంలో తప్ప, మామూలు పరిస్థితుల్లో పేషెంటును ఆసుపత్రిలో చేర్చుకోవాలంటే, ఆ అవసరం వున్నదని, ఎవరో ఒక స్పెషలిస్ట్ సూచించాలి. అడ్మిషన్ డేట్ తేలిన తరువాత, ముందస్తు జాగ్రత్తలెన్నో పేషెంటుకు వివరిస్తారు. వాళ్లకు ఏ రకం సబ్సిడీ లభిస్తుందో, ఆ స్థాయికి తగ్గ గదులనే కేటాయిస్తారు. అడ్మిషన్‌కు ముందుగానే, ఫీజు చెల్లించే విధానం, అవసరమైన డాక్యుమెంట్ల విషయంలో, అందాజాగా ఫీజు మొత్తాన్ని సవివరంగా తెలుపుతారు.
సింగపూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో కాని, ప్రభుత్వ స్పెషలిస్ట్ కేంద్రాలలో కాని, పాలీ క్లినిక్‌లో కాని, చికిత్సకు వెళ్లిన వారి క్లినికల్ పరీక్షల వివరాలను, ‘‘నేషనల్ ఎలెక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ సిస్టం’’ అనే పేరుతో, ఒక సెంట్రలైజ్డ్ డాటా బేస్ ఏర్పాటుచేసింది ప్రభుత్వం. పేషెంట్ మెడికల్ హిస్టరీ మొత్తం ఒకే చోట భద్రపరిచి, కంప్యూటర్‌కు అనుసంధానం చేశారు. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న అన్ని రకాల ఆరోగ్య కేంద్రాలు ఒకే గొడుగు కింద పనిచేసే ఈ విధానంవల్ల, ఒకసారి ఒకచోట క్లినికల్ టెస్టులు చేయించుకున్న పేషంటు, ఇంకో స్పెషలిస్ట్ దగ్గరకు వెళ్లినప్పుడు, ఆయన దగ్గర కంప్యూటర్లో ఇవి చూసే వీలుంటుంది. మళ్లీ- మళ్లీ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదు.
సింగపూర్ జనరల్ ఆసుపత్రిలో ఇరవై నాలుగు గంటలు పనిచేసే ఎమర్జెన్సీ శాఖలో, ప్రతి షిప్ట్‌లోను, ఒక సీనియర్ ఎమర్జెన్సీ ఫిజిషియన్ తప్పనిసరిగా పనిచేస్తుంటారు. సింగపూర్లో అత్యవసర వైద్య సహాయ సేవలను, ‘‘ఎమర్జెన్సీ అంబులెన్స్ సర్వీస్’’ పేరుతో, ‘‘సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్’’ నిర్వహిస్తుంది. ఆంధ్రపద్రేశ్‌లో 108 సేవలవలెనే, ఇక్కడ 995 నంబర్‌కు ఫోన్ చేసి ఈ సేవలను పొందవచ్చు. జీవన్మరణ సమస్య తలెత్తినప్పుడు మాత్రమే 995 నంబర్‌కు ఫోన్ చేసి సహాయం కోరాలి. ఫోన్ చేసిన వెంటనే 108 - అంబులెన్స్ తరహాలోనే ఇక్కడా అంబులెన్స్ వస్తుంది. వైద్య సహాయం కావాలని కోరుకునే నాన్ - ఎమర్జెన్సీ పేషంట్ సౌకర్యం కొరకు, వారికి అంబులెన్స్ పంపేందుకు 1777 అనే మరో నెంబర్ కేటాయించింది ప్రభుత్వం. ఎమర్జెన్సీ కేసు కాదని తేలితే, 995 నంబర్‌కు ఫోన్ చేసి అంబులెన్స్ కోరిన వారి దగ్గర నుంచి 180 సింగపూర్ డాలర్లు ఫీజు కింద వసూలు చేస్తారు. లేకపోతే ఈ సౌకర్యం ఉచితమే. ప్రయోగాత్మకంగా, కనీసం, దేశంలోని ఆరు పెద్ద మెట్రోపాలిటన్ నగరాలైన న్యూఢిల్లీ, ముం బయి, కోల్‌కత, హైదరాబాద్, చెన్నై, బెంగళూరులలో సింగపూర్ విధానాన్ని ప్రవేశపెట్టి, ఆ తరువాత ఫలితాలను బట్టి ఇతర ప్రాంతాలకు విస్తరిస్తే మంచిదేమో.

- వనం జ్వాలా నరసింహారావు jwala99@gmail.com