మెయన్ ఫీచర్

సమాచార హక్కు చట్టానికి తూట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమాచార హక్కు చట్టంలో సెక్షన్-26 ప్రకారం ఆ చట్టం ప్రయోజనాలను ప్రజలకు అందించి, వారిలో అవగాహన కల్పించాల్సిన రాజ్యాంగ బద్ధమైన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే. కానీ రోజురోజుకూ ఆ చట్టాన్ని అటకెక్కించే పనిలో అన్ని ప్రభుత్వా లూ పనిచేస్తున్నాయా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ ఆర్. సుభాష్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం- ‘తక్షణం సమాచార హక్కు కమిషనర్లను నియమించాలని, కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ ఈ ప్రక్రియ పూర్తి చేయాల’ని ఆదేశించడంతో కొంత కదలిక వచ్చింది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, కేరళ, ఒడిశా, కర్నాటక సహా చాలా రాష్ట్రాల్లో పూర్తి స్థాయి సమాచార హక్కు కమిషన్లు ప్రస్తుతం పనిచేయడం లేదు. వేలాది కేసులు పెండింగ్‌లోనే ఉన్నాయి. బెంగాల్‌లో ఇద్దరు సమాచార కమిషనర్లు పదేళ్ల క్రితం దాఖలైన పిటిషన్లనే ఇంకా పరిశీలిస్తున్నారు. కేంద్ర సమాచార హక్కు కమిషనర్లను కూడా పూర్తి స్థాయిలో ఇంకా నియమించలేదు. అనేక వడపోతల తర్వాత కేంద్రం 14 పేర్లతో ఒక జాబితాను రూపొందించింది. ఆ జాబితాలో ఒక మాజీ న్యాయమూర్తి మినహా మిగిలిన వారంతా ప్రభుత్వ ఉద్యోగులే. సమాచార కమిషన్‌లో తిరిగి ప్రభుత్వ ఉద్యోగులనే నియమించాలా? అని ఇటీవల సుప్రీం కోర్టు ప్రశ్నించింది. అంజనీ భరద్వాజ్, కమాండర్ లోకేష్ భత్ర, అమృత జోహ్రిలు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీం తీవ్రంగా స్పందించింది. కేంద్ర సమాచార హక్కు కమిషన్ ముంగిట దాదాపు 23,500 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్రాల వారీ తీసుకుంటే ఆ సంఖ్య లక్షల్లోనే ఉంది.
సమాచార హక్కు కమిషన్‌లో ప్రధాన కమిషనర్ హోదా ఎన్నికల ప్రధాన కమిషనర్ హోదాకు సమానంగానూ, కమిషనర్ల హోదా ఎన్నికల కమిషన్‌లోని కమిషనర్ల హోదాకు సమానంగానూ రూపొందించారు. జీతభత్యాలు, ఇతర సౌకర్యాలు, ప్రొటోకాల్ తదితర అంశాలు అన్నీ తత్సమానవైనవిగా చట్టాన్ని రూపొందిస్తే ఇటీవల కేంద్ర ప్రభుత్వం సమాచార హక్కు కమిషనర్ల నియామకానికి సంబంధించి జారీ చేసిన నోటిఫికేషన్‌లో జీతభత్యాల ప్రస్తావన లేకుండా చూసింది. నియామకం రోజున ఈ సమాచారాన్ని ఇస్తామని పేర్కొంది. సమాచార హక్కు చట్టం కమిషనర్లు, ప్రధాన కమిషనర్ నియామకాల్లో కేంద్ర ప్రభుత్వానికి ఇంత దాపరికం ఎందుకు ? దీనికి కారణం లేకపోలేదు.
సమాచార హక్కు చట్టాన్ని తీసుకువచ్చిన కాంగ్రెస్ పార్టీని గద్దెదించడంలో ఆ చట్టమే మిగిలిన పక్షాలకు బ్రహ్మాస్త్రంగా ఉపయోగపడింది. అన్ని రకాల కుంభకోణాలను సమాచార హక్కు చట్టం కింద లిఖితపూర్వకంగా పొంది, వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలోనూ, ఆ సమాచారాన్ని పుస్తకాలుగా ముద్రించి ప్రజలకు పంచడంలో అప్పటి విపక్షాలు విజయం సాధించాయి. అదే చట్టం నేటి ప్రభుత్వానికి కూడా కంటిలో నలుసుగా మారింది. రాఫెల్ వివాదంతో పాటు కేంద్రప్రభుత్వ ఒప్పందాలు, కాంట్రాక్టులు, ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హతలపై ఢిల్లీ యూనివర్శిటీకి ఇచ్చిన ఆదేశాలు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విద్యార్హతలపై సీబీఎస్‌ఈకి ఆదేశాలు వంటి అంశాలపై సహచట్టం కింద వివరాల కోసం దరఖాస్తులు దా ఖలయ్యాయి. ఒక దశ లో ఇలాంటి వివాదం నేపథ్యంలోనే కేంద్ర మంత్రి పదవికే ముప్పుతెచ్చింది. పెద్ద నోట్ల రద్దు తదితర వివాదాల్లో ఆర్‌బీఐ వ్యవహరించిన తీరును తప్పుపట్టి సమాచారాన్ని బహిర్గతం చే యాల్సిందేనని అప్పటి సమాచార హక్కు కమిషనర్ ఇచ్చిన ఆదేశాలు కూడా ప్రధాని కార్యాలయానికి కంటిమీద కునుకు లేకుండా చేశాయి.
రాజకీయ పార్టీలు సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తాయని, బ్యాంకులు సైతం రుణగ్రస్తుల జాబితా విడుదల చేయాలని, టిప్పుసుల్తాన్ ఖడ్గం తదితర అంశాలపైనా, కోహినూర్ వజ్రం పూర్వపరాలపైనా, ఎంపీ లాడ్స్ నిధులను ఖర్చుచేసిన తీరుపైనా, లాల్ బహుదూర్ శాస్ర్తీకి ఆనాడు ఏం జరిగిందో జాతికి చెప్పాలని, ఆపరేషన్ బ్లూస్టార్ రికార్డులు బహిర్గతం చేయాలని, బీసీసీఐని సమచార హక్కు చట్టం పరిధిలోకి ఎందుకు తీసుకురాకూడదని ఆనాటి కమిషన్ ప్రశ్నించడంతో కేంద్రం పలుమార్లు ఇరకాటంలో పడింది. ప్రభుత్వాల సాచివేత కారణంగా 30 రోజుల్లో పరిష్కారం కావల్సిన పిటిషన్లలో కొన్నింటికి రెండున్నరేళ్లు కూడా పడుతోంది. ఇటీవల కేంద్ర సమాచార కమిషన్ ఇచ్చిన తీర్పులను సమీక్షించి, పరిశోధనాత్మక అధ్యయనం చేసినపుడు కొన్ని పిటిషన్ల పరిష్కారానికి 319 రోజులు మొదలు 862 రోజులు పట్టిన సందర్భాలున్నాయి. చట్టం అమలులోకి వచ్చి అపుడే 15 ఏళ్లు అవుతున్నా ఇంకా అనేక అనుమానాలున్నాయి. కొంత మంది మాత్రమే సమాచార హక్కు చట్టాన్ని పకడ్బందీగా ఉపయోగించుకుంటున్నారు. మిగిలిన వారు సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకోలేకపోతున్నారు. కేంద్రంలో ఉన్న పరిస్థితే చాలా రాష్ట్రాల్లోనూ ఉంది. సమాచారం అడిగిన వారిని బెదిరించడం, భయపెట్టడం, కేసులు బనాయించడం ద్వారా దారిలోకి తెచ్చుకుంటున్నారు. దేశవ్యాప్తంగా అనేకమంది సమాచార హక్కు కార్యకర్తలు హత్యకు గురయ్యారు. ఆ కేసుల వివరాలు ఇప్పటికీ ఇంకా వెలుగు చూడలేదు.
వాస్తవానికి సమాచార హక్కు చట్టాన్ని చాలా పకడ్బందీగా రూపొందించారు. ప్రజల ఒత్తిడి మేరకు చట్టాలను తీసుకురావడం, తర్వాత వాటిని రాజకీయ ప్రయోజనాల కోసం నిర్వీర్యం చేయ డం మన దేశంలో కొ త్తేమీ కాదు. దేశగతిని మార్చిన చట్టాల్లో మధ్యా హ్న భోజన పథకం అమలుకు ఉద్దేశించిన నిర్బంధ ఉచిత విద్యా హక్కు చట్టం ఒకటైతే ఇంకోటి సమాచార హక్కు చట్టం. 2015లో సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చింది. చట్టంలోని 2(జే) ప్రకారం పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడానికి ప్రభుత్వ యంత్రాంగం అదుపులో ఉన్న సమచారాన్ని పౌరులు పొందడమే సమాచార హక్కుగా నిర్వచించారు. సెక్షన్ 2 (ఎఫ్) ప్రకారం రికార్డులు, పత్రాలు, మెమోలు, ఈ-మెయిళ్లు, అభిప్రాయాలు, ఆదేశాలు, ఒప్పందాలు, పత్రికాప్రకటనలు, కాంట్రాక్టులు, సర్క్యులర్లు, ఉత్తర్వులు, నమూనాలు, కంప్యూటర్లలో నిక్షిప్తమైన డేటా, సీడీలు, డీవీడీలు, ఫ్లాపీలు, మరే ఇతర రూపంలో ఉన్న సమాచారాన్నయినా పొందే వీలుంది. సెక్షన్ 5(1) మేరకు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ప్రజా సమాచార అధికారి, సహాయ ప్రజా సమాచార అధికారి, వీరిద్దరూ స్పందించని పక్షంలో అపెక్స్ అధారిటీ ఒకరు ఉంటారు. కార్యాలయం బయట సమాచార హక్కు చట్టానికి బాధ్యులైన అధికార్ల పేర్లు, ఫోన్ నెంబర్లు, ఈ-మెయిల్ వివరాలను ప్రదర్శించాలి. సెక్షన్ 6(1) కింద సమాచారం కావల్సిన వారు ఆ అధికారులకు లేఖ ద్వారా లేదా ఈ-మెయిల్‌లో ఆంగ్లం లేదా ప్రాంతీయ భాషల్లో సమాచారాన్ని కోరవచ్చు. ఇందుకు చట్టంలో నిర్దేశించిన ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. వాస్తవానికి దరఖాస్తుకు నిర్ణీత రూపం లేదు, కానీ సమాచారం కోసం విన్నవిస్తున్నట్టు పేర్కొంటే సరిపోతుంది. సెక్షన్ 6(2) ప్రకారం సమాచారం ఎందుకు కోరుతున్నామో చెప్పాల్సిన పనిలేదు. సెక్షన్ 6(3) ప్రకారం ఒక వేళ దరఖాస్తు తమ కార్యాలయానికి సంబంధించింది కానప్పటికీ అది ఎవరికి సంబంధించిందో వారికి వీలైనంత త్వరగా పంపించాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగానిదే.
దరఖాస్తు అందిన ఐదు రోజుల్లో దానిని సంబంధీకులకు పంపించాలి. ఆ విషయాన్ని తిరిగి దరఖాస్తుదారుకి సమాచారం ఇవ్వాలి. సమచార హక్కు చట్టం సెక్షన్ 7(3), జీవో ఎంఎస్ నెంబర్ 740 కింద ఫీజును నగదు రూపంలో, డీడీ, చెక్కు, పోస్టల్ ఆర్డర్ రూపంలోనైనా చెల్లించవచ్చు. సెక్షన్ 7(5) ప్రకారం దారిద్య్ర రేఖ దిగువన ఉన్న వారు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. సమాచార హక్కు చట్టం -2015 సెక్షన్7(1) ప్రకారం 30 రోజుల్లో సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. వ్యక్తి స్వేచ్ఛ , జీవించే హక్కులకు భంగం కలిగే పక్షంలో 48 గంటల్లో సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.
దరఖాస్తు తీసుకోవడానికి నిరాకరించినా, ఎక్కువ రుసుం చెల్లించాలని డిమాండ్ చేసినా, తెలిసి కూడా అసంపూర్తి సమాచారాన్ని ఇచ్చినా, సమాచారం ఇచ్చేందుకు నిరాకరించినా, సమాచారాన్ని ధ్వంసం చేసినా, సమాచారాన్ని ఇవ్వడాన్ని అడ్డుకున్నా ఇవన్నీ నేరాల కిందకే వస్తాయి. సమాచార హక్కు చట్టం సెక్షన్ 20(1) కింద ఇలాంటి నేరాలకు పాల్పడిన సమాచార అధికారికి రోజుకు 250 రూపాయిల నుండి 25వేల రూపాయిల వరకూ జరిమానా విధించే వీలుంది. తరచూ సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించే అధికారులపై సెక్షన్ 20(2) కింద క్రమశిక్షణ చర్యలు తీసుకునే వీలుంది. జీవో ఎం ఎస్ నెంబర్ 454 ప్రకారం ప్రింట్ రూపంలో కావాలంటే ప్రతి పేజీకి రెండు రూపాయలు, ఫ్లాపీకి 50 రూపాయిలు, సీడీకి వంద రూపాయిలు, డీవీడీకి 200 రూపాయిలు చెల్లించాలి. సమాచార హక్కు కమిషన్ నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం ఏ న్యాయస్థానానికీ లేదు. సెక్షన్ -23 మేరకు సమాచార హక్కు కమిషన్ ఇచ్చిన నిర్ణయాన్ని సవాలు చేయడం, ప్రశ్నించడం లేదా సమీక్షించమని కోరడానికి అవకాశం లేదు.

-బీవీ ప్రసాద్ 98499 98090