మెయన్ ఫీచర్

భాజపా ‘మాస్టర్ స్ట్రోక్’.. సాధ్వి ప్రజ్ఞ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాలెగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలిగా సుదీర్ఘకాలం జైలులో ఉండటమే కాకుండా, తీవ్రమైన పోలీసు చిత్రహింసలకు గురైన సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌ను భోపాల్ నియోజకవర్గం నుండి తన అభ్యర్థిగా ప్రకటించడం ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ వేసిన పెద్ద ‘మాస్టర్ స్ట్రోక్’ అని చెప్ప వచ్చు. ఈ ఎంపిక కేవలం భోపాల్‌లో గెలుపు కోసం కాకుండా జాతీయ స్థాయిలో ఎన్నికలపై ప్రభావం చూపే విధంగా, సైద్ధాంతికంగా పట్టు సడలి వ్యక్తి ఆరాధనకు పరిమితం అవుతున్న బీజేపీలో భారీ శస్తచ్రికిత్స జరపడం కోసం జరిపిన ఎత్తుగడగా అర్థం అవుతున్నది.
వాస్తవానికి భోపాల్ భాజపాకి కంచుకోటగా పే రొందింది. మూడు దశాబ్దాలుగా ఆ పార్టీకి అక్కడ తిరుగు లేదు. మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రచారం ప్రారంభించినా బీజేపీ అంతగా కంగారు పడనవసరం లేదు. ఒక విధంగా సాధ్వి ఎంపికతో మొదటగా కలవర పడవలసింది దిగ్విజయ్ సింగ్ మాత్రమే. సరిగ్గా 15 ఏళ్ల క్రితం ఎన్నికల రాజకీయాలకు దిగ్విజయ్ దూరం కావడానికి భాజపా నాయకురాలు ఉమాభారతి కారణం అని మరువలేము. ఆనాడు రాజకీయంగా దిగ్విజయ్‌ను తెర వెనుకకు పంపడానికి ఒక సాధ్వి కారణమైతే, 15 ఏళ్ళ తరవాత తిరిగి ఎన్నికల రాజకీయాలలో అడుగుపెట్టిన ఆయనకు మరో సాధ్వి ప్రత్యర్థి కావడం గమనార్హం. పదేళ్ల పాటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవడమే కాకుండా, బలమైన నేతగా పేరొందిన దిగ్విజయ్ సింగ్‌ను 2003లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉమాభారతి పట్టుదలతో ప్రచారం చేసి ఓడించారు. ఆ ఓటమికి బాధ్యత వహిస్తూ పదేళ్ల పాటు ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉండి, 2014లో దిగ్విజయ్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. భోపాల్ ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలకు మంచి పట్టున్న ప్రాంతం కావడంతో ఆ ప్రాంతంలోని హిందువులను ఆక ట్టుకోవడానికి అక్కడ పోటీకి సిద్ధపడినప్పటి నుండి దిగ్విజయ్ ప్రచారం ప్రారంభించారు.
భోపాల్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయానికి పోలీస్ భద్రతను కమల్‌నాథ్ ప్రభుత్వం ఉపసంహరించుకున్న వెంటనే తీవ్రంగా ఖండించి, తిరిగి భద్రత కొనసాగేటట్లు దిగ్విజయ్ చేశారు. పలు హిందూ ఆలయాలను సందర్శిస్తూ సోషల్ మీడియాలో సంబంధిత ఫొటోలను ఆయన ఉంచుతున్నారు. పైగా అక్కడ రామాలయం ని ర్మాణానికి సొంతంగా స్థలం ఇస్తానంటూ ముందుకు వచ్చారు. ఇదివరకెప్పుడూ ఆ విధంగా ఆయన చేయలేదు. ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా తనను ఎంపిక చేయడానికి రాహుల్ గాంధీపై బలమైన వత్తిడి తెచ్చిన వారిలో దిగ్విజయ్ ముఖ్యులని కమల్‌నాథ్ కు తెలుసు. వాస్తవానికి జ్యోతిరాదిత్య సింధియా పట్ల రాహుల్ మొగ్గు చూపారు. ఆ కృతజ్ఞత ఉన్నప్పటికీ, పరిపాలనా వ్యవహారాలలో దిగ్విజయ్ ఎక్కువగా జోక్యం చేసుకొంటూ ఉండడాన్ని ముఖ్యమంత్రి సహించలేక పోతున్నారు. భోపాల్‌లో పోటీ చేస్తే ఓటమి తప్పదనే భావనతో ఒక ఝలక్ ఇవ్వాలనే బలవంతంగా దిగ్విజయ్‌ను కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి దించారు. అయితే సంఘ్ పరివార్ ఈ అవకాశాన్ని ఉప యోగించుకొని దిగ్విజయ్ చేపట్టిన హిందూ ఉగ్రవాద రాజకీయాలపై ముప్పేట దాడి చేయడానకి సమా యత్తమవుతోంది. యూపీఏ-1 ప్రభుత్వ హయాంలో హిందూ కాషాయ ఉగ్రవాదం పేరుతో సంఘ్ పరివార్‌ను ఉగ్రవాదులుగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ నేతలలో ముందున్నది దిగ్విజయ్ సింగ్ కావడం గమ నార్హం. ఈ పద ప్రయోగం మొదటగా చేసింది ఆయనే.
2007లో సంఝౌతా ఎక్స్‌ప్రెస్ పేలుళ్లను, 2008లో మాలెగావ్ పేలుళ్లను హిందూ కాషాయ ఉగ్రవాదంగా దిగ్విజయ్ విష ప్రచారం చేశారు. సంఘ్ పరివార్ సంస్థలే ముస్లిం ఉగ్రవాదానికి పోటీగా హిందూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయని దారుణమైన ప్రచారం చేపట్టారు. మొదటి కేసులో స్వామి అసీమానంద్‌ను, రెండో కేసులో సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ తో పాటు లెఫ్ట్‌నెంట్ కల్నల్ శ్రీకాంత్ పురోహిత్‌లను ప్రధాన నిందితులుగా చేసి, వారిని పోలీసు చిత్రహింసలకు గురిచేశారు. దేశాన్ని కుది పివేస్తున్న ఉగ్రవాదాన్ని కట్టడి చేసే బదులు, ఉగ్రవాదానికి మతం రంగు పూసి రాజకీయ ప్రయోజనం పొందే ప్రయత్నం చేశారు. ఆ విష ప్రచారానికి కారకుడైన దిగ్వి జయ్ సింగ్ పై సాధ్వి ప్రజ్ఞను పోటీకి దింపడం ద్వారా జాతీయ స్థాయిలో సైద్ధాంతిక ప్రచారానికి ఇప్పుడు అవకాశం కలుగుతుంది.
నవంబర్ 26, 2008న జరిగిన ముంబై పేలుళ్ల ఘటన వెనుక కూడా ఆర్‌ఎస్‌ఎస్ హస్తం ఉన్నట్లు దిగ్విజయ్ ఆరోపించారు. ముంబై పేలుళ్లు ఆర్‌ఎస్‌ఎస్ కుట్ర అనే ఆరోపణలతో ప్రచురించిన ఒక గ్రంధాన్ని కూడా రెండేళ్ల తర్వాత ఆవిష్కరించారు. రాడికల్ హిందూ బృందాల కారణంగానే దేశంలో మైనారిటీ ఉగ్రవాదం పెరు గుతుందనే విధంగా, ఉగ్రవాదాన్ని సమర్ధించేలా సైద్ధాంతిక బలం సమకూర్చే ప్రయత్నం చేశారు. చివరకు 26/11న ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడి సందర్భంగా మహారాష్ట్ర ఏటిఎస్ అధినేత హేమంత్ కర్కరే హత్యకు కూడా హిందూ తీవ్రవాదులు కారణం అనే విధంగా ఆరోపణలు చేశారు. హిందూ సంస్థలపై విష ప్రచారం చేస్తున్న దిగ్విజయ్ సింగ్ కు ఒక విధంగా రాజకీయంగా సమాధి చేయడం కోసమే ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌ను ఆయనపై పోటీకి దింపినట్టు భావించవచ్చు. అంతే కాదు, ఈ నిర్ణయం రెండో దశ పోలింగ్ ముందు రోజు తీసుకోవడం గమనార్హం. ప్రధాని మోదీ ప్రభంజనంతో ఎన్నికలలో మరోసారి గెలవవచ్చని భాజపా భావించింది. అయితే 2014 ఎన్నికల కన్నా సీట్లు పెరిగే అవకాశాలు ఇపుడు కనిపించడం లేదు. 200కు మించి సీట్లు గెల్చుకోగలమా? అనే ప్రశ్న భాజపాలో తలెత్తింది. రామమందిరం విషయంలో మోదీ ప్రభుత్వం తమను మోసం చేసిందనే అసంతృప్తి ప్రజలలో ఉన్నదని, అందుకని 180కి మించి సీట్లు గెల్చుకోలేమని భాజపా ఎంపీ సుబ్రమణ్య స్వామి రెండో దశ పోలింగ్ రోజునే ట్వీట్ చేశారు.
మోదీ ఐదేళ్ల పాలనలో అమలు చేసిన కార్యక్రమాలు, సాధించిన విజయాలను ప్రస్తావించడం కన్నా ప్రతిపక్షాలను పాకిస్తాన్‌కు మిత్రులుగా చిత్రీకరిస్తూ ప్రజ లలో భావావేశాలు రగిల్చి ఓట్లు పొందాలనే ప్రయత్నాలు వికటించడంతో ప్రమాద సంకేతాలు వెలువడుతున్నాయి. పైగా ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ నవ్వు లపాలవుతున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా కేవలం ప్రతిపక్షాలకు చెందిన నేతల ఇళ్లపై పెద్ద ఎత్తున ఆదాయపు పన్ను శాఖ దాడులు జరగడం ప్రతిపక్షాలకు బలం చేకూర్చే విధంగా ఉంది.
ఎన్నికల ప్రచారంలో ఎటువంటి సైద్ధాంతిక అంశాలను ప్రస్తావించకుండా ‘నేను.. నేను.. నేను’ అని మాత్రమే భాజపా అధినాయకులు ప్రస్తావిస్తున్నారు. ప్రజలను కలవరానికి గురిచేస్తున్న ఉపాధి, వ్యవసాయ సంక్షోభం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వంటి అంశాలను ప్రస్తావించే సాహసం చేయడం లేదు. ఆర్భాటంగా ఈ ప్రభుత్వం ఐదేళ్ల క్రితం ప్రారంభించిన అనేక పథకాల ప్రభావం క్షేత్ర స్థాయలో కనబడడం లేదు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు, వ్యవసాయ ఆదాయం రెట్టింపు వంటి హామీల విషయంలో ఆత్మరక్షణలో పడవలసి వస్తోంది.
ఇటువంటి సమయంలో సాధ్వి ప్రజ్ఞను అభ్యర్థిగా పోటీ చేయించడం ద్వారా దారితప్పుతున్న ఉగ్రవాదంపై చర్చను గాడిలో పెట్టడం, ఆమెను ఉగ్రవాదిగా చిత్రీకరించి చితహింసలకు గురిచేసిన దారుణమైన పాలనను ప్రజల దృష్టిలోకి తేవడం ద్వారా నికార్సయన జాతీయవాదాన్ని ప్రజల ముందు తెచ్చే అవకాశం ఏర్పడుతుంది. తనను అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత సాధ్వి ప్రజ్ఞ ప్రజలతో మాట్లాడుతూ, జైలులో పోలీసుల వేధింపుల గురించి, చిత్రహింసల గురించి ప్రస్తావిస్తూ ఉంటే అందరికీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. పోలీసులు తనను 13 రోజుల పాటు అక్రమంగా కస్టడీలోకి తీసుకున్నారని, మొదటి రోజు నుంచే తనను ఏమీ అడగకుండానే బెల్ట్‌లతో తీవ్రంగా కొట్టారని, తన శరీరమంతా వాతలు తేలిందని ఆమె చెప్పుకొచ్చారు. ఏ మహిళకూ ఇలాంటి వేధింపులు ఎదురుకాకూడదని అంటూ తనను పోలీసులు హింసిస్తూ దుర్భాషలాడేవారని గుర్తుచేసుకున్నారు. మాలెగావ్ పేలుళ్లతో తనకు సంబంధం ఉన్నట్లు బలవంతంగా అంగీకరించేలా ఒత్తిడి తెచ్చి పోలీసులు విఫల యత్నం చేశారు. తనను కొట్టేవారు డ్యూటీలు మారినప్పటికీ, వారి చేతిలో మాత్రం శిక్ష ఒకేలా ఉండే దని ఆమె వాపోయారు.
బహుశా స్వతంత్ర భారత దేశంలో మరే మహిళను ఇంత దారుణంగా, ఎటువంటి సంబంధం లేకుండా హింసించిన ఉదంతం మరొకటి ఉండకపోవచ్చు. అందుకనే భోపాల్ ఎన్నికల ప్రచారం గురించి ఇప్పుడు కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు ఆత్మరక్షణలో పడే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు దేశ ప్రజల దృష్టి భోపాల్ పై పడింది. ఈ పోటీ ప్రభావం కేవలం ఎన్నికల ఫలితాలపైనే చూపడమే కాకుండా, ఎన్నికల అనంతరం దేశ రాజకీయాల దిశను సైతం నిర్ధారించే అవకాశం ఉంది.

-చలసాని నరేంద్ర 98495 69050