మెయిన్ ఫీచర్

అనిస్ బాట ఆచరణీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశ స్వాతంత్య్రంకోసం ఎంతోమంది ప్రాణాలని పణంగా పెట్టి పోరాడారు. అందులో భాగస్వాములైన ఎంతోమంది స్ర్తిలలో మహిళా శక్తికి ఎదురులేదని నిరూపించింది అనిస్ బేగం కిద్వాయ్. ఎందరిలోనో స్ఫూర్తిని కలిగించగలిగిన ఈ స్ర్తిమూర్తి జీవిత విశేషాలు తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా వుంది.
నెహ్రూ, తయ్యాబ్జీ, ఫైజీ, కిచ్లూ, కిద్వాయ్ లాంటి కొన్ని కుటుంబాలు నిష్ట నిబద్ధతలతో ప్రధానంగా పనిచేశాయి. ఆ కుటుంబాలు అద్వితీయ త్యాగాలతో స్వాతంత్య్రోద్యమ చరిత్రలో తమదంటూ ప్రత్యేకతను సంతరించుకున్నాయి. అటువంటి చరిత్ర కలిగిన కిద్వాయ్ కుటుంబ సభ్యులు అనిస్ బేగం కిద్వాయ్.
ఉత్తరప్రదేశ్‌లో వున్న బారాబంకిలో షేక్ విలాయత్ అలీ కుటుంబంలో అనీస్ బేగం 1906లో జన్మించారు. న్యాయవాది అయిన ఆమె తండ్రి బ్రిటీషు ప్రభుత్వ వ్యతిరేకి. ఆంగ్లేయులకు అండగా నిలిచిన అలీఘర్ మేధావులతో దూరంగా వుండేవారు. హిందూ-ముస్లింల ఐక్యతను ఆకాంక్షించే వారు. భారత జాతీయ కాంగ్రెస్-ముస్లిం లీగ్‌లమధ్య సయోధ్యను కోరుకున్న ప్రముఖులు.
చిన్నతనం నుంచి అనిస్ తండ్రితోపాటుగా రాజకీయ, సాహిత్య సభలు, సమావేశాలకు హాజరవుతూ తండ్రి నుంచి బ్రిటీష్ వ్యతిరేకతను సంతరించుకున్నారు. తండ్రినుండి రాజకీయ, సాహిత్య పరిజ్ఞానాన్ని, దేశభక్తి భావనలను ఆమె చిన్నతనంలోనే పుణికిపుచ్చుకున్నారు. రాజకీయ విషయాలలో ప్రాముఖ్యతనిచ్చే ఆ కుటుంబ విద్యా విషయంలో మాత్రం సర్ సయ్యద్ అహమ్మద్ మార్గదర్శకత్వంలో మగ పిల్లలందరికీ ఇంగ్లీషు చదువులు చెప్పించారు. ఆడపిల్లలను మాత్రం చదువుకు దూరంగా ఉంచింది. అనిస్ బేగం సోదరులకు విద్య నేర్పించేందుకు గురువులను ఏర్పాటుచేశారు. ఆ సమయంలో అనిస్ కూడా సోదరులతో కలిసి కూర్చుని ఉర్దూ, ఇంగ్లీషు భాషలను నేర్చుకున్నారు. ప్రత్యేకంగా ఆమె ఏమీ చదవలేదు. ఆమె 12 సంవత్సరాల వయస్సులో ఉన్నపుడు తండ్రి ఇనాయత్ అలీ కన్నుమూశారు. ఆ కారణంగా ఆమెకు చదువుకునే అవకాశాలు లేకుండాపోయాయి.
ఆమెను వారి సన్నిహిత బంధువు షఫీ అహమ్మద్ కిద్వాయ్‌ను వివాహం చేసుకున్నారు. షఫీ అహమ్మద్ ప్రముఖ జాతీయోద్యమకారుడు అన్న రఫి అహమ్మద్ కిద్వాయ్‌తో బ్రిటీషు వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొన్నారు. సహాయ నిరాకరణ ఉద్యమం సందర్భంగా తాను చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి రఫి అహమ్మద్ కిద్వాయ్‌తో కలిసి ఖిలాఫత్- సహాయ నిరాకరణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. చిన్ననాటినుండీ తండ్రి వద్ద జాతీయ భావాలను సంతరించుకున్న అనిస్ బేగంకు బ్రిటీష్ వ్యతిరేక భావాలు గల భర్త లభించడం, అటు పుట్టింటివారు, ఇటు అత్తింటివారు కూడా జాతీయోద్యమకారులు కావటంతో ఎంతో ప్రోత్సాహం లభించింది. ఆ ప్రోత్సాహంతో ఉద్యమ కార్యక్రమాలలో ఆమె మరింతగా నిమగ్నమయ్యారు.
బావ, భర్త ఖిలాఫత్ సహాయ నిరాకరణ ఉద్యమాలలో అగ్రగ్రాములుగా ఉండి పోరుబాట సాగటంతో అనిస్ బేగంకు పోలీసుల బెడద తప్పలేదు. కుటుంబంలో వున్న ఆర్జనాపరులు ఉన్నత ఉద్యోగాలను వదలుకుని ఉద్యమబాట పట్టడంతో ఆర్థిక ఇబ్బందులు కూడా అనిస్ బేగంను చుట్టుముట్టాయి. ఆనాడు రాజకీయంగా దృఢమైన అభిప్రాయాలు గల అనిస్‌ను అటు పోలీసులుగాని, ఇటు ఆర్థిక ఇబ్బందులుగాని ఏమీ చేయలేకపోయాయి. ఆమె చివరివరకూ స్వరాజ్యం సాధించేందుకు ముందుకు సాగారు. ఆ కుటుంబం ఆకాంక్షించిన స్వరాజ్యం సిద్ధించింది. ఆశించని విధంగా భారతదేశ విభజన జరిగింది. ఆ సందర్భంగా కిద్వాయ్ కుటుంబ వ్యాకులతకు లోనైంది. ఆ బాధనుండి తేరుకునేలోపుగా అనిస్ మీద పెను ఉప్పెన విరుచుకపడింది. ఆమె భర్త షఫీ అహమ్మద్ కిద్వాయ్ దారుణ హత్యకు గురయ్యారు. ఆదినుండి హిందూ ముస్లింల ఐక్యతను కోరుకుంటూ మతోన్మాదాన్ని అన్నివిధాలా ఎదుర్కొన్న షఫీ అహమ్మద్‌ను మతోన్మాద జ్వాలలు బలితీసుకున్నాయి.
ఆ సంఘటనతో అనిస్ బేగం చలించిపోయారు. ఏ మతోన్మాద రాక్షసి నుండి ప్రజలను కాపాడాలని ఆ దంపతులు నిరంతరం పనిచేశారో ఆ ఉన్మాదానికి ఆమె భర్త బలయ్యారు. ఆ పరిస్థితి ఆమెలో సరికొత్త ఆలోచనలకు కారణమైంది. ఈ మతోన్మాద భూతం ఎంతమందిని బలి తీసుకుంటుందోనని ఆమె తపించిపోయారు. ఆ విధంగా సన్నిహితులు కోల్పోయిన కుటుంబాల పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఆమెను నిలువనివ్వలేదు. ఆ సమయంలో ఢిల్లీలో వున్న మహాత్మాగాంధీ వద్దకు వెళ్ళారు. ఆనాడు దేశమంతా విభజన వాతావరణంతో ప్రజ్వరిల్లుతుంది. కుటుంబాలకు కుటుంబాలు ఇటు అటు వెడుతున్నాయి. అమాయకులు రాక్షస ఉన్మాదానికి బలవుతున్నారు. ఈ పరిస్థితుల చేదు అనుభవాలను ప్రధానంగా మహిళలు, పిల్లలు వృద్ధులు ఎదుర్కొంటున్నారు. ఉన్మాదుల రక్తదాహానికి, భయనక చేష్టలకు మహిళలు బలవుతున్నారు. కూడు, గూడు లేక అల్లాడిపోతున్నారు. ఆ పరిణామాల నేపథ్యంలో అనిస్ బేగం ఓ నిర్ణయానికి వచ్చారు. శరణార్థులుగా మారిన హిందూ - సిక్కు బాధిత మహిళలకు, పిల్లలకు రక్షణ కల్పించి ఆశ్రయమిచ్చి ఆదుకునేందుకు కృషిచేయాల్సిందిగా మహాత్మాగాంధీ ఆదేశించారు. ఆయన ఆదేశాలను శిరోధార్యంగా భావించి సుభద్రా జోషి, మృదులా శారాబాయిలతో కలిసి అనిస్‌బేగం రంగంలోకి దిగారు.
విభజన సృష్టించిన సంక్షోభం వలన విలవిల్లాడుతున్న వేలాదిమంది మహిళలను చేరదీశారు. ఆ బాధిత మహిళలకు ధైర్యం చెప్పి శరణార్థుల శిబిరంలో ఆశ్రయం కల్పించారు. ఈ కార్యక్రమాలలో భాగంగా ఆమె లక్నోలో ప్రత్యేక శిబిరం ఏర్పాటుచేశారు. ఈ శిబిరంలో అవసరార్థులను, అభాగ్యులను చేర్చుకుని వారి వారి స్థావరాలకు వారు భద్రంగా చేరేంతవరకు వారికి ఆశ్రయం, రక్షణ కల్పించారు. మతోన్మాద రాక్షసి బారిన పడి ప్రాణభయంతో విలవిల్లాడిన మహిళలకు ధైర్యం చెబుతూ వారిలో ఆత్మస్థైర్యం పెంచారు. ఈ విధంగా అనిస్ అందించిన సేవలకు గుర్తింపుగా ఆమె రాజ్యసభ సభ్యురాలుగా ఎన్నికయ్యారు. 1957 నుంచి 1968 వరకు బాధ్యతలను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళల సంక్షేమం కోసం అనేక సూచనలు చేసి సంఘాలు, సంస్థలకు శక్తివంచన లేకుండా సహకారమందించారు. అనిస్ భారత విభజన అనుభవాలను ఆజాద్‌కి చౌన్ మేన్ పేరుతో పుస్తకాన్ని తీసుకువచ్చారు. జులూమ్ పేరుతో మతోన్మాదం సాగించిన రాక్షసత్వాన్ని వివరిస్తూ అబ్ జిన్‌కి దేఖ్నే మరో పుస్తకాన్ని రాశారు. ఈ వ్యాసాలు 1976లో నజ్రే ఖుష్ గుజ్రే శీర్షికతో ప్రచురితమయ్యాయి. ఆమె సాహిత్య కృషికి ప్రతిఫలంగా సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. రాజకీయంగా, సాహిత్యపరంగా, సేవారంగాలలో అపూర్వ సేవలందించి మాతృభూమి రుణం తీర్చుకునేందుకు అవిశ్రాంతంగా శ్రమించారు.

-దామరాజు నాగలక్ష్మి