మెయిన్ ఫీచర్

సర్వశుభంకరి బాలాత్రిపురసుందరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సదా ఆనందంలో ఓలలాడుతూ, తన భక్తులకు చిన్మయానందాన్ని ప్రసాదించే ఆనందమయి ‘బాలాత్రిపురసుందరి’. ఈ విశాల కువలయమే, తల్లికి ఆలయం. మేధాశక్తికి మేరుపర్వతం లాంటిది, జగన్మాత. అర్చనకూ, అర్పణకూ, విద్యకు, అవిద్యకు, జగన్మాత అధీశ్వరి. పూర్వజన్మ సుకృతం ఉంటేనే అమ్మను సేవించాలనే బుద్ధిపడుతుంది. పంచభూతములు, జగన్మాత నుండే ఉద్భవించాయి. జగన్మాతను సేవిస్తే రోగ భయం ఉండదు, మృత్యభయం దరిజేరదు. భవబంధాన్ని పారద్రోలి, భక్తులకు ముక్తిని ప్రసాదించే మోక్షపదాయిని బాలాత్రిపురసుందరి. జగన్మాతను గూర్చిన విశేషముల శ్రవణం, కీర్తనం, స్మరణం- మూడూ పుణ్యకార్యాలే. సర్వులయందు ప్రసన్నత, కరుణ సౌశీల్యం- తల్లి స్వరూపాలు. త్రిపుర సుందరీ అనుగ్రహం లభిస్తే, సకల సౌభాగ్య సంపద భక్తులకు లభిస్తుంది. త్రిపురసుందరీదేవి అనుగ్రహం కావాలంటే, జగన్మాత స్వరూప స్వభావాలను భక్తులు అలవరచుకొని ఆరాధించాలి.
*జగన్మాతకు బంధుప్రీతి లేదు. తప్పుచేసినవారిని, వారెవరైనాసరే శిక్షిస్తుంది. అందుకే తండ్రి దక్షుడు చేసిన అధర్మ యజ్ఞాన్ని ఆమె నిరసించి, అందు తానే బలి అయింది. అదే జగన్మాత త్యాగం. ‘త్యాగేనైకే అమృతత్త్వ మానసుః’. ఇంత జరిగినా, బాలాత్రిపుర సుందరి ముఖంలో మందహాసం మాత్రం స్థిరంగానే ఉంది. తనను కొలిచే భక్తులకు కూడా స్థితప్రజ్ఞతను ప్రసాదించి, చిదానందాన్ని పంచియిచ్చే చిద్రూపిణి- బాలాత్రిపురసుందరీ మాత. బాలాత్రిపుర సుందరీ అనుగ్రహం లభిస్తే, సకల సౌభాగ్య సంపద భక్తులకు లభిస్తుంది. హృదయంలో పొగలేని వెలుగుగా చిద్రూపంలో వెలుగుతూ ఉంటుంది. మూలాధారంలోనూ, దానిపైన వున్న జలతత్త్వం- స్వాధిష్ఠానంలోనూ అగ్నిరూపంలో కనిపిస్తుంది. అగ్నిమండలం, సూర్యమండలం, చంద్రమండలం మనశరీరంలోనే ఉన్నాయి. ఆజ్ఞా విశుద్ధి చక్రాలలో చంద్రకాంతి, అనాహత మణిపూరాల్లో సూర్యకాంతి, స్వాధిష్ఠాన మూలాధార చక్రాల్లో అగ్నికాంతి- ఈ మూడింటితో ఒక త్రికోణం ఏర్పడితే, ఆ త్రికోణం మధ్య భాసించే చిచ్ఛక్తి స్వరూపిణి బాలాత్రిపురసుందరి.
‘సత్యం జ్ఞాన మనంతం బ్రహ్మ’ అన్నాయి బ్రహ్మసూత్రాలు, మహాకావ్యాలు. సత్యమే జ్ఞానం, సత్యానందమే జ్ఞానానందం. అదే మహదానందం. అంతులేని ఆనందం. ఇదే సహస్రారాంతర్గత చంద్రమండలంలో ఆనందబిందువుగా మందహాసం చేసే ‘బాలాత్రిపుర సుందరీ’ స్వరూపం. అమ్మ అనుగ్రహంతో గాని రుూ పరమానందాన్ని పొందలేము. ఈ ఆనందానే్న త్యాగరాజస్వామి ‘చంద్రువర్ణుని అందచందమును హృదయార విందమున జూచి బ్రహ్మానందమును పొందువారు’’ అని పేర్కొన్నాడు శ్రీరాగంలో. శ్రీరామచంద్రుడు, నీలమేఘశ్యాముడైనా, నల్లనివాడైనా, త్యాగయ్యగారికి తెల్లని చందురు వర్ణుడుగా దర్శనమివ్వటంలో గల కుండలినీ యోగశక్తి ఆంతర్యాన్ని, సమాధినిష్ఠ విశేషాలను అందించాడు. ఇది బాలాత్రిపురసుందరీ శక్తి. అటువంటి జగన్మాత స్వరూపాన్ని ‘బాల’గా స్మరించుకుంటే, తల్లికి మరింత దగ్గరవుతారు. దీనిని దృష్టిలో ఉంచుకొని, నవరాత్రి పూజలో పది పనె్నండు సంవత్సరముల వయసు లోపు కన్యలను పూజించి, వారికి పసుపు కుంకుమ, నూతన వస్త్రాలు, ఆభరణములు యిచ్చి, దేవిని ‘బాల’ రూపంగా ఆరాధించి, ఆమె లీలావినోదాన్ని అనుభవిస్తారు.
ఒకప్పుడు, ఇంద్రాదిదేవతలు, తమ విజయానికి ‘శక్తి’యే కారణమన్న సత్యాన్ని మరచిపోయి, గర్వంతో అంతా తమ స్వశక్తితోనే పొందామని తలంపసాగారు. ఆ సమయంలో అపురూపమైన శక్తి వారి ఎదుట సాక్షాత్కరించింది. ఆ అద్వితీయ అపురూప శక్తి ఏమిటో వారికి గోచరించలేదు. తెలిసికోవటానికి అగ్నిదేవుడు ముందుకు వచ్చి ‘శక్తి’తో ‘నేను సర్వజ్ఞుణ్ణి, దేన్నైనా దహించగలను’ అనగా, శక్తి అతని ఎదుట ఒక గడ్డిపోచ ఉంచి, దీనిని కాల్చమన్నది. అగ్నిదేవుని యావచ్ఛక్తి, అతని అహంకారం వలన, పని చేయనందున ఎంత ప్రయత్నించినా, గడ్డిపోచను దహించలేక, దీనవదనుడైనాడు, ఆశ్చర్యచకితుడైనాడు. అతని గర్వం అంతా పోయింది. నా వేడి ఉష్ణశక్తి ఏమైపోయిందని ఆలోచిస్తూ, అవమానంతో కృంగిపోయాడు అగ్నిదేవుడు. ఈ విధంగానే వాయుదేవుడు మొదలుగాక దేవతలందరూ విఫలులైనారు. అపుడు ‘ఉమా హైమవతీ బహు శోభమానా’ అయి ప్రకాశిస్తూ మందహాసంతో, మహాశక్తి త్రిపుర సుందరీదేవి దర్శనమిచ్చింది. అహంకారాన్ని పోగొట్టుకున్న దేవతలు, తమ విజయానికి, తమలో వున్న ఆ మూలశక్తియే కారణమని, తాము నిమిత్తమాత్రులమని తెలిసికొని తల్లి పాదములను ఆశ్రయించారు. ఇది ఉపనిషత్ చెప్పిన శక్తి స్వరూపం- బాలాత్రిపుర సుందరీ పూజకు దీప్తినిస్తుంది. ఆమె ఎప్పుడూ చిన్నవయసులోనే ఉంటుంది. పరమాణు ప్రమాణంలో వున్నా, బ్రహ్మాండాన్ని అలుముకున్నా చీకటిని చిటికెలో తన చిత్కళతో పారద్రోలి, జ్ఞాన వెలుగును ప్రాదించి బిడ్డలను సర్వదా రక్షించే తల్లి బాలాత్రిపురసుందరి.
చదువులతల్లి, మహాసరస్వతీదేవి అంశయే- మహాకాళి. ఆ దేవిని బాలాబీజమంత్రంతో ఉపాసన చేసి, సర్వ విద్యా పారంగతుడై, వాక్సుద్ధిని పొంది, మహాకవి అయినవాడు- కాళిదాస మహాకవి. ఇది బాలాత్రిపురసుందరీ మాత అనుగ్రహం. ‘శ్రీదేవీ లఘుస్తవమ్’లో మహాకవి కాళిదాసు వాగ్దేవీ స్తవం చేసి వాగ్దేవిని, బాలాత్రిపురసుందరిగా స్తుతించాడు. ‘‘లలాటమున ఇంద్రధనుష్ప్రభతోనూ, శిరస్సునందు చంద్రకాంతితోనూ హృదయమునందు సూర్యప్రకాశముతోనూ ధ్యాన సమయంలో శ్రీదేవి దర్శనమిచ్చి, వాక్సుద్ధినిస్తుందని, బాలాత్రిపురసుందరీ అనుగ్రహాన్ని అనుభవపూర్వకముగా వర్ణించాడు కాళిదాస మహాకవి. భోజమహారాజు, కాళిదాస మహాకవి- ఇద్దరూ ప్రాణమిత్రులు. ఒకానొక సందర్భంలో, తొందరపడి భోజ మహారాజు, కాళిదాస మహాకవిని దేశబహిష్కరణ గావించాడు. కాళిదాస మహాకవి రాజ్యం విడిచివెడుతూ ఒక చెట్టుక్రింద విశ్రాంతి తీసుకుంటున్నాడు. రాజ్యబహిష్కరణ చేశాడేగాని భోజమహారాజు ఉండలేక, మారువేషంలో కాళిదాస మహాకవిని వెతుకుతూ బయలుదేరాడు. చెట్టుక్రింద కూర్చున్న కాళిదాస మహాకవిని సమీపించి, ప్రక్కనే కూర్చున్నాడు. మారువేషంలో వున్నాడు కనుక, భోజరాజుని కాళిదాసు పోల్చుకోలేకపోయాడు. ఎక్కడనుండి వస్తున్నారని అడిగాడు. ధారానగరం నుండి వస్తున్నానన్నాడు. అయితే నా ప్రాణమిత్రుడు భోజమహారాజు బాగా ఉన్నాడా? అని అడిగాడు మహాకవి. ‘‘ఇంకెక్కడి భోజరాజు..’ అని కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ, చెయ్యి పైకి చూపిస్తూ చెప్పాడు. మహాకవికి కళ్ళు చెమర్చినాయి, రాజుని తలచుకుంటూ, చరమశ్లోకాని చెప్తూ ‘భోజరాజే దివంగతే’ అన్నాడు. ప్రక్కనే వున్న భోజమహారాజు క్రిందడిపోయాడు.
కాళిదాస మహాకవి ఆశ్చర్యపడి వచ్చినవాడు భోజ మహారాజని తెలిసికొని, విలపించి, మహాసరస్వతీ అంశ అయిన కాళీమాతను, బాలాత్రిపుర సుందరీ బీజ మంత్రముతో ధ్యానించి, వాగ్దేవిని తనకు వాక్సుద్ధిని ప్రసాదించమని ప్రార్థించి, పూర్వము చెప్పిన శ్లోకాన్ని వ్యత్యస్తము చేసి ‘భోజరాజే భువంగతే’ అని చెప్పగానే ఆప్తమిత్రుడైన భోజమహారాజు లేచి కూర్చున్నాడు. ఇది బాలాత్రిపుర సుందరీ మంత్రశక్తి, వాక్సుద్ధి, చరిత్ర చెప్పిన సత్యం.
చెడ్డవారికి చెండికలా చెండాడుతుంది, ప్రళయతాండవం చేస్తుంది. క్షీణించే శరీరానికి, క్షీణించని శరీరానికి, క్షరాక్షరీ రూపంలో ప్రవేశించి అధిష్ఠాత్రిగా ఉంటుంది. బ్రహ్మ, విష్ణు మహేశ్వరులకి కూడా ఆమే తల్లి. అర్థకామాల్ని ధర్మంతో ప్రసాదించి ఎన్నటికీ క్షీణించని అపవర్గ పదాన్ని అనగా మోక్షాన్ని ప్రసాదించే జగన్మాత బాలాత్రిపురసుందరి.
భండాసురుడు - బండలాంటివాడు. ఉన్నచోటే ఉంటాడు, చలించాడు. ఎంత ప్రయత్నించినా లేవడు. సామూహికంగా ప్రయత్నిస్తే, భండాసురుణ్ణి, వాడి పరివారాన్ని, వాడి కుమారుల్ని సంహరించటం జరగదు. తనకంటె మించినవాళ్ళు లేరనే వాడు భండాసురుడు. మన శక్తికంటె మించిన శక్తి ఉన్నదని వాడికి తెలియదు, చెప్పినా వినడు, విన్నా నమ్మడు. కడుపునిండా తిని, కంటినిండా నిద్రపోయి, సుఖంగా హాయిగా, కాలం గడపటమే జీవిత పరమావధి అని వితండవాదం చేసే మొండివాడు భండాసురుడు.
దుర్జన సాంగత్యమే చేయాలనేవాడు- విషంగుడు, ఇంద్రియములకు పూర్తిగా లోనై, దిగజారిన భోగలాలసతకు దాసుడైనవాడు- విశుక్రుడు. విషంగుణ్ణి సంహరించటానికి మంత్రిణీమాత మంచి వ్యూహరచన చేస్తుంది. విశుక్రుని ప్రాణాలు హరించేందుకు ‘వారాహి’ తన వీర్యాతిశయాన్ని ఉపయోగిస్తుంది. ‘విశుక్రప్రాణహరణ వారాహీ వీర్యవందితా’, ‘మంత్రిణ్యంబా విరచిత విషంగవధ తోషితా’ అన్నది శ్రీలలితా సహస్రనామ స్తోత్రం.
ఒక్కసారి కామేశ్వరుని ముఖంవైపు చూస్తే, విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమవగా, సర్వవిఘ్నములను జయిస్తుంది జగన్మాత. భండాసురుడు ప్రయోగించే అస్తశ్రస్త్రాలకు, ఆమె చేతిలో ప్రత్యస్త్రాలున్నాయి. అవసరమైతే, తల్లి చేత వ్రేళ్ళ గోళ్ళనుండి, మత్స్య కూర్మ వరాహాది దశావతారాలలో శ్రీమన్నారాయణుడు సాక్షాత్కరిస్తాడు. నారాయణుని సహకారంతోగాని, నరునిలోని భండత్వం నశించదు. నరజాతిలోని అసురత్వాన్ని నారాయణుడు నశింపజేస్తే, పశుత్వాన్ని పశుపతి అణచివేస్తాడు. కామేశ్వరాస్త్రంతో భండాసురునితో సహా అతని రాజధానియైన శూన్యక మహానగరాన్ని అగ్నికి అర్పించింది. చతుర్బాహుడు మొదలు ఉపమాయుడు వరకు ముప్ఫది మంది రాక్షసులు, భండాసురుని తనయులు. వారిని తనూజయై తొమ్మిది సంవత్సరములు వయసుగల ‘బాలాత్రిపురసుందరి’ వధించినది. దార్శనిక విమర్శ శక్తియే బాలాత్రిపురసుందరీ స్వరూపం. ఆ తల్లి పూజతో ద్వైత వృత్తులు తొలగి ఆత్మానందం కలుగుతుంది. ‘‘భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ వందితాయై నమః’ అన్న లలితా సహస్రనామ స్తోత్త్రంలో, బాలాత్రిపురసుందరీ తత్త్వం విశదమవుతుంది.
‘‘త్రైలోక్య మోహనాది చక్రేశ్వరి, త్రైపద పరబ్రహ్మ మహిషి, భాస్వరి, సాలోక్యాది ముక్తిప్రదానకరి, సదాశివకరి, గురుగుహోదయకరి మూలాది నవాధారేశ్వరి, శుభకరి, నీలాలకధరి, నిత్యానందకరి, లీలావిశ్వోత్పత్తి స్థితిలయకరి, బాలా పరమేశ్వరి, పంచదశాక్షరి’’ అని బాలాత్రిపురసుందరిని ముదావంగా కీర్తించాడు ముత్తుస్వామి దీక్షితులు.
మోక్షస్వరూపిణి- బాలాపరమేశ్వరి. కనుకనే పంచదశాక్షరీ మంత్రంతో తల్లిని స్మరిస్తే ముక్తిని ప్రసాదిస్తుంది. విశ్వంలోని సకల శక్తులు ఆమెనుంచే వస్తాయి. అందరి ఆలోచనలు, భావాలు, సంకల్ప వికల్పాలు- తల్లికి తెలుసు. బాల అయినా సంసార బాధల్ని పోగొట్టి, జీవనాన్ని సుఖమయం చేస్తుంది. అందుకే వర్ణరూపంలో అనగా అక్షర రూపంలో ‘బాలా’ పరమేశ్వరిని కీర్తించాయి, ఉపనిషత్తులు. కల్పనాలోకంలో నిర్వికల్పంగా విహరిస్తూ, వెలుగులకు వెలుగైన అతీతశక్తి- బాలాత్రిపురసుందరి.
బాలాపరమేశ్వరీ దేవిని అనేక రకములైన పుష్పములతో పూజిస్తారు. కాని ఆమెకు నచ్చేది చైతన్య కుసుమం. మనకు చైతన్యాన్నిస్తుంది. అసలు, మనం చైతన్య స్వరూపులమే. దానిని, అంతర్ముఖంగా చేసి దర్శింపజేస్తుంది. చైతన్య కుసుమాన్ని మనం అర్పిస్తే, ఆ కుసుమమే నచ్చుతుంది తల్లికి. ప్రసన్న వదనంతో ఎప్పుడూ మెలుకువతో ఉంటుంది. సర్వదా చిరునవ్వు చిందిస్తూ చారుహాసిని చేసే చిన్మయ మందహాసం- ఒక పుష్పహాసం. నిర్మల నిశ్చల మనస్సుతో, స్వార్థరహితంగా, నలుగురి క్షేమం కోసం చేసే స్తోత్ర పారాయణంతో సంతోషించే స్తుతి పరాయణి- బాల. ఆమె తన నామాలను స్మరించమని కోరదు. స్తుతించినవారు తరిస్తారు. ఆమెను స్మరిస్తే చక్కటి ఆలోచనలు ఉదయిస్తాయి. మనస్సు పవిత్రం అవుతుంది. పవిత్రమైన మనస్సు కలవాడు, మానవుడు. కనుక మనిషిలో మానవత్వాన్ని మలిచి, మంగళకర జీవితాన్ని రూపొందించే మనస్విని, మనోన్మణి- బాలాత్రిపుర సుందరీదేవి.
అకారము, చికారము కలిసి ‘బాలా’ అయింది. ‘యత్కుమారీ మంద్రయతే’ అన్న శ్రుతివాక్యం అనుసరించి ‘బాల’ అనగా కుమారి, ఆమెయే కన్యాకుమారి. బాల లీలల గలది, కనుక బాలా అవుతుంది. ‘బాలా లీలా వినోదిని’ ముగురమ్మల మూలపుటమ్మ త్రిపురా- ముగ్గురు మూర్తులకు పూర్వమే వున్నది. ఆ దేవియే బాలాత్రిపురసుందరి.
‘‘సౌభాగ్యవాన్ భవేన్మంత్రీ- త్రిపురాయాః ప్రసారతః శే్వతపుష్పైర్మహేశాని మహద్భిః పూజయేన్నదః’’ ఎతల్లని పూలతో ఒక మాసము జగన్మాతను పూజించిన నరుడు, త్రిపురాదేవి అనుగ్రహమును పొంది ఉన్నత స్థితిని పొందుతారు. అలాగే నెల రోజులు దేవిని ఎఱ్ఱని మంకెన పూవులతో పూజిస్తే, సర్వపాపములు దహించబడతాయని, పుష్పచింతామణి గ్రంథంలో పేర్కొనబడింది.
కుమారస్వామి, తారకాసుర సంహారంగావించాడు. తారకాసురుని కుమారులు, తారాక్ష్యుడు, విద్యున్మాలి, కమలాక్షుడు అనే త్రిపురాసురులు. వీరు తమ తండ్రి మరణానికి పరితపించి, బ్రహ్మను గూర్చి తపస్సు చేసి, మరణం లేకుండా వరాన్ని కోరారు. అది సాధ్యపడదంటే, ఏదైనా ఒక మార్గాన్ని ఎంచుకొని ఆ విధంగా జరిగితే మరణించేటట్లుగా వరం కోరుకోమన్నాడు బ్రహ్మ. త్రిపురాసురులు మూడు పురములు కట్టుకొని, ఆకాశంలో తిరుగుతూ వేయి సంవత్సరములు జీవించిన పిమ్మట ఆ మూడు పురములు ఒకే చోటికి చేరినపుడు, ఒకేబాణంతో ఆ పురాల్ని భేదించగలిగినవారి చేతిలో మాత్రమే వారికి మరణం సంభవించేటట్లు వరం కోరుకున్నారు.
జగత్తత్త్వంతో రథాన్ని, వేదతత్వంతో గుఱ్ఱాల్ని, నాగతత్త్వంతో పగ్గాల్ని, మేరుశిఖర తత్త్వంతో ధనుస్సును, వాసకి తత్త్వంతో వింటి నారిని, సోమ విష్ణువాయు తత్త్వాలతో బాణాన్ని తయారుచేసి బ్రహ్మ స్వయంగా సారథి అయ్యాడు. వాటి ప్రయోజనం సమకూరలేదు. పరమేశ్వరుడు అంతర్ముఖుడై పరతత్త్వాన్ని భావించాడు. త్రిపురములన్నీ ఒకే సరళరేఖపై చేరాయి. ఒకే బాణంతో త్రిపురాలను ఛేదించాడు పరమేశ్వరుడు. చిరునవ్వుతో బాలాత్రిపురసుందరి ధనస్సు నుంచి బయటకు వచ్చింది. నేటి ప్రకాశం జిల్లా త్రిపురాంతక్షేత్రంలో బాలాత్రిపురసుందరీ దేవి శిలాకారంలో ప్రకాశిస్తూ భక్తుల పాలిటి పెన్నిధిగా ఉన్నది. అక్కడ గర్భగుడిగా చెప్పబడుతున్న దివ్యప్రదేశమే, శ్రీ బాలాత్రిపురసుందరీదేవి ఆవిర్భవించిన ‘చిదగ్నికుండము’. ‘చిదగ్నికుండ సంభూతా దేవకార్య సముద్యతా’- లలితా సహస్రనామం.
‘‘శ్యామకృష్ణ సోదరి శుకశ్యామల త్రిపుర సుందరి ఈ మహిలో నీ సమాన దైవమెందుగాననే కామాక్షీ’’ అంటూ లయబ్రహ్మ శ్యామశాస్ర్తీ జగన్మాతను కీర్తించాడు. ‘బాలాంబికే పాహి భద్రం దేహి’ అని మనోరంజని రాగంలోను, ‘భజరే రే చిత్త బాలాంబికాం, భజరేరే చిత్త భక్తకల్పలతికాం’ అని, శాంతకళ్యాణ రాగంలోను; ‘బాలాంబిక యా కటాక్షితోహం, బుధజనాది నుత త్రికూట వరయా’ అని శ్రీరంజని రాగంలో, ‘బాలాంబికాయై నమస్తే వరదాయై, భక్తచిత్త కేకి ఘనాఘనాయై’. కేకి అనగా నెమలి, భక్తుల చిత్తమను నెమలికి, గొప్పదైన మేఘము వంటివి. మేఘమును చూచి నెమలి పురివిప్పి ఆనందంతో నాట్యమాడుతుంది. ఆ విధంగానే జగన్మాతను చూచిన భక్తులు, నెమలిలాగా ఆనందంతో నాట్యం చేస్తారు అని నాటకురంజి రాగంలో అద్భుతంగా ప్రార్థించాడు, ముత్తుస్వామి దీక్షితులు.
‘‘భజామి త్వాం గౌరీం నగపతి కిశోరీమ్ అవిరతమ్’ గౌరీశబ్దం నిర్మలత్వానికి, స్వచ్ఛతకు సంకేతం. తెలుపు, ఎరుపు, పసుపు వర్ణాల సమాహారమే ‘గౌర’ శబ్దం గౌరవర్ణముగల తల్లి కనుక ‘గౌరీ’. అందరిచేత కీర్తింపబడునది కనుక గౌరీ. వివాహము కాని ఎనిమిది సంవత్సరముల వయసుగల కన్య గౌరీ. ‘నగపతి కిశోరీ’ అనే దాంట్లో, కిశోరీ శబ్దంవల్ల అమ్మ బాలారూపం వ్యక్తమవుతోంది. ‘నగ’ శబ్దం వలన - హిమవంతుని పుత్రిక గాన ఆమె హృదయదారుఢ్యం, దుష్టులపట్ల కాఠిన్యత వ్యక్తమవుతుంది. అంతేకాదు, హిమంతుడని ధ్వనించడంచేత, జగన్మాత చల్లని తల్లి, కరుణామయి అని విశదమవుతోంది. కారుణ్యం- జగజ్జననికి భక్తులపై వున్న వాత్సల్యానికి ప్రతీక. గంభీరమైన యిన్ని విషయాల్ని తెలియపరచాడు శ్రీ శంకరాచార్యులు, ఆనందలహరిలో, అద్భుతంగా.
స్వార్థరహితంగా, దేవీకటాక్ష సిద్ధిని లోక కల్యాణానికి ఉపకరించి సర్వమానవ సౌభ్రాత్రతతో విశ్వమానవ కళ్యాణాన్ని వీక్షించాలని చెప్తోంది, శ్రీ దేవీ శరన్నవరాత్రుత్సవములో రెండవ రోజు పూజలందుకుంటున్న బాలాత్రిపురసుందరీ మాత.

-పసుమర్తి కామేశ్వరశర్మ 9440737464