మెయిన్ ఫీచర్

పట్టుదలకు ప్రతిరూపం ప్రాంజల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాంజల్ పాటిల్.. సబ్ కలెక్టర్‌గా విధులు చేపట్టిన తొలి అంధురాలైన మహిళా ఐఏఎస్. తిరువనంతపురం జిల్లా సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించింది ప్రాంజల్. ఆమెకు కళ్లు ఏమాత్రం కనిపించవు. అయినా పట్టుదలతో ఆమె సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో విజయం సాధించింది. అదీ ఒకసారి కాదు. వరుసగా రెండుసార్లు ఎంపికైంది.
వివరాల్లోకి వెళితే..

మహారాష్టల్రోని ఉల్హాస్‌నగర్‌లో జన్మించింది ప్రాంజల్. పుట్టుకతోనే ఆమెకు పాక్షిక అంధత్వం ఉంది. ఆమె కంటిచూపు పూర్తిగా పోవచ్చునని డాక్టర్లు ఆమె తల్లిదండ్రులకు ముందే చెప్పరు. కానీ అది ముందుగానే సంభవించింది. ఆమె రెండో తరగతి చదువుతున్నప్పుడే.. ఓ సహ విద్యార్థి పెన్సిల్‌తో ఆమె కంట్లో పొడిచాడు. దాంతో ఆమె పూర్తిగా కంటిచూపును కోల్పోయింది. అయినా కూడా ప్రాంజల్ సాధారణ స్కూల్లోనే చదువు కొనసాగించింది. తర్వాత పరిస్థితులు చాలా కష్టంగా మారాయి. ఆమెను బద్లాపూర్‌లోని ఒక స్కూల్లో చేర్చారు. అక్కడి వాతావరణంలో ఆమె ఇమడకలేకపోయింది. దీంతో ఆమెను ముంబయిలోని దాదర్‌లోగల కమలాబాయి మెహెతా స్కూల్లో చేర్చారు. ఆ స్కూల్లోనే ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకూ చదివింది. ప్రాంజల్ సోమవారం నుంచి శుక్రవారం వరకూ అక్కడే, స్కూల్లోనే ఉండేది. వారాంతాల్లో ఇంటికి వచ్చేది. అప్పుడు చాలా సంతోషంగా ఉండేది. కానీ సోమవారం స్కూలుకు వెళ్లాలంటే చాలా బాధపడేదట. పదకొండో తరగతి నుంచి ఆమెను ఇంటికి దగ్గర్లోకి కాలేజీలో చేర్చారు. ప్రాంజల్ తల్లి లేదా తమ్ముడు ఆమెను కాలేజీలో దింపేవారు. పదో తరగతి వరకూ ఆమె మరాఠీ మీడియంలో చదివింది. పదకొండో తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియం.. దీంతో ఆమెకు చాలా కష్టాలు ఎదురయ్యాయి. అయినా అన్నింటినీ అధిగమించి హయ్యర్ సెకండరీ సర్ట్ఫికెట్ (హెచ్‌ఎస్‌సీ) పరీక్షల్లో జిల్లాలోనే మొదటి ర్యాంక్‌ను సాధించింది. హెచ్‌ఎస్‌సీ తరువాత ముంబయిలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో ఆమె చేరింది. అంధుల కోసం అవసరమైన సదుపాయాలన్నీ ఆ కాలేజీలో ఉన్నాయి. ప్రాంజల్ విశ్వవిద్యాలయం స్థాయిలో ఫస్ట్ ర్యాంక్‌తో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. ఆమె ఇంకా ముందుకు సాగాలనుకుంది. దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్‌యూ)లో ఉన్నత విద్య అభ్యసించాలని నిర్ణయించుకుంది. అక్కడి నుంచే అంతర్జాతీయ సంబంధాల్లో ఎం.ఎ., ఎంఫిల్ పూర్తిచేసింది. పీహెచ్‌డీ కోసం కూడా నమోదు చేసుకుంది. ఈ మధ్యలోనే నెట్, సెట్ పరీక్షలు కూడా పాసైంది.
సివిల్ సర్వీసెస్ ప్రయాణం..
ఎంఫిల్ పూర్తిచేసిన తరువాత ప్రాంజల్ సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరవ్వాలని నిర్ణయించుకుంది. ప్రారంభంలో.. అందుకు అవసరమైన స్టడీ మెటీరియల్ సంపాదించుకోవడానికి చాలా కష్టపడింది. అప్పుడు తన పర్సనల్ కంప్యూటర్‌లో స్క్రీన్ రీడర్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసుకుంది. ఆ సాఫ్ట్‌వేర్ ఆమె జీవితాన్ని కొంత సులభం చేసింది. దాని సాయంతో ఆమె న్యూస్‌పేపర్లు, ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు అన్నీ చదివేది. బ్రెయిలీలో లభించని కొన్ని పుస్తకాలని పీడీఎఫ్ ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేసుకుని చదువుకునేది. అలాగే జేఎన్‌యూలో ఉన్న ప్రాంజల్ ఫ్రెండ్ ఒకరు.. ప్రిలిమ్, మెయిన్ పరీక్షల్లో రైటర్‌గా ప్రాంజల్‌కు చాలా సహాయం చేసింది. అలా ఆ స్నేహితుల మధ్య సఖ్యత కుదిరింది. జవాబు రాయడం కన్నా చెప్పటం చాలా సులభం. రాయడం కష్టం. కానీ ఆమె ప్రాంజల్‌కు చాలా సహకరించింది. ప్రాంజల్ హెడ్‌ఫోన్ సాయంతోనే చదువుకుంది. దీనివల్ల ఆమె తన చెవులు కూడా దెబ్బతింటాయేమోనని ప్రాంజల్ ఆందోళన పడేదట. కానీ డాక్టర్ సలహా తీసుకుంటూ చదువును కొనసాగించేది. అలా ప్రాంజల్ తొలి ప్రయత్నంలోనే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 773వ ర్యాంకుతో ఎంపికైంది. కానీ ఆమె పోరాటం అక్కడితో ఆగలేదు. ఆమెకు ఇండియన్ రైల్వే ఎకౌంట్స్ సర్వీసెస్ (ఐఆర్‌ఏఎస్) కేటాయించారు. కానీ పూర్తిగా అంధురాలైన వ్యక్తికి ఆ పోస్టు ఇవ్వడానికి రైల్వే నిరాకరించింది. ఈ పరిణామం ప్రాంజల్‌ను తీవ్రంగా కలచివేసింది. ప్రాంజల్ రెండోసారి సివిల్స్ మెయిన్స్ పరీక్ష 2016 డిసెంబర్ మూడో తేదీన రాయాలి. డిసెంబర్ రెండో తేదీన ఈ విషయాలన్నీ ప్రాంజల్‌కు తెలిశాయి. షాక్ తింది ఆమె. అయితే మొదటగా ఆమె పరీక్షలపైనే దృష్టి పెట్టింది. ఈ పరిణామం గురించి డిపార్ట్‌మెంట్ ఆప్ పర్సనల్ అండ్ ట్రైనింగ్‌లో వివరించాలని ఆమె తన స్నేహితులకు చెప్పింది. తరువాత అక్కడి నుంచి ఆమెకు ఎలాంటి సమాచారం రాలేదు. అప్పటి రైల్వేమంత్రి సురేశ్‌ప్రభును కూడా కలిసింది ప్రాంజల్. పీఎంఓ సహాయమంత్రి జితేంద్రసింగ్ దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లింది ప్రాంజల్. దీంతో వారు ప్రాంజల్‌కు ఇండియన్ పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ సర్వీసెస్ కేటాయించారు. సర్వీసును కేటాయించే తన పని డీ ఓ పీటీ పూర్తిచేసినందుకు ప్రాంజల్ అది తీసుకోవాల్సి వచ్చింది. సర్వీస్‌లో చేరింది. ఈలోగా రెండోసారి రాసిన మెయిన్స్‌లో ఎంపికైంది. ఈసారి ప్రాంజల్‌కు 124వ ర్యాంక్ వచ్చింది. అలా ప్రాంజల్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌ను సాధించింది. ఆమెకు కేరళ కాడర్ వచ్చింది. అప్పుడు కేరళలోని ఎర్నాకుళం జిల్లా అసిస్టెంట్ కలెక్టర్‌గా విధుల్లో చేరింది. ఇప్పుడు తిరువనంతపురం జిల్లాలో సబ్ కలెక్టర్‌గా బాధ్యతలను స్వీకరించింది.
కుటుంబం..
ప్రాంజల్‌కు కోమల్ పాటిల్‌తో వివాహమైంది. ఆమెకు ఆయన బేషరతుగా అంగీకరించారు. మహారాష్టల్రోని ఒక చిన్న పట్టణం భూసావాల్‌లో నివసిస్తారు. అక్కడే ఆయనకు చిన్న వ్యాపారం ఉంది. కోమల్ లాగానే ప్రాంజల్ అత్తమామలు కూడా ప్రాంజల్‌కు ఎంతో మద్దతునిచ్చారు. ఆమె కష్టసుఖాల్లో ఆమెకు వెన్నంటి నిలిచారు.
ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకుని.. ఒక్కో మెట్టూ ఎక్కుతూ.. ఐఏఎస్‌గా ఎన్నికై.. నిన్న అసిస్టెంట్ కలెక్టర్.. నేడు సబ్ కలెక్టర్.. మరి రేపు.. పట్టుదలకు, కృషికి అంతమనేది ఎక్కడుంది? అందుకు నిదర్శనంగా ఉంది కదూ.. ఈ ప్రాంజల్ పాటిల్.