మెయిన్ ఫీచర్

‘త్రిపుర’ పౌర్ణమి విశిష్టత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమి చాలా పవిత్రమైనది. ఇది అత్యంత మహిమాన్వితమైనదని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో ప్రతి దినమూ పవిత్రమైనదే.. సోమవారాలు, రెండు ఏకాదశులు, శుద్ధ ద్వాదశి, పౌర్ణమి దినాలు ఒకదానికంటే మరొకటి అధిక ప్రభావంతమైనవి. నెలరోజులూ చేసే కృత్యాల ఫలితం ఒక ఎత్తు, పౌర్ణమి నాటి కృత్యాల ఫలితం ఒక్కటీ ఒక ఎత్తు. అందువల్ల అనేక వ్రతాలు, పూజలు, కృత్యాలకు, దైవారాధనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పురాణాలు వివరిస్తున్నాయి. పౌర్ణమిరోజున దీపారాధనకు విశేష ప్రాముఖ్యముంది. శివ, విష్ణు దేవాలయాల్లో రెండింటా దీపాలు వెలిగిస్తారు. విష్ణు ఆలయాల్లో గోపురం మీదా, ధ్వజస్తంభం ఎదుట, తులసికోట దగ్గర, దేవుడి సన్నిధిలోనూ ప్రమిదల్లో, ఉసిరికాయలపై బియ్యప్పిండితో చేసిన ప్రమిదల్లో దీపాలు వెలిగించాలి. ఈ దీపాలను చక్కగా కుంకుమ, పూలతో అలంకరించుకొని వెలిగించాలి. శివాలయంలో ధ్వజస్తంభంపై నందాదీపంతో పేరుతో అఖండదీపాన్ని, ఆకాశదీపం పేరుతో ఎతె్తైన ప్రదేశాల్లో భరిణల్లో (కుండలు, లోహపాత్రలతో తయారుచేసి) వేలాడదీస్తారు. అరటి దొనె్నల్లో దీపాలు వెలిగించి చెరువులు, నదులు వంటి జల వనరుల్లో విడిచి పెడతారు. ఇలా చేయడం వల్ల అష్టైశ్వర్యాలు కలగడంతో పాటు ఎంతో పుణ్యం వస్తుంది.
వైజ్ఞానికపరంగా ఆలోచిస్తే ఈ కార్తీక దీపాల వెలుగుల నుంచి వచ్చే వాయువుల వల్ల వాతావరణంలోని కాలుష్యం తగ్గిపోయి వాతావరణం శుద్ధి అవుతుంది. ఫలితంగా ఆరోగ్యం చేకూరుతుంది. కార్తీక పౌర్ణమి నుంచి ఆచరించే వ్రతాల్లో భక్తేశ్వర వ్రతం ఒకటి. ఇది స్ర్తిలకు సౌభాగ్యం కలిగిస్తుంది. భక్తురాలి కోరికను మన్నించి వరాలిచ్చే వ్రతం అని దీనికి పేరు. ఇది ప్రాచుర్యంలోకి రావడానికి ఒక కథ ఉంది. పాండ్యుడు, కుముద్వతి దంపతులు సంతానార్థం శివుని ఆరాధించి ప్రత్యక్షం చేసుకున్నారు. వారు చేసిన ఆరాధనలోని చిన్న లోపం వల్ల వరం ఇవ్వదలచుకోలేదట శివుడు. అందుకే ‘అల్పాయుష్కుడు, అతి మేధావి అయిన కొడుకు కావాలా.. పూర్ణాయుష్కురాలు, విధవ అయిన కుమార్తె కావాలా?’ అని అడిగితే.. కుమారుణ్ణే కోరుకున్నారా దంపతులు. శివుడి వరంతోటి ఆ దంపతులకి కుమారుడు పుట్టాడు. అయితే ఆ కుమారుడు పెరుగుతున్న కొలదీ ఆ తల్లిదండ్రుల్లో గుబులు పెరుగుతోంది. ఆ సమయంలో శివభక్తి పరాయణురాలైన అలకాపురి రాజకుమార్త్తెపై వారి దృష్టి పడింది. ఆమె పిలిస్తే శివుడు పలికేటంత భక్తి, శక్తి కలదని విన్నారా దంపతులు. ఆ పిల్లను తమ కోడలిగా చేసుకుంటే తమ బిడ్డను పూర్ణాయుష్కుడిగా మార్చే బాధ్యత ఆమె చూసుకుంటుందని ఆలోచించి అలాగే చేశాడు. వివాహమైన కొన్నాళ్లకే భర్తకోసం యమభటులు వచ్చేసరికి అసలు విషయం తెలిసింది ఆ సాధ్వికి. తక్షణమే తన భక్తి ప్రభావంతో శివుడ్ని ప్రార్థించి ప్రత్యక్షం చేసుకుని భర్తను పూర్ణాయుష్కుడిగా మార్చుకునే వరం పొందిందని పురాణ కథనం.
ఈ పౌర్ణమికి త్రిపుర పూర్ణిమ అని మరోపేరు. తారకాసురుడి ముగ్గురు కుమారులూ బ్రహ్మను మెప్పించి, ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచరించగలిగే మూడు నగరాలను వరంగా పొందారు. అలాగే ఎవరివల్లా మరణం లేకుండా వరం కోరారు. అది సాధ్యం కాదన్నాడు బ్రహ్మ. అలాగైతే రథంకాని రథంపై, విల్లుకాని విల్లుతో, నారికాని నారి సారించి, బాణం కాని బాణం సంధించి, మూడు నగరాలూ ఒకే సరళరేఖలోకి వచ్చాక ఒకే బాణంతో ముగ్గురునీ ఏకకాలంలో కొడితేనే మరణం సంభవించేలా వరం కోరారు. ఇవ్వక తప్పలేదు బ్రహ్మకు. ఆ వర బలంతో లోకాలన్నింటా కల్లోలం సృష్టించారు. వివిధ లోకవాసులు విసిగిపోయి బ్రహ్మకు మొర పెట్టుకున్నారు. వరం ఇచ్చింది తానే కాబట్టి ఏమీ చేయలేను.. మీరు విష్ణువు దగ్గరకు వెళ్ళండి అని చెప్పాడు. విష్ణువు కూడా తనకా శక్తిలేదని, వారిని వెంటబెట్టుకుని శివుడి దగ్గరకు వెళ్లాడు. దేవతలందరూ సహకరిస్తే తానీపని చేయగలనన్నాడు శివుడు. ఆ మాటతో భూమి రథం కాని రథంగా మారింది. మేరు పర్వతం విల్లుకాని విల్లుగా, ఆదిశేషువు అల్లెతాడు కాని అల్లెతాడుగా, శ్రీ మహావిష్ణువు బాణం కాని బాణంగా మారారు. వీరందరి సమాహార శక్తితో శివుడు త్రిపురాసురులను సంహరించాడని, అందువల్ల కార్తీక పౌర్ణమికి ఈ పేరు వచ్చిందని పురాణ కథనం.
కార్తీక పౌర్ణమిరోజు చేసే స్నానం, దీపారాధన, ఉపవాసం వంటి అన్నింటిలోనూ ఆరోగ్య, ఆధ్యాత్మిక భావనలు అంతర్లీనంగా ఉన్నాయి. ఈ మాసమంతా సూర్యోదయానికి ముందే తలస్నానం చేయడం వల్ల ఆరోగ్యం కలుగుతుంది. ప్రస్తుతకాలంలో ఉద్యోగాల బిజీలో కానీ ఇతర ఏ కారణం చేతనైనా రోజూ దేవుడ్ని పూజించి దీపారాధన చేసే సమయం లేనివారు, నిష్ఠను ఆచరించలేని వారు కార్తీక పౌర్ణమినాడు ఆచరిస్తే చాలు.. నెలంతా పూజ చేసిన ఫలితం కలుగుతుంది. ఈ రోజున స్ర్తిల కొరకు ప్రత్యేకంగా ఉపవాసం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. పగలంతా ఉపవాసం ఉండి, రాత్రి దీపారాధన చేసి, చలిమిడిని చంద్రుడికి నివేదించి ఫలహారంగా స్వీకరించాలి. ఇలా చేయడం వల్ల కడుపు చలువ అంటే బిడ్డలకు రక్ష కలుగుతుందని పెద్దలంటారు. ఆరోగ్యపరంగా చూస్తే ఇలా చేయడం వల్ల గర్భాశయ సమస్యలు దరిచేరవని ఆయుర్వేద శాస్త్ర కథనం. ఈ రోజు మరో ప్రత్యేకత ఏంటంటే.. శివాలయాల్లో జరిపే జ్వాలాతోరణం. కార్తీకపౌర్ణమిరోజు శివుడు త్రిపురాసురులను సంహరించి ఇంటికి వస్తాడు. విజయంతో తిరిగి వచ్చిన పరమశివుడికి దిష్టి తగలకుండా ఉండటం కోసం పార్వతీదేవి జ్వాలాతోరణోత్సవం నిర్వహించిందట. అదే పద్ధతిలో ఈ రోజున శివాలయాల్లో జ్వాలాతోరణోత్సవాన్ని జరుపుతుంటారు. కార్తీకపౌర్ణమి రోజున శివాలయానికి వెళ్లి దీపారాధన చేసి ఈ జ్వాలా తోరణోత్సవాన్ని చూడటం వల్ల సమస్త దోషాలు నశించి సకల శుభాలు చేకూరతాయట. ఇంకా ప్రాంతీయ, ఆచార వ్యవహారాల భేదంతో అనేక వ్రతాలు, పూజలు, నోములు చేస్తారీ రోజు. వాటిలో వృషవ్రతం, మహీఫలవ్రతం, నానాఫలవ్రతం, సౌభాగ్యవ్రతం, మనోరథ పూర్ణిమావ్రతం, కృత్తికావ్రతం వంటివి ముఖ్యమైనవి. వీటితోపాటు లక్షబిల్వార్చన, లక్షప్రదక్షిణ, లక్షవత్తులు, లక్షరుద్రం వంటి పూజలు చేస్తారు.
ప్రత్యేకతలు
దైవదర్శనం, దీపారాధన, దీపదానం, సాలగ్రామదానం, దీపోత్సవ నిర్వహణ ఈ రోజు విశేష శుభ ఫలితాలను అనుగ్రహిస్తాయని కార్తీక పురాణంలో ఉంది. ఎవరి శక్తి సామర్థ్యాలను బట్టి హరిహరులను సేవించి వారి కరుణా కటాక్షాలు పొందాలి. వీరిని ఎంత నిష్ఠతో పూజిస్తే అంత శుభఫలితాలు ఉంటాయి.