మెయన్ ఫీచర్

అర్థం లేని పాఠ్యాంశాలు అవసరమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భాష భావాభివ్యంజన సాధనం, జ్ఞానార్జనకు మూలం. అది పారంపరికమై, జన వ్యవహారములో రూఢమై, అనుకరణ, శిక్షణల ద్వారా వ్యాప్తి చెంది భాషా నైపుణ్యాల రూపంలో ఆర్జింపబడుతుంది. భాష - భావం పరస్పరాశ్రయాలు. అందుభావం ప్రధానం, భాష ఆనుషంగికం. భాష సామూహిక జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. భాషా సాధనంలో మానవుడు జ్ఞాన విజ్ఞానాలను పెంపొందించుకొని కొత్త అనుభూతులను, కొత్త వైఖరులను, కొత్త అభిరుచులను ఏర్పరచుకుంటాడు. భాష మానవ జాతి తరతరాల నుంచి సాధించిన అనుభవ సంపత్తిని ‘విద్య’ రూపంలో అందించే నిధి. అది అతి ప్రాచీనకాలం నుంచి వెలసిన విజ్ఞానం, వేదాలు, ఉపనిషత్తులు, కావ్యాలు, పురాణాలు, నాటకాది శాస్త్రాలు చదివి, అభ్యసించి, ఆనందించడానికి తోడ్పడుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే భాష మనకు తరతరాల నుండి పరంపరాగతంగా ప్రాప్తించిన సాంస్కృతిక వస్తు విశేషం, వైజ్ఞానానికి వారసత్వ సంపద. భాష దాన్ని మాట్లాడువారి సంస్కృతి, సభ్యత, సంస్కార వికాసాన్ని బట్టి, ఔన్నత్యాననుసరించి అదియును అట్టి ‘గతి’నే పొందుతుంది.
పాలభాష..బాలభాష
అమ్మ ఒడిలో, తల్లి ఒడిలో ఆ, ఊ లలో ప్రారంభించి శిశువు నేర్చుకునే భాష తెలుగు భాష, అదే మన మాతృభాష. అది పాలభాష, బాలభాష ముద్దుముద్దు మాటల ముద్ద్భుష... అన్న - అన్నం, పాయి-పాలు, లాల - నీళ్లు, ఆయి - నొప్పి, జ్వరం, బూచి-దెయ్యం, కూ-రైలు, బచ్చు-బస్సు, కాలం-కారం, ఆచ్చిపోదాం-బయటికి పోదాం, మియ్యావు-పిల్లి, కట్టె-కుక్క మొదలయినవి శిశువు మాట్లాడే ముద్దుమాటలు. ముద్దుమాటలుగా మిగిలి పోకుండా మనం భాషను తీర్చిదిద్దాలి. తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు మాట్లాడే భాషను శిశువు అనుకరిస్తూ ఆచరిస్తుంటాడు. తనకు సౌలభ్యంగా ఉన్న మాటల్ని మొదటగా నేర్చుకుంటాడు. అమ్మ, అత్త, అక్క, నాన, తాత మొదలయినవి. పిల్లలు తమ తమ ఆటలల్లో, జట్టులల్లో భాషా ప్రయోగాలను చేస్తూ తమ మాతృభాషను విస్తృతపరచుకుంటారు. బొమ్మలతో ఆడుకుంటూ కొన్నిసార్లు పెద్దవాళ్లను అనుకరిస్తూ ఉంటారు. పిల్లల భాషా నిర్మితి పటిష్టం చేసే వ్యవస్థలో తల్లి ఒడి తరువాత ‘బడి’ చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. పాఠశాలలో పిల్లలు ఉపాధ్యాయులను అనుకరిస్తుంటారు. జట్టు పిల్లల ద్వారా ఆటలు, పాటలు, మాటల ద్వారా కొంత భాషను నేర్చుకొని ఉంటారు. ఆత్మ కొంగుపట్టుకొని ముద్దు, ముచ్చటతో కాలం గడిపిన చిన్నారులు ఈ కాలంలో మూడున్నర ఏండ్లకే పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో చేరి అయిదేండ్ల వయసులో ఒకటవ తరగతిలో అడుగుపెడుతున్నారు. పాఠశాలలో పిల్లలు ప్రవేశించిన తరువాత ప్రతి స్థాయిలోను శ్రవణ, భాషణ, పఠన, లేఖ నాదులను వారి భాష, భావ, మానసిక పరిణతి, వయసు, పరిసరాలు, కుటుంబ నేపథ్యాలను బట్టి పెంపొందంచవలసిన బాధ్యత ఉపాధ్యాయులది. వాటికి తోడుగా భావావగాహనం, ప్రాయోగిక వ్యాకరణం, స్వయం అధ్యయనం, భాషోపయోగం, శబ్దజాలంలో అధికారం అనే కనీసాభ్యసనస్థామూలను అభివృద్ధి పరచడం ధ్యేయంగా విద్య, ప్రణాళిక, పాఠ్య ప్రణాళిక, విషయ ప్రణాళికలను రూపొందించుకోవాలి. వాటిని పాఠ్య పుస్తకరచనలో పొందుపరచాలి. వీటన్నింటికి ఒక పద్ధతి, విధానం, రీతి అనేది ఉంటుంది. బోధనాభ్యసనం, బోధనాభ్యసన కృత్యాలు, సామగ్రి, అభ్యసన ప్రక్రియలు, భాషా సామగ్రి, భావసామగ్రి, సాహిత్య సామగ్రి, జాతీయాలు, నుడికారాలు, సామెతలు, లోకోక్తులు వ్యాకరణాంశాలు మొదలైన వెన్నో తదితరాంశాలు వాటిలో చోటు చేసుకోవాలి. అప్పుడే ఉపాధ్యాయుడు విషయాంశ విశే్లషణ చేసుకొని బోధనకు ఉపక్రమించాలి. పాఠ్య పుస్తకాలు స్పష్టంగా, నిర్దుష్టంగా, నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ, గుణాత్మకత పెంపొందించే విధంగా రాయబడాలి. అప్పుడే భాషా నైపుణ్యాలు అభివృద్ధి అవుతాయి. పాఠశాల విద్య పరిపుష్టమవుతుంది.
ప్రభుత్వాలు మారినప్పుడల్లా పాఠ్య గ్రంథాలు మారుతున్నాయి. అస్తవ్యస్తమయిన అంశాలు చోటు చేసుకుంటున్నాయి. పర్యవేక్షణ లోపించింది. నాసిరకమైన పాఠ్యాంశాలకు వాచకాలు వేదికలయ్యాయి. యన్.టి.రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ‘కొత్త దీపం’ పేరుతో బాపు, రమణలతోని వీడియో పాఠాలను రాయించారు. పదివేల టీవీలను పాఠశాలలకు అందజేశారు. ఉపాధ్యాయులు పాఠానికి ముందు, పాఠం తరువాత అంశాన్ని గురించి బోధించాలి. కాని మన ఉపాధ్యాయులు ఆ కార్యక్రమాన్ని నీరుగార్చారు.
ఇదీ నిర్వాకం
రాష్ట్ర విద్యాపరిశోధనా శిక్షణా సంస్థలోని దృశ్య శ్రవణ విధానం వారి నిర్వాకమిది. అప్పట్లో ఎస్.సి.ఇ.ఆర్.టి. అధీకృత సంస్థగా, నాగభైరవ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో పాఠ్య గ్రంథాలు రాయించారు. బాలభారతి, మూడవ తరగతి, 14వ పాఠం, ‘ప్రజాసేవయే మా కర్తవ్యం’ పాఠంలో ‘ఎంతసేపు ఎదురుచూసినా బస్సు లేదు. కండ్లుకాయలు గాసిపోయాయి, అతుకుల గతుకుల రోడ్డు మీది నుంచి బస్సు వచ్చింది. తీసుకొంటూ, దొబ్బుకుంటూ బస్సు ఎక్కాం. విపరీతమైన రద్దీ, ఎగుడు దిగుడు రోడ్డు మీది నుంచి బస్సు పోతుంటే మా పైప్రాణాలు పైకి పోయినట్టనిపించింది.’ ఇదీ పాఠం ప్రారంభం. అంతా ఋణాత్మకం. ఎన్.టి.ఆర్. సంచాలకులతో సహా మమ్మల్ని పిలిపించారు. ఇలాంటి పాఠాలు రాస్తే ఎలా? ప్రభుత్వం ప్రతిష్ట ఏంగావాలి? మీరు పాఠ్యపుస్తకాలను చదివి సమీక్షించి సరిదిద్దాలిగదా! ఏం చేస్తున్నట్లు అంటూ మెత్తగా చివాట్లు పెట్టి పాఠాన్ని తిరిగి రాయించుమన్నారు. అప్పుడు ‘బస్సు అద్దంలాంటి తారురోడ్డు మీద నుంచి రయ్యిన వచ్చింది. క్యూ పద్ధతిని పాటిస్తూ బస్సు ఎక్కాం. కిటికీ ప్రక్కన కూర్చున్న మాకు బస్సు నడుస్తుంటే చెట్లు వెనుకకు పోతున్నట్లనిపించింది. చెప్పలేని ఆనందం కలిగింది’. ఇలా విషయమంతా ధనాత్మకం, పాఠం సుఖాంతం. అలాగే ఎనిమిదవ తరగతి వాచక పాఠం ‘‘ఏడు ఘడియల రాజు’’ తెలుగు విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి పేర్వారం జగన్నాథం రచన, ఇతివృత్తం సర్వాయి పాపన్న. సర్దారు పాపన్న ఏడు బిందెల ధనం ఎక్కడ దాచావని తన తల్లిని వెంట్రుకలు పట్టి ఈడ్చి కొట్టాడు. ఆ పాఠంపట్ల అసెంబ్లీ సాక్షిగా పెద్ద గొడవే జరిగింది. ఆ పాఠాన్ని తొలగించాలని విద్యాశాఖ వారి ఆదేశాలు దాని స్థానంలో అప్పటి రచయిత డా. జయరాం తెలుగు విశ్వవిద్యాలయం మాజీ ఉప కులపతులు నాయని కృష్ణకుమారి రచన ‘‘కవల పిల్లలు’’ జానపద కథను ఎంపిక చేశారు. తొమ్మిదవ తరగతిలోని ‘పార్వతీ తపస్సు పాఠం శృంగార భరితంగా ఉండేది. అందులో ఒక పద్యంలో ‘‘కొంగుచాటున వర్ధిల్లు కుచభరమున’’ అనే వాక్యంపట్ల బోధనకు అనుకూలంగా లేదనే విమర్శలు వచ్చాయి. దాన్ని తొలగించారు. అట్లాగే 1994లో రచించిన నూతన ‘తెలుగు భారతి’ ఒకటవ తరగతి వాచకంలో ఒక చిత్రం రైల్వే ప్లాటుఫారం మీద అమ్మాయి పూలబుట్టతో పూలదండ అమ్ముతున్నట్లుగా (చిత్రకారులు గోలి శివరాం) ఉంది. అప్పటి ప్రధాన కార్యదర్శి రాజాజీ పాఠశాలలో ఉండాల్సిన అమ్మాయి ప్లాటుఫారంపై ఎందుకుందని అభ్యంతరం వ్యక్తపరిచారు. దాని స్థానంలో చిత్రకారుడు నడుం వంగిపోయిన ఒక ముసలమ్మ చిత్రాన్ని వేశారు. తిరిగి రాజాజీ మీరు వృద్ధులకిచ్చే గౌరవం ఇదేనా? అన్నారు. తిరిగి ఒక నడివయసు స్ర్తి చిత్రాన్ని పూలు అమ్ముతున్నట్లుగా చిత్రించడం జరిగింది. ఈ రకంగా స్ర్తిలు, బాలికల గౌరవానికి భంగం కలిగే అంశాలను చిత్రాలను వాచకాలల్లో పరిహరించడం జరిగేది. ఎస్.సి.ఇ.ఆర్.టి.లో పాఠ్య పుస్తకాలపై వచ్చే అభ్యంతరాలను విషయం వారీగా సమీక్షించి, సవరణలు చేసేది. ప్రస్తుతం ఈ సంప్రదాయానికి స్వస్తి చెప్పి, వాచక రచన, విషయ నైప్యుం, పని సంస్కృతిపట్ల అవగాహన లేని వలసదారులను, పైరవీకారులకు అది నిలయంగా మారింది. విద్యాశాఖకు ‘‘తెల్ల ఏనుగు’’లా తయారయింది. అత్యున్నతమైన యస్.సి.ఇ. ఆర్.టి.కి ఈ అధోగతి పట్టడానికి కారణభూతులెవరు?
200-2008 వరకు అమల్లో ఉన్న అయిదవ తరగతిలోని పాఠం అధ్వాన్నం. అప్పట్లో ప్రభుత్వ పథకాలను ఏకంగా పాఠ్యపుస్తకాల్లో చొప్పించారు. ఆరోగ్య వారోత్సవాలు పాఠంలో ‘ఏరా గోపీ అలా కూచున్నావేంటి అని టీచర్ అడిగింది. ఆ ‘రాము’కు ఆరోగ్య వారోత్సవంలో ప్రైజు వచ్చింది. నాకు రాలేదని విచారంగా ఉంది అన్నాడు గోపి. నీ చింపిరిజుట్టు, జిడ్డు మొహం నీకెలా వస్తుంది? నీవు అద్దంలో నీ మొహం చూసుకొని రమ్మంది టీచర్’. అప్పుడు ప్రభుత్వ పథకంలో పాఠశాలలకు అద్దాలు, దువ్వెన్లు సరఫరా చేశారట అందుకే ‘అద్దం’ ప్రసక్తి, నాసిరకం సంభాషణా పాఠం. తరువాత ఇంకో పాఠం ‘బడికిపోతా’ దాన్ని బడికి వెళితే కూలీపని ఎవరు చేస్తారు? నాలుగురాళ్లు ఎలా వస్తాయి? బడికి పంపొద్దు అంటాడట’ తండ్రి తల్లితో - పాఠం శైలి, నడత, ప్రదర్శన - చిత్రం అంతా తప్పుల తడక... చౌకబారు పాఠం. పేజీ 35-8వ పాఠం ‘దరఖాస్తు’’ స్వయం ఉపాధికోసం మహిళలకు ఋణాలు ఎస్.జె.ఎన్.వై. పథకం కింద ఇవి చేయడంలో ఎస్.జె.ఎన్.వై., డి.ఆర్.డి.ఎ., మార్కెటింగ్ డిమాండు, ప్రాజెక్టు లీడ్ బ్యాంక్ మొదలైన వాటి గురించి తెలుసుకోండి. పాఠమంతా కలగాపులగం... అయోమయం. వాచకాలు పిల్లల కోసమా, ప్రభుత్వాల కోసమా? ప్రస్తుతం గూడ అదే తీరు అదే విధానం. పన్నుల వసూలు, షేరు మార్కెట్టు పాఠాలల్లో పెట్టాలని అభ్యర్థనలు, సూచనలు. అట్లే ‘అవ్వ-బువ్వ’ పాఠం, ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా ఎన్.సి.ఇ.ఆర్.టి.కి చీమకుట్టినట్టు కూడా లేదు.
ప్రస్తుతం ఏడవ తరగతి రెండవ పాఠంలో ‘నాయనమ్మ నడుం విరగొట్టినా’ వృద్ధులపై గౌరవ భావమంటూ సమర్ధించుకోవడం విశేషం. ఒక ఆంగ్ల వాచకంలో దళితుడు ఇల్లు కట్టుకుంటే అగ్ర కులస్థుడు దాన్ని కాలబెట్టాడట. దాన్ని లౌకిక వాదమంటూ సమర్ధించుకోవడం విద్యాశాఖకే తలవంపు. ఇలాంటి మతితప్పిన పాఠాలు, వాచకాలల్లో చిన్నారుల కోసం రాయడం అవసరమా? ఇవి ఏ నైతిక విలువల్ని, జ్ఞానాత్మక విలువల్ని పెంచి పోషించడానికి? ఏ మేధావి వర్గం ఈ వాచక నిర్మాణంలో పాల్గొంది?

-డా. సరోజన బండ