మెయన్ ఫీచర్

అస్త్రాలు లేకుండా భాజపా యుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇద్దరు తాగుబోతులు మధ్యరాత్రి పనె్నండు గంటలకు నిండుగా తాగి ఓ వివాదం ముందు పెట్టుకుని కొట్లాడుతున్నారు.! ఆకాశంలోకి చూపించి ఒకడు అక్కడ కనిపిస్తున్నది చంద్రుడని, మరొకడు సూర్యుడని వాదించుకుంటున్నారు. వాళ్లిద్దరు ఎంతసేపు వాదించుకున్నా ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. హటాత్తుగా ఓ పెద్దమనిషి ఆ తోవకుండా వెడుతున్నాడు. అతణ్ణి ఆపి ఆకాశంలో కనిపిస్తున్నది సూర్యుడా! చంద్రుడా! తేల్చిపొమ్మన్నారు తాగుబోతులు. చంద్రుడు! అని ఈ పెద్ద మనిషి నోరు తెరిస్తే, సూర్యుడు అన్నవాడు ఇతని ముఖం పగలగొట్టడానికి సిద్ధంగా వున్నాడు. ఇదంతా తనకెందుకు అనుకున్న పెద్ద మనిషి అటు ఇటు చూసి, ‘ఇది మా వూరు కాదు’ అని వెళ్లిపోయాడట!
సరిగ్గా ఇలాగే తెలుగు ఆకాశంలోని ‘చంద్ర’ బింబాన్ని చూసి భాజపా నేతలు మా వూరు కాదు అని తప్పించుకుని పోయే కాలమా ఇది! ఎంతసేపు ‘నరేంద్ర మోదీ నిజాయితీపరుడు’, అన్న ఒక్క అంశమే తెలుగు రాష్ట్రాల భాజపాను గట్టెంక్కించగలుగుతుందా? ఇక్కడి ప్రభుత్వాల పనితీరు, స్థానిక రాజకీయ వ్యూహం, ప్రతిపక్షంగా తెలంగాణలో, మిత్రపక్షంగా ఆంధ్రలో తన ప్రత్యేక ముద్ర వేయవద్దా! మూడేళ్లు గడిచినా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న విధంగా సాగుతున్న తీరు కింది క్యాడర్‌కు ఆందోళన కలిగిస్తున్నది. అంతేకాకుండా దక్షిణాది రాష్ట్రాల్లో విచ్చిన్నకర శక్తులు అనేక ముఖాల్లో జాతి వ్యతిరేక చర్యలు జరుపుతున్నా కిమ్మనకుండా వుండడం కూడా ఇక్కడి భాజపా రాజకీయ వ్యూహమా?
కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో భాజపా విస్తరణకు వ్యూహాలు పన్నిన రాంమాధవ్ గత జూన్ 23న వరంగల్‌కు వచ్చాడు. అక్కడి పదాధికారుల సమావేశంలో మాట్లాడుతు శక్తివంతమైన నాలుగు వాక్యాలు చెప్పారు. ‘రాజకీయాలు చారిటీ కోసం వుండవు. సేవ చేయడానికి అనేక సంస్థలు వుంటాయి. అధికారాన్ని చేజిక్కించుకోవడానికి రాజకీయాలు చేయాలి. రాజకీయాల్లో భావోద్వేగాలకు స్థానం వుండదు. మనవాడే అని ఆలోచించడం కుదరదు. అలా చేస్తే పని జరగదు. పాలిటిక్స్ హాజ్ టు బీ ఎ కోల్డ్ బ్లడెడ్’ అన్నాడు. అక్కడ ఈ వాక్యాలు విన్న నాయకులంతా శరీరంనిండా శక్తి నిండి శక్తిమాన్‌లు అయ్యారు. మరి దానికి తగినట్టుగా తరువాత యుక్తి ఎక్కడుంది?
తెలంగాణలో ఏ కార్యకర్తను కదిలించినా ‘ఆ నలుగురు!’ అంటున్నారు. పార్టీ బాగుంది, కానీ అందులో చేరితే పట్టించుకునేవారు లేరు అని కొందరు! అసలు ఎన్నికల వరకు పొత్తు ఎవరితో పొడుస్తుందో చెప్పలేని స్థితి. ఆగస్టు 26న అదే రాంమాధవ్ సికింద్రాబాద్‌లో నిర్వహించిన నవభారత్ నిర్మాణ సభలో మాట్లాడుతూ ‘2019లో తెలుగు రాష్ట్రాల్లో ఎంపీ సీట్లన్నీ మావే’ అన్నారు. అంటే ఎమ్మెల్యే సీట్లు ఎవరికి! అన్న సందేహం తలెత్తడం సహజం.
తెలంగాణ ప్రాంతంలో 109 సీట్లలో పదిహేను సీట్లల్లో బలమైన భాజపా నాయకులున్నారు. మిగతా 95 స్థానాల పరిస్థితి ఏమిటి? వాటికోసం తీసుకున్న విస్తృత కార్యక్రమం ఏమిటి అనేది ఎవరికీ తెలియదు. అమిత్‌షా వచ్చి వెళ్లాక బూత్ కమిటీల ఏర్పాటు, తెలంగాణ విమోచన యాత్ర, రాజనాధ్ సభ, డిఎస్ కుమారుడు సంజయ్ భాజపాలో చేరడం మాత్రమే చెప్పుకోదగిన విషయాలు. ఎపుడైనా కెసిఆర్‌పై ప్రజలకు ‘మొహంమొత్తితే’ మాకు అవకాశం రాకపోదా అని చూడడం కోల్డ్‌బ్లడెడ్ రాజకీయమా?
తెలంగాణ భాజపా అధ్యక్షుడు డా.లక్ష్మణ్ సాదాసీదా వ్యక్తిత్వం వున్న మనిషి. నాకు గుర్తున్నంతవరకు తెరాసకు ప్రత్యామ్నాయం తామే అని ఓ యాభైసార్లు ప్రకటించాడు. కానీ ఆచరణలో కెసిఆర్ రాజకీయ చాతుర్యాన్ని ఎదుర్కోవడానికి వేసిన అడుగులెన్ని? నిజానికి దక్షిణాదిన కర్నాటక తర్వాత భాజపా విస్తరణకు తెలంగాణనే మంచి మైదానం. ఈ ప్రాంత ప్రజల్లో జాతీయవాద శక్తులకు స్థానం సుస్థిరంగా ఉంది. అందువల్లనే తెలంగాణ ఉద్యమంలో ఎవరెన్ని హైజంప్‌లు లాంగ్ జంప్‌లు చేసినా ప్రజలు కెసిఆర్ వెంట నిలబడ్డారు. కెసిఆర్ వెంబడి నిలబడడంలో తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక భావన, కృతజ్ఞతగా వ్యవహరించడం అనే రెండు లక్షణాలు కనిపిస్తాయి. అయితే ‘ఒక ఓటు రెండు రాష్ట్రాలు’ అన్న కాకినాడ తీర్మానం అందరికన్నా ముందే భాజపా చేసినా తర్వాత ఉద్యమంలో భాగస్వామి అయిందే తప్ప దానిని లీడ్ చేయలేకపోయింది. తెలంగాణ వస్తే భాజపా బలపడుతుందనే ఎంఐఎం, సిపిఎం ఆనాడు ప్రత్యేక రాష్ట్ర సాధనకు మోకాలడ్డే ప్రయత్నం చేసాయి. తర్వాత కెసిఆర్ రాజకీయ వ్యూహాలతో ఇక్కడి భాజపా, మిత్రపక్షమో, ప్రతిపక్షమో తెలియనంత గందరగోళం ఏర్పడింది. ఆ స్తబ్దత అలానే కొనసాగుతోంది. సామర్ధ్యం వున్న నాయకుడు మురళీధర్ రావుకు జాతీయ స్థాయిలో వున్న పేరు కిందిస్థాయిలో ప్రజల్లో లేదు. భాజపాలో ఎంతో అనుభవం వున్న బండారు దత్తాత్రేయ మంత్రిగా వున్నన్నాళ్లు తాను కెసిఆర్‌తో ‘గుడ్‌బాయ్’ అనిపించుకోవడానికే ప్రయత్నం చేసాడు తప్ప ప్రభుత్వంపైకి దూకుడుగా కాలు దువ్వింది లేదు. తెరాస ప్రభుత్వ విధానాలను ప్రశ్నించింది లేదు.
విషయ పుష్టి కన్నా, గోముగా ప్రజలనాకర్షించే నాగం ఇటీవల ఎందుకు వెనుకబడ్డాడు. టీవీ చర్చల్లో ముందున్న రఘనందనరావు, శ్రీ్ధర్‌రెడ్డి, కరుణసాగర్, ప్రకాశ్‌రెడ్డి ఈరోజువరకు సహాయ నటులుగానే తమ పాత్రలు నిర్వహిస్తున్నారు. కిషన్‌రెడ్డి అనేక విషయాల్లో సమర్ధుడైనా ఈ మధ్యలో వౌనంగ వుండడంమే తన రాజకీయం అన్నట్టు సరిపెట్టుకున్నాడు. ఎమ్మెల్యే రాజాసింగ్ హిందూ ఫాలోయింగ్ పెంచుకుంటుండగా చింతల రామచంద్రారెడ్డి చిన్న జీయర్ స్వామి శిష్యుడిగా ఆరితేరాడు. ఎన్వీఎస్ ప్రభాకర్ నియోజకవర్గంలో ‘్ఫల్ బిజీ’. ఇంద్రసేనారెడ్డి, బద్దం బాల్‌రెడ్డి, చింతా సాంబమూర్తి, మందాడి లాంటి వారు ప్రస్తుతం పెద్ద మనుషుల కోవలోనే కొనసాగుతున్నారు.
హైదరాబాద్ నడిగడ్డపై ఒవైసీ సోదరులు ప్రధాని నరేంద్ర మోదీని తిట్టిపోసినా దీటైన సమాధానం లేదు. మజ్లిస్‌ను కేసిఆర్ చంకనెక్కించుకున్నాడన్న చర్విత చరణ వాక్యం తప్ప ఒవైసీ మాట్లాడుతున్న మతతత్వ భాషను అంశలవారీగా ఇక్కడి నాయకులు ఎదుర్కోలేకపోతున్నారు. అందువల్ల అతడు జాతీయ నాయకుడు అవుతున్నాడు. ఎందుకంటే ఒవైసీపై కేంద్ర భాజపాలోని సందీప్ పాత్ర, నళిన్ కోహ్లీవంటి నేతలు మాత్రమే మాట్లాడేసరికి జాతీయ మీడియా అతనిపై దృష్టి సారించింది. అంతెందుకు సిపిఐ నారాయణ ‘మోదీని నాలుక కోయాలి, ఉరి వేయాలి’ అని బహిరంగంగా విమర్శిస్తూంటే అదేదో తమకు కలిసొచ్చే నెగిటివ్ ప్రచారం అన్నట్టు తెలుగు రాష్ట్రాల భాజపా నాయకులు చూస్తుండిపోయారు తప్ప స్పందన లేదు.
భాజపాకు మూలధనం లాంటి జాతీయ భావం ఎక్కడినుండి ఉత్పత్తి అవుతుందో ఇక్కడి నాయకులు పసిగట్టడం లేదు. జాతీయతకు మారు పేరైన సరస్వతీ శిశుమందిరాలు ఆర్థిక అవసరాల్లో కొట్టుమిట్టాడుతుంటే వాటిని ఆదుకోవడం కోసం వీళ్లు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ఒకప్పటి విద్యార్థి పరిషత్ నాయకులే ఈరోజు తెలంగాణ భాజపాలో చక్రం తిప్పుతున్నారు. మరి విద్యార్థి పరిషత్‌కు మూల కేంద్రమైన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇప్పుడు ఆ సంస్థ ఉనికి ఎంత? ఇటీవల కొత్తగా ఏర్పాటైన ఇతర తెలంగాణ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థి పరిషత్ భాగస్వామ్యం కోసం ఏమైనా ప్రయత్నం జరిగిందా? పోనీ పత్రికలు, టీవీల్లో భాజపా పరిస్థితి ఏమిటి? సిపిఐ,సిపిఎం లాంటి పార్టీలు కూడా పత్రికలు, టీవీలు నడుపుతుంటే మాది అని చెప్పుకునే భాజపా పత్రిక కానీ, టీవీగాని వుందా! కేసిఆర్ తెలివిగా వాటిని ఎలా ఉపయోగించుకుంటున్నారో గమనించకపోతే ఎలా? మరణ శయ్యపై వున్న కమ్యూనిస్టులు ఈ ప్రచార, ప్రసార మాధ్యమాల ద్వారా తమ సిద్ధాంతాలను ప్రచారం చేస్తున్నది నిజం కాదా!
జాతీయవాద మేధావులను కూర్చోబెట్టి భాజపావారు ఎప్పడైనా మాట్లాడే ప్రయత్నం చేసారా? జర్నలిస్టుల్లో, రచయితల్లో, కవుల్లో జాతీయవాదులు ఎవరున్నారో కనీసం వారిపేర్లైనా ఇక్కడి నాయకులు తెలుసుకున్నారా? జాతిని అవమానించిన యార్లగడ్డ, ‘ద్రౌపది’ పేరుతో అవమానకరంగా నవల రాసిన పెద్దమనిషి, పద్మ అవార్డు పొంది, రోజూ వెంకయ్యనాయుడు పక్కన ఫొటోల్లో కన్పిస్తాడా! జాతి వ్యతిరేక శక్తులకు అవార్డులు వస్తుంటే ఇక్కడి భాజప నాయకులు కళ్లు మూసుకుంటే ఎలా? భాజపాకు బలమైన మద్దతుదారులైన 25 లక్షల మంది ఆర్యవైశ్యులు రోడ్లపై తన మనోభావాలు గాయపడుతున్నాయన్నా అనుకూలంగా భాజపా మాట్లాడితే వారి నోటి ముత్యాలు రాలిపోతాయా?
తెలంగాణ వచ్చాక కుల సంఘాలను, ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలను తమవైపు తిప్పుకునే ప్రయత్నం జరగలేదు. యుపికన్నా ఎక్కువ ప్రాంతీయ పార్టీలు, బలమైన శక్తులు ఇక్కడ ఏమీలేవు. గోహత్యలు, వినాయక మండపాలపై ఆంక్షలు, వినాయక ఊరేగింపులపై నిర్బంధనలు విషయంలో మిగతా పార్టీల్లాగనే భాజపా వౌనంగా వుంది. ఒక్క ఉట్కూరు సంఘటనలో తప్ప ఎక్కడా తీవ్రంగా స్పందించలేదు. విమోచన యాత్ర భాజపా కార్యకర్తలను ఉత్సాహపరిచిందే తప్ప మిగతా సమాజాన్ని ప్రభావితం చేయలేదన్నది నిష్ఠుర సత్యం! దానికి కారణం ఏమిటి?
ఆంధ్రలో ఇదీ తీరు!
తెలంగాణలో ఇలావుంటే ఆంధ్రలో కులతత్వం ముందు భాజపా కునారిల్లుతోంది. 2019లో అధికారంలోకి వస్తాం అని చె ప్పుకోవడానికైనా తెలంగాణలో వుంది కానీ ఆంధ్రలో కక్కలేని మింగలేని పరిస్థితి.
నంద్యాలలో చంద్రబాబు దగ్గరకు రానీయకున్నా ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రులు నామమాత్రంగా వున్నా తమది అన్న అస్తిత్వమే అక్కడి భాజపాకు లేకుండాపోయింది. మంత్రి కామినేని శ్రీనివాస్ తెదేపా కార్యకర్తకన్నా ఇంకా అత్యుత్సాహంతో పనిచేస్తున్నారు. మాణిక్యాలరావు వ్యక్తిగతంగా మంచి వాడే అయినా దేవాదాయ శాఖమంత్రిగా వుండి పుష్కరాల్లో గుళ్లు కూలగొట్టిన ఘనత వారిది. తిరుమలలో తనదైన ముద్రను వేసేందుకు ఒక జాతీయవాద పార్టీకి చెందిన మంత్రిగా ఏమీ చేయలేదు. సోము వీర్రాజు, గోకరాజు గంగరాజు, విష్ణుకుమార్ వంటి సమర్ధులున్నా వారినోళ్లను ఎవరు కుట్టేస్తున్నారో వాళ్లే చెప్పలేని పరిస్థితి. ఇతర పార్టీలనుంచి వలస వచ్చి పొద్దుపోక ఎదురుచూస్తున్న పురంధేశ్వరి, కావూరి, కన్నా లక్ష్మీనారాయణలాంటి వారి పరిస్థితి అయోమయం అయి, ఆఖరుకు ‘జగన్నాధం’ అవుతుందేమోనని అందరికీ అనుమానం.
అక్కడి బిజెపి నాయకులకు ‘గుళ్లో దర్శనాలు తప్ప’ ఇంక అంతకన్నా పెద్ద పనులు ఏవీ కావడంలేదని ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. జోడు పదవులతో తులతూగుతున్న కంభంపాటి హరిబాబు స్థానంలో కొత్త అధ్యక్షుణ్ణి పెట్టలేకపోవడం అసమర్ధతనా? అవసరమా? ఇటీవల ఎక్కువ గోవధ జరిగిన రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. కానీ ఆంధ్ర భాజపా నాయకులు చంద్రబాబును నోరు తెరిచి అడగలేని దైన్య స్థితిలో వుండడం ఆత్మహత్య సదృశం కాదా? ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే జాతీయవాదాన్ని, ప్రాంతీయవాదాన్ని కలగలిపి పాలిస్తున్న కెసిఆర్‌ను అర్థం చేసుకోవడానికి తెలంగాణ భాజపాకు ఐదేళ్లు పట్టొచ్చు. కాస్ట్ పాలిటిక్స్‌ను, కాష్ పాలిటిక్స్ అభివృద్ధి గంపకింద దాచిపెట్టే చంద్రబాబుతో పొత్తు ఆంధ్ర భాజపాకు ‘కాలికో గుండు నెత్తికో బెండు’ లాంటిదే!
తెలుగు రాష్ట్రాల్లో కమ్యూనిస్టుల్లా తోకపార్టీల్లా కాకుండా తొడగొట్టే పార్టీలా భాజపా ఎదగాలంటే రాజకీయ రంగును కాషాయమయం చేయాలి. కాబట్టి విస్తృతమైన ప్రజాక్షేత్రంలో తిష్ఠవేసిన సమస్యల తేనెతుట్టెను కదిలిస్తేనే భాజపా భవిష్యత్తు ఆశాజనకం. లేకుంటే ఉగాదికో పార్టీ పంచాంగం విని ఆనందించాల్సిందే.

-డా. పి భాస్కరయోగి సెల్: 99120 70125 bhaskarayogi.p..gmail.com