మెయన్ ఫీచర్

వ్యూహమా? తప్పిదమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తండ్రి: పిల్లలూ.. ఈరోజు ఎవరైతే భోజనం చేయకుండా ఉంటారో వాళ్లకు ఐదు రూపాయలిస్తా
పిల్లలు ఐదురూపాయలు తీసుకుని పడుకుంటారు. మళ్లీ పొద్దునే్న..
తండ్రి: పిల్లలూ మీకు టిఫిన్ కావాలంటే ఐదు రూపాయలవుతుంది.
పిల్లలు: నువ్వు డాడీవా? మోదీవా?
మలయాళ నటుడు మోహన్‌లాల్ మామగారి పేరు బాలాజీ. బాలాజీ తమిళ నిర్మాత, నటుడు. ఈ బాలాజీ చెల్లెలు విజయపార్ధసారధి. ఈ విజయ తమిళ నటుడు మహేంద్రన్ తల్లి. మహేంద్రన్ భార్య, రజనీకాంత్ భార్య లత అక్క చెల్లెళ్లు. లతా రజనీకాంత్ కూతురు ఐశ్వర్య, అల్లుడు ధనుష్. లతా రజనీకాంత్ అన్న రవి రాఘవేంద్రన్. మహేంద్రన్ కూతురు మధుమతి అరుణ్‌ను పెళ్లి చేసుకుంది. అరుణ్ విజయచాముండేశ్వరి కొడుకు. విజయచాముండేశ్వరి, జెమిని గణేశన్ మహానటి సావిత్రిల కూతురు. బాలీవుడ్ నటి రేఖ కూడా జెమిని కూతురే. ఇప్పుడు మోహన్‌లాల్‌కి, రేఖకు చుట్టరికం చెప్పగలిగే మీకు జీఎస్టీ అర్ధమయినట్టే లెక్క.
- ఇవి గత రెండు వారాల నుంచి మోదీ నిర్ణయాలపై సోషల్ మీడియాలో లక్షలమందిని ఆకర్షిస్తున్న జోకులు. పెద్దనోట్లు రద్దయి ఏడాది ముగిసిన సందర్భంగా బీజేపీ నేతలు దాన్నొక సాహసచర్యగా పేర్కొంటూ ర్యాలీలు జరిపితే, విపక్షాలు మాత్రం పెద్దనోటుకు తద్దినం పెట్టి తమ నిరసన తెలిపారు. విచిత్రంగా.. దాదాపు ఆరేడునెలలు నోట్ల రద్దు కష్టాలను భరించిన త్యాగధనులెవ్వరూ బీజేపీ ర్యాలీవైపు కనె్నత్తిచూడలేదు. అదే విపక్షాలు పెట్టిన తద్దిన క్రతువును చూసేందుకు దారిన వెళ్లే దానయ్యలంతా వారంతట వచ్చి, ఆ పిండప్రదానంలో పాల్గొనడం విశేషం.
వ్యూహరచన చేసే సమయంలో కష్టాలు-నష్టాలు అంచనా వేయడం విజ్ఞుల లక్షణం. తమ వ్యూహం అమలయ్యే సమయంలో ఏదైనా లోటుపాట్లు ఉంటే భేషజాలకు వెళ్లకుండా, దానిని వెంటనే సరిదిద్దుకోవాల్సి ఉంటుంది. లేకపోతే పలుకుబడి పలచబడిపోతుంది. ఏడాది క్రితం నాటి నోట్ల రద్దు, తాజా జీఎస్టీలో మోదీ భాయ్ వ్యూహబృందం జనం కష్టాలను అంచనా వేయడంలో బొక్క బోర్లాపడింది.
ఫలితంగా మూడేళ్ల క్రితం వరకూ ఏ సోషల్ మీడియా అయితే మోదీ పల్లకిని భుజం పుండ్లు పడేలా మోసిందో, గత మూడు నెలల నుంచి అదే సోషల్ మీడియా ఆయన నిర్ణయాలను దునుమాడుతోంది. మోదీ పల్లకీనెక్కిన తొలిరోజుల్లో సోషల్ మీడియాలో ఆయనపై ఈగవాలితే సహించని నెటిజనే్ల, ఇప్పుడు ఆయన నిర్ణయాలపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తుండటం బట్టి మోదీ ప్రభ ఏ స్థాయిలో మసకబారుతున్నదో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.
గుజరాత్ ఇచ్చిన సర్వాధికారాల లక్షణాలను ఢిల్లీకి తీసుకువెళ్లిన మోదీ ఒక నాయకుడిగానయితే పార్టీని, సహచరులను, సీనియర్లను నియంత్రించగలిగారు. కానీ, ఆయన వాజపేయిలా మిత్రపక్షాలకు మంచి మిత్రుడు కాలేకపోతున్నారు. నమ్మకమైన నాయకుడిగా సొంత పార్టీ నేతలకూ విశ్వాసం కల్పించలేకపోతున్నారు. దేశంలో ఏ ఎన్నికలు జరిగినా, అక్కడ సొంత పార్టీ ఓడితేనయినా మోదీ వైఖరి మారుతుందని కోరుకునే వారి సంఖ్య పెరుగుతుండటం బీజెపీలో వస్తున్న అంతర్గత మార్పునకు పరాకాష్ఠ. తమ అధినేతలు నేల మీద నడవాలంటే, ఎన్నికల్లో కొన్ని ఎదురుదెబ్బలు తగలాలని అన్ని పార్టీల్లోనూ కోరుకుంటారు. అందుకు మోదీ మినహాయింపేమీ కాదు.
ప్రధానంగా పెద్దనోట్ల రద్దు ప్రభావం ఇంకా జనసామాన్యంపై పెను ప్రభావం చూపిస్తూనే ఉంది. ఇది నోట్లు రద్దయిన ఏడాది సందర్భంలో స్పష్టంగా కనిపించింది. జాతీయ మీడియా సంస్థలు స్వామివారిపై భయభక్తులు ప్రదర్శించి, జనాగ్రహ స్ధాయిని తగ్గించినా సోషల్ మీడియా మాత్రం తన నిరసన విశ్వరూపాన్ని నిర్మొహమాటంగా ఆవిష్కరించింది. నోట్ల రద్దుకు ఏడాది ముగిసిన సందర్భంలో కాంగ్రెస్ విమర్శలకే జనం మొగ్గు చూపారంటే, పరిస్థితి ఎటునుంచి ఎటు పయనిస్తుందో అర్ధమవుతోంది. ఆర్ధికరంగం కుదేలవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ చేస్తున్న మాటలదాడికి కమలశిబిరం నుంచి ఎదురుదాడి కరవయిదంటే అది వ్యూహతప్పిదమే కదా?
తాజాగా అమలుచేసిన జీఎస్టీ అయితే మరీ దారుణం. జీఎస్టీ వల్ల లాభాలు బోలెడని ప్రచారం చేసిన సర్కారు మాటలు, ఆచరణలో జనాలను ఎన్ని కష్టాల్లోకి నెడుతుందో అనుభవిస్తే తప్ప అర్ధం కాదు. తనకెలాంటి నష్టం లేని రిక్షావాడు కూడా జీఎస్టీతో నష్టమంటూ చెబుతున్నాడు మరి! కింది స్థాయిలో వ్యతిరేకత పెరుగుతుండటంతో మరికొన్ని మినహాయింపులిచ్చేందుకు సిద్ధపడుతుందంటే మోదీ సర్కారు తప్పులోకాలేసినట్లేకదా?! అడుసుతొక్కనేల? కాలు కడగనేల?
* * *
ఎవరూ తమను పొగడకపోతే తమను తామే పొగుడుకోవాలన్నట్లు.. తనకు తానే అన్నగా పిలిపించుకుని, తాను సీఎం అవుతున్నానని తనకు తానే ఊహించుకుని హామీలిచ్చేస్తున్న జగన్‌బాబు పనిలోపనిగా తనకు తాను ఎన్టీఆర్‌లా భ్రమిస్తూ, తాను కూడా అన్న గారిలా అసెంబ్లీ ముఖం చూడనని చెప్పేశారు. అన్నగారు అసెంబ్లీని బహిష్కరించినా, తమ్ముళ్లు సభలోనే ఉన్న విషయాన్ని పీ.కే.కు తెలియదు కాబట్టి బహుశా ఆయనా జగన్‌కు చెప్పి ఉండరు. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన జగన్ తీరు సొంత పార్టీ వారికే రుచించకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు.
పాదయాత్ర మంచిదే. జనం సమస్యలు తెలుసుకునేందుకు అదో దారి. కానీ అదే అధికారానికి అడ్డదారి అనుకుంటే అమాయకత్వమే. షర్మిళక్క కాళ్లరిగేలా పాదయాత్ర చేసినా ఫలితం దక్కలేదు కదా? అంతకుముందు చంద్రన్న కూడా మీకోసం అంటూ వందల కిలోమీటర్లు బస్సుయాత్ర చేసినా రాజన్నను గద్దెదింపలేకపోయారు. ఇప్పుడు జగనన్న చేసే యాత్ర అధికారం తెచ్చిపెడుతుందన్న అపోహలు ఆయనకు తప్ప ఎవరికీ లేవు.
పాదయాత్ర లో జనం కష్టాలు, కన్నీళ్లు తెలుసుకుని ఇప్పటికిప్పుడు జగనన్న ఏం చేయలేరు. కాబట్టి ఏం చేయాలి? వాటికి వేదికయిన అసెంబ్లీలో కదా వాటి గురించి గొంతెత్తాల్సింది? మరి ఆ అసెంబ్లీనే బహిష్కరిస్తే సమస్యలు ఎవరికి చెబుతారు? ఎవరిని నిలదీస్తారు? రోజుకు ఉన్న 24 గంటల్లో ఇరవైమూడున్నర గంటలు బాబు సర్కారు అవినీతి, అస్మదీయులకు తాయిలాలపై సొంత మీడియాలో పుంఖానుపుంఖాలుగా రాయడంతోపాటు, అదేపనిగా బయట చేస్తున్న ఆరోపణలు నిగ్గదీసి, సర్కారును కడిగేసే అవకాశం ఉన్న అసెంబ్లీని బహిష్కరించడం వల్ల వచ్చే ప్రయోజనమేమిటో ఇప్పటికీ ఆ పార్టీ నేతలకే అర్ధం కావడం లేదు. పోనీ, అసెంబ్లీకి వెళ్లకపోవడానికి కారణాలను సహచరులకేమైనా చెప్పారా అంటే అదీ లేదు. సర్వం జగన్నాధం మరి!
పార్లమెంటు, అసెంబ్లీలలో ప్రతిపక్షం అనుకున్నట్లు జరగవు. సభలో నిమిష నిమిషానికీ తమదే పైచేయి కావాలని అధికార పార్టీలు ఆశిస్తుంటాయి. విపక్షాలను రెచ్చగొడుతుంటాయి. ఆ అసహనంతో తప్పులు చేసే విపక్షాలను ఉచ్చులో బిగిస్తుంటాయి. ఇది సర్వసాధారణం. ఇప్పుడంటే జగన్ అసెంబ్లీలో కాలుబెట్టినందున ఆయనకిది కొత్తగా అనిపించవచ్చేమోగానీ, ఆయన తండ్రి ఉన్నప్పటి నుంచీ ఈ సంప్రదాయం ఉన్నదే. అలాగని దేశంలో ఎక్కడా విపక్షాలు సభను బహిష్కరించలేదే?! ఇది చెరువు మీద అలగడం లాంటిదే. ప్రజాసమస్యలతోపాటు, ప్రభుత్వాన్ని నిలదీసేందుకు పార్టీలకు ఉన్న ఏకైక మార్గం అసెంబ్లీనే. ఎందుకంటే ఇష్టం లేకపోయినా విపక్షం ప్రశ్నలకు ప్రభుత్వం జవాబు చెప్పాల్సిందే. దాన్ని తమంతట తామే మూసుకున్న జగన్ నిర్ణయానికి చప్పట్లు కొట్టేవాళ్లెవరూ కనిపించరు. అసెంబ్లీకి హాజరుకాకుండా, సభలో జరిగిన అంశాలపై పేపర్లలో వాపోయేకంటే అదేదో సభలోనే నిలదీస్తే ప్రజాస్వామ్యం కూడా శోభిల్లేది. రాజకీయాల్లో హత్యలుండవు. అన్నీ ఆత్మహత్యలుంటాయన్న సామెతకు ఉదాహరణ కోసం ఎవరి వైపూ చూడాల్సిన అవసరం లేదిప్పుడు!
* * *
ఒక ఊరిలో ఒక వస్తాదు తాను కొండను మోస్తానని చెప్పి సవాలు చేసి రేపు సాయంత్రం అందరినీ కొండ దగ్గరకు రమ్మంటాడు. జనాలొచ్చి కొండ ఎత్తమంటే, నేను కొండను మోస్తానన్నానే తప్ప కొండను ఎత్తుతాననలేదని, మీరొచ్చి కొండను నా భుజం మీద పెడితే మోసేందుకు సిద్ధంగా ఉన్నానన్నాట్ట సదరు సిపాయి మొనగాడు. రాజీనామాపై గంభీర లేఖోపన్యాసమిచ్చిన రేవంత్‌రెడ్డి వ్యవహారం కూడా ఇప్పుడు అలాగే ఉంది.
రాజీనామా చేసి రెండు వారాలయినా రేవంతుడి దగ్గర మళ్లీ ఆ ముచ్చటే వినిపించడం లేదు. విజయవాడ వెళ్లి బాబుకు రాజీనామా లేఖ ఇచ్చి తనకు తాను నైతికవిలువల నేతగా ప్రచారం చేసుకున్న రేవంత్, ఇప్పటివరకూ ఆ రాజీనామాను స్పీకర్‌కు ఇవ్వకపోవడం నగుబాటుపాలయింది. తనకు బీ ఫారం ఇచ్చింది బాబు కాబట్టి, దానివల్ల వచ్చిన ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామా లేఖనూ బాబుగారికే ఇస్తానంటే అది కొండ మోస్తానన్నట్లే ఉంటుంది. రాజీనామా లేఖను తన రాష్ట్ర అసెంబ్లీ స్పీకరుకు ఇవ్వాలే తప్ప, ఎలాంటి సంబంధం లేని పక్క రాష్ట్ర సీఎంకు ఇస్తే దాని భావమేమి తిరుమలేశా?
అసలు రేవంత్, చంద్రబాబుకు రాజీనామా లేఖనే ఇవ్వలేదన్న రమణ మాటలు, తమకు ఇంతవరకూ రాజీనామా లేఖ చేరలేదన్న అసెంబ్లీ కార్యాలయ ప్రకటనలో నిజం లేదని నిరూపించుకోకుండా, కాలయాపన చేస్తున్న రేవంత్ తెలివితేటలు ఎవరిని మెప్పించడానికి? ఎవరిని మభ్య పెట్టడానికో అర్ధం కాదు. విచిత్రంగా అటు తెరాసీయులు కూడా రేవంత్ రాజీనామా లేఖ ఏమయిందని ప్రశ్నించకపోవడం, రాజీనామా ఆమోదించుకోకుండా పార్టీ తీర్థం ఇచ్చిన కాంగ్రెస్ పెద్దలు కూడా వౌనవ్రతంలో ఉండటం వింతలోకెల్లా వింత.
గతంలో తెరాసీయులు లెక్కలేనన్ని సార్లు ఉప ఎన్నికలకు వెళ్లినప్పుడు పట్టుపట్టి రాజీనామాలు ఆమోదించుకున్నారు. విభజనకు ముందు హరికృష్ణ కూడా ఎంపి పదవికి రాజీనామా చేసి, దానిని ఆమోదింపచేసుకున్నారు. మరి తెలంగాణ నయా సిపాయి రేవంత్ ఆ దారిలో ఎందుకు వెళ్లడం లేదు? వ్యూహమా? తప్పిదమా? లేక ఇవన్నీ జనాలు పట్టించుకోరన్న ఆత్మవిశ్వాసమా?