మెయన్ ఫీచర్

వచ్చినవాళ్లు ఫల్గుణులేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ బుడ్డోడి కుటుంబాన్ని వాడి కళ్ల ముందే విలన్లు వేధిస్తారు. అది చూసిన మన బుడ్డోడి గుండె ఆవేశంతో రగిలిపోతుంది.కానీ ఏమీ చేయలేని నిస్సహాయత. తనలోని పగను వయసుతోపాటు గుండెల్లో పదిలంగా దాచుకుని, నూనూగుమీసాల వయసొచ్చాక ఆ విలన్ల భరతం పడతాడు. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ సినిమాల వరకూ ఇలాంటి కథలను టన్నుల కొద్దీ చూసిన వారికి.. తాజాగా జనసేనాధిపతి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు గుర్తుకురాకమానవు.
తన దేవుడన్నయ్య ప్రజారాజ్యం పార్టీ పుట్టిముంచిన వాళ్లెవరినీ వదిలిపెట్టేది లేదని, మంగమ్మశపథం మాదిరి పవనన్నయ్య చేసిన శపథం చూస్తే మన కల్యాణ్‌బాబు రాజకీయాల్లోకి వచ్చింది మార్పు కోసమా? అన్నయ్యను సీఎంను కాకుండా చేసిన మాజీ పీఆర్పీయులపై ప్రతీకారం కోసమా? అన్నదే పవన్ మాదిరిగా అర్థ్ధం కాని ప్రశ్నలా మారింది.
నిజంగా ఇప్పటివరకూ పవన్ ప్రదర్శించిన నవరసాల్లో జనం కష్టాలపై ప్రేమ, వారికి న్యాయం చేయాలన్న తపనే ఉన్నట్లు అందరూ నమ్మారు. కానీ అది భ్రమేనని, తమ్ములుంగారిలో ఉన్నది మార్పు మార్కు సేవ కాదని, తన దేవుడన్నయ్య చిరంజీవిని సీఎం కాకుండా, పూర్వాశ్రమంలోని పీఆర్పీ శిబిరాన్ని విధ్వంసం చేసిన వారిపైనేనని తేలిపోయిన తర్వాత కూడా కాటమరాయుడి నుంచి ప్రజాసేవ వంటి పదాలు ఆశించడం మరీ అత్యాశవుతుందేమో?!
సినిమా షూటింగు గ్యాపులో జనసేనానికి మళ్లీ ప్రజల కష్టాలు గుర్తుకొచ్చాయి. సంతోషం. జనం సమస్యలపై ఎవరు గళమెత్తినా స్వాగతించాల్సిందే. విశాఖ డిసిఐ ప్రైవేటీకరణను నిరసిస్తూ వెంకటేష్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన ఆ ఉద్యోగులతో కలసి ధర్నా చేసి, బీజేపీకి హెచ్చరికలు పంపారు. ప్రజల కోసమే కుటుంబాన్ని వదులుకుని వచ్చానని, అవసరమైతే ప్రజల కోసం ప్రాణాలర్పిస్తానని సెలవిచ్చారు. ఇప్పటి పరిస్థితిలో పవన్ వంటి మాయామర్మం లేని నిష్కల్మషమైన పసిపిల్లాడి మనస్తత్వం ఉన్న ఆదర్శనీయ నేతలే కావాలి కాబట్టి, ఆయన ప్రాణాలు తెలుగుజాతికి అమూల్యం, అవసరం! ఈ వయసులో కూడా తన కొత్త వారసుల ఫొటోలను నిర్భయంగా విడుదల చేసే ధైర్యం ఎంతమందికి ఉంటుంది? అయితే, తన కుటుంబాన్ని వదులుకుని వచ్చానన్న పవన్ మాటలూ నిజమే. ఇప్పటికే ఆయన రెండు కుటుంబాలను వదులుకుని వచ్చిన మాటలో అణువయినా అబద్ధం లేదు.
విశాఖకు వెళ్లిన జనసైన్యాధ్యక్షుడు నేటి రాజకీయాలు, వారసత్వ పోకడలు, డబ్బు సంపాదన వంటి అంశాలపై వెలిబుచ్చిన ఆవేదన ఆలోచించతగ్గదే. కాకపోతే అన్నయ్య పార్టీలో ఈ తమ్ముడూ ఒకప్పటి యువసైన్యాధ్యక్షుడే. ఇంకో అన్నయ్య ఒక విభాగం చూసుకుంటే, అతనికంటే ఘనుడైన మరో ఆచంట మల్లన్న లాంటి బావమరిది ఇంకో వ్యవహారం చక్కబెట్టారు. వీళ్లంతా ఆ అన్నయ్యకు సోదరులు కాకపోతే ఆ హోదాలు అప్పనంగా ఎలా వస్తాయి? అప్పటికే వివిధ పార్టీల నుంచి చేరిన మహానేతలున్నా వారిని కాదని అన్నయ్యగారు, తన కుటుంబసభ్యులకే అన్ని బాధ్యతలు అప్పగించారు? అది కూడా వారసత్వమే కదా అని ప్రశ్నించవచ్చు. తప్పేమీ లేదు. ఎందుకంటే కల్యాణ్‌బాబు కూడా ప్రశ్నించేందుకు పార్టీ పెట్టారు కాబట్టి. కాకపోతే పీఆర్పీ అన్నది ముగిసిన కథ. కానీ మన తాజా జనసేనాని, తన మాజీ పీఆర్పీ విషాదాన్ని ఇంకా మర్చిపోలేకపోతున్నారు!
అంటే మొన్నటి వరకూ అన్నయ్యకు తమ్ముడు దూరమయ్యారంటూ వచ్చిన వార్తల్లో ఏమాత్రం పసలేదని, సినిమా ఫంక్షన్లలో పవన్ గురించి వేసే కేకలు, వారిపై అన్నయ్య, అబ్బాయిల చిరాకుపరాకుల్లో కూడా నిజం లేదని, ఇంకా తమ్ముడి గుండెలో అన్నయ్య గూడుతోపాటు గుడి కూడా కట్టుకున్నాడని పవన్ తాజా అంతరంగం, వేదికలెక్కి ఘోషించిన తర్వాత కూడా పవన్ అభిమానులు సినిమా ఫంక్షన్లలో ఆయన రాలేదని గోల చేయడం మంచిదికాదు.
వచ్చినవాడు సామాన్యుడు కాదు. ఫల్గుణుడని మారువేషంలో ఉన్న అర్జునుడి అసలు అవతారం గురించి బయటపెట్టినట్లు.. పవన్ విశాఖ సభలో బ్రహ్మాండం బద్దలు చేసేలా మాట్లాడతారనుకుంటే, తన పీఆర్పీ విషాదం, పరాభవాల ప్రతీకార పర్వం ఆవిష్కరించడం ఎవరికీ రుచించలేదు. పీఆర్పీని దెబ్బతీసిన వాళ్లెవరినీ మర్చిపోలేదు. ప్రతి ఒక్కడూ నాకు తెలుసు. గుండెల్లో, కడుపులో పెట్టుకుని ఉన్నాను. వాళ్లను కొడితే సరిపోదు, తిడితే సరిపోదు. చేసి చూపిస్తే అర్ధమవుతుంది. దేవుడు లాంటి అన్నయ్యకు ద్రోహం చేసిన వారందరికీ జనసేన చెప్పుతో కొట్టినట్లు చెబుతుంది. పరకాల ప్రభాకర్ గురించి సమయం వచ్చినప్పుడు చెబుతానన్న జనసేనాని మాటల బట్టి, ఆయన ఇప్పుడు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చింది మార్పు కోసం కానే కాదని, తన దేవుడన్నయ్యను మోసం చేసిన వాళ్లపై ప్రతీకారం కోసమేనని మెడ మీద తల ఉన్నవారికెవరికైనా తెలిసిపోతుంది.
బాగుంది. రాజకీయాల్లో ఎందుకొచ్చారని అడిగే అర్హత ఎవరికీ లేదు. కెఏపాల్, కాసాని జ్ఞానేశ్వర్ లాంటి వాళ్లు కూడా పార్టీలు పెట్టారనుకోండి. అది వారిష్టం. కానీ తమ్ములుంగారు ప్రతీకారం తీర్చుకునే వాళ్లంతా ఇప్పుడు ఆయన మద్దతునిచ్చిన తెలుగుదేశంలోనే ఉన్నారు కదా? కల్యాణ్‌బాబును ప్రత్యేక హెలికాప్టర్‌లో బెజవాడకు తీసుకుని వచ్చిన మంత్రి కామినేని కూడా ఒకప్పటి పీఆర్పీయుడే. ఇప్పడు తెలుగుదేశం పార్టీకి అధ్యక్షత వహిస్తోన్న కళా వెంకట్రావు, అదే ఆస్థానంలో కొలువుదీరిన గంటా శ్రీనివాసులు, జ్యోతుల నెహ్రులు, త్రిమూర్తులు ఇంకా బోలెడుమంది గతంలో తమకు ‘కాపు’కాసిన వాళ్లంతా ప్రస్తుతం తెలుగుదేశీయులయిపోయారు. మరి ప్రతీకారం ఎవరి మీద తీర్చుకుంటారు? అంతమందిని వదిలిపెట్టి పరకాలనే గుర్తుపెట్టుకోవడం ఆశ్చర్యమే!
వృత్తిపరంగా పీఆర్పీ పుట్టుక నుంచి పతనం వరకూ అత్యంత సమీపంగా పరిశీలించిన వారిలో నేనూ ఒకడిని. అప్పుడు పార్టీ విధాన ప్రకటనలన్నీ చిరంజీవి ఆమోదంతోనే జరిగితే వాటిని పరకాల-డాక్టర్ మిత్రా వెల్లడించేవారు. ఆ తర్వాతే చాలామంది వాసిరెడ్డి పద్మలు తెరపైకొచ్చారు. నాటి నిర్ణయాలన్నీ నాలుగుగోడల మధ్యనే జరిగితే, అందులో చిరంజీవి కుటుంబేతరులు కనిపించేవారు కాదు. పార్టీ ప్రకటన, టికెట్ల పంపిణీ నుంచి, వేదికల వరకూ అంతా ఇప్పటి జనసేన మాదిరిగా ఏకపాత్రాభినయమే. బహుశా, పార్టీలో సామాజికన్యాయం లేదని పార్టీ ఆఫీసులోనే మీడియాకు చెప్పి బయటకు వచ్చిన పరకాల తెగింపును కల్యాణ్‌బాబు ఇంకా మర్చిపోలేకపోతున్నట్లు కనిపిస్తోంది.
అసలు మార్పు కోసమని పార్టీ పెట్టి, పార్టీని నడపలేక మధ్యలోనే కాడి కిందపడేసి, తాను పంచెలువిప్పి కొట్టాలని పిలుపునిచ్చిన కాంగ్రెస్ ప్రసాదించిన కేంద్రమంత్రి పదవి కోసం, తనను నమ్మి వచ్చిన కాపులందరినీ వారి మానాన వారినొదిలేసి, పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసిన అన్నయ్య తప్పేమీ లేదన్నట్లు మాట్లాడటం వింతల్లోకెల్లా వింత కదా? సరే ఏదేమైనా పవన్‌కు తన మీద తనకు స్పష్టత ఉందని గుర్తించినందుకు అభినందిచాలి. తనను సీఎం అని పిలిచే సరదా మీకున్నా అలాంటి భావన తనలో కలగడం లేదని అభిమానులనుద్దేశించి జనసేనాని చేసిన వ్యాఖ్యకు సలాం కొట్టాల్సిందే.
బెజవాడలో కులం కంపు కొడుతోందన్న ఆవేదనలో ఆవగింజంతయినా అబద్ధం లేదు.
* * *
హమ్మయ్య! ప్రపంచంలో అత్యంత కీలకమైన ఘట్టం ఒకటి పూర్తయింది. కాంగ్రెసు యువరాజు నుదుట బాసికం కట్టాలన్న సోనియామాత కోరిక ఇనే్నళ్లకు ఈడేరింది. యువరాజు రావాలంటూ కార్యకర్తలు గొంతులవిసేలా అరిచినా, మన రాహుల్ బాబు అవేమీ పట్టకుండా ఇన్నాళ్లూ ఆత్మశోధన కోసం అన్ని దేశాలూ తిరిగొచ్చారు. ఇక దేశ సౌభాగ్యం కోసం, దేశాన్ని ఉద్ధరించబోయే పార్టీకి ‘తప్పులులేకుండా మాట్లాడే’ నాయకుడు అవసరమని గుర్తించిన సోనియమ్మ, అర్జెంటుగా రాహుల్‌గాంధీని పట్ట్భాషిక్తుడిని చేయడంతో.. ఆ లోకోత్తర సుందర దృశ్యం కళ్లారా చూసి తరించాలనుకుంటున్న గాంధీ భక్తులకు, రాహులబ్బాయి అసలు పార్టీ పనికి సరిపోతాడా లేదా? అన్న తర్కవితర్కాలు తెరపైకి తెచ్చిన మీడియాకూ ఓ పనయిపోయినట్టయింది.
రాహుల్ కాంగ్రెస్ ఉత్తరాధికారి అవుతాడన్నది పెద్ద రహస్యమేమీ కాదు. సీతారాం కేసరి, పివి నరసింహారావు పుణ్యం పుచ్చిపోయి, కాలం కలసివచ్చి పార్టీ అధ్యక్షులయి, మన్మోహన్‌సింగ్ ప్రధాని అయ్యారే తప్ప, అమ్మగారికి ఇష్టం ఉండి కాదన్నది నిజం. జాతీయ పార్టీగా ఒకప్పుడు వెలిగిన కాంగ్రెస్ ప్రభ, నేడు కొడిగొట్టిన దీపంలా మారి, కొన్ని రాష్ట్రాలకే పరిమితమైన విషాదం నుంచి గట్టెక్కించి, మళ్లీ ఢిల్లీ గద్దెపై గజ్జె కట్టాలన్న సోనియామాత కోరిక నెరవేరడం ఆషామాషీ కాదు.
ఇకపై రాహులబ్బాయి వెనుకసీట్లో కూర్చుని పార్లమెంటు ఏసీగాలికి సేదదీరితే కుదరదు. ఇప్పటిమాదిరిగా అమాయకంగా ఏది పడితే అది ట్వీటు చేస్తే అస్సలు కుదరదు. కాంగ్రెసును ఇంకా పట్టి పీడిస్తు, జన్‌పథ్‌ను ఉడుముల్లా పట్టుకుని వేళ్లాడుతున్న వృద్ధజంబూకాలను వదిలించుకోవడం, ప్రణబ్‌దాదా నుంచి ఆశీస్సులు తీసుకున్నంత సులువు కాదు. ఒకప్పుడు ప్రాంతీయ పార్టీలను శాసించి, ఇప్పుడు అవి విదిల్చే పాతిక పరకా సీట్ల కోసం ఎక్కే గుమ్మం, దిగే గుమ్మంలా మారిన దుస్థితిని తప్పించి, మళ్లీ ఢిల్లీ నవాబు కావాలంటే అనుకున్నంత వీజీ కాదు. అందులోనూ మోదీ-అమిత్‌షా వంటి అఘటనాఘట సమర్ధుల ఎత్తుజిత్తులను తిప్పికొట్టేంత బుద్ధికౌశలం ఇప్పటికి వెయ్యింతలు ఉంటేనే కాంగ్రెస్ బండి నడిచేది.
అధికార వియోగంలో ఉన్న రాష్ట్రాల్లో పార్టీకి పెళ్లికళ తీసుకురావాలంటే ఇప్పటిమాదిరి తీరికూర్చుని, ఓట్లకు కొరగాని ట్వీట్లు చేస్తే అధికారం ఎప్పటికీ కలగానే ఉంటుంది. మోదీ వంటి ధీరుడినే ఎదుర్కొని ఎన్నికల్లో గెలిచిన అహ్మద్‌పటేల్లూ, గులాంనబీ ఆ‘జాదూ’ల ప్రభావం నుంచి పార్టీని పట్టాలకెక్కించి , ఢిల్లీ చుట్టూ తిరిగిన వారికే పదవులన్న అప్రతిష్ఠను తొలగిస్తేనే రాహుల్‌కు భవిష్యత్తు! ఏమాటకామాట!

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 97053 11144