మెయన్ ఫీచర్

ప్రజల్ని బిచ్చగాళ్లుగా మారుస్తున్న తమిళ ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్తీసారా తాగి జనాలు చస్తున్నారని భావించిన ఎన్టీఆర్ గాంధీ జయంతినాడే సారాని నిషేధించాడు. దీనికి నాటి పీపుల్స్‌వార్ ఉద్యమం కారణం కాగా, దూబగుంట రోశమ్మ సారా వ్యతిరేక నినాదం ఊతాన్నిచ్చింది. ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుణ్ణి చేసిన చంద్రబాబు సారా నిషేధంతో దొంగతనంగా కల్తీసారాను అమ్మడంతో తాగిన వారి ప్రాణాలు పోతున్నాయని అదే గాంధీ జయంతి రోజున భారతదేశంలో తయారైన విదేశీ మద్యం (ఐఎమ్‌ఎఫ్‌ఎల్) పేరుతో సారాప్యాకెట్లను పోలీసులచే అమ్మించడం ప్రారంభించాడు. ఇలా సారాకథలు రావిశాస్ర్తీగారి 3‘సారో’2కధల్లా ఎప్పుడూ ఎన్నికల నినాదంగా ఉంటూనే ఉన్నాయి.
ప్రజల ఆరోగ్య పరిరక్షణ పేరుతో సారాను ప్రభుత్వ పరంగానే అమ్మడం, నిషేధించడం జరిగినా పోయే ప్రాణాలు పోతూ నే ఉన్నాయి. గుల్ల కావలసిన ఇళ్లు గుల్లవుతూనే ఉన్నాయి. కర్నాటక, గుజరాత్, బిహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలే ఇందుకు ఉదాహరణ. ఈసారి జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సారానే ప్రధాన ఎన్నికల అజెండాగా నిలవడం గమనార్హం. తిరిగి అధికారాన్ని అప్పగిస్తే సారాను నిషేధిస్తానని మమతా బెనర్జీ ప్రకటిస్తే, గతంలో వున్న ప్రొహిబిషన్‌ను ఎత్తివేసిన కరుణానిధి, ఈసారి తిరిగి ప్రొహిబిషన్‌ను అమలు చేస్తానంటే, తనకు తిరిగి అధికారాన్ని అప్పగిస్తే దశలవారీగా సారా నిషేధాన్ని విధిస్తానని జయలలిత ప్రకటించింది. నిజానికి తమిళనాడు ప్రభుత్వమే 3‘తస్మాక్’2 పేరుతో ప్రతి అరకిలోమీటరుకు ఒక దుకాణం చొప్పున నడుపుతున్నది. గతంలో మూడు కిలోమీటర్లకు ఒకటి చొప్పున ఉన్న ఇవి నేడు 6,800కు చేరుకున్నాయి. వీటికి అనుబంధంగా లైసెన్స్‌డ్ మినీ బార్లకు అనుమతించడంతో పెద్దలు, పిల్లలు అనే తేడా లేకుండా అందరూ మత్తులో మునగడం తమిళనాట ఒక నిత్యకృత్యం.
ఈ సారా తయారికై చక్కెర కర్మాగారాలలో వచ్చే ఉప ఉత్పత్తి ఇథనాల్‌పై ప్రభుత్వం ఆధారపడుతున్నది. బాహ్య విపణిలో ఉన్న చక్కెర ధరకన్నా, గానుగాడే చెరకుధర ఎక్కువగా ఇవ్వడంతో, చెరకు పరిశ్రమలు నష్టాలకు గురవుతున్నాయి. ఈ నష్టాన్ని తగ్గించాలని భావించిన కేంద్ర ప్రభుత్వం 2014లో లీటరు ఇథనాల్ ధరను రూ.34.50 నుంచి రూ.48.50కి పెంచి, ప్రతీ రాష్ట్రానికి కేంద్ర ఇథనాల్ గ్రిడ్‌కు సరఫరా చేయాల్సిన కోటాను నిర్ణయించింది. ఈ లెక్కన తమిళనాడు ప్రభుత్వం పెట్రోల్‌లో కలపడానకై సరఫరా చేయాల్సిన 13 కోట్ల లీటర్లకు బదులుగా కేవలం 50 లక్షల లీటర్లే సరఫరా చేస్తున్నది. మిగతా ఇథనాల్‌కు సారాయి తయారీకి వాడుకుంటూ రూ.30వేల కోట్ల ఆదాయన్ని ఆర్జిస్తున్నది. ఇది ప్రభుత్వ మొత్తం ఆదాయంలో మూడోవంతు! ఇలా ఆర్జించిన రెవెన్యూను ఉచితాలపై ఖర్చుపెట్టడం అలవాటుగా మారింది. ఉచితాలపై ప్రభుత్వాలు ఇప్పటి వరకు రూ.3.4 లక్షల కోట్లు ఖర్చు చేశాయని అంచనా.
2006లో ఉచితాల నినాదాన్ని డిఎంకె ప్రారంభిస్తే, 2011లో అన్నాడిఎంకె వీటికి నీరుపోసి మరింతగా పెంచింది. ఇలా కలర్ టీవీలను , రెండు రూపాయలకే కిలో బియ్యాన్ని ఎరగా పెట్టి పదవిని చేజిక్కించుకున్న డిఎంకెకు, అవే ఉచితాలను ప్రకటించిన అన్నా డిఎంకె 2011లో అధికారంలోకి వచ్చింది. ఈ రెండు సందర్భాల్లో కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్లు నిద్ర మేల్కొనకపోగా, ఈసారి కూడా నిద్రనే నటిస్తున్నాయి. ఇలా డిఎంకెకు పోటీగా 2011లో ల్యాప్‌టాప్‌లు, మిక్చర్లను, గ్రైండర్లను, ఫ్యానులను, కేబుల్ కనెక్షన్లను, పాఠశాల విద్యార్థులకు యూనిఫాంను ఉచితంగా పంపిణీ చేస్తానని వాగ్దానం చేసి పంపిణి చేసింది. వీటికి తోడుగా వంటింటి సామాన్లను, గొర్రెలను, మేకలను, ఆవులను సబ్సిడీపై కొనిస్తానన్నది. పెళ్లి చేసుకునేవారికి నాలుగు గ్రాముల బంగారు మంగళ సూత్రాల్ని ప్రకటించింది. ప్రతి సంక్రాంతి పండక్కి రూ.500 విలువ చేసే కూపన్లను చేనేత బట్టల కొనుగోలుకై ఇచ్చింది. ఈవిధంగా ఉచితాలే ప్రధాన ఎన్నికల అజెండాగా మారిన తమిళ రాజకీయాలు వీటికి అతీతంగా పోలేని స్థితికి నెట్టివేయబడ్డాయి.
అందుకే ఈసారి ఎన్నికలు కూడా వీటిచుట్టే తిరుగుతున్నాయి. డిఎంకె తన మేనిఫెస్టోలో, సబ్సిడీ ధరలకే సెల్‌ఫోన్లు అంటూ, టాబ్లెట్ అంటూ, వీటికై 10 జిబి స్థాయి 34, 4జి కనెక్షన్లను అంటూ, విద్యుత్ సబ్సిడీలంటూ, కిలో రూపాయి చొప్పున ప్రతి ఇంటికి 35 కిలోల బియ్యమంటూ ఏకరువు పెట్టగా, అన్నా డిఎంకె రెండడుగులు ముందుకేసి , రూ.1.9 కోట్ల రేషన్ కార్డులు గలవారికి ఉచితంగా వైఫై సేవలు, వీటికి ఉచిత ఇంటర్నెట్ కనెక్షన్లకు, పబ్లిక్ స్థలాల్లో ఉచిత వైఫైలను, 50 శాతం సబ్సిడీపై ఉద్యోగాలు చేసుకునే మహిళలకు స్కూటర్లను, రెండు నెలలకై 100 యూనిట్ల విద్యుత్‌ను, మెటర్నిటీ సహాయాన్ని రూ.18 వేలుగా, మెటర్నిటీ సెలవును ఆరు నెలల నుంచి తొమ్మిది నెలలకు, రూ.40వేల కోట్ల పంట రుణాల మాఫీని, మత్స్యకారులకు రూ.5వేల సహాయాన్ని, 4 గ్రాముల బంగారాన్ని 8 గ్రాములకు పెంచడంతోపాటు, ప్రతి కుటుంబానికి 20 కిలోల బియాన్ని, యువతులకు సానిటరీ నాప్‌కిన్స్‌ను ఉచితంగా ఇస్తానంటూ మే 5న విడుదల చేసిన మేనిఫెస్టోలో ప్రస్తావించింది. సిటీ బస్సుల్లో 60 ఏళ్ల వృద్ధులకు ఉచిత ప్రయాణమని డిఎంకె అంటే 58ఏళ్ల వారికే అన్ని బస్సుల్లో ఉచితమని అన్నా డిఎంకె సవాలు విసిరింది. పోతే గతంలో లాగా ఈ ఉచితాలు పనిచేస్తాయనే నమ్మకాలు ఇరు పార్టీలకు లేకపోగా గత వారసత్వంగా వస్తున్న ఎన్నికల సరళిని దృష్టిలో పెట్టుకొని, డిఎంకె తిరిగి తానే పగ్గాలు చేపడతాననే ధీమాతో ఉన్నది. పైగా 93 సంవత్సరాల కరుణానిధే ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటించింది.
1984, 1991, 2001, 2011ల్లో అధికారాన్ని అన్నాడిఎంకె చేపట్టగా, 1989, 1996, 2006లో డిఎంకె పగ్గాల్ని చేపట్టింది. ఈ లెక్కన ఈసారి డిఎంకె పార్టీకే అవకాశాలనేది గత అనుభవం. కాని 2006 నుంచి ఉచితాలకు ముఖం వాసిన తమిళ ప్రజలు కుంటుపడుతున్న పారిశ్రామిక ప్రగతి, పెరుగుతున్న నిరుద్యోగాన్ని అవినీతిని ప్రశ్నిస్తున్నారు. మేధావి వర్గం కూడా ఉచితాలను ఈసడించుకుంటూ, అభివృద్ధిని కోరుకుంటున్నారు. మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఈసారి సిపిఎం, సిపిఐ లాంటి జాతీయ పార్టీలతో నాలుగు ప్రాంతీయ పార్టీలు, సినిమా నటుడు కెప్టెన్ విజయ్‌కాంత్ నేతృత్వంలో పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్‌గా ఏర్పడడం, మొత్తంగా 234 సీట్లకై పోటీ పడటంతో ముక్కోణపు పోటీ జరుగుతున్నది. కాంగ్రెస్ డిఎంకెతో పొత్తు పెట్టుకోవడంతో, బిజెపి విధిగా అన్నాడిఎంకెతో కలవాల్సి వస్తున్నది. ఇలా ఎండిఎంకె, వైకో పార్టీ, టిఎంసి, జికె వాసన్ పార్టీ, విసికె, తిరుమవళవన్ పార్టీలు ఏకతాటిపైకి రావడం, వీరికి పిఎంకె పార్టీ అధినేత రామదాస్ మద్దతు కూడా ఉండటం కొత్త ఆశలు కనబడుతున్నాయి. వంద సీట్లకు పోటీపడుతున్న డిఎండికె పార్టీ నేత కెప్టెన్ విజయకాంత్ ప్రచార సరళి కూడా విచిత్రంగానే ఉంటున్నది. ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగాన్నిచ్చి కుటుంబ ఆదాయాన్ని రూ.25వేలకు పెంచుతానని, ప్రతి సంవత్సరం ఐదువేల మంది రైతుల్ని విదేశాలకు పంపించి ఆధునిక వ్యవసాయ పద్ధతులు నేర్పిస్తానని, రేషన్ దుకాణాల నుంచి నేరుగా సరకులు ఇంటింటికి సరఫరా చేస్తానని, పెట్రోలు లీటరుకు రూ.45కు, డీజిల్‌ను రూ.35కు అందిస్తానని ఫేస్‌బుక్కుద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. నిజంగా ఈ ఫ్రంటు గెలిస్తే ముఖ్యమంత్రి మాత్రం కెప్టెన్ విజయకాంతే అయినా, తమిళనాట నడిచే బస్సెక్కే రాజకీయాలు (నడిచే బస్సెక్కడం-ఓ తమిళ సామెత) ఎంతకాలం ఆయనను ముఖ్యమంత్రిగా కొనసాగిస్తాయో తెలియదు.
ఈసారి ఎన్నికల్లో చేతులు మారుతున్న డబ్బు అయిదు రాష్ట్రాల్లో దాదాపు రూ.60 వేల కోట్ల రూపాయలంటూ స్వయానా అర్‌బిఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ప్రకటించడం గమనార్హం. ఈ డబ్బులో అత్యధికంగా మారేది కూడా తమిళనాడులోనే! ఎన్నికలకు ముందు ఈ అంచనా రూ.9,000 కోట్లు కాగా, ఈ మధ్యన అన్నాడిఎంకె కార్యకర్తల దగ్గర పట్టుబడిన డబ్బే రూ.30 కోట్లదాకా తేలింది. ఈ లెక్కన ఎన్నిలు ముగిసే నాటికి ఈ మొత్తం మరింతగా పెరగొచ్చు. ఈ పంపిణీకి తమిళ రాజకీయాలు ఎంచుకున్న మార్గం 3‘తిరుమంగళం’2 అనే విధానం. ఎనిమిది తొమ్మిది పద్ధతుల్లో సాగే ఈ డబ్బు పంపిణి- కవర్లలో రూ.100 నుంచి రూ.1000 దాకా పెట్టి ఇంటి కిటికీల గుండా జారవిడవడం వార్తాపత్రికల్లో పెట్టడం, మొబైల్ ఫోన్లను రీచార్జీ చేయించడం, వివిధ వస్తువుల కొనుగోళ్లకోసం కూపన్లు ఇవ్వడం, పాలకేంద్రాల ద్వారా పంపిణి చేయడం, శుభకార్యాల్లో అతిథులకు పంచడం, ఇంటి మహిళలకే నేరుగా అందించి పిల్లలపై, భర్తపై ప్రమాణం చేయించడం, ఏరియా లేదా గ్రామపెద్దలకు డబ్బును ఇచ్చి ఒప్పందం చేయించుకోవడం వుంటాయి. అధికార పార్టీ అయితే నేరుగా పోలీసుల వాహనాల్లోనే రవాణా చేసి పంపిణీ చేస్తుందనే ఆరోపణలున్నాయి.
ఇలా ఉచితాల పేరున దిక్కులేని వారికి పంచినట్టు వస్తువుల్ని పంపిణీ చేసి, పరోక్షంగా కొన్ని కార్పొరేటు సంస్థల ఉత్పత్తులకు మార్కెటింగ్ చేస్తూ, సెల్‌ఫోన్ల పంపిణీ తర్వాత వారం వారం, నెలనెలా టాప్ ఆప్‌లు వేయించుకొని చేబులు ఖాళీ చేసుకోవడంలో మొబైల్ కంపెనీలకు ఆదాయం వచ్చేలా పథక రచన చేయడం తమిళ రాజకీయాలకు అలవాటుగా మారింది. వీటిని నియంత్రించే ఓ యంత్రాంగం (గతంలో శేషన్ మాదిరిగా) లేకపోవడంతో వీరు ఆడిందే ఆటగా, పాడిందే పాటగా మారింది. ఇప్పుడిప్పుడే తమిళనాడు ఓటర్లు, యువత ఈ ఉచితాల్ని ఈసడించుకున్నట్లు వార్తా కథనాలు వస్తున్నాయి. ఇవి నిజమైతే, ఈసారి ఎన్నికల్లో మార్పు అనివార్యమవుతుంది. కావాలని ఆశిద్దాం.

- డా. జి.లచ్చయ్య సెల్: 9440116162