మీకు మీరే డాక్టర్

భొల్లి... ఆయుర్వేద చికిత్స

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రశ్న: బొల్లి వ్యాధి చాలా కాలంగా ఉంది. ఇది ఎందుకొస్తుందో తగిన నివారణోపాయాలతో సహా వివరంగా చెప్పగలరు.

-రాజారామారావు దామెర, కదిరి

జ: మనుషుల చర్మం నల్లగా ఉండటం సహజ లక్షణం. చర్మానికి నలుపురంగు నిచ్చే కణాలను మెలనో సైట్స్ అంటారు. అవి చర్మంలో కొద్ది భాగాల్లో మరణించటం వలన గానీ, పని చేయక పోవటం వలన గానీ, అంతమేరా చర్మంలో నలుపురంగు తగ్గిపోయి, తెల్లగా అయిపోతుంది. తెల్లవాళ్లం అని విర్రవీగే జాతుల వారికీ చర్మంలో మెలెనో సైట్లుంటాయి. అవి సక్రమంగా లేకపోతే తెల్లవాళ్లక్కూడా బొల్లి మచ్చలు వస్తాయి.
బొల్లి ఇవాళ్టి వ్యాధి కాదు. అధర్వణ వేదంలోనే దీని చికిత్సా విషయాలున్నాయి. శ్విత్రము లేదా శే్వత కుష్టము అనే బొల్లి వ్యాధిని తగ్గించే గుణాలు బావంచాలు, గుంటగలగరాకు, చేదుపుచ్చ, నీలిమొక్క ఇలాంటి వనౌషధులకు ఉన్నాయని అధ్వరణ వేదంలో చక్కని వివరణ కనిపిస్తుంది. సూర్య కిరణాల వలన బొల్లి మచ్చలు తగ్గుతాయని ఈ వేదం పేర్కొంది. తన బొల్లివ్యాధిని తగ్గించాడని సూర్యునికి కృతజ్ఞతగా మయూరుడు సూర్య శతకం వ్రాశాడని ఐతిహ్యం.
దురద గానీ, మంటగానీ, పోటుగా, చీముగానీ, రసి కారటం గానీ లేకపోయినా బొల్లి వ్యాధి కలిగించే మనోవేదన చాలా తీవ్రంగా ఉంటుంది. కేవలం చర్మం తెల్లగా రంగు మారుతుంది అంతే! అంతేనని సరిపెట్టుకోవడానికి వీల్లేదు. బొల్లి గురించి మన సమాజంలో అనేక అపోహలున్నాయి. అవి చాలామంది రోగుల్ని ఆత్మహత్య దాకా పురిగొల్పుతుంటాయి.
ఈ తెల్లమచ్చల వ్యాధి (బొల్లి) అంటువ్యాధనీ, తల్లిదండ్రులకు ఉంటే పిల్లలకూ వస్తుందనీ, నయం కాని వ్యాధి అనీ, పథ్యాలు చేయాల్సి వస్తుందనీ, ‘స్ర్తి పథ్యం’ ఉండాలనీ.. ఇలా ఎన్నో అపోహలు రోగిని భయభ్రాంతులకు గురి చేస్తాయి. వీటికి సరయిన సమాధానాలు చెప్పి, రోగికి మానసిక ప్రశాంతతని కలిగించేదిగా చికిత్స ఉండాలి. వచ్చిన వ్యాధి సొరియాసిస్ అన్నప్పటికి రోగి భయపడడు. కానీ బొల్లి అనేసరికి కృంగిపోతాడు. ఇది బొల్లి వ్యాధిలో కనిపించే ‘మూడ్ రిసార్డర్’ అనే లక్షణం. చిన్న కారణానికే వణికిపోయే అతి సున్నిత మనస్కులకే బొల్లి త్వరగా వస్తుండటాన్ని మనం గమనించవచ్చు. బొల్లి వ్యాధి రావడానికి మానసిక అసంతృప్తులు, అలజడులు, ఆందోళనలు కూడా కారణం అవుతాయి.
వైద్యపరంగా బొల్లి వ్యాధిని ‘విటిలైగో’ లేక ‘ల్యూకోడెర్మా’ అనీ, ఆయుర్వేదంలో ‘శ్విత్రము లేదా శ్విత్రకుష్టము’ అనీ పిలుస్తారు. ఈ వ్యాధికి స్పష్టమైన కారణం ఇది అని నిర్ధారణగా తెలియదు. ఎలర్జెని కలిగించే అంశాలు, వంశపారంపర్య కారణాలు, మానసిక కారణాలు, థైరాయిడ్ వ్యాధులూ, నరాలకు సంబంధించి, కొన్ని వైరస్ సంబంధిత వ్యాధులు, పేగులలో నులి పురుగులు ఇవి బొల్లి వ్యాధి రావడానికి ప్రధాన కారణాలుగా శాస్తవ్రేత్తలు భావిస్తున్నారు. ఆయుర్వేద శాస్త్రం దీన్ని వాత వ్యాధిగా పేర్కొంది. వాతాన్ని ప్రకోపింపచేసే అంశాలన్ని బొల్లికి దారి తీసేవిగా ఉంటాయి.
చర్మంపైన ఏ భాగంలోనయినా తెల్ల మచ్చలు రావచ్చు. ఎక్కువమంది విషయంలో ముఖమూ, చేతులూ కాళ్ల వేళ్లపైన, రొమ్ములూ, జననాంగాలపైన ఎక్కువగా తెల్లమచ్చలు కనిపిస్తాయి. మొదట సూదిమొనంత మచ్చలేర్పడి, క్రమేణా శరీరం అంతా వ్యాపించటం మొదలెడతాయి. ఒకేసారి పెద్ద మచ్చలు రాకపోవచ్చు. పెదిమలు, అరిచేతులూ, అరికాళ్లలో మెలెనోసైట్లు తక్కువగా ఉండటం వలన అక్కడ సహజంగానే చర్మం నలుపు తక్కువగా ఉంటుంది. అలాంటి చోట వచ్చే బొల్లి ఆలస్యంగా తగ్గుతుంది. అలాగే, ఎండ తగిలే అవకాశం లేని శరీర భాగాలలో వచ్చే బొల్లి మచ్చలు కూడా ఆలస్యంగా తగ్గుతాయి.
మెలెనోసైట్లు పని చేయకపోవటం, మెలెనోసైట్లు మరణించటం అనేవీ ఈ వ్యాధి రావడానికి రెండు కారణాలు. వీటిలో మెలెనోసైట్లు సక్రమంగా పనిచేయక పోవటం వలన బొల్లి వ్యాధి వచ్చినప్పుడు ఔషధాలు కొంతవరకూ వాటిని ఉత్తేజితం చేయగలుగుతాయి. తెల్లని మచ్చలు క్రమేణా రంగు వెలిసి నలుపులోకి తిరిగేందుకు అవకాశం ఉంటుంది.
మెలెనోసైట్లు మరణించిన కారణంగా బొల్లి వ్యాధి వస్తే మాత్రం అది కష్టసాధ్య వ్యాధి లేదా అసాధ్య వ్యాధి అవుతుంది. నల్లరంగు నిచ్చే మెలెనోసైట్ కణాలను పూర్తిగా మార్పిడి చేసే చికిత్సా విధానం (ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ మెలెనోసైట్స్ ఆర్ మెలెనోసైట్ గ్రాఫ్టింగ్) ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. రోగి తొడ భాగంలో చర్మం లోంచి మెలెనోసైట్లను వేరుచేసి బొల్లి వచ్చిన చోట నాటే ప్రక్రియ ఇది.
చర్మానికి మెలనిన్ బాగా వొంటబట్టేలా సూర్యరశ్మి సహకరిస్తుంది. బావంచాలు మూలికలు అమ్మే షాపుల్లో దొరికే నల్లని గింజలు. వీటిని సొరలిన్స్ అంటారు. ఇవి సూర్యరశ్మిని చర్మం గ్రహించేలా చేస్తాయి. ఆధునిక వైద్యశాస్త్ర పరమైన చికిత్సలో కూడా అధ్వరణ వేదంలో చెప్పిన మూలికలతోనే ప్రధాన చికిత్స జరుగుతోందంటే మన పూర్వీకుల జ్ఞానదృష్టికి మనం జోహారు చెప్పాల్సిందే! ఈ మూలికలలో సొరలిన్స్ (బావంచాలు) ముఖ్యమైనవి. సొరలిన్స్ లేదా బావంచాలు కలిసిన ఔషధాలను వాడుకొంటూ, నిర్దిష్ట సమయంలో మచ్చలకు కొద్దిసేపు ఎండ చూపించగలిగితే బొల్లి మచ్చలు త్వరగా అదుపులోకి వస్తాయి.
సూర్యరశ్మి తగలకుండా తెరలాగా ఉపయోగపడుతుందని సి విటమిన్‌ని సన్ స్క్రీనింగ్ ఏజెంట్ అంటారు. ఒకప్పుడు బొల్లి వ్యాధిలో సి విటమిన్ తీసుకోకూడదని పళ్లు వగైరా నిషేధించారు. కానీ సి విటమిన్‌కున్న తెర పట్టే గుణం వలన బొల్లి సోకని చర్మ భాగాన్ని సంరక్షించవచ్చు కాబట్టి, బొల్లిలో ‘సి’ విటమిన్ తీసుకోవడం అవసరం అని ఇప్పుడు వైద్యులు చెప్తున్నారు.
ఆయుర్వేద ఔషధాలతో బొల్లికి చికిత్స నిరపాయకరంగా ఉంటుంది. తెల్లమచ్చలు నల్లగా మారుతూనే రోగి చర్మ వర్ఛస్సు కాంతివంతంగా మారటాన్ని గమనించవచ్చు. దుస్తుల అడుగుమ ఉండే చోట కలిగే బొల్లి మచ్చలకు ఎండ చూపించే అవకాశం ఉండదు. అలాంటి సందర్భాల్లో ఆయుర్వేద ఔషధాలు బాగా ఉపయోగపడతాయి.

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com