జాతీయ వార్తలు
కరవుపై అఖిలపక్షం ఏర్పాటుచేయండి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: దేశవ్యాప్తంగా నెలకొన్న కరవుపై చర్చించడానికి కేంద్రం తక్షణం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. కరవుప్రాంతాల్లోని మహిళలు, వృద్ధులు, పిల్లలకు పౌష్ఠికాహారం అందించాలన్నారు. అలాగే రైతు కూలీలకు మూడు వేల రూపాయిల మేర కరవుపెన్షన్ ఇవ్వాలని బుధవారం ఇక్కడ కోరారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బిహర్, జార్ఖండ్, చత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో తీవ్ర కరువుపరిస్థితులు నెలకొన్నాయని ఆయన అన్నారు. ఒక వైపువడగాడ్పులు మరోపక్క మంచి నీరు దొరక్క ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ప్రధాని మోదీ తక్షణం స్పందించాలని సురవరం విజ్ఞప్తి చేశారు. గత 25 సంవత్సరాల్లో ఇంత దుర్భర పరిస్థితులు ఎప్పుడూ లేవని ఆయన అన్నారు. మరఠ్వాడ ప్రాంతల్లో నీళ్లు కోసం ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడం దారుణమని సిపిఐ నేత విమర్శించారు. కేంద్రం తక్షణం స్పందించి అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేసి నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్లో చర్చించాలని చెప్పారు. కరవు ప్రాంతాలకు యుద్ధప్రాతిపదికన సాయం అందించాలని సురవరం డిమాండ్ చేశారు.
తక్షణం స్పందించాలని సిపిఐ డిమాండ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని కరవు పీడిత ప్రాంతంగా ప్రకటించాలని రాష్ట్ర సిపిఐ డిమాండ్ చేసింది. కొత్త రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో కరవు, దుర్భిక్షపరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈమేరకు ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి మహమూద్ అలీకి కరవు పరిస్థితులపై బుధవారం ఒక నివేదికను అందజేశారు. సిపిఐ ప్రతినిధులు ఈనెల 16 నుంచి 19 వరకు కరువుపీడిత ప్రాంతాల్లో పర్యటించారు. సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సయ్యద్ అజీజ్ పాషా, శాసనసభ్యుడు ఆర్.రవీంద్రకుమార్, పశ్య పద్మ, ఈర్ల నర్సింహులు ఉప ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. తెలంగాణ మొత్తం కరవుబారిన పడిందని వారన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి జాతీయ విపత్తుల నిధులు రాబట్టేందుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు.