జాతీయ వార్తలు

తల్లీకూతుళ్ల దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నోయిడా, డిసెంబర్ 6: నోయిడాలోని ఓ అపార్టుమెంట్‌లో తల్లి, కుమార్తె దారుణ హత్యకు గురయ్యారు. బ్యాట్‌తో కొట్టి, స్క్రూడైవర్‌తో పొడిచి చంపేశారు. రెండు రోజులుగా అపార్ట్‌మెంట్ తలుపులు మూసివుండటం, ఫోన్లకు స్పందించకపోవడంతో ఆ కుటుంబానికి సన్నిహితుడైన అపార్ట్‌మెంట్ వాసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తలుపులు పగులగొట్టడంతో వీరిద్దరి హత్య వెలుగుచూసింది. డాగ్ స్క్వాడ్‌ని, ఫోరెన్సిక్ నిపుణుల్ని పోలీసులు రంగంలోకి దింపారు. హత్య జరిగిన రోజునుంచీ ఆమె కుమారుడు కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. తల్లీకూతుళ్ల మృతదేహాలను ఓ దుప్పటిలో చుట్టి ఉన్నాయని బిస్రాఖ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అజయ్ శర్మ వెల్లడించారు. వారిద్దర్నీ బ్యాట్‌తో తీవ్రంగా కొట్టారనీ, స్క్రూడ్రైవర్‌తో పొడిచారని ఆయన తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం తల్లీ కూతుళ్లిద్దరూ సోమవారం రాత్రి 7.15కు బయటకు వెళ్లారని, తిరిగి 8 గం.కు వచ్చారని, ఆ తర్వాత వారు బయటకు రాలేదని సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ లవ్‌కుమార్ వెల్లడించారు. ఆమె భర్త వ్యాపారం పనిమీద టూర్‌లో ఉన్నాడని, ఇంట్లో తల్లి, కూతురు, కుమారుడు మాత్రమే ఉంటారని ఆయన తెలిపారు. కుమారుడి ఆచూకీ మాత్రం తెలియలేదని, అతని కోసం గాలిస్తున్నామన్నారు. అతడు దొరికితే అపార్టుమెంట్‌లో ఏం జరిగిందనేది తెలుస్తుందని పేర్కొన్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, హంతకులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. చోరీ కోణాన్ని కూడా కాదనలేమనీ, యజమాని వచ్చిన తర్వాత గానీ ఆ విషయం బయటపడే అవకాశం లేదని పేర్కొన్నారు. వ్యాపార పనిమీద టూర్ వున్న ఆమె భర్త ఫోన్ చేసినా స్పందించకపోవడంతో నన్ను సంప్రదించారని మరో అపార్ట్‌మెంట్ వాసి వెల్లడించారు. ఇంటర్‌కమ్‌లో ప్రయత్నించినా ఎవరూ తీయకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. పోలీసులు వచ్చి తలుపులు పగులగొట్టడంతో జంట హత్యల విషయం వెలుగుచూసింది.