జాతీయ వార్తలు

కుంభకోణం ఎలా జరిగింది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో జరిగిన భారీ కుంభకోణంపై ఇప్పటికే సీబీఐ, ఈడీ విస్తృత దర్యాప్తు చేపట్టిన నేపథ్యంలో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) కూడా సోమవారం రంగంలోకి దిగింది. ఈ కుంభకోణం ఎలా జరిగిందో వివరించాలంటూ కేంద్ర ఆర్థికశాఖ, పీఎన్‌బీ అధికారులకు నోటీసులు ఇచ్చింది. భవిష్యత్‌లో అక్రమాలు జరగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. మరోవైపు ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించాలని కోరుతూ సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దేశంలో ప్రభుత్వరంగానికి చెందినవాటిలో రెండో అతిపెద్ద బ్యాంక్ పీఎన్‌బీలో రూ.11,400 కోట్ల కుంభకోణం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. దేశ బ్యాంకింగ్ వ్యవస్థను కుదిపేసిన ఈ కుంభకోణంపై సీవీసీ దృష్టి సారించింది. ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీ, మెహుల్ ఛోస్కీలకు సంబంధించిన సంస్థలు ఎలా మోసానికి పాల్పడ్డాయో వివరించాలని పంజాబ్ నేషనల్ బ్యాంక్ సీనియర్ అధికారులకు తాఖీదులు పంపింది. అవకతవకలకు అవకాశం కల్పించిన బ్యాంకు విధానాల్లోని లోపాలేమిటో చెప్పాలని, నిఘావ్యవస్థ వైఫల్యాలపై సంజాయిషీ ఇవ్వాలని ఆ అధికారులను సీవీసీ ఆదేశించింది.
దేశంలోని అతిపెద్ద కుంభకోణాల్లో ఒకటైన ఈ వ్యవహారంపై దృష్టి సారించిన సీవీసీ, స్పష్టమైన ద్రవ్య విధానాలున్నప్పటికీ ఇంత పెద్ద మోసం ఎలా జరిగిందో పదిరోజుల్లోగా నివేదిక సమర్పించాలని పీఎన్‌బీ, ఆర్థికశాఖ అధికారులను ఆదేశించింది. అంతకుముందు సీవీసీతో భేటీ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్, రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్థికశాఖ అధికారులు కుంభకోణం జరిగిన తీరు, దర్యాప్తులో పురోగతిని వివరిస్తూ రెండు గంటల పాటు ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల పేర్లను అడిగిన సీవీసీ ఈ మోసాన్ని అడ్డుకునేందుకు చర్యలు తీసుకున్న అధికారుల వివరాలను అడిగి తెలుసుకుంది. కాగా ఈ కుంభకోణం నేపథ్యంలో మళ్లీ అలాంటి అక్రమాలు చోటుచేసుకోకుండా ఉండేందుకు వివిధ ప్రభుత్వరంగ సంస్థలకు కొన్ని మార్గదర్శకాలను సీవీసీ జారీ చేసింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో, ముఖ్యంగా బ్యాంకుల్లో ఒకేచోట మూడేళ్లుగా పనిచేస్తున్న సీనియర్ అధికారులను, ఐదేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న గుమస్తా స్థాయి సిబ్బందిని బదిలీ చేయాలని సూచించింది.
ఈ కుంభకోణంలో పాలుపంచుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో జనరల్ మేనేజర్ స్థాయి అధికారితో సహా 18 మంది ఉద్యోగులను పీఎన్‌బీ సస్పెండ్ చేసింది. ఇద్దరు పీఎన్‌బీ మాజీ అధికారులను సీబీఐ అరెస్టు చేసింది. అనధికారికంగా ‘లెటర్ ఆఫ్ అండర్‌స్టాండింగ్’, ‘లెటర్స్ ఆఫ్ క్రెడిట్’లు జారీచేసి అక్రమాలకు పాల్పడ్డారన్న కారణంగా సీబీఐ వారిని అరెస్టు చేసింది. అవినీతి నిరోధానికి గాను సీవీసీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన నియమ నిబంధనలను సమర్ధంగా అమలు చేసినందుకుగానూ 2016-17లో ‘విజిలెన్స్ ఎక్సలెన్స్ ఆఫీసర్’గా పీఎన్‌బీ ఎంపికవడం విశేషం. బ్యాంకు సిబ్బంది కలసి అక్రమాలకు పాల్పడటం, సిబ్బందిపై అంతర్గతంగా నిఘా, నియంత్రణ లేకపోవడం ఈ కుంభకోణానికి కారణమని ఆర్‌బీఐ అధికారులు పేర్కొన్నారు. పీఎన్‌బీలో కంట్రోల్ సిస్టమ్స్‌పై ఇప్పటికే ఆర్‌బీఐ ఒక అంచనాకు వచ్చింది. కాగా ఈ అవినీతి వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ మోసాలకు కేంద్రంగా నిలిచిన ముంబయిలోని పీఎన్‌బీకి చెందిన ఎమ్‌సీబీ బ్రాడీ హౌస్ బ్రాంచ్‌ను సీబీఐ సోమవారం ఉదయం సీల్ చేసింది. మరోవైపు కోల్‌కతాలోని నక్షత్ర షోరూమ్, పూనాలోని గీతాంజలి జెమ్స్ విక్రయకేంద్రపై ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడి చేసి సోదాలు నిర్వహించారు. 2జీ స్పెక్ట్రమ్ కేసులో ప్రముఖులైన నిందితుల తరపున వాదించిన న్యాయవాది విజయ్ అగర్వాల్ ఇప్పుడు నీరవ్‌మోదీ తరపున వాదించనుండటం మరో విశేషం.