జాతీయ వార్తలు

అక్రమ చెల్లింపులు నిజమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పోలవరం కాంట్రాక్టర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చేసిన చెల్లింపుల్లో అక్రమాలు జరిగినట్లు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)తోపాటు కాగ్ నివేదిక నిర్ధారించిన విషయం వాస్తవమేనని జల వనరుల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ వెల్లడించారు. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు విజయ సాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన చెల్లింపులను తిరిగి రాబట్టాలని కూడా పీపీఏ సూచించిందని మంత్రి వెల్లడించారు. ఈ అక్రమ చెల్లింపులపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇస్తూ, త్వరితగతిన ప్రాజెక్టు పనులు పూర్తి చేయించే హడావిడిలోనే భూసేకరణ, స్టీల్ కొనుగోలుతోపాటు మరికొన్ని పనుల్లో ఆయా కాంట్రాక్టర్లకు నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు జరిపినట్లు తెలిపిందని వివరించారు. అక్రమంగా చేసిన చెల్లింపులను ఆయా కాంట్రాక్టర్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం రికవరి చేసినట్టు తెలిపారు. పోలవరం హెడ్ వర్క్స్ కాంట్రాక్టును ఏదైనా కంపెనీకి లబ్ధి చేకూర్చే విధంగా కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ వ్యవహరించిందా అన్న మరో ప్రశ్నకు మంత్రి మేఘ్‌వాల్ జవాబిస్తూ- 2016 సెప్టెంబర్ 16న కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ జారీ చేసిన లేఖకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చేపట్టినట్లు వెల్లడించారు. కాబట్టి ప్రాజెక్టుకు సంబంధించిన ఏ కాంట్రాక్టులైన ఇచ్చే అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటుందని పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కూడా కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. ఇప్పటివరకు అందిన నివేదికల ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు 62.16 శాతం పూర్తయ్యాయని చెప్పారు. డిసెంబర్ 2019 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని
లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పనుల నాణ్యతను ధవళేశ్వరంలోని క్వాలిటీ కంట్రోల్ పర్యవేక్షిస్తున్నట్టు మంత్రి తెలిపారు. అయితే పనుల నాణ్యతను మరింత పటిష్టంగా పర్యవేక్షించేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీలోని సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ రీసెర్చి స్టేషన్‌తో పీపీఏ ఒక అవగాహన కుదుర్చుకుందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు కారణంగా లక్షా 5వేల 601 కుటుంబాలు నిరాశ్రయం అవుతాయని, అందులో ఇప్పటివరకు 3,922 నిర్వాసిత కుటుంబాలకు కొత్తగా నిర్మించిన 26 పునరావాస కాలనీల్లో ఆశ్రయం కల్పించినట్లు మంత్రి వివరించారు.