జాతీయ వార్తలు
విద్య, వైద్యానికి మినహాయింపు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
పసిడి సహా ఆరింటిపై ఖరారుకాని జిఎస్టి
టెలికాం, ఆర్థిక సేవలకు 18శాతం
రవాణా సేవలపై 5శాతం పన్ను
ఫైవ్స్టార్ ఆహార బిల్లుపై 28 శాతం
50 లక్షలలోపు టర్నోవరైతే 5 శాతం
జిఎస్టి రేట్లను ఖరారు చేసిన కౌన్సిల్
శ్రీనగర్, మే 19: అత్యంత కీలకమైన విద్య, ఆరోగ్య సేవల రంగాలను వస్తు సేవల పన్ను (జిఎస్టి) నుంచి మినహాయిస్తున్నట్టు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. జిఎస్టి మండలి శుక్రవారం జమ్మూ, కాశ్మీర్ రాజధాని శ్రీనగర్లో జరిపిన సమావేశంలో పన్నుల శ్లాబ్లను ఖరారు చేసింది. జూలై 1నుంచి జిఎస్టి విధానం అమల్లోకి రానున్న విషయం తెలిసిందే. ప్రధానంగా శుక్రవారం జిఎస్టి మండలి సేవలకు సంబంధించి పన్ను శ్లాబ్లపై దృష్టి పెట్టింది. నాలుగు వేర్వేరు శ్లాబ్లుగా సేవలపై జిఎస్టి వర్తిస్తుంది. ఎకానమీ క్లాస్ విమాన ప్రయాణం సహా ట్రాన్స్పోర్టుపై 5 శాతం చొప్పున పన్ను విధిస్తారు. వస్తువులకు మాదిరిగానే సేవలకూ నాలుగు మల్టీ శ్లాబ్ విధానాన్ని నిర్ణయించినట్టు సమావేశం అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ జైట్లీ చెప్పారు. జిఎస్టి కౌన్సిల్ నిర్ణయించిన పన్ను రేట్లవల్ల ఆర్థిక రంగంపై ద్రవ్యోల్బణ ప్రభావం పడబోదని కూడా చెప్పారు. టెలికాం, ఫైవ్స్టార్ హోటళ్లు, రెస్టారెంట్లు సహా సేవా రంగానికి సంబంధించి పన్ను వర్తించే నాలుగు శ్లాబ్లను ఖరారు చేసినట్టు జైట్లీ తెలిపారు. దీంతో బంగారంలాంటి ఆరు వస్తువులు తప్ప మిగతా అన్నింటికీ పన్ను రేట్లను ఖరారు చేసినట్టయ్యింది ఆయన తెలిపారు.
టెలికాం, ఆర్థిక సేవలకు 18శాతం స్టాండర్డ్ రేటుపై పన్ను విధిస్తారు. అలాగే రవాణా సేవలపైన కూడా 5 శాతం పన్ను వర్తిస్తుంది. ఓలా, ఉబర్ లాంటి క్యాబ్ అగ్రిగేటర్లతో పాటుగా ప్రస్తుతం 6 శాతం పన్ను చెల్లిస్తున్న క్యాబ్లకూ ఇది వర్తిస్తుంది. నాన్ ఏసీ రైలు ప్రయాణాన్ని జిఎస్టి నుంచి మినహాయించగా, ఏసీ రైలు టికెట్లపై 5 శాతం పన్ను విధిస్తారు. మెట్రో, లోకల్ రైళ్లలో ప్రయాణాలు, అలాగే హజ్ యాత్ర సహా అన్ని మతపరమైన యాత్రలకు జిఎస్టి నుంచి మినహాయింపు కొనసాగుతుందని రెవిన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా చెప్పారు. ఎకానమీ క్లాస్ విమాన ప్రయాణంపై 5 శాతం పన్ను విధించనుండగా, బిజినెస్ క్లాస్ ప్రయాణానికి 12 శాతం పన్ను వర్తిస్తుంది.
కాగా, నాన్ ఏసీ రెస్టారెంట్లలో ఫుడ్ బిల్లుపై 12 శాతం జిఎస్టి వసూలు చేస్తారని జైట్లీ చెప్పారు. ఏసీ రెస్టారెంట్లు, అలాగే లిక్కర్ లైసెన్స్ ఉన్న బార్ అండ్ రెస్టారెంట్లలో పన్నురేటు 18 శాతం కాగా, ఫైవ్స్టార్ హోటళ్లలో 28 శాతం జిఎస్టి వసూలు చేస్తారు. రూ.50 లక్షలు, అంతకన్నా తక్కువ టర్నోవర్ ఉండే రెస్టారెంట్లు 5 శాతం శ్లాబ్ పరిధిలోకి వస్తాయని చెప్పారు. కాగా, వైట్వాషింగ్ లాంటి వర్క్ కాంట్రాక్టలపైన కూడా 12 శాతం జిఎస్టి వర్తిస్తుంది. కాగా, జిఎస్టి విధానంలో వినోదపు పన్నును సర్వీస్ టాక్స్లో విలీనం చేసి సినిమా సర్వీసులతో పాటుగా గేంబ్లింగ్, రేస్కోర్సుల్లో బెట్టింగ్లపై 28 శాతం కాంపోజిట్ టాక్స్ను వసూలు చేస్తారు. సినిమా హాళ్లపై ప్రస్తుతం విధిస్తున్న పన్నుతో పోలిస్తే కొత్తగా విధించే పన్ను తక్కువైనప్పటికీ సినిమా టికెట్ల ధరలు మాత్రం తగ్గకపోవచ్చని, ఎందుకంటే స్థానిక పన్నులు విధించే అధికారం ఆయా రాష్ట్రాలకు ఉంటుందని అధికార వర్గాలు అంటున్నాయి.
కాగా, రోజుకు వెయ్యి రూపాయల లోపు టారిఫ్ను వసూలు చేసే హోటళ్లు, లాడ్జీలను జిఎస్టినుంచి మినహాయించగా, వెయ్యి-2 వేల మధ్య టారిఫ్ ఉండే వాటిపై 12 శాతం, 2500-5000 మధ్య టారిఫ్ ఉండే హోటళ్లు, లాడ్జీలపై 18 శాతం జిఎస్టి విధిస్తారు. రోజుకు 5 వేల రూపాయలకు పైగా టారిఫ్ ఉండే హోటళ్లకు 28 శాతం పన్ను వర్తిస్తుంది. ఇదిలా ఉండగా, బంగారం సహా ఇతర విలువైన లోహాలకు సంబంధించి పన్ను రేట్లను జూన్ 3న జరిగే కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించనున్నట్లు జైట్లీ చెప్పారు. ఈ రోజు సమావేశంలో ప్రధానంగా సర్వీసులపై జిఎస్టిపైనే చర్చించినట్లు కూడా ఆయన చెప్పారు. పన్ను మినహాయింపులుండే ఐటంలలో చాలావరకు దీర్ఘకాలంగా కొనసాగుతున్నవేనని, వాటిని అలాగే కొనసాగించామని ఆయన తెలిపారు. కాగా, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ లాంటి ఇ-కామర్స్ సంస్థలు సరఫరాదారులకు చెల్లింపులు జరిపే సమయంలో 1శాతం టిసిఎస్ను తగ్గించుకుని చెల్లింపులు జరపాల్సి ఉంటుందని అధియా చెప్పారు. జిఎస్టి అమలుకు తేదీ జూలై 1 అని జైట్లీ చెప్తూ, తాము దాదాపు సంసిద్ధంగా ఉండే స్థితిలోనే ఉన్నామని చెప్పారు.