శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ఎంతటివారకైనా బాధాకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు రూరల్, మే 13: చేతికి అందివచ్చిన కొడుకు అన్నింటికి చేదోడువాదోడుగా ఉంటాడనుకున్న సమయంలో ఈ విషాద సంఘటన జరగడం అత్యంత బాధాకరమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ మృతి చెందడంతో శనివారం నారాయణ కుటుంబ సభ్యులను సిఎం చంద్రబాబు కలిసి సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఎం విలేఖరులతో మాట్లాడుతూ, ఉన్నత విద్యను అభ్యసించి తండ్రి స్థాపించిన కంపెనీలకు అండగా నిలుస్తాడని అనుకున్న సమయంలో ఇంతటి బాధాకరమైన సంఘటన జరగడం ఎవరూ ఊహించలేకపోయామన్నారు. మంత్రి నారాయణకు తామంతా అండగా ఉంటామని అన్నారు. సింగపూర్‌లో ఉన్నత విద్య చదువుకుంటున్న సమయంలోనే నిషిత్ శని, ఆదివారాలలో వ్యాపారాల గురించి ఆలోచించేవాడని, వాటి కోసం ఇండియా వస్తుండేవాడని ఆయన అన్నారు. ఈ సంఘటన జరిగిన సమయంలో తాను అమెరికాలో ఉన్నానని, మంత్రి నారాయణ అమరావతికి సంబంధించి విషయమై లండన్‌లో ఉన్నారని ఆయన తెలిపారు. అనుకోని సంఘటన జరిగిన తరువాత సాధ్యమైనంత వరకు ఆ విషాదం నుండి బయటపడి మరలా జీవితాన్ని కొనసాగించాలన్నారు. చేతికి అందివచ్చిన కొడుకు పోవడం ఎంతటివారికైనా బాధాకరమని, అయినప్పటికీ అంతటితో జీవితం కాదని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ మొత్తం నారాయణ కుటుంబానికి అండగా ఉంటుందన్నారు. ఆయన మరలా మామూలు మనిషి కావడం కోసం తాము అందరం కలిసి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని ఆయన తెలిపారు. ఇదిలావుండగా సిఎం చంద్రబాబు శనివారం ఉదయం 11.40 నిమిషాలకు హెలికాప్టర్ ద్వారా నారాయణ మెడికల్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. అక్కడ నుండి అదే ప్రాంగణంలో ఉన్న మంత్రి నారాయణ ఇంటికి సిఎం చంద్రబాబు తన భార్య భువనేశ్వరితో చేరుకున్నారు. సుమారు గంటపాటు మంత్రి నారాయణ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. హెలికాప్టర్ దిగిన వెంటనే మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఎంఎల్‌సి బీద రవిచంద్ర, టిడిపి నాయకులు ఆనం రామనారాయణరెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వెంట ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కూడా వచ్చారు. మంత్రి కుటుంబాన్ని పరామర్శించిన తరువాత సుమారు 1.10 ప్రాంతంలో హెలికాప్టర్‌లో తిరుగు ప్రయాణం అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెళ్లిన తరువాత తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ మంత్రి నారాయణ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, కొడుకుని పోగొట్టుకోవడం ఎంతటి నరకమో సాక్షాత్తు తాను అనుభవించానని అన్నారు. ఇలాంటి నరకం శత్రువులకు కూడా రాకూడదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంచి వారికే దేవుడు ఇలాంటి గర్భశోకం ఎందుకు పెడతాడో తెలియదని ఆయన అన్నారు. మంత్రి నారాయణ మంచి వ్యక్తి అని, అలాంటి వ్యక్తికి ఇలాంటి గర్భశోకం రావడం బాధాకరమన్నారు. అయినప్పటికీ వాటినన్నింటిని దిగమింగుకుని మరలా జీవితం కొనసాగించాలని ఆయన ఈ సందర్భంగా దేవున్ని ప్రార్థించారు. అనంతరం శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మంత్రి నారాయణ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, ఇలాంటి సంఘటన తాను దగ్గరుండి చూశానని, అది ఎంత బాధాకరమో తనకు తెలుసునని అన్నారు. అయినప్పటికీ చనిపోయిన వారితో మన జీవితం పూర్తికాదని అక్కడితో ఆగిపోకూడదని మరలా జీవితాన్ని సాగించాలని ఆయన అన్నారు. నారాయణకు, ఆయన కుటుంబ సభ్యులకు ఈ సంఘటనను జీర్ణించుకొనే శక్తిని ఇవ్వాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు ఆయన చెప్పారు. మొత్తమీద చంద్రబాబునాయుడు కార్యక్రమం సాఫీగా సాగిపోవడంతో పోలీసు శాఖ ఊపిరి పీల్చుకుంది. సిఎం పర్యటనంతటినీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో బీద రవిచంద్ర, గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్, విజయవాడ ఎంపి కేశినేని నాని, విజయవాడ ఎమ్మెల్యే బొండా ఉమా, జిల్లా నాయకులు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, ముంగమూరు శ్రీ్ధర్‌కృష్ణారెడ్డి, రమేష్‌రెడ్డి, పలువురు కార్పొరేటర్లు, ఆనం రామనారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఎన్‌డిఎకు జగన్ మద్దతు
ఉపసంహరించుకోవాలి
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు హితవు
నెల్లూరు కలెక్టరేట్, మే 13: రాష్టప్రతి ఎన్నికలలో ఎన్‌డిఎకు వైకాపా మద్దతును ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఉపసంహరించుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పెనమల్లి మధు హితవు పలికారు. జిల్లాకేంద్రమైన నెల్లూరులోని జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్టప్రతి ఎన్నికలలో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ పరివారం మతతత్వ అజెండాను అణచివేయాలన్నారు. ఈ ఎన్నికలలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఎన్‌డిఎకు తన సంపూర్ణ మద్దతు తెలియజేశాశారని, మద్దతును వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మతోన్మాద శక్తులను ఓడించేందుకు రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా వామపక్షాల ఉమ్మడి అభ్యర్థి విజయానికి ప్రజాస్వామికవాదులు కలసిరావాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల వల్ల దళితులు, గిరిజనులు, మైనారిటీలకు రక్షణ కరవైందన్నారు. తినే ఆహారంపై స్వేచ్ఛ లేకుండా ఉన్మాద చర్యలకు తెగబడుతున్నారని, మతోన్మాద ఆర్‌ఎస్‌ఎస్ శక్తులను నివారించేందుకు సహకరించాలన్నారు. ఒకవైపు పంట పండించిన రైతు మార్కెట్ యార్డుల్లో అల్లాడుతుంటే మరోవైపు వలస రైతులు పొట్టచేత పట్టుకుని ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఉపాధి దొరకక అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ సకాలంలో అందజేయకపోవటంతో రైతులు అవసరాల కోసం మద్దతు ధర కంటే తక్కువ ధరకు దళారులు, వ్యాపారులకు తమ పంటలను అమ్ముకుంటున్నారని అన్నారు. కూరగాయలు పండించే రైతులు దారుణంగా దెబ్బతిన్నారన్నారు. పశువులకు అవసరమైన పశుగ్రాసం, దాణా, నీరు లేక పాడి రైతులు దివాళా తీశారన్నారు. గ్రామీణులు ఉపాధి లేక వలసబాట పట్టారన్నారు. ఉపాధి హామీ పనులకు సంబంధించి వేతన బకాయిలు కోట్లలో ఉందన్నారు. గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న రైతుల ఉత్పత్తులు కొనే దిక్కులేక కారుచౌకగా అమ్ముకోవాల్సి వచ్చిందన్నారు. ధరలు పడిపోయిన కారణంగా టమోట, మిర్చి, కంది, పసుపు రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. తీర ప్రాంతంలో పరిశ్రమల నుండి వెలువడే కాలుష్యంతో పంటల నాణ్యత తగ్గి అక్కడి రైతుల పరిస్థితులు దయనీయంగా మారాయన్నారు. ప్రజా సమస్యలను పరిశీలించి ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు దేశవ్యాప్త పరిశీలనలో భాగంగా సిపిఎం అఖిల భారత నాయకులు ప్రకాష్‌కాత్, బివి రాఘవులు ఈనెల 26,27న జిల్లాకు రానున్నారన్నారు.
టిడిపి మహానాడు వేదిక మార్చుకోవాలి
ఈనెల 27 నుండి తెలుగుదేశం పార్టీ నిర్వహించ తలపెట్టిన మహానాడు వేదికను ఆంధ్ర విశ్వవిద్యాయం నుండి మార్చాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చని చంద్రబాబునాయుడుకు మహానాడు నిర్వహించే నైతిక హక్కు లేదన్నారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలు నెరవేర్చి మహానాడు నిర్వహించాలని హితవు పలికారు. విశ్వవిద్యాలయంలో మహానాడు నిర్వహించడం సరికాదన్నారు. ఉన్నత విద్యామండలి ఇచ్చిన జీవోను అనుసరించి విశ్వవిద్యాలయం నుండి వేదికను మార్చుకోవాలన్నారు. గతంలో ప్రత్యేక హోదా సమావేశాన్ని నిర్వహించుకునేందుకు విద్యార్థులు అనుమతి కోరితే రాజకీయ సమావేశమంటూ నిరాకరించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు నిర్వహించ తలపెట్టిన మహానాడుకు అనుమతులు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. రాజకీయాలకు సంబంధించిన మహానాడును విద్యనందించే విశ్వవిద్యాలయంలో నిర్వహించరాదని విద్యార్థులు చేస్తున్న ఆందోళనలకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని ఆయన వెల్లడించారు. విలేఖర్ల సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి చండ్ర రాజగోపాల్ పాల్గొన్నారు.

15 నుంచి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు
* జిల్లాలో 63 కేంద్రాల్లో నిర్వహణ
* పకడ్బందీగా ఏర్పాట్లు
* కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
* డిఇసి కన్వీనర్, ఆర్‌ఐవో బాబూజాకబ్ వెల్లడి
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు మే 13: ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను ఈనెల 15 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు జిల్లా పరీక్షల కమిటీ (డిఇసి) కన్వీనర్, ఆర్‌ఐవో బాబూజాకబ్ తెలిపారు. నగరంలోని డికెడబ్ల్యు కళాశాలలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతరం ఆ కళాశాలలోని సమావేశ మందిరంలో పరీక్షల పర్యవేక్షణ హైపవర్ కమిటీ సభ్యులతో నిర్వహణపై సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పరీక్షలు జిల్లాలో మొత్తం 63 కేంద్రాల్లో నిర్వహించనున్నామని తెలిపారు. నెల్లూరు నగరంలో 25 పరీక్షా కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో 14, నగర హైస్కూల్‌లో 3, ప్రైవేట్ పరీక్షా కేంద్రాలు 21లలో పరీక్షలను నిర్వహించనున్నామని తెలిపారు. విడవలూరు, బుచ్చి, ఉదయగిరి, రాపూరు, కావలి, వెంకటగిరి, కోట ప్రాంతాలను సమస్యాత్మక పరీక్షా కేంద్రాలుగా గుర్తించామని వివరించారు. పరీక్షలకు సంబంధించి మొదటి సంవత్సరం విద్యార్థులు 23,282 మంది, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 5,246 మంది పరీక్షలు రాయనున్నారన్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం 2.30 నిమిషాల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సర విద్యార్థులకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. పరీక్షలను పకడ్బందిగా నిర్వహించేందుకు హైపవర్ కమిటీ (హెచ్‌సి)తో పాటు, జిల్లా పరీక్షల కమిటీ (డిఇసి), 4 ప్లైయింగ్ స్క్వాడ్స్, 5 సిట్టింగ్ స్క్వాడ్స్ నియమించినట్లు తెలిపారు. పరీక్షలకు గాను జిల్లా కలెక్టర్ డిఇసి చైర్మన్‌గా వ్యవహరిస్తారని తెలిపారు. కలెర్టర్‌చే హైపవర్ కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. హైపవర్ కమిటీలో జిల్లా ఎస్పీ, రీజనల్ జాయింట్ డైరెక్టర్ వై.పరంధామయ్య (ఆర్‌జెడి, గుంటూరు), ఇంటర్ విద్య, జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి (డివిఇవో) బీమా వెంకయ్య, ఉదయగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల సీనియర్ ప్రిన్సిపాల్ సి.మాల్యాద్రి తదితరులు సభ్యులుగా ఉంటారని తెలిపారు. జిల్లా పరీక్షల కమిటీలో డిఇసి కన్వీనర్‌గా తాను వ్యవహరిస్తానని అన్నారు. సభ్యులుగా ప్రిన్సిపాల్స్ రంగారెడ్డి, వరప్రసాద్, లెక్చరర్ చంటిరాజు వ్యవహరిస్తారని తెలిపారు. వివిధ శాఖల జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం ఈనెల 10వ తేదీన పరీక్షల నిర్వహణపై నిర్వహించినట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణకు కరెంట్ సరఫరా, మారుమూల ప్రాంతాల విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలని, ఓఆర్‌ఎస్ ప్యాకెట్‌లు, అత్యవసర మందులు, సిబ్బందితో సహాయక చర్యలు తదితర ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు తెలిపారు. ఇదిలావుండగా ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సజావుగా జరిగేలా తగు చర్యలు చేపట్టాలని జిల్లా పరీక్షల కమిటీ (డిఇసి) కన్వీనర్, ప్రాంతీయ పర్యవేక్షణాధికారి (ఆర్‌ఐవో) బాబూజాకబ్ ఆదేశించారు. డికెడబ్ల్యు కళాశాలలోని సమావేశ మందిరంలో ఆయన పరీక్షల పర్యవేక్షణ హైపవర్ కమిటీ సభ్యులు, జిల్లా పరీక్షల కమిటీ సభ్యులతో సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. పరీక్షల్లో ఎటువంటి అక్రమాలకు పాల్పడినా ఇంటర్ బోర్డు నిబంధనల మేరకు కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రతిఒక్కరు పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా తగు చర్యలు చేపట్టాలని కోరారు. డివిఇవో బీమా వెంకయ్య సభ్యులకు పరీక్షల నిర్వహణపై పలు ముఖ్యమైన సూచనలు, సలహాలు తెలియజేశారు.

ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం
వైద్యం వికటించి యువతి మృతి
ఆత్మకూరు, మే 13: ఆత్మకూరు పట్టణంలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా చికిత్స నిమిత్తం వచ్చిన యువతి వైద్యం వికటించడంతో తనువు చాలించింది. శనివారం మర్రిపాడు మండలం ధర్మారావుచెరువుపల్లి గ్రామానికి చెందిన భోగ్యం ప్రవల్లిక అనే 17 ఏళ్ల యువతి జ్వరంతో బాధ పడుతుండటంతో ఆమె కుటుంబ సభ్యులు ఆత్మకూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆ యువతికి రక్తం తక్కువగా ఉందని చెప్పి వైద్యులు తెలియజేశారు. దీంతో స్థానిక బ్లడ్ స్టోరేజి పాయింట్ నుంచి రెండు రక్తం ప్యాకెట్లను తీసుకొచ్చి ఆ యువతికి ఎక్కించి చికిత్స నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో తొలి ప్యాకెట్ రక్తం ఎక్కేటప్పుడు సదరు యువతి ఆరోగ్యం బాగానే ఉంది. రెండో ప్యాకెట్ రక్తం ఎక్కేటప్పుడు మాత్రం అకస్మాత్తుగా ఆయాసం అధికమై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి మరణించింది. రెండో ప్యాకెట్ రక్తం ఎక్కించేటప్పుడు ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణిస్తుందనే సంగతి ఆసుపత్రి సిబ్బందితో మొర పెట్టుకుంటున్నా సకాలంలో పట్టించుకోకపోవడం వల్లే ఇలా జరిగిందని మృతురాలి కుటుంబీకులు వాపోతున్నారు. కొంతసేపు తమ నిరసన వ్యక్తం చేయడంతో సహా స్థానిక విలేఖర్ల వద్ద కూడా గోడు వెళ్లబోసుకున్నారు. ఆసుపత్రికి వ్యతిరేకంగా యువతి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే వైద్యశాలపై కేసు నమోదు చేయాలంటే యువతి మృతదేహానికి పోస్టుమార్టం విధిగా నిర్వహించాల్సి ఉండటంతో ఈ దిశగా ఇష్టపడక బంధువులు వెనుకడుగు వేశారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.

నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు
డిఎంహెచ్‌ఓ వరసుందరం హెచ్చరిక
నాయుడుపేట, మే 13: ప్రైవేటు ఆసుపత్రుల్లోను, రోగ పరీక్షలు నిర్వహించే ల్యాబరేటరీల్లోను నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి వరసుందరం హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా పట్టణంలోని శ్రీకాళహస్తి బైపాస్ రోడ్డులో నిర్వహిస్తున్న శ్రీలక్ష్మీరాం ప్రజా వైద్యశాల ప్రస్తుత లైసెన్సును రద్దు చేసినట్టు శనివారం నిర్వహించిన ఆకస్మిక తనిఖీల సందర్భంగా ఆయన తెలియచేశారు. చుట్టుపక్కల మండలాల్లో ఇటీవల విషజ్వరాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకులు ఇదే అదనుగా డెంగ్యూ జ్వరాలని నిర్ధారిస్తూ రోగులను భయభ్రాంతులకు గురిచేసి సొమ్ములు గుంజుకుంటున్నారన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా ప్రోగ్రాం అధికారిణి డాక్టర్ రమాదేవి అన్ని ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహిస్తుండగా లక్ష్మీరాం ఆసుపత్రిలో జ్వరం వచ్చిన రోగికి డెంగ్యూ సోకినట్టు ఆసుపత్రి వర్గాలు నిర్ధారించిన ఆధారాలు దొరికాయి. దీంతో డిఅండ్‌హెచ్‌ఓకి ఫిర్యాదు చేయడంతో ఆయన ఆకస్మికంగా ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఆసుపత్రిలో 2018 వరకు ఐదు పడకలతో లైసెన్సు పొంది 25 పడకలను నిర్వహిస్తున్నట్టు తేలింది. అంతే కాకుండా డెంగ్యూ వ్యాధిని గుర్తించి నిర్ధారించే అధికారం అనుమతి పొందిన జిల్లా అధికారులకు మాత్రమే ఉందని, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఆసుపత్రి ప్రస్తుత అనుమతులను రద్దు చేస్తున్నామని తెలిపారు. అనంతరం 25 పడకలకు అనుమతి పొందాల్సి ఉంటుందన్నారు. అనుమతి లేని ల్యాబ్‌ల్లో ల్యాబ్ టెక్నీషియన్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

ఖైదీల ఆరోగ్యం, ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ
జైళ్ల శాఖ డిఐజి జయవర్ధన్ స్పష్టం
గూడూరు, మే 13: జైళ్లలో ఉండే ఖైదీల ఆహారం, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్టు జైళ్లశాఖ డిఐజి జయవర్ధన్ తెలిపారు. శనివారం ఆయన గూడూరు సబ్ జైలును వార్షిక తనిఖీల్లో భాగంగా సందర్శించారు. ఈ సందర్భంగా జైలులోని పలు విభాగాలను ఆయన పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని జైళ్లలో వసతులు బాగున్నాయని తెలిపారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి రాష్ట్రంలోని అన్ని జైళ్లను తనిఖీ చేస్తున్నట్లుగానే గూడూరు జైలును తనిఖీ చేసినట్లు తెలిపారు. ప్రధానంగా జైళ్లలో వసతులు, నీటి సౌకర్యం, ఇతర సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి ప్రభుత్వానికి నివేదికలు పంపనున్నట్టు తెలిపారు. గూడూరులో జైలు సిబ్బందికి క్వార్టర్స్ నిర్మాణానికి చర్యలు తీసుకొంటామని, ఇందుకు సంబంధించిన స్థలాన్ని ఆయన పరిశీలించారు. నెల్లూరు జైల్లో ఉన్న ఖైదీలు తయారుచేసిన వివిధ రకాల వస్తువులు తనకు చూపించారని, వాటి నాణ్యత ఎంతో బాగుందన్నారు. జైళ్లలో పారిశుద్ధ్యం మెరుగుపడిందన్నారు. జైలులో పొగ తాగడం నిషేధమన్నారు. ఈయన వెంట గూడూరు సబ్ జైలర్ వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.

కొంప ముంచిన కేసులు!
* వాకాటిని పార్టీ నుండి పక్కన పెట్టిన చంద్రబాబు
నెల్లూరు, మే 13: జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. చట్టసభల ప్రతినిధిపై ఆర్థికపర ఆరోపణల నేపథ్యంలో పార్టీ నుంచి సస్పెండ్ చేసిన ఘటన ఈ దశాబ్దంలో టిడిపిలో ఎన్నడూ చోటుచేసుకోలేదు. వివిధ కంపెనీల పేర్లతో వందల కోట్ల రుణాలను ప్రభుత్వరంగ బ్యాంకుల నుంచి తీసుకుని ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టారని వాకాటిపై బ్యాంకులు చేసిన ఫిర్యాదుల మేరకు సిబిఐ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులకు సంబంధించి శుక్రవారం నెల్లూరులోని ఆయన ఇంటిలో సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించడం, కీలకమైన పత్రాలను తమ వెంట తీసుకెళ్లడంతోపాటు వాకాటిని విచారించడం జరిగింది. ఈ నేపథ్యంలో వాకాటిని అరెస్టు చేసి తీసుకెళ్లే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నప్పటికీ ఎటువంటి అరెస్టు జరగలేదు. అయితే త్వరలో ఆయన్ను సిబిఐ అరెస్టు చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టిడిపి జాతీయ అధ్యక్షుడి హోదాలో వాకాటిని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేస్తూ కీలకమైన నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
నెల్లూరులోనే నిర్ణయం!
ఎంఎల్‌సి వాకాటి నారాయణరెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నెల్లూరులోనే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. శనివారం మంత్రి నారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి వచ్చినప్పుడు జరిగిన సంఘటనలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. జిల్లాకు వచ్చిన చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు వెళ్లిన జిల్లా నేతల్లో వాకాటి కనిపించలేదు. పరామర్శ పూర్తయిన తరువాత తిరిగి అమరావతి వెళ్లేందుకు హెలిప్యాడ్ వద్దకు వచ్చిన చంద్రబాబు పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రను తన వద్దకు పిలిపించి సుమారు పది నిమిషాలపాటు ప్రత్యేకంగా చర్చించారు. వాకాటి కేసు వివరాల గురించి ఆయన వాకబు చేసినట్లు సమాచారం. ఒకవేళ వాకాటిని అరెస్టు చేస్తే పార్టీకి చెడ్డ పేరు వస్తుందని ప్రతిపక్షానికి అవకాశమిచ్చేటట్లు అవుతుందని భావించి ముందుగానే అప్రమత్తమై ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. విజయవాడకు వెళ్లగానే వాకాటి నారాయణరెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ సంఘటన జిల్లాలో సంచలనం రేపింది.