డైలీ సీరియల్

యాజ్ఞసేని-41

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలాగే పాండవులు నీ ఆలోచనతోనే పెరిగి మంచివారయ్యారు. నీవే వారికి రక్షకుడవు. కోకిల పుత్రులను కాకి సంరక్షించినట్లు నీ పుత్రులను నేను పెంచాను. ప్రాణాంతకమైన కష్టాలను అనుభవించాను. ఇకపై కర్తవ్య నిర్ణయం నీవే చేయాలి’’ అని అన్నది.
‘‘యాదవ వంశ నందినీ! నీ పుత్రులు అతిబలవంతులు. ఇతరులచే నాశనం పొందరు. అచిరకాలంలో వారు బంధు ఇత్రులతో కలిసి రాజ్యాధికారాన్ని పొందుతారు’’ విదురుడు అన్నాడు.
ద్రుపదుని అంగీకారంతో పాండవులు, ద్రౌపది, కుంతీదేవి, శ్రీకృష్ణుడు హస్తినకు బయలుదేర సమకట్టారు.
***
యాజ్ఞసేని కాంపిల్యాన్ని విడిచిపెట్టే సమయం ఆసన్నమైంది. ఒక్కసారి తనకిష్టమైన గద్దెపై కూర్చుంది. మనసంతా దిగులు దిగులుగా వున్నది. పైన పంజరంలోనున్న తన ప్రియమైన శుకమంజరి కూడా వౌనంగా వున్నది. రోజూ ఏదో విధంగా కల్పించుకొని మాట్లాడే చిలుక తనను పలకరింపకబోవటంతో పాంచాలి వౌనాన్ని వీడి చిలుకతో అన్నది.
‘‘ఏమండీ చిలుకగారూ! ఏం వౌనంగా ఉన్నారు’’ అని అన్నది.
ఓహో! పాంచాల రాజపుత్రిగారా! చాలాకాలానికి మేము జ్ఞాపకం వచ్చినట్లున్నది. అయినా మీరు కురురాజ్యానికి రాణి కాబోతున్నారు. ఇక మాతో మీకేమి అవసరం?’’ అని అన్నది.
‘‘అలా అనకే నా ప్రియసఖీ! నిన్ను చూడకుండా ఎప్పుడైనా ఉన్నానా? నేనిప్పుడు స్వతంత్రరాలుని కాదుగదా?’’ అని కన్నీరు పెట్టుకుంది ద్రౌపది.
‘‘రాకుమారీ! మీరు హస్తినకు పోతున్నారు గదా! నీ వెంట నన్ను కూడా తీసికెళ్ళకూడదా?’’ అని అడగింది చిలుక. ద్రౌపది వౌనం వహించి కూర్చున్నది. ఇంతలో తన ఇష్టసఖి ధాత్రేయిక వచ్చింది. యాజ్ఞసేనితో ఏదో చెప్పింది. మళ్లీ వస్తానంటూ చెప్పి ద్రౌపది చెలికత్తెతో కలిసి వెళ్లింది.
***
పాండవులు తల్లి కుంతీదేవితో కలిసి హస్తినకు బయలుదేరారు. ఆ సమయాన ద్రుపదుడు యాజ్ఞసేనికి బంగారు ఆభరణాలూ, బంగారు కంఠాభరణాలూ, బంగారు అంబారీపీఠాలతో అలంకరింపబడి వున్న వేయి ఏనుగులను ఇచ్చాడు. వాటిని మావటీవాండ్రు నడుపుచున్నారు. నాలుగేసి గుఱ్ఱాలను పూన్చిన వేయి రథాలను, అయిదువందల ఉత్తమ జాతి గుఱ్ఱాలను, పదివేలమంది దాస దాసీజనాన్ని, వెయ్యిమంది సమర్థులైన ధానుష్కులను, బంగారు పాన్పులు, పాత్రలు, ఆసనాలు, లక్షల సంఖ్యలో గోధనం, వంద పల్లకీలను, అయిదు వందల బోరుూలనూ ఇచ్చాడు.
ద్రౌపది తండ్రి వద్దకు వచ్చింది. కన్నీటితో తండ్రిని ఆలింగనం చేసుకొన్నది. ద్రుపునికి కూడా దుఃఖం ఆగలేదు. ద్రుపదుడు యాజ్ఞసేనిని ఓదార్చి అన్నాడు.
‘‘అమ్మా! ద్రౌపదీ! అర్జునునికి భార్యగాగల ఒక పుత్రిక కావాలనే వాంఛతో పుత్రకామేష్ఠి యాగాన్ని సల్పి నిన్ను పుత్రికగా పొంది ధన్యుడనయ్యాను. నా కోరిక నెరవేరింది. అర్జురునికేగాక దైవం నిర్ణయించినట్లుగా పాండు సుతులందరికీ భార్యవయ్యావు. నేను ప్రశాంత చిత్తుడనయ్యాను.
పాండవులకు ధర్మపత్నివి. మంచి ఉత్తములైన పుత్రులను పొందుము. పుట్టింనింటికి, మెట్టినింటికి కీర్తిప్రతిష్ఠలను సదా నిలబెట్టుము. సుఖంగా వెళ్లిరా’’ అని అన్నాడు.
ద్రౌపది తండ్రి పాదాలకు నమస్కరించింది.
తల్లి కోకిలాదేవి పాదాలకు మ్రొక్కింది. కౌగలించుకున్నది. కోకిలాదేవి కూడా తండ్రి వలెనే ద్రౌపదిని ఆశీర్వదించింది. కన్నీటితో వీడ్కోలు పలికింది.
సోదరుడైన దృష్టద్యుమ్నుడు ద్రౌపది చేయి పట్టుకుని రథంలో ఎక్కించాడు. ద్రౌపది అత్తగారైన కుంతీదేవితో ఆశీనురాలైంది. వేలకొలది మంగళవాద్యాలు మ్రోగాయి. రథాలు కదిలాయి.
జనపదాల జెండాలు ఆకాశంలో గాలికి రెపరెపలాడుతున్నాయి.
- ఇంకావుంది

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము