Others

తుపాను నష్టానికి తల్లడిల్లిన నేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వివరాల్లోకి వెళితే- సీఎం ఫోన్ చేసిన మర్నాడు కృష్ణకాంత్ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేసే రోజు. ఆ ఉదయమే అప్పటి పీసీసీ అధ్యక్షుడు, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు అనంతరాములు రాజ్‌భవన్‌లో ఉంటున్న మా ఇంటికి అల్పాహార విందుకు వచ్చారు. మా జిల్లావాసి అయిన మల్లు అనంతరాములుతో ఎంతో కాలంగా నాకు పరిచయం. మరి కొద్దిసేపట్లో రాజీనామా సమర్పించమని నేను అడగాల్సిన మంత్రి కోనేరు రంగారావుకు అనంతరాములు సమీప బంధువు. సరే.. ఎలాగైతేనేం.. గవర్నర్ ప్రమాణ స్వీకారం అనంతరం నేను చేయాల్సిన పని చేశాను. ఆ తరువాత కాసేపటికి మంత్రి పదవికి కోనేరు రంగారావు రాజీనామా సమర్పించారు. దురదృష్టవశాత్తూ అది జరిగిన కొన్ని గంటల్లోనే ఎంపీ అనంత రాములు గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. ఆ విషయం తెలుసుకున్న నేను తార్నాకా వెళ్లి సీఎం చెన్నారెడ్డికి వివరాలు చెప్పగానే వెంటనే సంతాప సందేశం ఇవ్వమన్నారు. అదే సమయంలో రాజీవ్ గాంధీ నుంచి సంతాప సందేశం వచ్చింది. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి అనంతరాములు కీలకం అని రాజీవ్ పంపిన సందేశంలో వుండడం చెన్నారెడ్డికి అంతగా రుచించ లేదని నాకు అనిపించింది. ఆ తరువాత సీఎం తరఫున సంతాప సందేశం విడుదల చేశాం. ఆయన ‘మల్లు’ను అందులో ఆకాశానికి ఎత్తేశారు.
1990 మేలో ఆంధ్రప్రదేశ్‌లో భీకరమైన తుఫాన్ వచ్చింది. అదే రోజుల్లో వైద్యచికిత్స కోసం అమెరికా వెళ్లడానికి అంతా సిద్ధం చేసుకున్నారు చెన్నారెడ్డి. అనుకున్న రోజున కుటుంబ సభ్యులు బేగంపేట విమానాశ్రయానికి వెళ్లడం, బోర్డింగ్ పాసులు తీసుకునేవరకు రావడం జరిగింది. మంత్రివర్గ సభ్యులకు చెప్పిపోవడానికి సచివాలయానికి వచ్చారు ముఖ్యమంత్రి చెన్నారెడ్డి. అప్పటి రాష్ట్ర సహాయ, పునరావాస కమిషనర్ అర్జునరావు, ముఖ్యమంత్రి కార్యదర్శి పరమహంస, మరికొందరు అధికారులు కలసి అమెరికా పర్యటన వాయిదా వేసుకుంటే మంచిదని చెన్నారెడ్డికి సూచించారు. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా, ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా, ఆఖరు క్షణంలో ఆయన తన ప్రయాణం మానుకున్నారు. అంతా సర్దుబాటు అయిన తర్వాత, రెండుమూడు వారాల అనంతరం ఆయన వైద్యచికిత్స కోసం అమెరికా వెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత కూడా ఆసుపత్రిలో చేరేంతవరకు, ప్రపంచ బ్యాంకు అధికారులతో చర్చలు జరుపుతూనే వున్నారు. బహుశా చెన్నారెడ్డి ఆరోజుల్లో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో పెంచుకున్న అనుబంధమే- నేటి ప్రభుత్వాల వరకూ కొనసాగుతుందనడంలో అతిశయోక్తి లేదేమో!
1990 మే 13న ఆంధ్రప్రదేశ్‌లో సంభవించిన భారీ తుఫాన్, దాని తీవ్రతను అంచనావేసి వేలాది ప్రాణాలను కాపాడేందుకు తీసుకున్న ముందస్తు చర్యలు, తుఫాన్ వచ్చిన సమయంలో, ఆ తర్వాత చేపట్టిన సహాయ పునరావాస కార్యక్రమాలు, వాటిని పర్యవేక్షించిన సహాయ పునరావాస కమిషనర్ అర్జున్‌రావు, ఆయనకు పరిపూర్ణ అధికారాలను ఇచ్చి అడుగడుగునా మార్గదర్శకత్వం వహించిన ముఖ్యమంత్రి చెన్నారెడ్డి పాలనాదక్షత పదే పదే గుర్తుచేసుకోవాల్సిందే. పట్టణాభివృద్ధిశాఖలో కార్యదర్శిగా పనిచేస్తున్న సీనియర్ అధికారి సి.అర్జున్‌రావును, కారణాంతరాల వల్ల ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ఆగ్రహానికి గురైనందున, ప్రాధాన్యత లేదని కొందరు భావించే ‘సహాయ పునరావాస కమిషనర్’గా రెండు నెలల క్రితమే నియమించింది ప్రభుత్వం. అర్జునరావు తన ఉద్యోగానికి వనె్న తెచ్చే రీతిలో తీసుకున్న ముందస్తు చర్యల వివరాలను ఆ శాఖ పదిలం చేసుకుని వుంటే, బహుశా చక్కటి ‘మార్గదర్శి’గా ఎల్లప్పుడూ పనికొస్తుండవచ్చు. తుఫాన్ ముగిసిన కొంత కాలానికి అర్జున్‌రావు- ఒక చిన్న కార్పొరేషన్ ఎండిగా వున్నప్పుడు, సహాయ పునరావాస కమిషనర్‌గా ఆయన తీసుకున్న చర్యలపై ‘రీడర్స్ డైజెస్ట్’ పత్రిక గొప్ప ఆర్టికల్ కూడా ప్రచురించింది.
దక్షిణ భారతదేశాన్ని 1977లో దివిసీమ ఉప్పెన తర్వాత బీభత్సం చేసిన అతి భయంకరమైన తుఫాన్‌గా 1990 మే మొదటి వారంలో సంభవించిన తుఫాన్‌ను పేర్కొనవచ్చు. 1990 మే 4న ‘ఉష్ణమండల గందరగోళం’ ప్రారంభమై, తుఫాన్‌గా మారి వాయువ్య దిశగా కదిలింది. మర్నాటికల్లా తీవ్రమైన వాయుగుండంగా ఏర్పడి మే ఎనిమిదవ తేదీ నాటికి భయంకరమైన తుఫాన్‌గా మారి, ఆంధ్రప్రదేశ్‌పై కనీవినీ ఎరుగని దుష్ప్రభావం చూపింది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని పలు ప్రాంతాలపై కూడా దాని ప్రభావం పడింది. ఏపీలో కనీసం పది జిల్లాలలోని కోటి మంది ప్రజలు తుఫాన్ ప్రభావంతో ఇబ్బందులకు లోనయ్యారు. విద్యుత్ సరఫరా సహా అన్నిరకాల ప్రజావసరాల ఏర్పాట్లన్నీ అస్తవ్యస్థమైపోయి, జన జీవనం స్తంభించిపోయింది. లక్షలాది గుడిసెవాసులు నివాసాలు కోల్పోయారు. ఆ విపత్కర సమయంలో చెన్నారెడ్డి ప్రభుత్వానికదో పెను సవాలుగా మారింది. తప్పిపోతుందనుకున్న తుఫాన్ రాష్ట్రాన్ని తాకనున్నదన్న సంకేతాలు ముందుగా అందడంతో, ప్రభుత్వం సరైన నివారణ చర్యలు చేపట్టడంతో లక్షలాది ప్రాణాలు కాపాడబడ్డాయి.
తుఫాన్‌కు గురైన ప్రాంతాలను సందర్శించడానికి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి చేసిన ప్రయత్నాలు రెండురోజులు ఫలించలేదు. వాతావరణం ఏ మాత్రం అనుకూలించనందువల్ల, ఆయనతో పాటు మేమందరం ఎక్కిన వైమానిక దళ హెలికాప్టర్ మొదటి రెండురోజులు మొరాయించింది’. ప్రధానమంత్రి వీపీ సింగ్ వచ్చి ఎక్కిన తర్వాతే అది కదిలింది. అయినప్పటికీ, విజయవాడ విమానాశ్రయం దాటి అది ముందుకు కదలలేదు. ‘ప్రధానమంత్రి కన్నా ముందర ముఖ్యమంత్రి ఎలా వెళతారు? ఆయనకెందుకు మొదట ఆ కీర్తి దక్కాలి’- అన్నట్లు హెలికాప్టర్ ‘మొరాయించే ఏర్పాటు’ ముందే జరిగిందని అప్పట్లో కొందరు వ్యాఖ్యానించారు. అలా వ్యాఖ్యానించడం ఎంతవరకు సమంజసమనేది వారికే వదిలేద్దాం. మరోమారు కూడా ప్రధాని ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి తుఫాన్‌కు గురైన ప్రాంతాలను సందర్శించారు. కాంగ్రెస్ నాయకుడి హోదాలో రాజీవ్ గాంధీ తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో రెండురోజులు తిరిగారు. సహాయ, పునరావాస కార్యక్రమాల సమీక్షకు చెన్నారెడ్డి అమెరికా నుండి తిరిగి రావడానికి ముందు రాజీవ్ పర్యటించారు.
*
(ముగింపు రేపటి సంచికలో)
*
(డా. మర్రి చెన్నారెడ్డి శత జయంతి ఉత్సవాల సందర్భంగా)
-వనం జ్వాలా నరసింహారావు (మాజీ పీఆర్వో టు సీఎం చెన్నారెడ్డి)